Skip to main content

మతం

ప్రపంచ సామాజిక వ్యవస్థలో ఏదో ఒక రకమైన మతం ఉంది. ఇది సమాజంలో అనాదిగా వేలఏళ్ల నుంచి మనుగడలో ఉంది. భిన్నత్వంలో ఏకత్వం ప్రత్యేకతగా ఉన్న భారతీయ సమాజ లక్షణాలకు సంబంధించి అత్యంత ప్రధానమైన అంశాల్లో మతం ఒకటి. భారతదేశం బహుళ మతాలతో కూడుకొని ఉంది. అనేక మతాలు ఉన్నప్పటికీ మత సహనంతో విరాజిల్లడం భారతీయ సమాజ విశిష్ట లక్షణం. ఈ లక్షణం పురాతన కాలంలోగానీ, ఆధునిక కాలంలోగానీ మరెక్కడా కనిపించదు.
తన పుట్టుక నుంచి మరణం వరకు ప్రకృతిలో సంభవించే వివిధ అంశాలు అగమ్యగోచర శక్తి ప్రభావాలే అని నమ్మాడు. తన ప్రశ్నలు, సందేహాలన్నింటికీ ఊహాత్మక భావనల మేరకు సమాధానం వెతుక్కున్నాడు. అంతిమంగా అవన్నీ ‘మానవాతీత శక్తి సృష్టి’ అనే భావనకు వచ్చాడు. సామాజిక మానవ శాస్త్రవేత్తలు ఈ మానవాతీత శక్తి (సూపర్ పవర్)నే అలౌకిక శక్తిగా విశ్లేషించారు. ఈ అలౌకిక శక్తుల మనుగడకు సంబంధించిన విశ్వాసమే మతంగా ఆవిర్భంచిందని చెప్పవచ్చు.

మతానికి సామాజిక శాస్త్రవేత్తలు ఇచ్చిన నిర్వచనాలు
  • మానవాతీత శక్తులపై ఉండే వైఖరులే మతం. - ఆగ్బర్న్
  • మానవ జీవితం, స్వభావానికి మార్గం చూపి, వాటిని నియంత్రించే మానవాతీత శక్తులపై ఉన్న విశ్వాసమే మతం. - జేమ్స్ అండ్ ఫ్రీజర్
  • మానవుడికి, మానవుడికి మధ్య ఉండే సంబంధమే కాకుండా అతీతమైన శక్తితో మానవుడికి ఉండే సంబంధాన్ని తెలియజేసేదే మతం. - మెకైవర్
మతం విశ్వజనీనమైంది. మతం లేని సమాజం లేదు. మానవాతీత శక్తుల్లో విశ్వాసం కలిగి ఉండటమే మతంలోని ప్రధానాంశం.

భారతదేశంలోని ప్రధాన మతాలు
1. హిందూ మతం
2. ఇస్లాం
3. క్రైస్తవం
4. సిక్కు మతం
5. బౌద్ధం
6. జైనం
7. జొరాస్ట్రియన్ (పార్శీ) మతం

2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో వివిధ మతాలవారు

1. హిందువులు

79.8 శాతం

2. ముస్లింలు

14.2 శాతం

3. క్రైస్తవులు

2.3 శాతం

4. సిక్కులు

1.7 శాతం

5. బౌద్ధులు

0.7 శాతం

6. జైనులు

0.4 శాతం

7. ఇతరులు

0.7 శాతం


హిందూ మతం
‘హిందూ’ అనే పదం భారతదేశ పశ్చిమ ప్రాంతంలో ప్రవహిస్తున్న ‘సింధూ’ నది పేరు నుంచి వచ్చిందని భావిస్తున్నారు. కాలక్రమంలో సింధూ అనేది ‘హిందూ’గా మారింది. భారతదేశానికి వచ్చిన విదేశీ యాత్రికులు సింధూనదిని ‘ఇండస్’ అని పిలిచారు. దీని ఆధారంగా భారతదేశానికి ‘ఇండియా’ అనే పేరు వచ్చింది. భారతీయులందరినీ ‘హిందువులు’గా పిలిచారు.
హిందూ మతాన్ని ఒక మతం అని పిలవడం కంటే ‘విశ్వాసాల సమ్మేళనం’గా పేర్కొనడం ఉత్తమం. పురాతన కాలం నుంచి భారతీయులకు అనేక విశ్వాసాలు ఉన్నాయి.
ఉదా: పితృదేవతలను పూజించడం, ప్రకృతి శక్తుల ఆరాధన (నదులు, చెట్లు), బహు దేవతారాధన, ఏకేశ్వర ఉపాసన.
ప్రాచీన కాలంలో భారతీయ నాగరిక ఆశయాల్లో అన్ని మానవ విశ్వాసాలు సమ్మిళితమయ్యాయని ఎస్.కె. బోస్ పేర్కొన్నారు. క్రైస్తవం, బౌద్ధం, ఇస్లాం మాదిరిగా హిందూ మతానికి ఒక ప్రారంభకుడు లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని ఆయన చెప్పారు.
హిందూ మతానికి చెందిన వ్యక్తి జీవితమంతా మత విలువలపైనే ఆధారపడి ఉంది. మంచి కార్యాలు చేసినవారు మరణించిన తర్వాత ఉత్తమ జీవితాన్ని పొందుతారు, చెడ్డ పనులు చేసినవారు తర్వాతి జన్మలో అనేక బాధలు అనుభవిస్తారనే నమ్మకంపై హిందూ మత విలువలు ఆధారపడి ఉన్నాయి.
హిందూ మత మౌలిక ధార్మిక గ్రంథాలు రెండు రకాలు. అవి: 1. శృతులు 2. స్మృతులు.

1. శృతులు
వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులను ‘శృతి సాహిత్యం’గా పేర్కొంటారు. దీన్ని అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. వీటినే ‘అపౌరుషేయాలు’ అంటారు. అంటే దేవతలు రాసి ప్రజలకు ఇచ్చారని అర్థం.

2. స్మృతులు
వేదాంగాలు, పురాణాలు, ఉపవేదాలు, ఇతిహాసాలను ‘స్మృతి సాహిత్యం’ అంటారు. వీటిని జ్ఞాన సముపార్జులైన రుషులు రాశారు.
పైన పేర్కొన్న అంశాల ద్వారా హిందూ జీవన విధానాన్ని తెలుసుకోవచ్చు. కర్మ సిద్ధాంతం, వర్ణ వ్యవస్థ, ఆశ్రమ వ్యవస్థ, పురుషార్థాలు హిందువులు ఆచరించాల్సిన విధానాల గురించి వివరిస్తాయి.

కర్మ సిద్ధాంతం
హిందూ మతంలోని ప్రతి వ్యక్తిపై కర్మ సిద్ధాంతం ప్రభావం ఉంటుంది. వ్యక్తి చేసే పనులు, మంచి చెడుల ఆధారంగా ప్రస్తుత జీవితం, పునర్జన్మ ఉంటాయని కర్మ సిద్ధాంతం తెలుపుతుంది. ‘ప్రతి వ్యక్తిలో ఆత్మ ఉంటుంది. ఇది శాశ్వతమైంది. దీనికి పునర్జన్మ ఉంటుంది. ప్రస్తుత జీవితం గత జీవితంలో చేసిన మంచి - చెడుల ఫలితం’ అని ఈ సిద్ధాంతం వివరిస్తుంది.

వర్ణ వ్యవస్థ
ఇది అత్యంత కీలకమైంది. రుగ్వేదంలోని 10వ అధ్యాయంలో పురుషసూక్తం దీని గురించి తెలుపుతుంది. దీని ప్రకారం ఈ సృష్టికర్త బ్రహ్మ. ఆయన తన శరీరం నుంచి ఈ సృష్టిని వర్ణం ఆధారంగా 4 రకాలుగా సృష్టించారని పేర్కొన్నారు. దీన్నే ‘దైవాంశ సంభూత సిద్ధాంతం’ అంటారు. దీని ప్రకారం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే నాలుగు వర్ణాల వారిని దైవం (బ్రహ్మ) సృష్టించాడని భావించారు. వీరిలో మొదటి మూడు వర్ణాల వారిని ‘ద్విజులు’ అంటారు. వీరికి ఉపనయనం, క్రతువులు ఉంటాయి. గాయత్రి మంత్రం ఆచరించడానికి, ఉచ్ఛరించడానికి వీరికి అర్హత ఉంటుంది. కింది స్థాయిలోని శూద్రులకు ఇవేవి ఉండవు. ఈ వర్ణవ్యవస్థ నుంచి తదనంతర కాలంలో కులాలు, ఉపకులాలు, ఆవిర్భవించాయి. కానీ వీటికి, ప్రస్తుతం ఉన్న కులాలకు చాలా తారతమ్యం ఉంది.

ఆశ్రమ వ్యవస్థ
హిందూ సామాజిక వ్యవస్థలో ప్రతి వ్యక్తి అంతిమ లక్ష్యం ‘మోక్షం’ పొందడం. ప్రతి హిందువు నాలుగు దశల ద్వారా దీన్ని చేరాలి.
హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఆశ్రమం అంటే వ్యక్తి తన జీవిత కాలంలో చేసే ఒక్కో మజిలీ. ఒక వ్యక్తి తర్వాత దశ చేరుకోవడానికి అర్హత పొందే శిక్షణా దశలే ఆశ్రమాలు. ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త అల్టేకర్ ప్రకారం క్రీ.పూ. 100 నుంచే హిందువుల్లో ఆశ్రమ పద్ధతి అమల్లో ఉంది. నాలుగు రకాల ఆశ్రమాలు ఉన్నాయి. బ్రహ్మను చేరుకోవడానికి ఈ ఆశ్రమాలు నాలుగు మెట్లు కలిగిన నిచ్చెన లాంటివని భీష్ముడు పేర్కొన్నట్లు హిందువులు భావిస్తారు.
i) బ్రహ్మచర్యాశ్రమం: ఒక వ్యక్తి ఉపనయనం తర్వాత మొదటిదశ అయిన బ్రహ్మచర్యాశ్రమంలోకి చేరుకోవచ్చు. తల్లి గర్భం నుంచి జన్మించడం మొదటి జన్మ. ఈవిధంగా పుట్టిన వ్యక్తిని ఎలాంటి లక్ష్యం లేనివాడిగా భావిస్తారు. ఆ తర్వాత బ్రహ్మచర్యాశ్రమంలోకి ప్రవేశింపజేయడానికి ఒక ఉత్సవం నిర్వహిస్తారు. దీన్నే ‘ఉపనయనం’ అంటారు. అంటే ‘మళ్లీ జన్మించినవాడు’ అని అర్థం. ఉపనయనం జరిగిన వ్యక్తిని ‘ద్విజుడు’ అంటారు. మహిళలు, శూద్రులకు ఉపనయనం లేదు.
ఉపనయనంలో ఒక లక్ష్యంలేని, క్రమబద్ధం కాని జీవితాన్ని ఒక నిర్దిష్ట ఆశయం ఉన్న జీవితంగా మారుస్తారు. వర్ణాల ఆధారంగా ఉపనయనం అర్హత నిర్ధారిస్తారు. సాధారణంగా బ్రాహ్మణులకు 8, క్షత్రియులకు 10, వైశ్యులకు 12 ఏళ్ల వయసులో దీన్ని నిర్వహిస్తారు. అనివార్య పరిస్థితుల్లో ఇలా జరగకపోతే మరో నాలుగేళ్ల తర్వాత ఉపనయనం చేస్తారు. దీని తర్వాత సంబంధిత వ్యక్తి గాయత్రీ మంత్రం నేర్చుకోవడానికి అర్హత పొందుతాడు. వేదాంగాల్లో భాగమైన కల్పలోని గృహసూత్రంలో 11వ యాగం ఉపనయనం గురించి తెలియజేస్తుంది.

వేదాంగాలు 6 రకాలు. అవి:
1. శిక్ష
2. నిరుక్త
3. వ్యాకరణం
4. జ్యోతిషం
5. ఛందస్సు
6. కల్ప

కల్ప 3 రకాలు
  1. గృహసూత్రం: మోక్షం సాధించడానికి చేయాల్సిన 16 యాగాల (షోడశ కర్మలు) గురించి తెలుపుతుంది. 11వ యాగం ఉపనయనం గురించి వివరిస్తుంది.
  2. శ్రేతసూత్రం: చక్రవర్తి ప్రజల కోసం నిర్వహించాల్సిన యాగాల గురించి తెలుపుతుంది.
  3. సుళువ సూత్రం: హోమగుండాల నిర్మాణం గురించి తెలుపుతుంది.
ఉపనయనం తర్వాత బ్రహ్మచర్య ఆశ్రమం ప్రారంభమవుతుంది. ఈ ఆశ్రమంలో వ్యక్తి ఉపాధ్యాయుడి గృహంలో విద్యార్థిగా ప్రవేశిస్తాడు. గురువు అతడికి వెంటనే విద్య నేర్పటం ప్రారంభించడు. వ్యక్తి ముందుగా గురువు ఇంటి పనులు చేయాలి. గురువు అతడికి పశువులు కాయడం; వంట చెరకు తీసుకురావడం; క్రతువులకు ఏర్పాట్లు చేయడం; తనకు, తన గురువుకు భిక్షను యాచించడం లాంటి పనులు అప్పగిస్తాడు. ఈ సేవల ద్వారా సంతృప్తి పొందితే గురువు వెలుగును (విద్యా) వేదాధ్యయనం ద్వారా బోధించడం మొదలు పెడతాడు. ‘విద్’ అంటే వెలుగు. జ్ఞానమనే వెలుగులో అజ్ఞానాంధకారాన్ని పారదోలడానికి గురువు వారధి లాంటివారు.
సన్మార్గం కోసం హిందువులకు ఒక బాధ్యతగా వేదాధ్యయనం నేర్పిస్తారు. పుట్టిన ప్రతి వ్యక్తి 3 రుణాలను చెల్లించాలని హిందూ మతం చెబుతోంది. అవి..
ఎ) రుషులకు రుణం చెల్లించడం: వేదాలు వల్లె వేయడం ద్వారా గురువు కంటే ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించి గురువుతో ప్రశంసలు పొందేలా జ్ఞానాన్ని పొందడం. దీంతో రుషి రుణం తీరినట్లవుతుంది.
బి) దైవ రుణం తీర్చడం: యజ్ఞయాగాదుల ద్వారా ఈ రుణం తీర్చుకోవచ్చని హిందూ ధర్మగ్రంథాలు తెలుపుతున్నాయి.
సి) పితృ (తల్లిదండ్రుల) రుణం: జన్మ ఇచ్చిన తల్లిదండ్రులను గౌరవించడం, వృద్ధాప్యంలో వారికి సేవలందించడం ద్వారా వారికి మోక్ష ప్రాప్తి లభించేలా చూడాలి.

ii) గృహస్థ ఆశ్రమం: బ్రహ్మచర్యంలో సంపాదించిన జ్ఞానం ఆధారంగా స్వశక్తితో జీవించడం ప్రారంభించిన తర్వాత వివాహం ద్వారా గృహస్థాశ్రమ ప్రవేశం జరుగుతుంది. హిందువుల్లో వివాహానికి ధర్మ, ప్రజా, రతి అనే మూడు లక్షణాలు ఉన్నాయి.
ధర్మ: సాంఘిక, మతపరమైన బాధ్యతలను నిర్వర్తించడం.
ప్రజా: సంతానాన్ని పొందడం. పురుష సంతానం వాంఛితమైందిగా భావిస్తారు. అతడు తల్లిదండ్రులను పుత్ (నరకం)లో పడకుండా రక్షిస్తాడనే నమ్మకం ఉంది.
రతి: ఇది లైంగిక వాంఛలు, కోరికలను తృప్తిపరుస్తూ సంతానోత్పత్తికి అవసరమైంది.
ఈ మూడు లక్ష్యాలను వ్యక్తి గృహస్థ దశలో సాధిస్తాడు. మనుసంహిత ప్రకారం ఒక గృహస్థు రోజూ ‘పంచ మహాయజ్ఞాలు’ చేయాలి. అవి.. బ్రహ్మయజ్ఞం, పితృ యజ్ఞం, దైవ యజ్ఞం, భూత యజ్ఞం, నరయజ్ఞం.
బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలు పోషణార్థం గృహస్థు ఆశ్రమంపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల దీన్ని ఉన్నతమైందిగా భావిస్తారు.
వార్థక్య ఛాయలు (ముఖంపై ముడతలు, జుట్టు నెరవటం) వచ్చిన తర్వాత లేదా కుమారులకు వివాహమైన అనంతరం గృహస్థు తన ఇంటిని కుమారులకు అప్పగించి భార్య సహాయంతో గృహస్థ ఆశ్రమాన్ని వదిలి వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించాల్సి ఉంటుంది.

iii) వానప్రస్థ ఆశ్రమం: ఇది గృహస్థ, సన్యాస ఆశ్రమాలకు వారధి లాంటిది. ఈ ఆశ్రమంలో ఒక వ్యక్తి వెంట భార్య వెళ్లవచ్చు. ఈ దశలోనూ ‘పంచ మహాయజ్ఞాలు’ నిర్వర్తిస్తారు. దీన్ని ప్రజా జీవనానికి దూరంగా, ప్రశాంత వాతావరణంలో గడపాలి. అందువల్ల అడవిలో ఆశ్రమం నిర్మించుకొని జీవిస్తారు. వ్యక్తి ప్రారంభంలో పచ్చి ఆకులు, వేర్ల సహాయంతో ఆకలి తీర్చుకోవాలి. ఆ తర్వాత నీరు, చివరకు గాలి మాత్రమే సేవించి ఆకలి తీర్చుకోవాలి. శారీరక సుఖాలన్నింటిని వదిలేయాలి. ఈ దశలో అర్థకామాలు ఉండవు. వేదాలు, వేదాంగాలు, స్మృతుల పఠనం ద్వారా ఆధ్యాత్మిక చింతన అలవరచుకోవడానికి శరీరానికి క్రమశిక్షణ అలవాటు చేయాలి.
సన్యాస ఆశ్రమం స్వీకరించే ముందు భార్యను కుమారులతో కలిసి జీవించడానికి ప్రోత్సహించాలి. వ్యక్తి క్రమంగా తన అభిమానం, కుటుంబం, గ్రామం అనే సంకుచిత పరిధుల నుంచి బయటపడి విశ్వమానవాళిని ప్రేమించాలి. ఇవన్నీ సాధించిన తర్వాత సన్యాసి రూపంలో సంఘ ప్రవేశం చేయాలి.

iv) సన్యాస ఆశ్రమం: ఇది చివరి దశ. ఈ దశలో కఠినమైన జీవితాన్ని గడపాలి. ప్రాపంచిక విషయాల పట్ల అనాసక్తత ప్రదర్శించాలి. మోక్ష సాధనకు ప్రయత్నించాలి. భిక్షాటన ద్వారా మాత్రమే జీవించాలి. సన్యాసి తాను తిరుగాడే ప్రజల నుంచి గొప్ప గౌరవాన్ని పొందాలి. ఆ ప్రజల మనసులు, జీవితాలపై గొప్ప ప్రభావాన్ని చూపాలి. వ్యక్తిగత ఉదాహరణ ద్వారా, మతబోధ ద్వారా మార్గదర్శకంగా ఉండేలా సమాజానికి ప్రోత్సాహం కల్పించాలి. అంటే సన్యాసి ఒక మహత్తర సాంఘిక పాత్రను నిర్వహిస్తాడు.

పురుషార్థాలు

హిందూ సమాజ వ్యవస్థలో ప్రతి వ్యక్తికీ పురుషార్థాలు మార్గదర్శక సూత్రాలుగా వ్యవహరిస్తాయి. పురుషార్థాలు 4. అవి..ధర్మం, అర్థం, కామం, మోక్షం.

హిందూ జీవనంలో ధర్మం అనే భావానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ధర్మం అనే పదం సంస్కృతంలోని ‘ధృ’ అనే ధాతువు నుంచి వచ్చింది. ‘ధృ’ అంటే కలిపి ఉంచు, నిలబెట్టు అని అర్థం. ధర్మం మానవుడి ప్రవర్తనను క్రమబద్ధం చేస్తుంది. సమాజానికి ఏది ఆమోద యోగ్యమో, దానికి అనుగుణంగా వ్యక్తి జీవించాలి. నీతి, నిజాయతీ, నైతిక ప్రవర్తన గురించి ధర్మం చెబుతుంది. ‘ధర్మం’ అనే పదాన్ని అనేక సందర్భాల్లో అనేక అర్థాల్లో వాడారు.
ఐతరేయ బ్రాహ్మణం: విశ్వానికంతటికీ మూలం ధర్మం. ప్రజలు మార్గదర్శకత్వం కోసం ధర్మం గురించి బాగా తెలిసిన వ్యక్తి వద్దకు వెళతారు. ధర్మం వల్ల దుష్టత్వాన్ని పారద్రోలవచ్చు. ప్రతిదీ ధర్మం మీదే ఆధారపడి ఉంది. అందువల్ల ధర్మం అత్యుత్తమ సుగుణం.
మహాభారతం: ప్రజల్లో శక్తి, ప్రభావం కలగడానికి ధర్మాన్ని వివరించారు. ధర్మం అహింసతో కూడింది, దృఢమైంది. అది ప్రపంచాన్ని నిలబెడుతుంది. సృష్టిలోని ఏ జీవికీ హాని చేయకుండా ఉండేది కచ్చితంగా ధర్మం.
వైశేషిక సూత్రాలు: భౌతిక లాభం, ఆధ్యాత్మిక సుగుణం దేని నుంచి కలుగుతాయో అదే ధర్మం.
మహానారాయణోపనిషత్తు: జగత్ అంతటికీ మూలం ధర్మం. ధర్మాన్ని శ్రద్ధగా పాటించేవారిని ప్రజలు ఆశ్రయిస్తారు. ధర్మం ద్వారా పాపాలను పోగొట్టుకుంటారు. ధర్మం అత్యంత సుగుణం. ‘సు’ అంటే మంచి అని అర్థం. గుణం అంటే లక్షణం అని అర్థం.
జైమిని ప్రకారం: వేదాలు సూచించే, ఆశించే ఫలితం లేదా ఆశయమే ధర్మం.
మనుస్మృతి ప్రకారం: పక్షపాత బుద్ధితో కాకుండా, నీతి నిజాయతీలతో రాగద్వేషాలను వీడి మనసా, వాచా, కర్మణా జీవించే పవిత్ర జీవన విధానమే ధర్మం. ప్రతి వస్తువుకు గమనించదగ్గ నైసర్గిక ధర్మం ఉంటుంది.
మానవుడు ఆచరించాల్సిన ధర్మాలను గురించి యాజ్ఞవల్క్యుడు తొమ్మిది ధర్మ సుగుణాలను వివరించాడు. అవి.. అహింస, నిర్మలత్వం, నీతి, పరిశుభ్రత, ఇంద్రియ నిగ్రహం, దానం, ఆత్మనిగ్రహం, ప్రేమ, సహనం
ఈ తొమ్మిది ధర్మగుణాల్లో మొదటి ఆరు ధర్మగుణాలు సమాజ మనుగడకు, మిగతా మూడు ధర్మాలు వ్యక్తి సత్ప్రవర్తనకు తోడ్పడతాయి.
ధర్మం లక్షణాలను కింది విధంగా గ్రహించవచ్చు.
1. ప్రజల శ్రేయస్సు కోసం ధర్మం ఉంది.
2. ఇతరులకు హాని చేయరాదు అనే భావం ఇందులో ఉంది.
3. ధర్మం వ్యక్తి నడవడిక నియమాలను, జీవన విధానాన్ని సూచిస్తుంది.
4. ధర్మం ఆనందానికి మూలం
5. ఏకీకృతం చేయడానికి ధర్మం ఉపకరిస్తుంది.
6. ధర్మం కర్తవ్యాన్ని సూచిస్తుంది.
7. ధర్మం సామాజిక విలువలకు, సాంస్కృతిక ప్రమాణాలకు ప్రతీకగా ఉంటుంది.
- హిందూ సామాజిక వ్యవస్థలో ధర్మం అత్యంత ఉన్నతమైంది, ఉత్కృష్టమైంది.

దీన్నే సంపద, ఐశ్వర్యం అంటారు. సంపద వల్ల శారీరక సుఖం కలుగుతుంది. అంటే వ్యక్తి అవసరాలను తీర్చడానికి అర్థం ఉపయోగపడుతుంది. కౌటిల్యుడి ‘అర్థశాస్త్రం’ అర్థం విలువను వివరించింది. ధనాన్ని అక్రమ మార్గాల ద్వారా సంపాదించరాదు. అర్థం ఎక్కువ చలామణిలో ఉండటంవల్ల వ్యక్తులు, సమాజం అభివృద్ధి జరుగుతుంది.
కామం అంటే కోరిక. ఇంద్రియ వాంఛలను తృప్తి పరచుకోవడం కామం. గృహస్థాశ్రమంలో వ్యక్తికి కామం సహజం. కామం కేవలం శారీరక వాంఛలకు మాత్రమే పరిమితం కాదు. నృత్యం, సంగీతం, నటన కళారూపాలు మొదలైన వాటిలో కూడా కోరిక ఉంది. కామం వివాహానికి, సంతాన ప్రాప్తికి మూలం. ధర్మంతో కూడిన కామం అంగీకార యోగ్యం. కాబట్టి ప్రతి వ్యక్తీ కామాన్ని క్రమబద్ధం చేసుకోవాలి. ద్విజులలో సంతానోత్పత్తికి మాత్రమే కామాన్ని ఉద్దేశించారు. ధర్మం, అర్థం, కామాలను త్రి వర్గాలు అని పిలుస్తారు. పురుషార్థాలలో కామానికి తక్కువ ప్రాధాన్యమిచ్చి ధర్మానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు.

ప్రతి హిందువు తుది లక్ష్యం మోక్ష సాధన. మోక్షం అంటే ‘ఆత్మను పరమాత్మలో మిళితం చేయడం’. మోక్షసాధన అంటే ప్రతి వ్యక్తి ఆత్మ సాక్షాత్కారం లేదా అంతరంగిక ఆధ్యాత్మికతను సాధించడం. ధర్మ, అర్థ, కామ పరిపూర్ణత ఇందులో ఉంటుంది. కర్మం, జ్ఞానం, భక్తి అనే మూడు మార్గాల ద్వారా మోక్షం లభిస్తుంది. భగవద్గీతలో మోక్షాన్ని పరాగతిగా వర్ణించారు.

బౌద్ధమతం

గౌతమబుద్ధుడు రుమిందై గ్రామ సమీపంలోని లుంబినివనంలో జన్మించాడు. అతడి తండ్రి కపిలవస్తు పాలకుడైన శుద్ధోదనుడు, తల్లి మహామాయ. గౌతమబుద్ధుడి అసలు పేరు సిద్ధార్థుడు. గౌతమబుద్ధుడు పుట్టిన ఏడు రోజులకే అతడి తల్లి మహామాయ మరణించింది. సవతితల్లి మహాప్రజాపతి గౌతమి పెంచడంతో అతడికి గౌతముడిగా పేరొచ్చింది. బుద్ధుణ్ని పెంచిన ‘గౌతమి ప్రజాపతి’ బౌద్ధమతంలో తొలి సన్యాసిని. బుద్ధుడి భార్య యశోధర, కుమారుడు రాహులుడు.
బుద్ధుడు తన 29వ ఏట ఒక వృద్ధుణ్ని, ఒక వ్యాధిగ్రస్తుణ్ని, ఒక సన్యాసిని, ఒక శవాన్ని చూశాడు. వీటిని చూసిన బుద్ధుడు కలత చెంది ఇల్లు వదిలి జ్ఞానాన్వేషణకు బయల్దేరాడు. సంరక్షకుడైన చెన్న సహాయంతో ‘కంఠక’ అనే గుర్రం మీద బుద్ధుడు బయల్దేరాడు. దీన్నే మహాభినిష్ర్కమణ అంటారు. జ్ఞానాన్వేషణలో భాగంగా బుద్ధుడు రెండేళ్లపాటు వైశాలిలో అలారక లామ వద్ద ధ్యాన విధానాన్ని నేర్చుకున్నాడు. రాజగృహంలో ఉద్రక(ఉద్దక) వద్ద కొన్ని రోజులు శిష్యరికం చేశాడు. గురువుల వద్ద తనకు కావాల్సిన సమాధానం లభించలేదు. దీంతో ముక్తి కోసం 15 రోజులు ఉపవాసం ఉన్నాడు. గౌతముడు స్పృహ కోల్పోయిన దశలో సుజాత అనే స్త్రీ అతడి ప్రాణాలను కాపాడింది.
గౌతమ బుద్ధుడు బుద్ధగయ వద్ద బోధివృక్షం కింద 49 రోజులు ధ్యానం చేశాడు. ఇక్కడే జ్ఞానోదయం(మహాసంబోధి) పొంది బుద్ధుడయ్యాడు (బుద్ధుడు అంటే తథాగతుడు-నిజాలను తెలుసుకున్నవాడు అని అర్థం). తర్వాత కఠోర ఆహార నియమాలు, సాధనలు చేయకూడదని అన్నీ మధ్యస్తంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అందుకే బుద్ధుడు ప్రవచించిన మార్గాన్ని మధ్యేమార్గం అంటారు. మధ్యేమార్గం అంటే మనిషి పూర్తిగా సన్యాసిగా కాకుండా, పూర్తిగా భౌతిక కాంక్షలతో కాకుండా స్వీయ నిగ్రహశక్తితో జీవితాన్ని గడపటం. ఈ మార్గాన్ని అనుసరించిన ఏ వ్యక్తయినా అతడి సామాజిక నేపథ్యంతో నిమిత్తం లేకుండా ముక్తి పొందుతాడు.
ఉదా: ఐశ్వర్యానికి, పేదరికానికి మధ్య జీవించడం.
బుద్ధుడు సిద్ధాంతాలను ప్రబోధించలేదు. కానీ ఆధ్యాత్మిక వికాసానికి ఒక హేతువాద మార్గాన్ని సూచించాడు. అందుకే బుద్ధుణ్ని ఆజ్ఞయ వాది(Agnostic) అని పిలవవచ్చు. బుద్ధుడు సత్యదూరాలైన వేదాలను తిరస్కరించాడు. జంతు బలులను ఖండించి, క్లిష్ట సంస్కారాలను ఎదిరించాడు. హిందూ మతంలోని అసమానత్వం, కొన్ని మత ఛాందస భావాలను ముఖ్యంగా కులవ్యవస్థను, బ్రాహ్మణాధిక్యతను ప్రశ్నించాడు. అందువల్ల బౌద్ధమతాన్ని మత ఉద్యమంగా కాకుండా ఒక సామాజిక ఉద్యమంగా చూడాలని కొందరి భావన. అందుకే బౌద్ధమతాన్ని రియాక్షనరీ రిలీజియన్ అని పిలుస్తారు.
బుద్ధుడు సారనాథ్‌లోని జింకలవనంలో కౌండిన్య, అశ్వజిత్, బద్రుక, మహానామ, కశ్యప /ఉపాలి అనే అయిదుగురు శిష్యులకు జ్ఞానబోధ చేశాడు. దీన్నే ధర్మచక్రపరివర్తనం అంటారు. బౌద్ధమత పుట్టుకగా ‘సారనాథ్’ను పేర్కొంటారు.
బుద్ధుడి శిష్యులకు బోధించిన సారాన్ని పంచశీల అంటారు.

పంచశీల సూత్రాలు..
  • అసత్య (అసత్యం పలకరాదు)
  • అసతేయ (దొంగతనం చేయరాదు)
  • అపరిగ్రహ (ఆస్తిని కూడబెట్టరాదు)
  • మత్తుమందులు సేవించరాదు
  • వ్యభిచారం చేయరాదు

బుద్ధుడి బోధనలు

1. ఆర్యసత్యాలు
2. అష్టాంగ మార్గం
3. ప్రతిత్వ సముత్పాదన (కార్యకారణ సిద్ధాంతం)
4. మధ్యేమార్గం
నిగ్రహశక్తిని కోల్పోయినవారు మానసికంగా బలహీనులయ్యే అవకాశముంది. కాబట్టి నిగ్రహాన్ని నిలబెట్టుకోవడానికి ఆర్యసూత్రాలు (లేదా) ఆర్యసత్యాలు, అష్టాంగ మార్గాన్ని పాటించాలని బుద్ధుడు చెప్పాడు.

బుద్ధుడి ఆర్యసత్యాలు
1. ప్రపంచం మొత్తం దుఃఖమయం
2. కోరికలే దుఃఖాలకు కారణాలు
3. దుఃఖ నిర్మూలనకు కోర్కెలను జయించాలి
4. దుఃఖ నిర్మూలనకు ఏకైక మార్గం అష్టాంగ మార్గం

బుద్ధుడి అష్టాంగ మార్గం:
1. సమ్యక్ ఆలోచన
2. సమ్యక్ వాక్కు
3. సమ్యక్ క్రియ
4. సమ్యక్ జీవనం
5. సమ్యక్ కృషి
6. సమ్యక్ నిశ్చయం
7. సమ్యక్ విశ్వాసం
8. సమ్యక్ దృష్టి

ప్రతిత్వ సముత్పాదన: దీన్నే కార్యకారణ సిద్ధాంతం అంటారు. ఇది బుద్ధుడి తత్వం. అంటే కర్మల వల్లే జీవుడు బంధ విముక్తుడు అవుతాడు.
బౌద్ధ సమావేశాలు: బౌద్ధ సమావేశాలనే బౌద్ధ సంగీతులు అంటారు. వినయ, సుత్త, అభిదమ్మ పీఠికలను త్రిపీఠకాలంటారు.

పంచ మహాకల్యాణాలు

బుద్ధుడి జీవితంలో జరిగిన 5 ముఖ్య సంఘటలను పంచ మహాకల్యాణాలు అంటారు. అవి..
  1. పుట్టుక /జననం - తామర పద్మం
  2. మహాభినిష్ర్కమణ - గుర్రం
  3. సంబోధి/నిర్యాణం - బోధివృక్షం
  4. ధర్మచక్రపరివర్తనం - ధర్మచక్రం (ధర్మచక్రం 8 ఆకులతో ఉంటుంది. భారత జాతీయ పతాకంపై 24 ఆకులు ఉంటాయి)
  5. మహాపరినిర్యాణం - స్తూపం (మరణించడం)

బౌద్ధ సంగీతులు
బౌద్ధ సంగీతి
కాలం
నగరం
రాజు
అధ్యక్షుడు
కారణం
ప్రాధాన్యం
మొదటి సంగీతి
క్రీ.పూ.483 (బుద్ధుడు మరణించిన వెంటనే)
రాజగృహం
అజాతశత్రువు
మహాకశ్యప
బుద్ధుడి బోధనలను గ్రంథస్తం చేయడానికి
ఆనందుడు ‘వినయ’, ఉపాలి ‘సుత్త’ అనే పీఠికల (నియమావళి గ్రంథాలు)ను సంకలనం చేశారు.
రెండో సంగీతి
క్రీ.పూ.383
వైశాలి
కాలాశోకుడు
సభాకమి
బౌద్ధమతంలో విభేదాలను పరిష్కరించడానికి
బౌద్ధమతం థేరవాదులు(మార్పు కోరని వారు), మహాసాంఘికులు(మార్పు కోరే వారు)గా చీలిపోయింది.
మూడో సంగీతి
క్రీ.పూ.250
పాటలీ పుత్రం
కాలాశోకుడు
మొగలిపుత్రతిస్స
బౌద్ధమతానికి సంబంధించిన అనేక విషయాలను చర్చించడానికి
అభిదమ్మ పీఠికను సంకలనం చేశారు.
నాలుగో సంగీతి
కుందలవనం కశ్మీర్
కుందలవనం కశ్మీర్
కనిష్కుడు
వసుమిత్రుడు
18 శాఖల మధ్య ఐక్యత సాధించడానికి
బౌద్ధమతం మహాయాన, హీనాయాన శాఖలుగా చీలిపోయింది.

బౌద్ధమత సాహిత్యం: బౌద్ధమత సాహిత్యాన్ని త్రిపీఠకాలని పిలుస్తారు. ఇవి పాళీ భాషలో ఉన్నాయి.
త్రిపీఠకాలు: సుత్త పీఠిక, వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక. సుత్త పీఠికలో బుద్ధుడి బోధనలను ఆనందుడు సంకలనం చేశాడు. వినయ పీఠికలో బౌద్ధ భిక్షువుల నియమ నిబంధనలను ఉపాళి సంకలనం చేశాడు.
జాతకాలు: బుద్ధుడి గత జన్మల గురించి తెలిపే కథలను జాతక కథలు అంటారు.

బుద్ధుడి పూర్వ జన్మలు:
1. అవలోకిటేశ్వర
2. మంజుశ్రీ భోజసత్తుడు
3. పద్మ సాంభవ
4. రత్న సాంభవ
5. అమితాభి
6. వజ్రపాణి

బౌద్ధమతంలోని శాఖలు
బౌద్ధంలో ప్రధానంగా 3 శాఖలున్నాయి. అవి.. మహాయానం, హీనాయానం, వజ్రయానం

మహాయానం
మహాయాన శాఖ బౌద్ధమతంలో మార్పులు చేపట్టింది. బౌద్ధమత గ్రంథాలన్నీ పాళీ భాషలో ఉండగా, ఈ శాఖకు చెందిన వారు సంస్కృతంలో గ్రంథాలు రాశారు. మహాయానంలో చేరిన వారికి ముక్తి లభిస్తుందని వీరి నమ్మకం. మహాయాన శాఖకు చెందిన వారు భారతదేశంలో బౌద్ధ విగ్రహాల ఆరాధనను ప్రారంభించారు.
నోట్: బుద్ధుడి పూర్వ జన్మలను బోధిసత్వులు అని కూడా అంటారు.
  • బుద్ధుడు అనేకసార్లు జన్మించాడని వీరి నమ్మకం. పూర్వ బుద్ధుణ్ని బోధిసత్వ అంటారు.
  • భవిష్యత్‌లో జన్మించబోయేది మైత్రేయ బుద్ధుడని భావిస్తారు.
  • ఆచార్య నాగార్జునుడు ఆంధ్ర ప్రాంతంలో మహాయాన శాఖ వ్యాప్తికి కృషి చేశాడు.
హీనాయానం
ఈ శాఖకు చెందిన వారు బుద్ధుడి మౌలిక బోధనలను విశ్వసిస్తారు.
  • బుద్ధుడి చిహ్నాలను ఆరాధించినప్పటికీ విగ్రహాలను ఆరాధించరు.
ఉదా: హీనాయాన శాఖకు చెందినవారు బుద్ధుడి పాద గుర్తులను పూజించరు.
  • ఈ శాఖ బౌద్ధంలో ఏ మార్పులు చేయలేదు. వీరి గ్రంథాలు పాళీ భాషలోనే ఉంటాయి.
వజ్రయానం
క్రీ.శ. 5వ శతాబ్దంలో ఈ శాఖ ఏర్పడింది. బౌద్ధ గ్రంథాల ప్రకారం ఈ శాఖ ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో ఆవిర్భవించింది.
  • వజ్రయానంలో బోధిసత్వాల భార్యలను పూజించడం ప్రారంభమైంది. వీరిని తార అని పిలుస్తారు.
  • వజ్రయానంలో మంత్రతంత్రాలు ఏర్పడ్డాయి. వీటికి జన్మస్థానంగా అమరావతిని పేర్కొంటారు.
  • ఏడో శతాబ్దం నాటికి భారత్‌లో వజ్రయానం అంతరించింది. ప్రస్తుతం టిబెట్‌లో మాత్రమే వజ్రయానాన్ని ఆచరిస్తున్నారు. దలైలామా ఈ శాఖకు చెందిన వారే. వజ్రయాన శాఖ కేంద్ర స్థానం హిమాచల్ ప్రదేశ్ (భారత్)లోని ధర్మశాల.
బుద్ధుడి బిరుదులు
1. శాక్యముని
2. తథాగతుడు
3. అంగీరసుడు
4. ప్రపంచజ్యోతి (డేవిడ్ రైస్ పేర్కొన్నారు)
5. లైట్ ఆఫ్ ఏషియా (ఎడ్విన్ ఆర్నాల్డ్ పేర్కొన్నారు)

భారతీయ సమాజంపై బౌద్ధమత ప్రభావం
  • బౌద్ధం సాధారణ జీవితానికి ప్రాధాన్యం ఇచ్చింది. సమాజంలోని అస్పృశ్యతను తగ్గించడంలో సఫలమైంది.
  • ప్రేమ, సమానత్వం, అహింసకు అధిక ప్రాధాన్యమివ్వడం ద్వారా నాటి సమాజంలో ఆచరణలో ఉన్న కుల వ్యవస్థను ఖండించింది.
  • స్త్రీలకు పురుషులతో సమాన హోదా కల్పించింది. యజ్ఞయాగాల పేరిట జరిగే జంతు బలిని తీవ్రంగా నిరసించింది.
  • మహాయాన బౌద్ధంలో బుద్ధుడి ప్రతిమలను పూజించడం ద్వారా హిందూ మతంలో కర్మకాండలను వదిలి విగ్రహారాధనను ప్రారంభించారు.
  • భారతదేశంలో కళలు, కట్టడాల అభివృద్ధికి బౌద్ధం విశేషంగా కృషి చేసింది.
ఉదా: అజంతా, ఎల్లోరా, కార్లీ, బాగ్ గుహ నిర్మాణాలు.
  • విద్యా విధానంలోనూ బౌద్ధం విశేషమైన సేవ చేసింది. నాటి వేదాలు వల్లెవేసే విధానాన్ని సంస్కరిస్తూ ప్రయోగపూర్వక, చర్యాత్మక పద్ధతులకు ప్రాధాన్యమిచ్చింది.
ప్రాచీన కాలంలో అనేకమంది విదేశీ విద్యార్థులను ఆకర్షించిన భారతీయ విశ్వవిద్యాలయాలు ప్రారంభంలో బౌద్ధవిశ్వవిద్యాలయాలే.
ఉదా:
1. నలందా విశ్వవిద్యాలయం (దీన్ని గుప్త వంశానికి చెందిన కుమార గుప్తుడు ప్రారంభించాడు)
2. నాగార్జున విశ్వవిద్యాలయం
3. వల్లభి (గుజరాత్) విశ్వవిద్యాలయం
4. విక్రమశిల విశ్వవిద్యాలయం (బిహార్)
5. ఉద్ధంతపురి విశ్వవిద్యాలయం(బిహార్)
  • చైనాకు చెందిన ప్రముఖ యాత్రికులు హుయాన్‌త్సాంగ్, ఇత్సింగ్ నలందా విశ్వవిద్యాలయంలో చదువుకున్నవారే. ఇక్కడ 8500 మంది విద్యార్థులు, 1500 మంది ఉపాధ్యాయులు ఉండేవారని బౌద్ధగ్రంథాల ఆధారంగా తెలుస్తోంది.

జైన మతం
జైనులకు అతి పవిత్రమైన ‘అనుస్తుతి’ సాహిత్యం ప్రకారం జైన మతాన్ని 24 మంది తీర్థంకరులు స్థాపించారు. తీర్థంకర అంటే ‘వంతెన నిర్మించేవారు’ (మోక్షానికి మార్గదర్శకులు లేదా జీవన స్రవంతిని దాటే వంతెన నిర్మించేవారని అర్థం). మొదటి తీర్థంకరుడు వృషభనాథుడు. ఇతడినే ఆదినాథుడు అని పిలుస్తారు. 22వ తీర్థంకరుడు అరిష్టనేమి. ఇతడి చిహ్నం శంఖం. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. ఇతడి చిహ్నం పాము. 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. ఇతడి చిహ్నం సింహం.

పార్శ్వనాథుడు
పార్వ్శనాథుడు కాశీ రాజైన అశ్వసేనుడి కుమారుడు. ఇతడు నిగ్రంథ మతాన్ని ప్రారంభించాడు. నిగ్రంథ అంటే ప్రపంచంతో సంబంధాలు లేనివాడని అర్థం. చారిత్రక జైనమత స్థాపకుడుగా పార్శ్వనాథుడిని పిలుస్తారు.
పార్శ్వనాథుడు 4 సూత్రాలను ప్రవేశపెట్టాడు. అవి..
1. అసత్య (అబద్ధం చెప్పకపోవడం)
2. అహింస
3. అస్తేయ (దొంగతనం చేయకుండా ఉండటం)
4. అపరిగ్రహ (ఆస్తులను అత్యాశతో కలిగి ఉండరాదు)

వర్ధమాన మహావీరుడు
వర్ధమాన మహావీరుడు క్రీ.పూ. 540లో వైశాలి సమీపంలోని కుందా గ్రామంలో జన్మించాడు. ఇతడి తండ్రి సిద్ధార్థుడు, తల్లి త్రిశాల దేవి. ఇతడు జ్ఞాత్రిక వంశానికి చెందినవాడు. మహావీరుడి భార్య యశోద, కూతురు ప్రియదర్శిని (అణోగ్న), అల్లుడు జమాలి, కుమారుడు రాహులుడు. వర్ధమానుడి మొదటి శిష్యుడు జమాలి. వర్ధమానుడు తన 30వ ఏట సన్యాసం స్వీకరించి సత్యాన్వేషణలో 12 సంవత్సరాలు గడిపాడు. 42వ ఏట రుజుపాలిక నదీతీరంలోని జృంభిక గ్రామంలో సాలవృక్షం కింద 84 రోజులు కఠిన తపస్సు చేసి కైవల్యం పొంది జినుడయ్యాడు. జినుడి బోధనలే జైనం.
  • ‘జిన’ పేరు మీదే నిగ్రంథ మతం జైన మతంగా మారింది.
వర్ధమానుడి బిరుదులు
1. కేవలి లేదా కైవల్యం (అత్యున్నత జ్ఞానం కలిగినవాడు)
2. జిన (పంచేంద్రియాలను జయించినవాడు)
  • వర్ధమానుడు 70వ ఏట పావనపురిలో నిర్యాణం పొందాడు.
పంచానువ్రతాలు(లేదా) పంచసూత్రాలు
పార్శ్వనాథుడు బోధించిన 4 అనువ్రతాలకు వర్ధమానుడు బ్రహ్మచర్యం అనే అయిదో సూత్రాన్ని జోడించి పంచానువ్రతాలను రూపొందించాడు.

త్రిరత్నాలు:
మహావీరుడు త్రిరత్నాలను ప్రవేశపెట్టాడు. అవి:
1. సమ్యక్ జ్ఞానం
2. సమ్యక్ విశ్వాసం
3. సమ్యక్ క్రియ

సల్లేఖన వ్రతం: మోక్షం పొందడానికి సల్లేఖన వ్రతం ఆచరించాలని వర్ధమానుడు తెలిపాడు. ఉపవాసంతో శరీరాన్ని శుష్కింపజేసి ప్రాణత్యాగం చేసి మోక్షం పొందడాన్నే సల్లేఖన వ్రతం అంటారు. శరీరాన్ని ఎంత కష్టపెడితే ఆత్మ అంత పునీతం అవుతుందని జైనుల నమ్మకం. ఆత్మను శరీర బంధం నుంచి విముక్తి చేస్తే మోక్షం లభిస్తుందని వీరి విశ్వాసం. సల్లేఖనం ద్వారా పూర్వజన్మ కర్మ నశిస్తుందని జైనులు విశ్వసిస్తారు. చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖన వ్రతాన్ని ఆచరించి కర్ణాటకలోని శ్రావణబెళగొళలో మరణించాడు. పరిషష్ట పర్యన్ అనే గ్రంథాన్నిహేమచంద్రుడు రాశాడు.
తత్వాలు: తత్వాలు రెండు ఉన్నాయి.
శాద్వాదం: ఇది ఇతమిత్థంగా దేన్నీ సమర్థించదు.
అనేకాంతర వాదం: ఈ వాదం ప్రకారం ప్రతిదానికి ఆత్మ ఉంటుంది.
క్రీ.పూ. 300లో జైనమతంలో శ్వేతాంబర, దిగంబర అనే రెండు శాఖలు ఏర్పడ్డాయి. శ్వేతాంబరులు తెల్లటి వస్త్రాలు ధరిస్తారు. ఈ శాఖను స్థూలభద్రుడు ప్రారంభించాడు. దిగంబరులు వస్త్రాలను ధరించరు. ఈ శాఖను భద్రబాహు ప్రారంభించాడు.
జైన సమావేశాలు: రెండు సమావేశాలు జరిగాయి.
మొదటి సమావేశం క్రీ.పూ. 300లో పాటలీపుత్రంలో జరిగింది. దీనికి స్థూలబాహు అధ్యక్షత వహించాడు. వర్ధమానుడి బోధనలను 12 అంగాలు (ద్వాదశ అంగాలు)గా క్రోడీకరించారు.
రెండో సమావేశం క్రీ.శ. 6వ శతాబ్దంలో గుజరాత్‌లోని వల్లభిలో జరిగింది. ఈ సమావేశానికి దేవర దిక్షమశ్రమణుడు అధ్యక్షత వహించాడు.
జైనమత సాహిత్యం: జైనమత పవిత్ర గ్రంథాలు అంగాలు. వీటిని ప్రాకృత భాషలో రచించారు.
  • 12 అంగాలపై రాసిన వ్యాఖ్యాన గ్రంథాలు నిర్యుక్తులు. వీటిని ఉపాంగాలు అని పిలుస్తారు. ఉపాంగాలను అర్ధమాగధి భాషలో రచించారు.
  • జైనమత తొలి గ్రంథాలన్నీ ప్రాకృత భాషలో ఉన్నాయి.
  • జైనులు ప్రాంతీయ భాషలను అభివృద్ధి పరిచారు.
  • ప్రస్తుతం బిహారీ ప్రజలు మాట్లాడే బిహారీ భాష అర్ధమాగధి భాషే.
జైనమత నిర్మాణాలు
జైనమత దేవాలయాలను బసదీలు అని పిలిచేవారు. తొలిసారిగా రాతి విగ్రహాలను చెక్కించింది జైనులే.
  • బిహార్‌లోని సుల్తాన్‌గంజ్‌లో అతి పురాతన పార్శ్వనాథుడి విగ్రహం బయల్పడింది.
  • ఉదయగిరి, ఎల్లోరా గుహలు జైనమతానికి చెందినవి. ఎల్లోరాలోని 5 గుహలు జైన మతానికి చెందినవి.
  • వేంగి చాళుక్య కుబ్జవిష్ణువర్ధనుడి భార్య అయ్యణ మహాదేవి బెజవాడలో నడుంబ బసది విహారాన్ని కావరురిగణ అనే జైన మతస్థులకు ఇచ్చింది.
జైన మత పతనానికి కారణాలు:
  • కఠినమైన మత విధానాలు. వర్ధమానుడి అహింస పరమ ధర్మం కూడా పతనానికి కారణం.
  • జైనులు పూర్తిగా అహింసకు ప్రాధాన్యమివ్వడం వల్ల అన్ని వర్గాలవారు జైన మతాన్ని ఆచరించలేకపోయారు. జైనులు అహింసే పరమ ధర్మంగా పాటించాలి. అందువల్లే జైనులు ముక్కు మీద వస్త్రం ఉంచుకొని గాలి పీలుస్తారు.
  • నడిచేటప్పుడు సూక్ష్మజీవులు నశిస్తాయేమోనని నేలను ఊడ్చి నడుస్తారు. రాత్రి వేళ దీపాలు వెలిగించరు.
  • జైనమతాన్ని వైశ్యులు ఎక్కువగా ఆదరించారు. కాలక్రమేణ ఈ మతం వ్యవసాయాన్ని నిషేధించింది. నాగలితో భూమిని దున్నితే సూక్ష్మజీవులు నశిస్తాయని భావించడమే దీనికి కారణం.
  • నాగరికత, సంప్రదాయాలకు విరుద్ధంగా జైనులు అవలంబించిన దిగంబరత్వం కూడా జైన మత పతనానికి కారణమైంది. ఇది జైనులను సభ్యసమాజం నుంచి దూరం చేసింది.
  • బౌద్ధం విశ్వమతంగా మారగా, జైనం కేవలం భారతదేశానికే పరిమితమైంది.
  • పరిమిత జైన సాహిత్యం కూడా జైన మత పతనానికి కారణం.
Published date : 27 Oct 2015 06:36PM

Photo Stories