Skip to main content

తెలంగాణ - పారిశుద్ధ్య నిర్వహణ

గ్రామీణ పారిశుద్ధ్యం
సంపూర్ణ పారిశుద్ధ్య ఉద్యమం కేంద్ర కార్యక్రమం. 2012 జనవరి 4 నుంచి దాన్ని నిర్మల్ భారత్ అభియాన్ (ఎన్.బి.ఎ.)గా మార్చారు. దీంతోపాటే గ్రామీణ ప్రాంతాలకు పారిశుద్ధ్య సాధనను వేగవంతం చేయడానికి వీలుగా ఆశయాలను, మార్గదర్శక సూత్రాలను కూడా సవరించారు. సరికొత్త వ్యూహాలతో గ్రామీణ సమాజంలో సమగ్రమైన పారిశుద్ధ్యాన్ని సాధించేలా నూతన కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు. నిర్మల గ్రామ పంచాయతీ (ఎన్.జి.పి)లను సృష్టించే లక్ష్యంతో ఎన్.బి.ఎ.ను ఉద్దేశించారు.
రాష్ర్టంలో నూరు శాతం గ్రామీణ పారిశుద్ధ్యాన్ని సాధించడానికి వ్యక్తిగత కుటుంబ యాజమాన్య మరుగుదొడ్ల (ఐ.హెచ్.హెచ్.ఎల్.) నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఐ.హెచ్.ఎల్. లో స్కూళ్లు, అంగన్‌వాడీ మరుగుదొడ్లను ఒక్కొక్క యూనిట్‌గా పరిగణిస్తారు. ఇందులో భాగంగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబం రూ.900 చెల్లిస్తే ప్రభుత్వం రూ.10,000ను ప్రోత్సాహకంగా ఇస్తుంది. రాష్ర్టంలో ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్.తో కలిసి ఐ.హెచ్.హెచ్.ఎల్‌ను నిర్మించుకునేలా 2014 అక్టోబర్ 2 వరకు ఎన్.బి.ఎ. ప్రాజెక్టును ప్రభుత్వం అమలు చేసింది. ఇటీవలే భారత ప్రభుత్వం ఎన్.బి.ఎ. కార్యక్రమాన్ని నిలిపివేిసి, దాని స్థానంలో అభివృద్ధి చేసిన స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ)ను ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమాన్ని 2014 అక్టోబర్ 2న ప్రారంభించింది. స్వచ్ఛ భారత్ ద్వారా 2019 నాటికి దేశంలో ఆరుబయట మల విసర్జనను నిర్మూలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఎన్.బి.ఎ. కార్యక్రమాన్ని పునర్నిర్మించి, దాని స్థానంలో ఎన్.బి.ఎం.(జి)ని ప్రవేశపెట్టే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని రూ.10,000 నుంచి 12,000కి పెంచింది. మరుగుదొడ్డికి నీటి సదుపాయం కల్పించడానికి అంటే నిల్వ కుళాయిని ఏర్పాటు చేసుకోవడానికి, చేతులు కడుక్కునే సదుపాయాన్ని కల్పించడానికి ప్రోత్సాహకాన్ని పెంచారు.

తెలంగాణ గ్రామీణాభివృద్ధి అకాడమీ
పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, పంచాయతీరాజ్ అధికారులు, గ్రామీణాభివృద్ధి అధికారులు, సంబంధిత ఇతర ప్రభుత్వ అధికారులకు ఎ.ఎం.ఆర్.- తెలంగాణ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. గ్రామీణ ప్రజలకు సంబంధించిన వివిధ అంశాలపై ఈ అకాడమీ కార్యగోష్టులు, సదస్సులను నిర్వహిస్తోంది.

పట్టణాభివృద్ధి, పరిపాలన
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ర్టంలో పట్టణ జనాభా 38.67 శాతం(13.61 మిలియన్లు). దేశంలో పట్టణ జనాభా శాతం 31.15 శాతం మాత్రమే. రాష్ర్ట రాజధాని హైదరాబాద్ నూరు శాతం పట్టణ జిల్లా. హైదరాబాద్ నగరం జిల్లా సరిహద్దులను దాటి, పొరుగున ఉన్న రంగారెడ్డి జిల్లాలోకి కూడా వ్యాపించింది. అందువల్ల హైదరాబాద్ తర్వాత ఎక్కువగా పట్టణీకరణ చెందిన జిల్లాగా రంగారెడ్డి జిల్లా నిలిచింది. రంగారెడ్డి జిల్లాలో పట్టణ జనాభా 70.32 శాతం. పట్టణ జనాభా 68 నగర స్థానిక స్వపరిపాలన సంస్థల్లో విస్తరించింది. వీటిలో 6 కార్పొరేషన్లు, 37 అన్ని గ్రేడ్‌లకు చెందిన మున్సిపాలిటీలు, 25 నగర పంచాయతీలు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో భాగమైన పది మున్సిపాలిటీలు హైదరాబాద్ నగర కార్పొరేషన్‌లో విలీనమై, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జి.హెచ్.ఎం.సి.) ఆవిర్భవించింది.

హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్.ఎం.డి.ఎ.) పరిధి 7,228 చ.కి.మీ. ఇందులో హైదరాబాద్ జిల్లాలోని 16 మండలాలు, రంగారెడ్డి జిల్లాలోని 22 మండలాలు, మెదక్ జిల్లాలోని 10 మండలాలు, నల్లగొండ జిల్లాలోని 5 మండలాలు, మహబూబ్‌నగర్ జిల్లాలోని 2 మండలాలు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ చుట్టుపక్కల ఉన్న మెదక్, మహబూబ్‌నగర్ నల్లగొండ జిల్లాల్లో పట్టణీకరణ చాలా తక్కువే. ఇతర ప్రాంతాల నుంచి పేదలు తరలివచ్చి మురికివాడల్లో స్థిరపడటం, వారి సంఖ్య పెరగుతుండటం, పట్టణ సదుపాయాల మీద ఒత్తిడి, చెత్త, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పెరిగిపోవడం, కాలుష్యం, జీవన పరిస్థితుల్లో పెరిగిపోతున్న అసమానతల వల్ల పట్టణాభివృద్ధికి తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి.

కొత్తగా రూపుదిద్దుకుంటున్న స్మార్ట్ సిటీల భావనలో సమాచార నెట్‌వర్క్, కమ్యూనికేషన్ నెట్‌వర్క్, సురక్షిత తాగునీరు, పారిశుద్ధ్యం, అందరికీ గృహవసతి, హరిత పర్యావరణం, ఆరుబయట మలవిసర్జన పద్ధతి నిర్మూలన, ప్రత్యేకించి ఇప్పటివరకు నిర్లక్ష్యానికి గురైన జనాభాకు కూడా పాత్ర కల్పించే విధానంలో భాగంగా ఉన్నాయి.

2001-11 మధ్య తెలంగాణలో పట్టణీకరణ
జిల్లా పట్టణ జనాభా 2001 పట్టణ జనాభా 2011 పెరుగుదలరేటు 2001-11 జనాభాలో పట్టణ జనాభా శాతం
ఆదిలాబాద్ 6,60,017 7,60,259 15.19 27.73
నిజామాబాద్ 4,24,738 5,88,372 38.53 23.06
కరీంనగర్ 6,78,812 9,51,225 40.13 25.19
మెదక్ 3,83,524 7,27,871 89.78 24.00
హైదరాబాద్ 38,29,753 39,43,323 2.97 100.00
రంగారెడ్డి 19,37,837 37,19,172 91.92 70.22
మహబూబ్‌నగర్ 3,71,335 6,07,692 63.64 14.99
నల్లగొండ 4,32,678 6,62,507 53.12 18.99
వరంగల్ 6,23,212 9,92,333 59.23 28.25
ఖమ్మం 5,10,861 6,55,911 28.39 23.45
మొత్తం 98,52,787 1,36,08,665 38.12 38.67
మొత్తం (రంగారెడ్డి మినహా) 79,14,950 98,89,493 24.94

మనవార్డు-మనపట్టణం-మన ప్రణాళిక
వేగవంతమవుతున్న పట్టణీకరణ, మేజర్ గ్రామ పంచాయతీలను పట్టణ స్వపరిపాలన సంస్థ (యు.ఎల్.బి.)లుగా పెంచడం వల్ల తొలిసారిగా మన వార్డు-మన పట్టణం-మన ప్రణాళిక అనే వినూత్న పథకాన్ని రాష్ర్టంలో ప్రారంభించారు. ప్రజల అవసరాలను గుర్తించడం దీనిలో మొదటి అంశం. అన్ని యు.ఎల్.బి. స్థాయిలో ప్రజల అవసరాలను గుర్తించారు. నీటిసరఫరా, రోడ్లు, మురుగు నీటి పారుదల, పారిశుద్ధ్య సదుపాయాలు, వీధి దీపాలు, భవిష్యత్ అవసరాలను ప్రధానమైనవిగా గుర్తించి, వాటిపై దృష్టి సారించారు. 67 యు.ఎల్.బి.లలోని 1549 వార్డుల్లో 5,98,632 ప్రతిపాదనలను గుర్తించారు. తిరిగి పైవాటిలో మొదటి మూడు అగ్ర ప్రాధాన్యానికి సంబంధించిన 5,165 ప్రతిపాదనలను గుర్తించి వాటికి రూ.3159.85 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. యు.ఎల్.బి. స్థాయిలో మొదటి మూడు అగ్రప్రాధాన్యానికి సంబంధించిన 210 ప్రతిపాదనలను గుర్తించి వాటికి రూ.8166.90 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ శాఖ 2015-16 బడ్జెట్‌లో రూ.1847.76 కోట్లు భరించాలని ప్రతిపాదించారు. రాష్ర్ట ఫైనాన్స్ కమిషన్ పథకం కింద లోతట్టు రోడ్లు, అభివృద్ధి పనుల కోసం కొత్త మున్సిపాలిటీలకు సహాయం, ఎం.ఇ.పి.ఎం.ఎ., ఎం.పి.ఎం.డి.పి. మొదలైన వాటికింద ఈ ఖర్చును భర్తీ చేస్తారు. మిగతా మొత్తాన్ని 14వ ఫైనాన్స్ కమిషన్ నిధుల నుంచి/ప్రభుత్వశాఖ బడ్జెట్ నుంచి/ ప్రత్యేక గ్రాంట్ల నుంచి వచ్చే 5 ఏళ్లలో దశలవారీగా సమీకరించాలని ప్రతిపాదించారు.

స్వచ్ఛ భారత్ మిషన్
2014 జూన్ 9న పార్లమెంట్ సంయుక్త సమావేశంలో రాష్ర్టపతి ప్రసంగంలోని ప్రభుత్వ దార్శనికత నుంచి స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇది పట్టణాభివృద్ధి శాఖ, తాగునీటి, పారిశుద్ధ్య విభాగాల మంత్రిత్వ శాఖల సంయుక్త కార్యక్రమం. మహాత్మాగాంధీ 150వ జన్మదినోత్సవం సందర్భంగా 2014 అక్టోబర్ 2న స్వచ్ఛభారత్‌ను ప్రారంభించారు. దీన్ని అయిదేళ్లపాటు నిర్వర్తిస్తారు. దేశంలోని పట్టణాలను సమాజం నడిపించే వ్యవస్థగా, సంపూర్ణ మురికి రహితంగా, జీవించదగిన నగరాలుగా, పట్టణాలుగా మార్చడమే జాతీయ పట్టణ పారిశుద్ధ్య స్థూల లక్ష్యం.

తెలంగాణలో దీక్షా కార్యక్రమం
పట్టణ స్వపరిపాలన సంస్థల్లో పారిశుద్ధ్యం
  • 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ర్టంలో 91.12 శాతం పట్టణ కుటుంబాలకు మరుగుదొడ్డి సదుపాయం ఉంది. జాతీయ స్థాయి సగటు 81.4 శాతం మాత్రమే.
  • రాష్ర్టంలో 8.98 శాతం పట్టణ కుటుంబాలు ఆరుబయట మలవిసర్జన విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇది జాతీయస్థాయి సగటు 12.6 శాతం కంటే మెరుగు. తెలంగాణ రాష్ర్టంలో పట్టణ కుటుంబాలు 31,71,376 ఉండగా, వాటిలో 2,75,151 కుటుంబాలు ఆరుబయట మలవిసర్జన విధానాన్ని అనుసరిస్తున్నాయి. రాష్ర్టంలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 25.87 శాతం పట్టణ కుటుంబాలు ఆరుబయట మలవిసర్జన విధానాన్ని అనుసరిస్తున్నాయి. 19.37 శాతం పట్టణ కుటుంబాలతో మహబూబ్ నగర్ జిల్లా, 18.22 శాతం పట్టణ కుటుంబాలతో నల్లగొండ జిల్లా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
  • రాష్ర్టంలోని యు.ఎల్.బి.లు సగటున రోజుకు 6287 టన్నుల చెత్తను వదులుతున్నాయి. యు.ఎల్.బి.లలో ఉత్పత్తి అవుతున్న తలసరి చెత్త రోజుకు 0.3-0.4 కేజీలు. ఉత్పత్తి అవుతున్న చెత్త పరిమాణం ఏటా 5 శాతం పెరుగుతోంది. కాగా చెత్తను శుభ్రం చేసే సామర్థ్యం యు.ఎల్.బి.లలో 80 శాతం. చెత్తను పడేయడానికి, శుద్ధిచేయడానికి అవసరమైన ఆవరణలు లేని యు.ఎల్.బి.లు 23 వరకు ఉన్నాయి. పట్టణాల్లో మురుగు నీటి వ్యవస్థ కూడా సరిగా లేదు.
ప్రభుత్వ చర్యలు
స్వచ్ఛభారత్ మిషన్ అమల్లో రాష్ర్ట ప్రభుత్వం అగ్రగామిగా ఉంది. 2014 సెప్టెంబర్ 25న స్వచ్ఛ తెలంగాణ వారోత్సవం (పరిశుభ్ర తెలంగాణ వారోత్సవం)ను ప్రారంభించారు. రాష్ర్టంలోని అన్ని (67) యు.ఎల్.బి.ల్లోనూ దీన్ని పాటించారు.

మున్సిపల్ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన ఉద్యమం (ఎం.ఇ.పి.ఎం.ఎ.)
పేద మహిళలు, మురికివాడల్లో నివసిస్తున్న అన్ని కుటుంబాలను ఎస్.ఎహెచ్.జి.లుగా మార్చి స్వావలంబకులుగా తీర్చిదిద్దడమే ఎం.ఇ.పి.ఎం.ఎ. ప్రధాన ఆశయం. సుమారు 12.66 లక్షల మంది మహిళలు, 1.26 లక్షల మహిళా స్వయం సహాయ బృందాల(ఎస్.హెచ్.జి.)ను ఏర్పాటు చేశారు. 2014 డిసెంబర్ నాటికి మొత్తం 4177 మురికివాడ స్థాయి సమాఖ్య (ఎస్.ఎల్.ఎఫ్.)లు, 97 బస్తీ స్థాయి సమాఖ్య (టి.ఎల్.ఎఫ్.)లను ఏర్పాటు చేశారు. సుమారు 19,900 మంది వికలాంగులను 3,980 ఎస్.హెచ్.జి.లుగా రూపొందించారు. 57 బస్తీ వికలాంగుల సమాఖ్య (టి.వి.ఎస్.)లు, 55 మానసిక వికలాంగుల తల్లిదండ్రుల సంఘాలను రాష్ర్టంలో ఏర్పాటు చేశారు.
2014-15లో 18,193 స్వయం సహాయక బృందాలకు రూ.517 కోట్ల మేర బ్యాంకు రుణాలను అందజేశారు. 6448 స్వయం సహాయక బృందాలకు వడ్డీ లేని రుణంగా రూ.75.02 కోట్లను అందజేశారు.

పింఛన్ కమ్ బీమా పథకం
ఇది పట్టణ ప్రాంతాల్లో 18 ఏళ్లుపైబడిన ఎస్.హెచ్.జి. మహిళలకు, 60 ఏళ్లు వచ్చేనాటికి సామాజిక భద్రతను కల్పించడానికి రాష్ర్ట ప్రభుత్వం సంకల్పించిన పథకం. పింఛన్, బీమాలను అందించే ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి ఆయా మహిళలు కొంత మొత్తాన్ని చెల్లించాలి. 2013-14లో ఈ పథకంలో తమ సభ్యత్వాన్ని 56,276 మంది మహిళలు నవీకరించుకోగా, వారిలో 5,852 మందికి 60 ఏళ్ల వయసు దాటడంతో ప్రతి నెలా రూ.500 పింఛన్ జారీ చేస్తున్నారు.

పట్టణ నీటిసరఫరా ప్రస్తుత పరిస్థితి
అన్ని పట్టణ స్వపరిపాలన సంస్థలకు సురక్షిత మంచినీటిని సరఫరా చేయడానికి రాష్ర్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. కేంద్ర ప్రజారోగ్య ఇంజనీరింగ్ ఎన్విరాన్‌మెంటల్ ఆర్గనైజేషన్ (సి.పి.హెచ్.ఇ.ఇ.ఒ.) నిబంధనావళిలో నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం భూగర్భ డ్రైనేజీ లేని బస్తీల్లో రోజుకు తలసరి నీటి సరఫరా కనీసం 70 ఎల్.పి.సి.డి. ఉండాలి. భూగర్భ డ్రైనేజీ సదుపాయం ఉన్న పట్టణాల్లో 135 ఎల్.పి.సి.డి.లు ఉండాలి.
వివిధ పట్టణ స్వపరిపాలన సంస్థలు రోజూవారీగా సరఫరా చేస్తున్న నీరు సాధారణంగా 35 ఎల్.పి.సి.డి.ల నుంచి 135 ఎల్.పి.సి.డి.ల వరకు ఉంటోంది.
Published date : 10 Nov 2015 12:02PM

Photo Stories