Skip to main content

ప్రాథమిక విద్య నుంచే.. ‘టెక్నాలజీ’ కీలకం

‘ప్రస్తుతం విద్యా విధానంలో మార్పులు తేవడం ఎంతో అవసరం. ఇందుకోసం ఎప్పటికప్పుడు వీటికి సంబంధించి సమీక్షలు నిర్వహించాలి. పస్తుత పరిస్థితుల్లో ప్రాథమిక విద్య నుంచే టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. దీనికి అనుగుణంగా విద్యా సంస్థలు సదుపాయాలు కల్పించాలి’ అంటున్నారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) చైర్ పర్సన్, సీనియర్ ఐఏఎస్ అధికారిణి అనితా కర్వాల్. ఎంహెచ్‌ఆర్‌డీలో పాఠశాల విద్యకు సంబంధించిన విధానాల అమలులో విశేష అనుభవం గడించి.. ప్రస్తుతం సీబీఎస్‌ఈ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న అనితా కర్వాల్‌తో ఈ వారం గెస్ట్‌కాలమ్...

 

నూతన విద్యా విధానం.. అన్ని వర్గాలకు మేలునూతన విద్యా విధానం ముసాయిదాలో పేర్కొన్న సిఫార్సులను పరిశీలిస్తే.. ఇవి పాఠశాల స్థాయి నుంచి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ వరకు.. అన్ని వర్గాలకు మేలు చేసే విధంగానే ఉన్నాయి. ముఖ్యంగా ఆర్‌టీఈ పరిధిని విస్తరించడం మొదలు టీచర్లకు శిక్షణ, ఉన్నత విద్యలో నిరంతర పర్యవేక్షణ, నియంత్రణ వంటి అంశాలు విద్యార్థులకు ఎంతో ఉపయుక్తం.

వృత్తి విద్య :
ప్రస్తుతం వృత్తి విద్యకు ప్రాధాన్యం పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సీబీఎస్‌ఈ వృత్తి విద్యను అందించే చర్యలకు శ్రీకారం చుట్టింది. సెకండరీ, సీనియర్ సెకండరీ స్థాయిల్లో స్కిల్ ఓరియెంటెడ్ కోర్సులను అందిస్తున్నాం. ముఖ్యంగా సీనియర్ సెకండరీ స్థాయిలో.. పలు రంగాలకు సంబంధించి ప్రాథమిక నైపుణ్యం, ప్రాక్టికల్ అవగాహన కల్పించేలా దాదాపు 40కు పైగా స్కిల్ ఓరియెంటెడ్ కోర్సులను ప్రవేశపెట్టాం.

ఉపాధ్యాయులకు శిక్షణ :
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. కాబట్టి టీచర్లు ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. అందుకే సీబీఎస్‌ఈ ఆధ్వర్యంలో టీచర్లకు వర్క్‌షాప్స్, సెమినార్స్ నిర్వహిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా 10 సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లను ఏర్పాటు చేశాం. ఉపాధ్యాయులు టెక్నాలజీ ఆధారిత టీచింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకోసం తగిన శిక్షణ పొందాలి.

పాఠశాల విద్యలో ఐసీటీ :
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాథమిక విద్య నుంచే ఐసీటీ (ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) విధానం అమలు చేయడం చాలా అవసరం. పాఠశాల విద్యలో ఇది ఒక అంతర్గత భాగంగా ఉండాలి. కానీ నేటికీ ఐసీటీ గురించి చాలా మంది పెద్దగా పట్టించుకోవట్లేదు. సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో మాత్రం ఐసీటీ ఆధారిత విద్యను తప్పనిసరిగా అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఐసీటీ సమర్థంగా అమలు కావాలంటే.. మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి.

అవకాశాల గురించి అవగాహన :
సీనియర్ సెకండరీ, +2 తర్వాత అధిక శాతం మంది విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడిసిన్ గురించి మాత్రమే తెలుసు. వాస్తవానికి ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ అవకాశాలున్నాయి. వీటిని విద్యార్థులకు తెలియజేసేలా సీబీఎస్‌ఈ ఆధ్వర్యంలో కెరీర్ గెడైన్స్ సదుపాయాన్ని కల్పిస్తున్నాం. అదే విధంగా కాలేజీ గైడ్ పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చాం. ఇందులో +2 తర్వాత అందుబాటులో ఉండే అన్ని రకాల కోర్సులు, వాటిని అందిస్తున్న సంస్థల వివరాలు పొందుపరిచాం. ఇది విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

పొరపాట్లకు తావు లేకుండా..
ఇటీవల కాలంలో సీబీఎస్‌ఈ పేపర్ మూల్యాంకనలో పొరపాట్లపై నిరసనలు జరిగిన మాట వాస్తవమే. భవిష్యత్తులో ఇలాంటివి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రతిరోజు మూల్యాంకన చేయాల్సిన పేపర్ల సంఖ్యను తగ్గించాలనే ఆలోచనలో ఉన్నాం. దీనివల్ల ఎవాల్యుయేటర్స్‌పైన పని భారం తగ్గుతుంది. ఫలితంగా ప్రతి ఆన్సర్ షీట్‌ను క్షుణ్నంగా పరిశీలించి.. సరైన విధంగా ఎవాల్యుయేషన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది.

స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు :
ప్రతి స్కూల్‌లోనూ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఒకరైనా ఉండాలి. దీనివల్ల దివ్యాంగ విద్యార్థులకు ఇతరులతో సమానంగా బోధన అవకాశాలు లభిస్తాయి. ఈ విధానాన్ని సీబీఎస్‌ఈ ఇప్పటికే అమలు చేస్తోంది. రాష్ట్రాల స్థాయిలోనూ పాఠశాలల్లో ఇలాంటి విధానం తప్పనిసరి చేయడం వల్ల ప్రత్యేక సామర్థ్యాల విద్యార్థులకు మేలు జరుగుతుంది. టీచర్లు విద్యార్థులకు అకడమిక్‌గా, కెరీర్ పరంగా కౌన్సెలర్లుగానూ వ్యవహరించాలి. విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా వారికి అందుబాటులో ఉండే భవిష్యత్తు అవకాశాల గురించి తెలియజేయాలి.

యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ :
విద్యార్థులకు ఏ అంశంలో ఆసక్తి ఉందో తెలుసుకోవడానికి ప్రధాన మార్గం యాక్టివిటీ బేస్డ్ టీచింగ్. దీన్ని అన్ని పాఠశాలల్లో అమలు చేయాలి. ఫలితంగా విద్యార్థులు ఏ సబ్జెక్ట్‌లకు సంబంధించిన యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొంటున్నారో తెలుస్తుంది. ఫలితంగా వారికి నిజంగా ఏ సబ్జెక్ట్‌పై ఆసక్తి ఉందో అంచనా వేయడానికి వీలవుతుంది.

మార్పులు సహజం :
ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రంగాల్లో మార్పులు జరగడం సహజంగా మారింది. వీటి గురించి ఆందోళన చెందకుండా.. మార్పులకు అనుగుణంగా నైపుణ్యం పొందాలి. సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో మార్పులకు సంబంధించి వార్తలు వస్తున్న మాట నిజమే. అయితే సివిల్స్ స్థాయి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మార్పులకు ఆందోళన చెందడం సరికాదు!!

 

Published date : 16 Aug 2021 03:32PM

Photo Stories