Skip to main content

నిరుపేద కుటుంబం నుంచి శాస్త్రవేత్త వరకు

ట్రిపుల్‌ఐటీలో ఇంజినీరింగ్ చేసిన శ్రీకాకుళపు హరిబాబు, కిరణ్‌బాబులది నిరుపేద కుటుంబం.
తండ్రి సత్యనారాయణ కుమ్మరి. తల్లి చిన్నమ్ములు గృహిణి. వీరిరువురూ కష్టపడి పనిచేస్తూ తమ బిడ్డలను సింహాచలం సమీపంలోని అడవివరం హైస్కూల్‌లో పదోతరగతి వరకు చదివించారు. పదోతరగతిలో హరిబాబు 564మార్కులు సాధించి 2009లోను, కిరణ్‌బాబు 561మార్కులు సాధించి 2011లోను నూజివీడు ట్రిపుల్‌ఐటీలో సీటు సాధించారు. ట్రిపుల్‌ఐటీలో సీటు సాధించిన నాటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా తమ తల్లిదండ్రులు కన్న కలలను నిజం చేస్తూ వారు గర్వించే స్థాయికి ఎదిగారు.

శాస్త్రవేత్తగా హరిబాబు...
అన్నదమ్ముల్లో పెద్దవాడైన హరిబాబు ప్రస్తుతం తమిళనాడులోని కల్పకంలోగల ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్‌లో సైంటిఫిక్ ఆఫీసర్-డీ గా నెలకు లక్ష రూపాయల వేతనంతో పనిచేస్తున్నాడు. ఇంజనీరింగ్‌లో ఎంఎంఈ బ్రాంచిలో 9.5 సీజీపీఏ సాధించాడు. అనంతరం ఎంటెక్ ముంబైలోని హోమీబాబా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బార్క్‌లో చదివాడు. 95 శాతం మార్కులతో ఎంటెక్ చేసి ఉద్యోగంలో చేరాడు. ఎంటెక్ చదివేటప్పుడు హోమీబాబా స్వర్ణ పతకం సైతం సాధించాడు.

జర్మనీలో పీహెచ్‌డీ చేస్తున్న కిరణ్‌బాబు:
చిన్నవాడైన కిరణ్‌బాబు ప్రస్తుతం జర్మనీలోని డస్కెల్‌డార్ఫ్‌లో ఉన్న మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఐరన్ రీసెర్చ్‌లో పీహెచ్‌డీ చేస్తున్నాడు. ప్రతినెలా 1500 యూరోల స్టైఫండ్ పొందుతున్నాడు. ఇంజినీరింగ్‌లో ఎంఎంఈ బ్రాంచి తీసుకుని 9.69 సీజీపీఏ సాధించాడు. ఐఐటీ మద్రాస్‌లో మూడు నెలల పాటు ఇంటర్న్‌షిప్ చేశాడు. రీసెర్చ్ సైంటిస్టు కావాలనే లక్ష్యంతో ముందుకుసాగుతున్నాడు.
Published date : 20 Dec 2019 02:00PM

Photo Stories