Skip to main content

ఆరుస్వర్ణాల ఆణిముత్యం... హర్షిత

లక్ష్యం మీద చూపించే శ్రద్ధ దాన్ని సాధించే సాధనా విధానాల మీద కూడా ఉన్నప్పుడే గమ్యానికి చేరుకోగలం.... వెయి అడుగుల దూరమైనా.. ఒక్క అడుగుతోనే మొదలవుతుందున్న స్పూర్తితో సాగాలి.. అప్పుడే నేటి పోటీ యుగంలో విజేతగా నిలవగలమని నిరూపించింది హర్షిత కుడితి.. మొదటి రోజు నుంచే శ్రమిస్తూ.. జేఎన్‌టీయూ పరిధిలో బీటెక్‌లో ఆరు స్వర్ణ పతకాలతో ఔరా అనిపించింది.. అందరికీ భిన్నంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లా కాకుండా హార్డ్‌వేర్ రంగంలో రాణించాలన్నదే తన లక్ష్యమంటోన్న హర్షిత సక్సెస్‌స్పీక్.

మాది వరంగల్ జిల్లా మరిపెడ గ్రామం. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. నాన్న యుగంధర్ రెడ్డి. రేస్‌కోర్స్ ఉద్యోగి. అమ్మ జ్యోతి. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయిని.

ఈసీఈ ఎందుకు?
ఎంసెట్ 95వ ర్యాంక్‌తో జేఎన్‌టీయూ-హైదరాబాద్ ఈసీఈలో చేరాను. ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ యుగం. ప్రతీ వస్తువు తయారీలో ఎలక్ట్రానిక్ అనువర్తనాల ఉపయోగం తప్పనిసరిగా మారింది. అంతేకాకుండా చిప్స్ డిజైనింగ్ సబ్జెక్ట్ అంటే ఎంతో ఆసక్తి. అందుకే ఈసీఈ ఎంచుకున్నా.

తొలి రోజు నుంచే:
కోర్సులో చేరిన తొలి రోజు నుంచే నిబద్ధత, నిజాయితీ, నిరంతర అధ్యయనం, కృషితో అడుగులు వేశాను.. ఈ నాలుగు అంశాలే నేను స్వర్ణ పతకాలు సాధించడానికి సాధనాలు. కాలేజీలో చేరిన తొలి రోజు నుంచే సబ్జెక్టు పరంగా పట్టు సాధించడానికి ప్రయత్నించాను.

అన్వయానికి ప్రాధాన్యం:
పుస్తక పరిజ్ఞానం కంటే అన్వయ సామర్థ్యానికి ప్రాధాన్యం ఇచ్చాను. నేర్చుకున్న అంశాన్ని ప్రయోగ రూపంలో అన్వయించే దిశగా ల్యాబ్‌వర్క్‌కు ఎక్కువ సమయం కేటాయించాను. ప్రయోగాల ద్వారా విషయ పరిజ్ఞానం మరింత ఎక్కువగా లభిస్తుంది. ముఖ్యంగా కోర్ బ్రాంచ్ విద్యార్థులు ల్యాబ్ వర్క్‌కు ఎక్కువ సమయం కేటాయించాలి.

ప్రాజెక్ట్ వర్క్:
బీటెక్ మొదటి సంవత్సరంలో రోబోటిక్స్‌పై ప్రాజెక్ట్‌వర్క్ చేశాం. చివరి సంవత్సరంలో సైయంట్ (ఇన్ఫోటెక్) తరపున ఆటోమేటిక్ రైల్ సిగ్నలింగ్ విత్ ట్రైన్ ప్రొటెక్ట్ అండ్ వార్నింగ్ సిస్టమ్ అనే అంశంపై ప్రాజెక్టును నిర్వహించా.

సలహా:
బీటెక్ విద్యార్థులు తొలి ఏడాది నుంచే స్పష్టమైన లక్ష్యంతో అడుగులు వేయాలి. మొదటి సంవత్సరంలో వర్క్‌షాప్‌లు, సెమినార్లలో చురుగ్గా పాల్గొనాలి. రెండో ఏడాది నుంచి ల్యాబ్‌వర్క్, ప్రాక్టికల్స్, ప్రాజెక్ట్‌వర్క్‌లపై ఆసక్తి పెంచుకోవాలి. ఎప్పటికప్పుడు సిలబస్‌ను పునశ్చరణ చేసుకునేలా ప్రణాళిక రచించుకోవాలి. ప్రతి అంశాన్ని ప్రాక్టికల్ అప్రోచ్‌తో చదివి.. ఆ అంశాలను వాస్తవ పరిస్థితులతో అన్వయించుకోవాలి. తద్వారా సదరు సబ్జెక్టులపై మరింత పట్టు లభిస్తుంది.

ఎంఎస్ చేస్తున్నా:
ప్రస్తుతం అమెరికాలోని అరిజోనా యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నాను. వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ (వీఎల్‌ఎస్‌ఐ) చిప్స్ డిజైనింగ్‌లో స్పెషలైజేషన్ చేస్తున్నాను. ఆ తర్వాత పీహెచ్‌డీ చేస్తా.

లక్ష్యం:
సెమీకండక్టర్ ఇండస్ట్రీలో చిప్ ఫ్యాబ్రికేషన్స్ డిజైనింగ్ ఇంజనీర్‌గా స్థిరపడాలనేది లక్ష్యం.

ఆరు స్వర్ణాలు:
  • జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో బీటెక్ (ఈసీఈ) బ్రాంచ్‌లో బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ (92.44 శాతం)
  • ప్రోఫెసర్ జి.పురుషోత్తమ్ స్మారక ఎండోమెంట్ గోల్డ్‌మెడల్ (జేఎన్‌టీయూ, కాన్‌స్టిట్యుయెంట్ అండ్ అఫ్లియేటెడ్ కాలేజీల పరిధిలో మ్యాథమెటిక్స్-1లో అత్యధిక మార్కులు సాధించినందుకు)
  • డీవీడీ నర్సరాజు స్మారక ఎండోమెంట్ గోల్డ్ మెడల్ (జేఎన్‌టీయూ కాలేజీలో బీటెక్ ఈసీఈ విభాగంలో బెస్ట్ అవుట్ గోయింగ్ గర్ల్ స్టూడెంట్)
  • శ్రీమతి ఎం. వేదవతి గోల్డ్ మెడల్ (జేఎన్‌టీయూ-హెచ్ పరిధిలోని కాన్‌స్టిట్యుయెంట్ కాలేజీల్లో బీటెక్-ఈసీఈలో బెస్ట్ అవుట్ గోయింగ్ గర్ల్ స్టూడెంట్)
  • అరుణ్ శేషు మెరిటి యస్ గోల్డ్ మెడల్ (జేఎన్‌టీయూ-హెచ్ పరిధిలోని అన్ని కాన్‌స్టిట్యుయెంట్ కాలేజీల్లో బీటెక్ అన్ని బ్రాంచ్‌ల్లో కలిపి ఫస్ట్ ర్యాంకు సాధించినందుకు)
  • బూర్గుల రామకృష్ణారావు స్మారక గోల్డ్ మెడల్ (జేఎన్‌టీయూ-హెచ్ పరిధిలోని అన్ని అఫ్లియేటెడ్, కాన్‌స్టిట్యుయెంట్ కాలేజీల్లో బీటెక్ అన్ని బ్రాంచ్‌ల్లో కలిపి ఫస్ట్ ర్యాంకు సాధించినందుకు)
అకడెమిక్ ప్రొఫైల్:
  • 10వ తరగతి: 554/600
  • ఇంటర్మీడియెట్: 978/1000
  • ఎంసెట్: 95వ ర్యాంక్
  • బీటెక్ ఈసీఈ: 92.44 శాతం
Published date : 19 Sep 2014 05:00PM

Photo Stories