Skip to main content

Engineering Students: బీటెక్‌ నాలుగేళ్ల ప్రణాళిక ఇలా..

బీటెక్‌.. నాలుగేళ్ల ఇంజనీరింగ్‌ కోర్సు! బీటెక్‌ పట్టా చేతికందితే కార్పొరేట్‌ కెరీర్‌ ఖాయమనే అభిప్రాయం అందుకే..ఎంట్రన్స్‌ టెస్ట్‌లో ర్యాంకు కోసం ఇంటర్‌లో చేరిన రోజునుంచే అహర్నిశలు కృషి చేస్తారు. లక్షల మందితో పోటీపడి నచ్చిన కోర్సులో చేరుతారు. ఇలా కాలేజీ క్యాంపస్‌లో అడుగుపెట్టిన విద్యార్థులు.. ఫైనలియర్‌ పూర్తయ్యే వరకు..అనుక్షణం అప్రమత్తంగా నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగాలి. అప్పుడే కంపెనీలు కోరుకునే నైపుణ్యాలు సొంతమవుతాయి. లేటెస్ట్‌ స్కిల్స్‌ ఉంటేనే.. కార్పొరేట్‌ కొలువుల కల నిజమవుతుంది. ఈ నేపథ్యంలో.. ఇటీవల ఇంజనీరింగ్‌ కోర్సులో చేరిన విద్యార్థులకు ఉపయోగపడేలా.. నాలుగేళ్ల బీటెక్‌లో రాణించడమెలాగో తెలిపే కథనం...
engineering students 4 years engineering course preparation plan
  • నాలుగేళ్లు పక్కా ప్రణాళికతోనే భద్రమైన కెరీర్‌
  • లేటెస్ట్‌ టెక్‌ స్కిల్స్‌ బాటలో సాగితేనే ప్లేస్‌మెంట్స్‌లో సక్సెస్‌
  • ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థులకు నిపుణుల సలహా

బీటెక్‌లో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రన్స్‌ టెస్ట్‌లో విజయం అనేది లక్ష్య సా«ధన దిశగా తొలి అడుగు మాత్రమే. ముఖ్యంగా ప్రస్తుత డిజిటల్‌ టెక్నాలజీ యుగంలో మెరుగైన ఇంజనీర్లుగా రూపొందాలంటే.. ఇంజనీరింగ్‌ కోర్సులో చేరిన మొదటి రోజు నుంచి నాలుగో ఏడాది పూర్తి చేసుకునే వరకూ.. పూర్తి అంకితభావంతో, పటిష్ట ప్రణాళికతో ముందుకు సాగాలి అంటున్నారు నిపుణులు.

చ‌ద‌వండి: Tech skills: సైబర్‌ సెక్యూరిటీ.. కెరీర్‌ అవకాశాలు, అర్హతలు, నైపుణ్యాలు అందుకునేందుకు మార్గాలు

స్కిల్స్‌కు ప్రాధాన్యం

ఇంజనీరింగ్‌లో సీటు కోసం ఎంతో కష్టపడి చదివిన విద్యార్థులు.. కోర్సులో చేరాక కొంత రిలాక్స్‌ మూడ్‌లోకి వెళ్లిపోతారు. క్యాంపస్‌లో అడుగుపెట్టడంతోనే తమ స్వప్నం సాకారమైందనే భావనకు వస్తారు. ఇది ఎంత మాత్రం సరికాదు. నేటి పోటీ ప్రపంచంలో..ముఖ్యంగా ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌ ప్రాధాన్యం పెరుగుతున్న తరుణంలో.. బీటెక్‌లో చేరిన తొలిరోజు నుంచే విద్యార్థులు నిరంతరం తమను తాము తీర్చిదిద్దుకోవాలి. నైపుణ్యాలకు నగిషీలు దిద్దుకోవాలి. టెక్నాలజీ యుగంలో వస్తున్న మార్పులను పసిగట్టి, వాటిపై పట్టు సాధించాలి. అప్పుడే నాలుగేళ్ల తర్వాత సర్టిఫికెట్‌ చేతికందే సమయానికి జాబ్‌ మార్కెట్‌కు అవసరమైన స్కిల్స్‌ సొంతమవుతాయి.

కొత్త వాతావరణం

బీటెక్‌లో చేరిన మొదటి సంవత్సరం విద్యార్థులు కొత్త వాతావరణంలో త్వరగా ఇమిడిపోయే ప్రయత్నం చేయాలి. ప్రధానంగా వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల విద్యార్థులు ప్రవేశాలు పొందే ఐఐటీలు, ఎన్‌ఐటీల క్యాంపస్‌లలో ఒత్తిడి సమస్య ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా రాష్ట్రాల స్థాయిలోని కళాశాలల్లోనూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కొత్త వాతావరణంలో ఒత్తిడికి గురవుతున్నారు. ఇలాంటి విద్యార్థులు ఇంటర్‌పర్సనల్, క్రాస్‌ కల్చరల్‌ స్కిల్స్‌ పెంచుకునే దిశగా అడుగులు వేయాలి. విద్యార్థుల కోసం కాలేజీల్లో ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ సెల్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ సదుపాయం వినియోగించుకోవాలి.

అకడమిక్స్‌లో రాణింపు

అకడమిక్స్‌ విషయంలో విద్యార్థులు స్పష్టమైన అవగాహనతో అడుగులు వేయాలి. ఇంటర్‌ వరకు చదివిన విధానం వేరు. ఇంజనీరింగ్‌ సబ్జెక్ట్‌లను అభ్యసించే పద్ధతి, బోధించే తీరు భిన్నం. అందువల్ల విద్యార్థులు ఆందోళన చెందకుండా తొలుత నాలుగేళ్ల సిలబస్‌పై ప్రాథమికంగా అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత మొదటి సంవత్సరం సబ్జెక్టులు, సిలబస్‌పై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టాలి. మొదటి సంవత్సరం సబ్జెక్ట్‌లు.. ఇంజనీరింగ్‌ కోర్సుకు పునాది వంటివి. వీటిపై పట్టు సాధిస్తేనే తర్వాత మూడేళ్లు అకడమిక్స్‌లో రాణించడం సులువవుతుంది.

చ‌ద‌వండి: Coding and Programming Skills: ఐటీలో కొలువులు.. లక్షల్లో వేతనం..

ప్రాక్టికాలిటీ, అప్లికేషన్‌ అప్రోచ్‌

ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఏ అంశాన్నైనా ప్రాక్టికల్‌ దృక్పథంతో, అప్లికేషన్‌ అప్రోచ్‌తో అధ్యయనం చేయడం అలవాటు చేసుకోవాలి. అందుకోసం కాలేజీ లేబొరేటరీల్లో ఆయా సబ్జెక్ట్‌ అంశాలకు సంబంధించి ప్రాక్టికల్స్‌ శ్రద్ధగా చేయాలి. కేవలం పుస్తకాలకే పరిమితమైతే పరీక్షల్లో ఎక్కువ మార్కులు స్కోర్‌ చేయొచ్చేమోకానీ.. రియల్‌ టైం నైపుణ్యాలు మాత్రం లభించవు. ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ లేకుంటే.. భవిష్యత్‌లో కెరీర్‌ అవకాశాల పరంగా ఇబ్బందులు ఎదురవడం ఖాయం. అవసరమైతే లెక్చరర్స్, ప్రొఫెసర్స్‌ సహాయం తీసుకోవడానికి కూడా వెనుకంజ వేయకూడదు. పలు ఇన్‌స్టిట్యూట్‌లు మెంటారింగ్‌ సెల్స్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నాయి. తరగతి గదిలో సందేహాలు నివృత్తి చేసుకోవడానికి బిడియపడే విద్యార్థులకు ఇవి ఎంతగానో ఉపయుక్తం.

రెండో ఏడాది నుంచి లోతైన అధ్యయనం

వాస్తవానికి పూర్తిస్థాయిలో ఇంజనీరింగ్‌ సబ్జెక్ట్‌ల బోధన రెండో ఏడాది నుంచే మొదలవుతుంది. రెండో సంవత్సరం నుంచి సబ్జెక్టులను లోతుగా అన్ని కోణాల్లో అధ్యయనం చేయడం ప్రారంభించాలి. అందుకోసం మూక్స్, ఎన్‌పీటీఈఎల్‌ వంటి ఆన్‌లైన్‌ విధానాలతోపాటు ప్రొఫెసర్స్‌ రాసిన ప్రామాణిక పుస్తకాలను చదవాలి. ముఖ్యంగా ప్రతి అంశాన్ని వాస్తవ పరిస్థితులతో అనుసంధానిస్తూ అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. విద్యార్థులు తమ బ్రాంచ్‌కు సంబంధించిన సబ్జెక్ట్‌లు.. వాటికి అవసరమైన క్షేత్ర నైపుణ్యాలపైనా దృష్టి పెట్టాలి.

చ‌ద‌వండి: Recruitment Trends: ఆఫ్‌–క్యాంపస్‌... రూ.కోట్లలో ప్యాకేజీలు అందుకోండిలా!

ఇంటర్న్‌షిప్స్‌ దిశగా

రెండో ఏడాది చివరి నుంచే ఇంటర్న్‌షిప్స్‌లో చేరేలా ప్రయత్నాలు సాగించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా రియల్‌ టైమ్‌ నైపుణ్యాలు సొంతం చేసుకోవాలంటే.. కనీసం రెండు లేదా మూడు ఇంటర్న్‌షిప్స్‌ చేయడం మేలు. ఏఐసీటీఈ నూతన కరిక్యులం కూడా ఈ మేరకు మార్గదర్శకాల్ని విడుదల చేసింది. కాబట్టి విద్యార్థులు సంబంధిత పరిశ్రమల్లో ఇంటర్న్‌ అవకాశాల కోసం అన్వేషించాలి. ఇందుకోసం క్యాంపస్‌లోని ఇండస్ట్రీ ఇంటరాక్షన్‌ సెల్‌తోపాటు, ఆయా సంస్థల్లో పనిచేస్తున్న సీనియర్ల సహకారం తీసుకోవాలి. ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేయడం ద్వారా తాజా పరిస్థితులపై అవగాహన వస్తుంది. కంపెనీల అవసరాలకు తగ్గట్లు నైపుణ్యాలు మెరుగుపరచుకునే అవకాశం లభిస్తుంది.

భవిష్యత్తు లక్ష్యాల దిశగా

మూడో ఏడాది నుంచి తమ భవిష్యత్తు లక్ష్యాల సాధన దిశగా స్థిరంగా అడుగులు వేయాలి. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ఆఫర్స్‌ సొంతం చేసుకోవాలనుకునే విద్యార్థులు.. అందుకు అనుగుణంగా ప్రస్తుతం జాబ్‌ మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న టెక్నాలజీలు, నైపుణ్యాలను అందిపుచ్చుకునే మార్గాలను అన్వేషించాలి. ఉన్నత విద్యకు వెళ్లాలనుకునే అభ్యర్థులు గేట్, క్యాట్‌ వంటి పరీక్షల ప్రిపరేషన్‌కు శ్రీకారం చుట్టాలి.

చ‌ద‌వండి: Career Opportunities: 5జీ టెక్నాలజీలో రానున్న మూడేళ్లలో 2.2 కోట్ల ఉద్యోగాలు..

సర్టిఫికేషన్స్‌తో సమర్థవంతంగా

ప్రస్తుతం జాబ్‌ మార్కెట్‌ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌గా పేర్కొనే ఆటోమేషన్, మెషిన్‌ లెర్నింగ్, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ, రోబోటిక్స్, 3-డి డిజైన్‌ ప్రింటింగ్, క్లౌడ్‌ కంప్యూటింగ్, సైబర్‌ సెక్యూరిటీ స్కిల్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. కంపెనీలు తమ కార్యకలాపాల నిర్వహణలో నిత్యం కొత్త టెక్నాలజీని ప్రవేశపెడుతున్నాయి. వీటిని కరిక్యులంలో భాగంగా అభ్యసించే వీలుండదు. ఇలాంటి లేటెస్ట్‌ టెక్నాలజీకి సంబంధించి సర్టిఫికేషన్‌ కోర్సులు చేయడం లాభిస్తుంది. విద్యార్థులు ఆయా సర్టిఫికేషన్‌ కోర్సులు పూర్తి చేయడం ద్వారా జాబ్‌ మార్కెట్‌లో ముందంజలో నిలిచే వీలుంటుంది. 

మూక్స్‌తో లేటెస్ట్‌ టెక్నాలజీ

నేటి ఇంటర్నెట్‌ యుగంలో ఇంజనీరింగ్‌ విద్యార్థులకు వరం మూక్స్‌(మాసివ్‌లీ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సెస్‌). అంతర్జాతీయంగా పలు ప్రముఖ యూనివర్సిటీలు ఆయా అంశాలకు సంబంధించి ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ విధానంలో కోర్సులను అందిస్తున్నాయి.ఇంజనీరింగ్‌ విద్యార్థులు మూక్స్‌ ద్వారా తమ సబ్జెక్టులతోపాటు లేటెస్ట్‌ టెక్నాలజీపైనా అవగాహన పెంచుకోవచ్చు. మన దేశంలోనూ ఎన్‌పీటీఈఎల్‌ ద్వారా ప్రముఖ ప్రొఫెసర్స్‌ బోధించే పాఠాలను ఆన్‌లైన్‌లో వినే అవకాశముంది. వీటిల్లో విద్యార్థులకు ఉపయోగపడే వర్చువల్‌ ల్యాబ్స్‌ సౌకర్యం సైతం లభిస్తుంది. ఫలితంగా విద్యార్థులు తాజా పరిశోధనలు, టెక్నాలజీ, పరిణామాలు, ప్రాక్టికల్‌ అంశాలపై అవగాహన పెంచుకోవచ్చు.

చ‌ద‌వండి: నైపుణ్యాల అంచనాకు మెరుగైన అంశం.. ప్రాజెక్ట్ వర్క్

సొంతంగా ప్రాజెక్ట్‌ వర్క్‌

మొత్తం ఇంజనీరింగ్‌ కోర్సులో అత్యంత కీలకమైనది.. ప్రాజెక్ట్‌ వర్క్‌. దీన్ని నాలుగో ఏడాదిలో చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు రియల్‌ టైమ్‌ ప్రాజెక్ట్‌ వర్క్‌ చేసేందుకే ప్రాధాన్యం ఇవ్వాలి. సొంతంగా ప్రాజెక్టు వర్క్‌ పూర్తిచేస్తే..సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌తోపాటు ప్రాక్టికల్‌ నైపుణ్యాలు అలవడతాయి.సదరు ప్రాజెక్ట్‌ వర్క్‌ రియల్‌ టైమ్‌ అవునా?కాదా?అని ప్లేస్‌మెంట్‌ ప్రతినిధులు ఇట్టే పసిగట్టేస్తారని గుర్తించాలి.

వ్యక్తిత్వ వికాసం

ఇంజనీరింగ్‌ విద్యార్థులు పెంపొందించుకోవాల్సిన మరో లక్షణం.. వ్యక్తిత్వ వికాసం(పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌). కంపెనీలు తమ నియామకాల సమయంలో అభ్యర్థి వ్యక్తిత్వాన్ని కూడా పరిశీలిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు కాలేజీలో ఉన్నప్పుడే వ్యక్తిత్వ లక్షణాలు సైతం మెరుగుపరచుకోవాలి. ముఖ్యంగా కమ్యూనికేషన్, లాంగ్వేజ్‌ స్కిల్స్, టీమ్‌ వర్కింగ్‌ వంటి నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. ఇందుకోసం కాలేజ్‌లో నిర్వహించే సెమినార్లకు హాజరవడం, తోటి విద్యార్థులతో గ్రూప్‌ డిస్కషన్స్‌ వంటి వాటిలో పాల్గొనాలి. అదే విధంగా కాలేజ్‌లో నిర్వహించే కల్చరల్‌ యాక్టివిటీస్‌లోనూ భాగస్వాములయ్యే విధంగా వ్యవహరించాలి. ఫలితంగా ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌ మెరుగవుతాయి.

సెల్ఫ్‌ లెర్నింగ్‌తో ఎక్సలెన్స్‌

బీటెక్‌ విద్యార్థులు మొదటి నుంచి సెల్ఫ్‌ లెర్నింగ్‌ అలవాటు చేసుకోవాలి. దీనికోసం ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న అన్నిరకాల వనరులను ఉపయోగించుకోవాలి. లైబ్రరీ, డిజిటల్‌ లైబ్రరీలను వినియోగించుకోవాలి. తద్వారా తమ కోర్‌ సబ్జెక్ట్‌లకు సంబంధించి తాజా పరిణామాలపై అవగాహన పొందాలి. అదే విధంగా రియల్‌ టైమ్‌ ప్రాబ్లమ్స్, వాటికి ఆ రంగంలోని నిపుణులు కనుగొన్న పరిష్కారాలను అధ్యయనం చేయడం ద్వారా మరింత అవగాహన లభిస్తుంది. ఇలాంటి రియల్‌ టైమ్‌ సొల్యూషన్స్‌ కోసం రీసెర్చ్‌ జర్నల్స్, రీసెర్చ్‌ పేపర్స్‌ను చదవడం అలవర్చుకోవాలి. 

చ‌ద‌వండి: IIT Jobs: ఐఐటీల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌.. ఏడాదికి రూ.2కోట్లకు పైగా వేత‌నం..

లక్ష్యంపై స్పష్టత

బీటెక్‌లో చేరిన ప్రతి విద్యార్థికి ఏదో ఒక నిర్దిష్ట లక్ష్యం ఉంటుంది. కొందరికి బీటెక్‌ పూర్తవగానే ఉద్యోగం లక్ష్యమైతే.. మరి కొందరు ఉన్నత విద్యను టార్గెట్‌గా చేసుకుంటారు. ఉద్యోగమా.. ఉన్నత విద్యా.. వీటిలో లక్ష్యమేమిటో ముందుగానే నిర్దేశించుకోవాలి. లక్ష్యంపై పూర్తి స్పష్టత ఎంతో అవసరం అంటున్నారు నిపుణులు. విదేశాల్లో ఎంఎస్‌ కోసమైతే రెండో సంవత్సరంలోనే టోఫెల్‌ను, మూడో ఏడాదిలోపు జీఆర్‌ఈ రాయాలి. ఎంటెక్‌/ఎంబీఏ కోసం 'గేట్‌' లేదా 'క్యాట్‌' పరీక్షలకు సన్నద్ధత ప్రారంభించాలి. ముఖ్యంగా అకడమిక్‌ స్టడీస్‌కు ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. సెమిస్టర్‌కు 15 వారాల వ్యవధిలో మొదటి ఆరేడు వారాల్లో 'లక్ష్య' సాధనకు కసరత్తు చేయాలి. మిగిలిన సమయాన్ని అకడమిక్స్‌కు కేటాయించాలి. 

Published date : 28 Nov 2022 04:07PM

Photo Stories