Skip to main content

పోటీ పరీక్షల్లో భారతదేశ చరిత్రకు ఎలా సిద్ధమవ్వాలి?

– ఆర్‌.కమల, హైదరాబాద్‌.
Question
పోటీ పరీక్షల్లో భారతదేశ చరిత్రకు ఎలా సిద్ధమవ్వాలి?
భారతదేశ చరిత్రను మూడు భాగాలుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అవి.. ప్రాచీన (Ancient), మధ్యయుగ (Medieval ), ఆధునిక (Modern) చరిత్ర. ప్రాచీన భారతదేశ చరిత్రలో సంస్కృతిని ప్రత్యేకంగా చదవాలి. ప్రాచీన శిలాయుగం, మధ్య శిలా యుగం, కొత్త రాతియుగ అంశాలపై దృష్టిసారించాలి. ఈ క్రమంలో సింధు నాగరికత, ఆర్య నాగరికతలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలి. క్రీ.పూ.6వ శతాబ్దంలో ప్రచారంలోకి వచ్చిన నూతన మతాలు.. జైనం, బౌద్ధంతోపాటు మహావీరుడు, గౌతమ బౌద్ధుడు–వారి బోధనలు, సామాజిక మార్పులకు అవి ఏ విధంగా కారణమయ్యాయో విశ్లేషించుకోవాలి. మగధ, మౌర్య సామ్రాజ్యాలు, పారశీక, గ్రీకు దండయాత్రలు, సంగం యుగం నాటి సాహిత్యం, ఆంధ్ర శాతవాహన రాజ్యాల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆనాటి రాజులు, సాహిత్యం, రచయితలు, బిరుదులను వివరంగా అధ్యయనం చేయాలి. కుషాణులు, గుప్తులు, హర్షవర్ధనుడు, పల్లవులు, చోళులు, చాళుక్య రాజులు.. ఆర్థిక, సాంస్కృతిక రంగాలను ఏవిధంగా ప్రభావితం చేశారో తెలుసుకోవాలి. మధ్యయుగ చరిత్రలో సింధు రాజ్యంపై అరబ్బుల దండయాత్ర, ఢిల్లీ సుల్తానులు, మొగల్‌ పాలన సంబంధిత అంశాలను బాగా చదవాలి. ముఖ్యంగా ఆనాటి సాహిత్యం, శిల్ప కళ, వాస్తు అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఆధునిక భారత చరిత్రకు సంబంధించి క్రీ.శ.1498లో వాస్కోడిగామా కాలికట్‌ (కేరళ)లో అడుగుపెట్టిన తర్వా త భారతదేశంలోకి యూరోపియన్ల రాక మొదలైంది. నాటి నుంచి 1947 వరకు నెలకొన్న పరిస్థితులను చదవాలి. ఈ క్రమంలో బ్రిటిష్‌ పాలన, సిపాయిల తిరుగుబాటు, కర్ణాటక యుద్ధాలు, ఆంగ్ల–మహారాష్ట్ర యుద్ధాలు, సాంఘిక సంస్కరణోద్యమం తదితర అంశా లపై దృష్టిసారించాలి. జాతీయ ఉద్యమంలోని ముఖ్య పరిణామాలను తెలుసుకోవాలి. వీటి నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి.

Photo Stories