AP New MBBS Seats in 2024 : ఏపీలో కొత్తగా మరో 850 ఎంబీబీఎస్ సీట్లు.. ఈ కాలేజీల్లో కూడా..
![Increasing MBBS Seats in Andhra Pradesh ap new mbbs seats details in telugu New Medical Colleges in Andhra Pradesh](/sites/default/files/images/2024/04/10/mbbs-students-1-1712726673.jpg)
రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ చేయడంతో పాటు, మన విద్యార్థులకు వైద్య విద్యావకాశాలు పెంచేలా ఏకంగా 17 కొత్త కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.
2024–25 విద్యా సంవత్సరం నుంచి పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె వైద్య కళాశాలలను ప్రభుత్వం ప్రారంభించనుంది.
☛ NEET UG 2024: నీట్-యూజీ-2024 పరీక్ష విధానం.. బెస్ట్ ర్యాంకు సాధించేందుకు ప్రిపరేషన్ గైడెన్స్..
ఒక్కో చోట 200 ఎంబీబీఎస్ సీట్లకు అనుగుణంగా..
![mbbs students](/sites/default/files/inline-images/5a0a824fc28c7_7.jpg)
ఐదు చోట్ల వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేయడంతో పాటు, వైద్య కళాశాలలకు 222, బోధనాస్పత్రికి 484 చొప్పున 3,530 పోస్టులను మంజూరు చేశారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ దాదాపు పూర్తయింది. వసతుల కల్పన వేగంగా కొనసాగుతోంది. ఒక్కోచోట 150 చొప్పున 750 సీట్ల కోసం నేషనల్ మెడికల్కమిషన్(ఎన్ఎంసీ)కు దరఖాస్తు చేశారు. మరోవైపు అనంతపురం వైద్య కళాశాలలో 50, నెల్లూరు, శ్రీకాకుళం కళాశాలల్లో ఒక్కో చోట 25 చొప్పున 50 ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు దరఖాస్తు చేశారు. ప్రస్తుతం అనంతపురంలో 150, శ్రీకాకుళంలో 175, నెల్లూరులో 175 సీట్లున్నాయి. కాగా, ఒక్కో చోట 200 ఎంబీబీఎస్ సీట్లకు అనుగుణంగా బోధనాస్పత్రుల్లో పడకలు, వైద్యులు, సిబ్బంది, ఇతర వనరులున్నాయి. దీంతో 200 సీట్లను పెంచేలా ఎన్ఎంసీకి దరఖాస్తు చేశారు. నూతన వైద్య కళాశాలలతో పాటు, అనంత, శ్రీకాకుళం, నెల్లూరు కళాశాలల్లో ఎన్ఎంసీ బృందం త్వరలో ఇన్స్పెక్షన్కు రానుంది.
వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా..
ప్రతి కొత్త జిల్లాకు ఒక వైద్య కళాశాల ఉండేలా వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తోంది. తద్వారా ఏకంగా 2,550 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెస్తోంది. ఈ నేపథ్యంలో వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ విద్యా సంవత్సరంలో ఐదు కళాశాలలను ప్రారంభించడం ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం మరో ఐదు కళాశాలలు ప్రారంభించడం ద్వారా ఒక్కో చోట 150 చొప్పున 750 సీట్లు సమకూరనున్నాయి. ఇక మిగిలిన ఏడు వైద్య కళాశాలలను 2025–26 విద్యా సంవత్సరంలో ప్రారంభించేలా ప్రణాళికలు రచించారు.
ఈ ఉద్యోగాలు కూడా భర్తీ.. : డాక్టర్ నరసింహం, డీఎంఈ
ఐదు కొత్త కళాశాలలను ప్రారంభించడానికి వీలుగా అన్ని విధాలా సిద్ధమవుతున్నాం. ఇప్పటికే ఐదు చోట్ల అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్లు, ఇతర పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాం. కళాశాలలు, బోధనాస్పత్రుల్లో ఎన్ఎంసీ నిబంధనలకనుగుణంగా ఏపీఎంఎస్ఐడీసీ వనరులు సమకూరుస్తోంది. ఎన్ఎంసీ బృందం తనిఖీలకు రావాల్సి ఉంది.
☛ Ritika : పెళ్లి కోసం దాచిన నగలు అమ్మి చదివింది..కట్ చేస్తే ఆల్ ఇండియా ర్యాంకు..