Skip to main content

Medical Education: వైద్య విద్యలో నవశకం

సాక్షి, అమరావతి: ఇప్పుడు వైద్య సేవలే కాదు.. వైద్య విద్య కూడా మనకు చేరువైంది. ఒకపక్క ప్రజారోగ్య సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ మరోపక్క మన విద్యార్థుల వైద్య విద్య కలలను సైతం సాకారం చేశారు. కోట్లుంటేనే డాక్టర్‌ కోటు సాధ్యమనే నానుడిని తొలగిస్తూ ఒకేసారి పెద్ద ఎత్తున వైద్య కాలేజీల ఏర్పాటుతో మెడికల్‌ మిరాకిల్‌ చేశారు! స్వాతంత్య్రం వచ్చాక రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఏర్పాటైన మెడికల్‌ కాలేజీల సంఖ్య 11. గత నాలుగున్నరేళ్ల కృషి ఫలితంగా కొత్తగా సాకారమవుతున్న ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య ఏకంగా 17.
 Chief Minister Jagan establishes numerous medical colleges.  A pioneer in medical education   Medical education dreams come true for students in Amaravati.

వైద్య ఆరోగ్య రంగానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యమిస్తోందో చెప్పేందుకు ఇది చాలు! ‘పేదలకు ఉచితంగా విద్య, వైద్యం అందించడం ప్రభుత్వాల బాధ్యత. ఈ రెండింటినీ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తేనే పేదలకు నిజమైన ప్రయోజనం చేకూరు­తుంది..’ ఈ సిద్ధాంతాన్ని మన­స్ఫూ­ర్తిగా విశ్వసిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

మనిషి ప్రాణం విలువ తెలిసిన మనసున్న పాలకుడిగా ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా చర్యలు చేపడుతున్నారు. గత సర్కారు హయాంలో నరకానికి నకళ్లుగా మారిన ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలను మార్చడానికి రూ.16 వేల కోట్లకుపైగా నిధులతో నాడు–నేడు కార్యక్రమాన్ని చేపట్టారు.

చదవండి: Nursing Colleges: నర్సింగ్‌ కళాశాలల ఏర్పాటుకు వినతీ పత్రం

ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా పేదలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వ వైద్యులను రప్పించి మారుమూల ప్రాంతాలవారికీ వ్యయ ప్రయాసలు లేకుండా ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ చికిత్స పరిమితిని ఏకంగా రూ.25 లక్షలకు పెంచి ప్రతి ఒక్కరికీ సంపూర్ణ వైద్య భరోసా కల్పిస్తున్నారు. 

ఇక అందిన ద్రాక్ష..

అందని ద్రాక్ష లాంటి వైద్య విద్యను పేద, మధ్య తరగతి విద్యార్థులకు చేరువచేస్తూ రూ.8,480 కోట్లతో రాష్ట్రంలో ఏకంగా 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారు. వీటి ద్వారా అన్ని ప్రాంతాల ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేస్తున్నారు. ఇప్పటికే 5 కొత్త మెడికల్‌ కళాశాలలను ప్రారంభించగా వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఐదు ఆరంభం కానున్నాయి. మిగిలిన 7 కాలేజీలను 2025–26లో ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. కొత్త మెడికల్‌ కళాశాలల ద్వారా 2,550 ఎంబీబీఎస్‌ సీట్లను విద్యార్థులకు అదనంగా అందుబాటులోకి తెస్తున్నారు.

చదవండి: 424 Jobs: వైద్యశాఖలో ఉద్యోగాల పండుగ.. దరఖాస్తులకు చివ‌రి తేదీ ఇదే..

ఈ విద్యా సంవత్సరం (2023–24) నుంచి విజయనగరం, ఏలూరు, రాజ­మహేంద్రవరం, మచిలీ­పట్నం, నంద్యాల వైద్య కళాశాలలను ప్రారంభించి ఒకే ఏడాది 750 ఎంబీబీఎస్‌ సీట్లలో అడ్మిషన్లు చేపట్టి రి­కార్డు సృష్టించారు. రాష్ట్రంలో మొదటి వైద్య కళా­శాల ఆంధ్రా మెడికల్‌ కాలేజీ 1923లో ఏర్పాటైంది. అప్పటి నుంచి 2019 వరకు 96 ఏళ్లలో ప్రభుత్వ రంగంలో ఏర్పాటైన మెడికల్‌ కాలేజీలు 11 మాత్రమే. వచ్చే విద్యా సంవత్సరంలో మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని మెడికల్‌ కాలేజీలను ప్రారం­భించనున్నారు. ఒకేసారి ఇన్ని వైద్య కళాశాలలను అందుబాటులోకి తేవడం ప్రజారోగ్యం పట్ల సీఎం జగన్‌ నిబద్ధత, దార్శనికతకు నిదర్శనం.

రెండు రకాల లాభాలు

కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతో రాష్ట్ర విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెరగడంతోపాటు పరిసర ప్రాంతాల్లోని పేద ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. ఇప్పటివరకు జిల్లా, ఏరియా ఆస్పత్రులున్న చోట బోధనాస్పత్రులు అందుబాటులోకి వస్తున్నాయి. వీటి ద్వారా నిపుణులైన వైద్యుల సేవలు పేద ప్రజలకు అందనున్నాయి. ఒక ఎంబీబీఎస్‌ బ్యాచ్‌ పూర్తై బయటకు వచ్చే సమయానికి ప్రతి కొత్త వైద్య కళాశాలలో 600 పడకల సామర్థ్యంతో ఆస్పత్రులు కార్యక­లా­పాలు నిర్వహిస్తుంటాయి.

గత ఏడాది ప్రారంభించిన ఐదు వైద్య కళా­శా­ల­లకు అనుసంధానంగా నడిచే బోధనాస్ప­త్రుల్లో కిడ్నీ, న్యూరో, కార్డి­యా­లజీ, క్యాన్సర్‌ లాంటి సూపర్‌ స్పె­షా­లిటీ విభాగా­లను ప్రభుత్వం మం­జూరు చేసింది. దీంతో అధునాతన వైద్య పరికరాలు, ల్యా­బ్‌లు ఏర్పాటు కావడంతో వైద్యం, రోగనిర్ధారణ సేవల్లో నాణ్యత పెరుగుతుంది. రేడియాలజీ, పాథా­లజీ, మైక్రోబయాలజీ విభాగాల ఏర్పాటుతో వివిధ రకాల వ్యాధు­లు, జబ్బులపై పరిశోధన జరు­గు­తుంది.

ఎంబీబీఎస్‌ విద్యార్థులు నాలు­గేళ్ల అనంతరం హౌస్‌ సర్జన్‌లుగా అందుబాటులోకి వస్తారు. వీరు 24/7 ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండటంతో రోగులకు నిరంతరాయంగా సేవలు అందుతాయి. అంతేకాకుండా ఐదేళ్ల తర్వాత పీజీ సీట్లు కూడా వస్తాయి. వీటి ద్వారా స్పెషలిస్ట్‌ వైద్యు­ల సంఖ్య పెరుగుతుంది. జిల్లాలోనే పెద్దాస్పత్రులు సమకూరడంతో ప్రజలు వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన శ్రమ, ఖర్చు ఉండదు.

నాడు ప్రైవేట్‌కు పట్టం..

నాకంటే విజనరీ ఎవరున్నారు? అంటూ తరచూ బుకాయించే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సుదీర్ఘ కాలం అధికారంలో కొనసాగినా కూడా విద్య, వైద్య రంగాల అభివృద్ధికి చేసిన కృషి శూన్యం. 2014 నుంచి నాలుగేళ్ల పాటు కేంద్రంలో అధికారాన్ని పంచుకుని కూడా ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాలనూ తేలేదు. కనీసం ఆ ప్రయత్నమూ చేయలేదు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ ప్రైవేట్‌ వైద్య కళాశాలలను ప్రోత్సహించారు. ‘ప్రభుత్వ రంగంలో కళాశాల ఏర్పాటు చేయాలంటే రూ.350 కోట్లు అవుతుంది. ఏటా రూ.30 కోట్లు ఖర్చు చేయాలి. మేం ప్రైవేట్‌ వైద్య కళాశాలల ఏర్పాటును ప్రోత్సహిస్తాం’ అని చంద్రబాబు సర్కారులో వైద్య శాఖ మంత్రిగా పనిచేసిన కామినేని శ్రీనివాసరావు సాక్షాత్తు అసెంబ్లీలో ప్రకటించారు. 

ఉద్యోగాలు.. ఉపాధి

కొత్త మెడికల్‌ కాలేజీల రాకతో విద్య, వైద్య సదుపాయాలు మెరుగుపడటంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా ప్రతి చోటా అత్యాధునిక బోధనాస్పత్రి, వైద్య కళాశాలలను నిర్మిస్తున్నారు. వైద్యులు, సిబ్బంది పోస్టులను కొత్తగా సృష్టించి భర్తీ చేయడం ద్వారా ఉద్యోగాలు లభిస్తాయి. నిర్మాణం, ఇతర రంగాలపై ఆధారపడిన వారికి ఉపాధి సమకూరుతుంది. 

విప్లవాత్మక నిర్ణయం
17 కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుతో ప్రభు­త్వ రంగ కళాశా­లలు రెట్టింపవుతాయి. ఇది ప్రజారోగ్య పరి­ర­క్షణలో విప్లవాత్మక నిర్ణయం. 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయాలు లేవు. గిరిజన జనాభా అత్యధికంగా ఉండే పాడేరు ప్రాంతంలో సీఎం జగన్‌ కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశా­లను అందుబాటులోకి తెస్తుండటం హర్షించదగ్గ విషయం.

– డాక్టర్‌ బాబ్జీ, వీసీ డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం

పక్క జిల్లాలోనే సీటు..
మాది శ్రీకాకుళం. పొరుగు జిల్లాలోని వైద్య కళాశాలలో సీటు రావ­డం సంతోషంగా ఉంది. ప్రభుత్వం కొత్తగా ఈ ఏడాది ఐదు మెడికల్‌ కాలేజీలను  అందు­బాటులోకి తేవడంతో ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య పెరిగింది. నాకు పక్క జిల్లాలోనే సీటు వచ్చింది. మా కాలేజీలో అనుభవజ్ఞులైన ఫ్యా­క­ల్టీ ఉన్నారు.  కార్పొరేట్‌ కళాశాలలకంటే మెరు­గైన సౌకర్యాలను ప్రభుత్వం కల్పించింది.        

– బడగాల మనస్వని, వైద్య విద్యార్థిని, ప్రభుత్వ వైద్య కళాశాల, విజయనగరం 

సొంతూరిలోనే మెడిసిన్‌..
మాది నంద్యాల. సీఎం జగన్‌ నంద్యాలలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయడంతో కౌన్సెలింగ్‌లో మొదటి ప్రయారిటీ ఇచ్చా. అక్కడే సీటు వచ్చింది. ఉంటున్న ఊళ్లోనే ఎంబీబీఎస్‌ చదవడం నా అదృష్టం. కొత్త వైద్య కళాశాలల ద్వారా ఎంబీబీఎస్‌ సీట్లు పెరగ­డంతో తాముంటున్న చోట వైద్య విద్య చదవా­లన్న నా­లాంటి విద్యార్థుల కలలను ప్రభుత్వం నెరవేరుస్తోంది.

– వినయ్‌ కుమార్‌రెడ్డి, వైద్య విద్యార్థి, నంద్యాల వైద్య కళాశాల 

Published date : 05 Feb 2024 03:10PM

Photo Stories