Skip to main content

చదువు బీటెక్-రాబడి హైటెక్

సాక్షి, ఎడ్యుకేషన్: బీటెక్ చదివినవారంతా ఏదో ఒక కంపెనీలో చేరి తమ జీవనయాత్రను సాగించడం సహజం.
ఝార్ఖండ్‌కు చెందిన రాకేశ్ అనే కుర్రాడు బీటెక్ తర్వాత ఉద్యోగంలో చేరాడు. మంచి జీతమే వస్తున్నా సంతృప్తి మాత్రం లభించలేదు. దీంతో ఆ ఉద్యోగానికి స్వస్తి పలికాడు. తన ఊరికి చేరి పొలం బాట పట్టి కొంతమంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపాడు.

రాకేశ్ మహంతి స్వస్థలం పటండా. వ్యవసాయ కుటుంబ నేపథ్యం. బీటెక్ పూర్తయ్యాక రాకేశ్‌కు ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం వచ్చింది. కొత్తల్లో ఉత్సాహంగా పనిచేసినా కాలక్రమేణా జీవితశైలి నచ్చలేదు. మంచి వేతనమే వస్తున్నా ఎందుకో ఆ ఉద్యోగం సంతృప్తి కలిగించలేదు. 2017లో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. వ్యవసాయం చేయాలని నిర్ణయించుకొని స్వగ్రామానికి వెళ్లిపోయాడు. అక్కడికి చేరాక బ్రూక్ అండ్ బీస్ అనే సంస్థను స్థాపించాడు. సామూహిక వ్యవసాయం ద్వారా లాభాలు పొందడం రాకేశ్ లక్ష్యం. స్థానిక రైతులతో చేతులు కలిపాడు. రైతుల అనుభవం, వనరులు, పరికరాలతోపాటు యంత్రాలను సామూహికంగా వాడుకొన్నారు. ‘మాది గ్రామీణ నేపథ్యం. వాతావరణ మార్పులు, నీటి కొరత, రసాయన సమ్మిళిత భోజనం, సాగులో రాబడి తదితర అంశాలపై నాకు చిన్నతనం నుంచే అవగాహన ఉంది. రైతాంగాన్ని..సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేలా చేయాలని నిర్ణయించుకొన్నా. కార్పొరేట్ సంస్థలో పనిచేస్తున్నా అక్కడ సంతృప్తి కలగలేదు. అందుకే స్వగ్రామానికి వచ్చేశా. వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టా’’ అని తెలిపారు రాకేశ్. రాకేశ్ సంస్థలో మొత్తం 80 మంది రైతులు సభ్యులుగా చేరారు. మొత్తం 80 ఎకరాల భూమిని సామూహికంగా పండించారు. ఇది వారికి వరంగా మారింది. తొలి ఏడాదే లాభాలు వచ్చాయి. దీంతో మరుసటి ఏడాదినుంచి రైతులకు ప్రతి నెలా జీతంతోపాటు లాభాల్లో పది శాతం వాటా ఇచ్చాడు రాకేశ్. దిగుబడి విక్రయ బాధ్యత మాత్రం రాకేశ్ చూసుకొంటున్నాడు. రాబడి బాగుండడంతో రైతులంతా సంతోషంగా జీవనం సాగిస్తున్నాయి.
Published date : 14 Mar 2020 05:15PM

Photo Stories