Skip to main content

Groups FAQs

గ్రూప్-1 మెయిన్స్ జనరల్ ఎస్సేను ఎలా రాస్తే మంచి మార్కులు లభిస్తాయి?
+
తొలుత ఇచ్చిన ప్రశ్నను రెండుమూడుసార్లు చదివి, దానిపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలి. ఆ తర్వాత ఎస్సే రాయడం ప్రారంభించాలి. ఎస్సేలో చిన్న వాక్యాలు ఉండేలా చూసుకోవాలి. భాష సరళంగా ఉండాలి. ఎదురుగా ఉన్న వ్యక్తితో సంభాషిస్తున్నట్లు రాయాలి. ఇతర పేపర్లతో పోల్చితే ఎస్సే పేపర్‌లో చేతిరాత కీలక పాత్ర పోషిస్తుంది. చాలా విషయాలను వ్యాసంలో ప్రస్తావించాలన్న తాపత్రయంతో గజిబిజిగా రాస్తే ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే ప్రమాదముంది. మీకు ఎంత సమయం అందుబాటులో ఉంటుందో మిగిలిన వారికీ అంతే ఉంటుందన్న విషయం గుర్తించి, నిర్దేశ సమయం, ముందుగా సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం ఎస్సే రాయాలి. పొంతన లేని కొటేషన్స్, సామెతలు లేకుండా చూసుకోవాలి.
  • ఎస్సేను పేరాగ్రాఫ్‌లుగా రాయాలి. అవసరమైన సబ్ హెడ్డింగ్స్ పెట్టాలి. ఒక పేరాకు తర్వాతి పేరాకు సంబంధం ఉండేలా చూసుకోవాలి. గణాంకాలను సాధ్యమైనంతవరకు శాతాల్లో చూపేందుకు యత్నించాలి. బాక్స్‌లు, ఫ్లో డయాగ్రమ్స్, పైచార్ట్‌లు వంటి వాటిని అవసరానికి తగ్గట్టు ఉపయోగించాలి.
  • ప్రశ్నలో అడిగిన అంశానికి సంబంధించి వివిధ కోణాలను స్పృశిస్తూ సమాధానం రాయాలి. ఏదో ఒక కోణాన్ని మాత్రమే ప్రస్తావించి వదిలేయకూడదు. ముగింపు ఆశావహ దృక్పథంతో ఉండేలా చూసుకోవాలి.
  • ఎస్సే నిరాశ, నిస్పృహలను ప్రతిబింబించేలా ఉండకూడదు. వివిధ సమస్యల పరిష్కారానికి అభ్యర్థి సూచనలు నిర్మాణాత్మకంగా, ఆచరణాత్మకంగా ఉండాలి. ఎస్సేకు ముగింపు రాసే ముందు అప్పటివరకు రాసిన భాగాన్ని మరోసారి చదవాలి. ప్రారంభ ఎత్తుగడకు, ముగింపునకు మధ్య సంబంధం ఉండేలా చూసుకోవాలి.
పోటీపరీక్షలకు సంబంధించి జనరల్ సైన్స్ అంశాలకు ఎలా సిద్ధమవాలి?
+
జనరల్ సైన్స్‌లో ప్రధానంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటికి పొడిగింపు అంశాలైన స్పేస్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ), రోబో సాంకేతిక పరిజ్ఞానం, డిఫెన్స్ పరికరాలు వంటి అంశాలపైనా దృష్టిసారించాలి.
  1. అంతరిక్ష ప్రయోగాలు, నౌకలు (పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ మార్క్-3..), క్షిపణులు (బ్రహ్మోస్, అగ్ని..), ఆవిష్కరణలు, ఆవిష్కర్తలు; సంప్రదాయ, సంప్రదాయేతర ఇంధన వనరులు తదితర అంశాలను తెలుసుకోవాలి.
  2. ఫిజిక్స్‌లో ధ్వని, ఉష్ణం, కాంతి, అయస్కాంతత్వం, విద్యుత్, ఆధునిక భౌతిక శాస్త్రం; కెమిస్ట్రీలో ఆమ్లాలు-క్షారాలు, లోహాలు-మిశ్రమ లోహాలు, ముడి ఖనిజాలు, వాయువులు-సంఘటనం, రూపాంతరత, నీరు, కాలుష్యం; గాజు-రకాలు; సిమెంటు ముడిపదార్థాలు, రసాయనిక ఎరువులు తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.
  3. బయాలజీలో ప్రధానంగా శరీరంలో కీలక అవయవాలు, వాటి పనితీరు; వ్యాధులు, కారణాలు, టీకాలు; విటమిన్లు, మొక్కలు, జంతువులు-ఉపయోగాలు; రక్త వర్గాలు; గ్రంథులు-హార్మోన్లు; శాస్త్రవేత్తలు-ఆవిష్కరణలు తదితర అంశాలను అధ్యయనం చేయాలి.
  4. గత ప్రశ్నపత్రాల ఆధారంగా, ఫ్యాకల్టీ సహాయంతో ప్రధానంగా దృష్టిసారించాల్సిన అంశాలను గుర్తించి, వాటిని చదవాలి. ముఖ్య భావనలు, దైనందిన జీవితంలో వాటి అనువర్తనాలను అధ్యయనం చేయడం ముఖ్యం. ప్రిపరేషన్‌కు పాఠశాల స్థాయి పాత పుస్తకాలను ఉపయోగించుకోవాలి.
పోటీ పరీక్షల కోసం ‘భారతదేశం - నీటి పారుదల వసతులు’ టాపిక్‌లో ఏయే అంశాలను చదవాలి?
+
ప్రతి పోటీ పరీక్షలో ఈ పాఠ్యభాగం నుంచి 1, 2 ప్రశ్నలు అడుగుతున్నారు. భారతదేశంలో ఎక్కువ మంది ప్రజల జీవనాధారం వ్యవసాయం. దీనికి ప్రధానంగా నీటి సౌకర్యాలు కావాలి. వర్షపాతం రుతుపవనాలపై ఆధారపడి ఉండటం వల్ల భారతదేశమంతా నీటి పారుదల సౌకర్యాల్లో వ్యత్యాసాలున్నాయి. అందువల్ల ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా నీటి పారుదల సౌకర్యాలు కల్పిస్తున్నారు. వివిధ పంచవర్ష ప్రణాళికల్లోనూ దీనికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షల దృష్ట్యా ఈ పాఠ్యభాగం అత్యంత ప్రధానమైంది. నీటి పారుదల రకాలు, అవి ఎక్కువగా కల్పిస్తున్న రాష్ట్రాలు, వివిధ రాష్ట్రాల్లో ఉన్న కాలువలు, వాటి ప్రత్యేకతలు మొదలైన అంశాలను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయాలి. భారతదేశంలోని ప్రధానమైన నదులు, అవి ప్రవహించే రాష్ట్రాలపై ఆధారపడి సాగునీటి కాలువలు, ప్రాజెక్టులు నెలకొని ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు ఇలాంటి అంశాలతో అనుసంధానం చేసుకుంటూ ఈ పాఠ్యభాగాన్ని చదివితే క్షుణ్నమైన అవగాహన ఏర్పరుచుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం 8, 9, 10వ తరగతి సాంఘికశాస్త్ర పుస్తకాలతో పాటు ఇంటర్ పుస్తకాలను అధ్యయనం చేయాలి.
కాకతీయుల పాలనను ఎలా అధ్యయనం చేయాలో వివరించండి?
+
నూతన తెలంగాణ రాష్ర్టంలో నిర్వహించబోయే ఏ పోటీ పరీక్షల్లో అయినా తెలంగాణ నేపథ్యంలోని అంశాలపై తప్పక ప్రశ్నలడుగుతారు. కానిస్టేబుల్ నియామక పరీక్షల్లో కూడా ఈ అవకాశం ఉంది. సాంఘిక శాస్త్రంలోని చరిత్ర నుంచి ప్రధానంగా కాకతీయులు, కుతుబ్‌షాహీలు, రెడ్డిరాజులు, పద్మనాయకులు, అసఫ్‌జాహీ (నిజాం రాజులు)లు, తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర, హైదరాబాద్ రాష్ర్ట చరిత్ర, తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట ఉద్యమానికి సంబంధించిన అంశాలపై పలు ప్రశ్నలు ఇస్తారు. తెలంగాణ ప్రాంత కవులు, వారి రచనలు, వారిని ఆదరించిన రాజులు, వివిధ దేవాలయాలు నెలకొన్న ప్రాంతాలు - వాటిని నిర్మించిన రాజులు, అక్కడి శిల్పకళారీతుల గురించి ప్రశ్నలను అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఈ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
పోటీ పరీక్షల్లో పార్లమెంట్ కు సంబంధించి ఏయే అంశాలపై ప్రశ్నలు అడుగుతున్నారో తెలపండి.
+
ప్రతి పోటీ పరీక్షలోనూ పార్లమెంట్‌పై తప్పనిసరిగా ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల దీనికి సంబంధించి లోతుగా అధ్యయనం చేయాలి. భారత పార్లమెంట్‌ను విదేశీ పార్లమెంట్లతో పోల్చి చదవాలి. అదేవిధంగా పార్లమెంట్, రాష్ట్ర శాసనసభను తులనాత్మకంగా అధ్యయనం చేయాలి. వివిధ లోక్‌సభలు, వాటి ద్వారా ఏర్పడిన ప్రభుత్వాలు, వాటి ప్రత్యేకతలు, అధికారంలోకి వచ్చిన పార్టీలు, వివిధ రాజకీయ సమీకరణాలకు సంబంధించిన అవగాహన ఉండాలి. వివిధ లోక్‌సభల్లో వివిధ కులాలు, మతాలు, మహిళలకు లభించిన ప్రాతినిధ్యాన్ని పరిశీలించాలి. ఓటింగ్ సరళి, పోలింగ్ శాతం తదితర అంశాలపైనా ప్రశ్నలు అడగవచ్చు.
పోటీ పరీక్షల కోసం భారతదేశ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులకు సబంధించి ఏయే అంశాలను ఎలా చదవాలో తెలపండి.
+
పోటీ పరీక్షల దృష్ట్యా ‘భారత దేశం - జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు’ పాఠ్యభాగం ప్రత్యేకమైంది. భారత దేశ భూగోళ శాస్త్రంలో మిగిలిన అంశాలు కింది తరగతుల నుంచి ఒకదానితో ఒకటి అనుబంధంగా ఉంటూ ఎక్కువసార్లు రిపీట్ అవుతాయి. కానీ ఇది భిన్నమైంది. ప్రతి పరీక్షలో దీని నుంచి 2, 3 ప్రశ్నలు తప్పనిసరిగా వస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా జాతీయ పార్కులు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, బయోస్పియర్ రిజర్‌‌వలు మొదలైనవి వందల సంఖ్యలో, అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. అందువల్ల వీటిలో ముఖ్యమైనవి, ప్రత్యేకమైనవి, వార్తల్లోకి వచ్చినవాటిని గుర్తించుకోవాలి. ఆయా ప్రదేశాలు, నదులు తదితర ప్రత్యేక అంశాల ఆధారంగా వీటికి పేర్లు పెట్టారు. ఇలాంటివాటిని బట్టి ఏయే రాష్ట్రాల్లో ఏయే సంరక్షణ కేంద్రాలున్నాయో గుర్తుంచుకోవాలి.

ఉదాహరణకు కింది ప్రశ్నను గమనించండి.
ఫారెస్ట్ రీసెర్‌‌చ ఇన్‌స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
1) ఢిల్లీ
2) సిమ్లా
3) డెహ్రాడూన్
4) భోపాల్
సమాధానం: 3. దీంతోపాటు ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ, ఫారెస్ట్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు కూడా డెహ్రాడూన్‌లోనే ఉన్నాయి. ఇలాంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ప్రత్యేకంగా ఏ జీవుల సంరక్షణ కోసం ఏయే పార్కులు/రిజర్వులను ఏర్పాటు చేశారో టేబుల్ రూపంలో పొందుపరుచుకొని తరచూ పునశ్చరణ చేసుకోవాలి. ఈ విభాగం నుంచి ప్రశ్నలను ఎక్కువగా సాధన చేయాలి. తద్వారా మంచి మార్కులు సంపాదించవచ్చు.
ఖనిజవనరులు పాఠ్యాంశాన్ని ఎలా అధ్య యనం చేయాలి?
+
  • భారతదేశంలో ఖనిజాల విస్తరణలో స్పష్టమైన లక్షణాలతో కూడిన ఖనిజ మేఖలలను అధ్యయనం చేస్తే ప్రాథమిక స్థాయి ప్రశ్నలకు సులువుగా సమాధానాన్ని గుర్తించవచ్చు.
  • ఖనిజాలు, వాటి రకాలను విభజించి, వాటి విస్తరణ ప్రాంతాలను అధ్యయ నం చేసి వాటి ప్రాధాన్యత క్రమాన్ని గుర్తిస్తే మెమరీ బేస్‌డ్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు.
  • ఖనిజాల లభ్యత ఆధారంగా భారత దేశంలోని ఖనిజాలను వర్గీకరించి చదివితే సమాధానాలను గుర్తించడం సులువు అవుతుంది.
  • ఈ పాఠ్యాంశాన్ని అధ్యయనం చేసేటప్పుడు దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఖనిజాలను కూడా చదవాలి.
  • ఖనిజాలు - లభించే ప్రాంతాలు - ఎగుమతులు - దిగుమతులు - ఆధారపడిన పరిశ్రమలను ఒక టేబుల్‌లా రూపొందించుకోవాలి.
పోటీ పరీక్షల కోసం చరిత్రలోని ‘బౌద్ధ శిల్పకళ’ పాఠ్యభాగంలో ఏయే అంశాలను చదవాలి?
+
పోటీ పరీక్షల దృష్ట్యా ‘బౌద్ధ శిల్పకళ’ పాఠ్యభాగం కీలకమైంది. గతంలో నిర్వహించిన సివిల్స్ పరీక్షలో గాంధార, బౌద్ధశిల్పకళపై రెండు ప్రశ్నలు అడిగారు. అందువల్ల బుద్ధుడికి సంబంధించిన చారిత్రక అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. అజంతా గుహలు మొత్తం ఎన్ని ఉన్నాయి? వాటిలో ఏ గుహలో ఏముంది? రాజకుమారి మరణం, రెండో పులకేశి రాయబారికి దర్శనమిస్తున్నట్లు ఉన్న చిత్రాలు ఏయే గుహల్లో ఉన్నాయి? తదితర అంశాలపైనా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కింది ఉదాహరణను గమనించండి.

అజంతా గుహల్లో బుద్ధుడు ధర్మాన్ని బోధిస్తున్నట్లుగా ఎన్నో గుహలో విగ్రహాన్ని తొలిచారు?
  1. 1
  2. 13
  3. 16
  4. 26

సమాధానం: 3.

అందువల్ల మిత్రవిందుని కథ, బోధిసత్వుడి గజావతారం తదితర జాతక కథల గురించి ఏయే గుహల్లో చెక్కారో తెలుసుకొని ఉండాలి. ఏయే ప్రాంతాల్లో బుద్ధుడికి సంబంధించిన ఎలాంటి విగ్రహాలు బయటపడ్డాయో గుర్తుంచుకోవాలి. అఫ్గానిస్తాన్‌లోని జలాలాబాద్, హడ్డా, బమియన్, కాబూలీ లోయలు; పాకిస్తాన్‌లోని చర్‌చద్ధ, తక్షశిల, స్వాత్ లోయ; భారత్‌లోని ఉష్కర, అర్వన్, పంజాబ్ ప్రాంతాల్లో ఉన్న బౌద్ధ శిల్పకళకు చెందిన వివరాలను పట్టిక రూపంలో పొందుపరుచుకోవాలి. వీటిపై జతపరచడానికి సంబంధించిన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సంఘారామ అవశేషాలు-బయటపడి న ప్రదేశాలు, శిల్పకళ లక్షణాలు, వివిధ గు హల్లో ఉన్న చిత్రలేఖనం లాంటి అంశాలపై అవగాహన పెంచుకుంటే ఎలాంటి ప్రశ్న ఇచ్చినా తేలిగ్గా సమాధానం గుర్తించవచ్చు.
గూప్-I స్థాయి పరీక్షల్లో ‘ప్రవాహిలు’ టాపిక్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి?
+
పోటీ పరీక్షల్లో ‘ప్రవాహిలు’ టాపిక్ నుంచి తరచుగా 1 లేదా 2 ప్రశ్నలు అడుగుతున్నారు. సాధారణంగా గ్రూప్-ఐ, ఐఐ, సివిల్స్ ప్రిలిమ్స్ స్థాయి పరీక్షల్లో ఈ అంశంపై ప్రశ్నలు వస్తున్నాయి. ఫిజిక్స్‌లో ఇతర అంశాల కంటే ఇది కొంచెం భిన్నమైన అంశం. అయినప్పటికీ నిత్య జీవితంలో మనం గమనించే చాలా విషయాలు ఈ పాఠ్యభాగంతో ముడిపడి ఉండటం వల్ల తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. నీటిలో తేలియాడుతున్న, మునిగి ఉన్న, వేలాడుతున్న వస్తువులను గమనిస్తూ.. వాటి వెనుక ఉన్న ధర్మం లేదా సూత్రాన్ని అర్థం చేసుకోవాలి. ద్రవ్యరాశి, ఘన పరిమాణం, సాంద్రత లాంటి అంశాలు మధ్య సంబంధాలను తెలుసుకోవాలి. నిజ జీవితంలో జరిగే వివిధ సంఘటనలను అర్థం చేసుకోవడం ద్వారా ఈ అంశంపై పట్టు సాధించవచ్చు. ఉదాహరణకు కింది అంశాన్ని పరిశీలించండి..
మంచి నీటిలో పెరిగే హైడ్రిల్లా (నాచు) మొక్క నీటిలో వేలాడుతుంది (కలిసిపోతుంది). కానీ అదే మొక్క సముద్రపు నీటిలో తేలుతుంది.

కారణం: ఏదైనా ఒక పదార్థ సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువగా ఉంటే అది నీటిలో తేలుతుంది. ఎక్కువగా ఉంటే మునుగుతుంది. సరిగ్గా సమానంగా ఉంటే వేలాడుతుంది లేదా అందులో కలిసి పోతుంది. మంచినీటిలో పెరిగే హైడ్రిల్లా మొక్క దాని సాంద్రత నీటి సాంద్రతకు సమానంగా ఉండటం వల్ల ఆ నీటిలో వేలాడుతుంది. కానీ అదే మొక్క సముద్రపు నీటిలో తేలడానికి కారణం దాని సాంద్రత సముద్ర నీటి సాంద్రత కంటే తక్కువగా ఉండటమే. ఇలాంటి అంశాలను క్షుణ్నంగా అధ్య యనం చేయడం వల్ల ఈ టాపిక్‌పై తేలికగా పట్టు సాధించవచ్చు.
పోటీ పరీక్షల కోసం రాష్ట్రపతికి సంబంధించిన అంశాలను ఏవిధంగా చదవాలి?
+
రాష్ట్రపతి అధికారాలను లోతుగా అ ధ్యయనం చేయాలి. సాధారణ, అత్యవసర సమయాల్లో రాష్ట్రపతి పాత్రను పోల్చి పరిశీలించాలి. అదేవిధంగా రాష్ట్రపతి, గవర్నర్ అధికారాలు పోల్చి చదివితే రెండు వ్యవస్థలపై అవగాహన పెంచుకోవచ్చు. అంతేకాకుండా భారత రాష్ట్రపతి అధికారాలను అమెరికా అధ్యక్షుడు, బ్రిటన్ రాజు లేదా రాణి అధికారాలతో పోలుస్తూ అధ్యయనం చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ అంశంపై ఎలాంటి ప్రశ్న ఇచ్చినా సులభంగా సమాధానం గర్తించవచ్చు.
మానవ శరీరంలో ఉండే వివిధ రసాయనాలు, వాటి విధులపై పోటీ పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో తెలపండి.
+
మానవ శరీరం ఒక పెద్ద రసాయన కర్మాగారం. చర్మం, వెంట్రుకలు, గోళ్లు, మొదలైనవన్నీ ప్రోటీన్లతో నిర్మితమవుతాయి. కార్బొహైడ్రేట్లు, లిపిడ్లు శరీరానికి శక్తినిస్తాయి. పప్పుదినుసులు, మాంసం ద్వారా ప్రధానంగా ప్రోటీన్లు లభిస్తాయి. నూనెగింజల ద్వారా కొవ్వులు (లిపిడ్లు) లభిస్తాయి. కార్బోహైడ్రేట్లకు ప్రధాన వనరులు బియ్యం, గోధుమలు. పండ్లు, కూరగాయల నుంచి వివిధ విటమిన్లు లభిస్తాయి. వీటన్నింటితో కూడిన ఆహారాన్ని ‘సమతుల ఆహారం’ అంటారు. పోటీ పరీక్షల్లో ఈ అంశాలపై తరచుగా ప్రశ్నలు అడుగు తున్నారు. అందువల్ల జీవ వ్యవస్థలకు సంబంధించిన వివిధ రసాయన పదార్థాల గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి. వీటి కోసం పదో తరగతి, ఇంటర్మీడియట్ ద్వితీ య సంవత్సరం రసాయనశాస్త్ర పుస్తకాలు చాలా ఉపయుక్తంగా ఉంటాయి.
పోటీ పరీక్షల కోసం బయాలజీ సబ్జెక్టును ఏవిధంగా చదవాలో కొన్ని సూచనలివ్వండి
+
సాధారణంగా పోటీ పరీక్షల్లో ప్రశ్నలు ఎక్కువగా పదోతరగతి స్థాయిలో, కొన్ని అంశాలపై ఇంటర్ స్థాయి వరకు వస్తున్నాయి. కాబట్టి ప్రిపరేషన్‌ను ఇంటర్మీడియెట్ స్థాయి వరకు కొనసాగించడం ప్రయోజనకరం. పదో తరగతి వరకు ఉండి, ఇంటర్‌లో పునరావృతమయ్యే పాఠ్యభాగాలను మాత్రమే చదవాలి.
  • ప్రతి అంశాన్ని వివరంగా, విశ్లేషణాత్మకంగా అవగాహన చేసుకుంటూ చదవాలి.
  • నిత్య జీవితంలో ఆయా అంశాలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయి? ఏవిధంగా ఉపయోగపడుతున్నాయి? అనే అంశాలను పరిశీలిస్తూ చదివితే ప్రయోజనకరంగా ఉంటుంది.
  • కొన్ని అంశాలకు సంబంధించి సమాచారాన్ని పట్టిక రూపంలో రూపొందించుకుని తరచుగా మననం చేసుకుంటే ఆయా అంశాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి.
    ఉదా: విటమిన్లు, ఎంజైమ్‌లు, వాటి ప్రభావం; మూలకాలు- వాటి లోపం వల్ల కలిగే - జీవశాస్త్రంలో ముఖ్యంగా వివిధ అంశాలకు సంబంధించిన చిత్ర పటాలను పరిశీలిస్తూ అధ్యయనం చేస్తే విషయం సులువుగా అర్థమవుతుంది. వీటి సహాయంతో క్లిష్టంగా ఉండే అంశాలపై సులభంగా పట్టు సాధించవచ్చు.
  • విధిగా నమూనా, గత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. వీటి ద్వారా ప్రశ్నల సరళి తెలుసుకోవడమే కాకుండా పొరపాట్లను సరిచేసుకునే వెసులుబాటు లభిస్తుంది.
పోటీ పరీక్షల దృష్ట్యా ‘పంచవర్ష ప్రణాళికలు’ పాఠ్యాంశాన్ని ఎలా చదవాలి?
+
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ‘భారతదేశ ప్రణాళికలు’ అధ్యయనం చాలా కీలకమైంది. ప్రతి పరీక్షలోనూ ఈ విభాగం నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ముందుగా ప్రణాళికలు - వాటి కాల వ్యవధి తెలుసుకోవాలి. ప్రతి ప్రణాళికకు ఒక ప్రాధాన్యత ప్రకటిస్తారు. ప్రాధాన్యత, ఆ ప్రణాళికలో పొందుపర్చిన వివిధ అంశాలను అధ్యయనం చేయాలి. ఉదా: మొదటి ప్రణాళికలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత, రెండో ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా 2వ ప్రణాళికలో మూడు భారీ ఇనుము-ఉక్కు కర్మాగారాలు నిర్మించారు. వాటిని ఏ రాష్ట్రాల్లో ఏర్పాటు చేశారు? ఏ దేశ ఆర్థిక సహాయం పొందారు? అనే అంశాలపై దృష్టి సారించాలి. దేశ ఆర్ధిక పరిస్థితులు మారుతున్న తరుణంలో వాటికి అనుగుణంగా ప్రణాళిక లక్ష్యాలు, వృద్ధిరేట్లను మారుస్తున్నారు. వాటిని తెలుసుకుంటుండాలి. ప్రారంభంలో ప్రణాళికలు కేంద్రీకృత ధోరణులుగా ఉండేవి. ప్రస్తుతం వాటి స్వరూపం వికేంద్రీకరణ, సూచనాత్మక ప్రణాళికల వైపు మారింది. ఇలాంటి పదాలు - వాటి అర్థాలు, వాటి వెనుక ఉన్న వ్యూహాలు అధ్యయనం చేయాలి. వివిధ ప్రణాళికల రూపకల్పనలో తీసుకున్న వృద్ధి వ్యూహాలను అవగాహన చేసుకోవాలి. ఉదా: మొదటి ప్రణాళిక ‘హారాడ్-డోమార్ మోడల్, రెండో ప్రణాళిక.. పీసీ మహలనోబిస్ మోడల్.

దేశంలో పేదరిక రేఖకు దిగువన ఉన్న ప్రజల శ్రేయస్సు కోసం ప్రభుత్వం అనేక పథకాలను రూపొందిస్తుంది. వివిధ ప్రణాళికల వారీగా పథకాలు, వాటి ముఖ్య లక్ష్యాలను జాగ్రత్తగా పరిశీలించాలి.
జనరల్‌ ఇంగ్లిష్‌ సిలబస్‌ పీజీ స్థాయిలో ఉంటుందా?
+
జనరల్‌ ఇంగ్లిష్‌ కేవలం క్వాలిఫైయింగ్‌ పరీక్ష మాత్రమే. దీని సిలబస్‌ పదో తరగతి స్థాయిలో ఉంటుంది.
ఇందులో కాంప్రహెన్షన్‌, యాక్టివ్‌ వాయిస్‌, పాసివ్‌ వాయిస్‌, ప్రిపొసిషన్స్‌, పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్‌, కరెక్షన్‌ ఆఫ్‌ సెంటెన్సెస్‌, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్‌.. వంటి అంశాలు ఉంటాయి.
ర్యాంకు నిర్ణయంలో జనరల్‌ ఇంగ్లిష్‌ మార్కులు కీలకమేనా?
+
ర్యాంకు నిర్ణయించడంలో జనరల్‌ ఇంగ్లిష్‌ మార్కులు పరిగణలోకి తీసుకోరు. ఇది కేవలం క్వాలిఫైయింగ్‌ పరీక్ష మాత్రమే. ఇందులో ఓసీ అభ్యర్థులు 40 శాతం, బీసీలు 35 శాతం, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌ అభ్యర్థులు 30 మార్కులు సాధిస్తే సరిపోతుంది.
గ్రూప్‌-1 మెయిన్స్‌ ఇంగ్లిష్‌లో రాయొచ్చా? లేదా తెలుగులోనే రాయాలా?
+
మెయిన్స్‌ను ఇంగ్లిష్‌/ తెలుగు/ ఉర్దూల్లో అభ్యర్థి ఎంపిక చేసుకున్న భాషలో రాయొచ్చు. ఐతే జనరల్‌ ఇంగ్లిష్‌ పేపర్‌ మాత్రం ఇంగ్లిష్‌లోనే రాయాల్సి ఉంటుంది.
గ్రూప్‌-1 ఇంటర్వ్యూలకు ఎన్ని మార్కులు ఉంటాయి?
+
మెయిన్స్‌లో ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇందులో మొత్తం మార్కులు 75.
గ్రూప్‌-1 ఇంటర్వ్యూకు చేరుకోవాలంటే మెయిన్స్‌లో సాధించాల్సిన కనీసం మార్కులెన్ని?
+
మెయిన్స్‌ నుంచి క్వాలిఫై ఐన అభ్యర్థులనే ఇంటర్వ్యూకు పిలుస్తారు. మెయిన్స్‌లో క్వాలిఫైయింగ్‌ కోసం.. మొత్తం 750 మార్కులకు జనరల్‌ అభ్యర్థులు 300, బీసీ అభ్యర్థులు 262.50, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులు 225 మార్కులు సాధించాల్సి ఉంటుంది.
ఇంటర్వ్యూతో కలుపుకొని జనరల్‌ అభ్యర్థులు 330, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులు 288.75, బీసీలు అభ్యర్థులు 247.50 కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది.
గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష ఎలా ఉంటుంది?
+
మెయిన్స్‌లో మొత్తం ఐదు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కుల చొప్పున మొత్తం 750 మార్కులు ఉంటాయి. వీటికి డిస్క్రిప్టీవ్‌ విధానంలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఒక్కో పరీక్షకు మూడు గంటలు.
పేపర్‌-1: జనరల్‌ ఎస్సే
పేపర్‌-2: హిస్టరీ అండ్‌ కల్చర్‌ హెరిటేజ్‌ ఆఫ్‌ ఇండియా; సోషియో హిస్టరీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌; జనరల్‌ వ్యూ ఆఫ్‌ ఇండియన్‌ కాన్‌స్టిట్యూషన్‌.
పేపర్‌-3: భారత ఆర్థిక వ్యవస్థ, ప్రణాళికలు, భూసంస్కరణలు, స్వాతంత్య్రానంతరం ఆంధ్రప్రదేశ్‌.
పేపర్‌-4: భారత దేశాభివృద్ధిలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాత్ర; లైఫ్‌ సెన్సైస్‌లో మోడ్రన్‌ ట్రెండ్స్‌తో జనరల్‌ అవేర్‌నెస్‌, అభివృద్ధి, పర్యావరణ సమస్యలు.
పేపర్‌-5: డాటా అప్రిసియేటషన్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌.
ప్రిలిమ్స్‌ పరీక్ష విధానం ఎలా ఉంటుంది?
+
గ్రూప్‌-1 పరీక్షలో ఇది మొదటి మెట్టు. ఇందులో ఎంపికైన అభ్యర్థులను మెయిన్స్‌ ఎంపిక చేస్తారు. ఇందులో 150 మార్కులకు 150 ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. జనరల్‌ స్టడీస్‌.. కరెంట్‌ ఈవెంట్స్‌, జాతీయ అంతర్జాతీయ వర్తమాన అంశాలు, జనరల్‌ సైన్స్‌, భారత దేశ చరిత్ర, ప్రపంచ, భారత భూగోళ శాస్త్రం, పాలిటీ, ఎకానమీ, మెంటల్‌ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు వస్తాయి. సమయం రెండున్నర గంటలు.
గ్రూప్‌-1కు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి?
+
ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
గ్రూప్‌-1 అర్హతలేమిటి?
+
సుమారు అన్ని ఉద్యోగాలకు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఐతే డివిజినల్‌ ఫైర్‌ ఆఫీసర్‌  వంటి ఉద్యోగాలకు సంబంధిత అంశంలో డిగ్రీ పొంది ఉండాలి.
గ్రూప్‌-1 ఉద్యోగాలకు వయోపరిమితి ఎంత?
+
సాధారణంగా గ్రూప్‌-1 ఉద్యోగాలకు కనిష్ట వయసు- 18, గరిష్ట వయసు- 39 ఏళ్లుగా ఉంది. ఐతే కొన్ని ఉద్యోగాలకు వయో పరిమితుల్లో తేడాలున్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌, డివిజినల్‌ ఫైర్‌ ఆఫీసర్స్‌ వంటి ఉద్యోగాలకు కనిష్ట వయసు-21, గరిష్ట వయసు-30గా ఉంది. ఐతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీహెచ్‌ అభ్యర్థులకు పదేళ్ల గరిష్ట వయో సడలింపు ఉంటుంది.
గ్రూప్‌-1 ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
+
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట స్క్రీనింగ్‌ టెస్ట్‌ ప్రిలిమ్స్‌ను నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా ఒక్కో ఉద్యోగానికి 50 మందిని(1:50 చొప్పున) ఎంపిక చేసి మెయిన్స్‌ను నిర్వహిస్తారు. మెయిన్స్‌లో ప్రతిభ చూపిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఏయే ఉద్యోగాల నియామకానికి గ్రూప్‌-1 పరీక్షను నిర్వహిస్తారు?
+
రాష్ట్ర స్థాయిలో అత్యున్నత పరీక్ష గ్రూప్‌-1. ఈ పరీక్ష ద్వారా ఏపీ సివిల్‌ సర్వీస్‌లో డిప్యూటీ కలెక్టర్లు; పోలీస్‌ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ సివిల్‌/ కమ్యూనికేషన్‌; కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్లు; ట్రాన్స్‌పోర్ట్‌ విభాగంలో రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్లు; ఫైర్‌ సర్వీసెస్‌లో డివిజినల్‌ ఫైర్‌ ఆఫీసర్లు; ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖలో అసిస్టెంట్‌ ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌; జిల్లా సాంఘిక సంక్షేమ ఆఫీసర్లు, పురపాలక శాఖలో మున్సిపల్‌ కమిషనర్లు, ట్రెజరీ శాఖలో అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్లు/ అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్లు; పంచాయితీ రాజ్‌లో ఎంపీడీఓలు; జైళ్ల శాఖలో డిప్యూటీ సూరింటెండెంట్‌ ఆఫ్‌ జైల్స్‌.. మొదలైన ఉద్యోగాలు ఉంటాయి.
ఉద్యోగాల నియామకాల్లో జోన్‌ల వ్యవస్థ అంటే ఏమిటీ? నేను ఏ జోన్‌లోకి వస్తాను?
+
వివిధ ఉద్యోగాల నియామకాల కోసం రాష్ట్రాన్ని వివిధ జోన్‌లుగా విభజించారు. జిల్లాల వారిగా ఈ విభజన ఉంది. అవి..
జోన్‌-1: శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం
జోన్‌-2: తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ.
జోన్‌-3: గుంటూరు, ప్రకాశం, నెల్లూరు
జోన్‌-4: చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు
జోన్‌-5: ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం.
జోన్‌-6: హైదరాబాద్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్గొండ.
హైదరాబాద్‌ను ఆరో జోన్‌లో భాగంగానే పరిగణిస్తున్నారు.