Skip to main content

ఎస్‌బీఐలో క్లర్కుగా చేస్తూనే

ఐసెట్ ఐదోర్యాంక్ సాధించిన చైతన్యమోహన్
ఏటేటా పెరుగుతున్న పోటీలో నె గ్గాలంటే నైపుణ్యాలను మెరుగుపరచుకోవటం కీలకం అంటాడు ఐసెట్ 2013 ఐదోర్యాంకర్ కందుల చైతన్యమోహన్. కళాశాల ప్రాంగణంలో ఉన్నపుడే.. రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించటమే కాదు.. ఐసెట్-2013లో ఎంతోమందితో పోటీపడి రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు తెచ్చుకున్నాడు. ఈ సక్సెస్ వెనుక కారణమేమిటో అతని మాటల్లోనే.

చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవాణ్ని. ఇంట్లో దానికి తగినంత ప్రోత్సాహం తోడవటంతో నిర్భయంగా చదువుకునేవాణ్ని. మా సొంతూరు గుంటూరులోని కొత్తపేట. నాన్న గోపాలకృష్ణ వ్యాపారి. అమ్మ ఉష గృహిణి. వారిద్దరూ నా మీద ఏనాడూ ఒత్తిడితేలేదు. పదోతరగతి 532, ఇంటర్ 961 మార్కులు సాధించాను. ఎంసెట్‌లో మంచిర్యాంకు సాధించి బీటెక్‌లో చేరినా.. మధ్యలోనే ఆపేశా. ఏడాదిపాటు పోస్టల్ ఉద్యోగం చేశా. తర్వాత బ్యాంకులో ఉద్యోగం రావటంతో దానికి మారాను. మొదటి నుంచి సబ్జెక్టులపై మంచి పట్టు ఉండటంతో అన్నీ బుర్రలో గుర్తుండిపోయాయి. దీంతో ఉద్యోగం చేస్తూనే రాత్రిళ్లు చదివేవాణ్ని. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా ర్యాంకు సాధించటం ఆనందంగా ఉంది. గతంలో ఐసెట్‌లో వచ్చిన ప్రశ్నాపత్రాలను చదివి.. ప్రశ్నల సరళిపై అవగాహన తెచ్చుకున్నా. తర్వాత నెలరోజుల పాటు సబ్జెక్టుల్లో సొంతంగా ప్రిపేరయ్యాను.

యుద్ధానికెళ్లే సైనికుడికి అస్త్రాలు ఎంత ముఖ్యమో.. పోటీపరీక్షలకు వెళ్లేటపుడు సబ్జెక్టులపై పరిజ్ఞానం అంత అవసరం. దాన్ని దృష్టిలో ఉంచుకుని సిద్ధమవ్వాలి. రోజుకు రెండుమూడుగంటలు ఏకాగ్రతతో చదవాలి. పరీక్షల్లో వచ్చే అంశాలను విభజించుకుని.. వాటిని విశ్లేషించుకోవాలి. ఏవైనా వెనుకబడి ఉన్నట్లయితే దానికోసం మరికొంత ఎక్కువ సమయం కేటాయించాలి.
Published date : 01 Jun 2013 04:58PM

Photo Stories