Skip to main content

High Court: యాజమాన్య కోటాను కన్వీనర్‌ భర్తీ చేయడం ఏంటి?

రాష్ట్రంలోని ప్రైవేట్‌ అన్ ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల్లో యాజమాన్యాలకు కేటాయించిన 30 శాతం సీట్లను కూడా కన్వీనరే భర్తీ చేసేందుకు అవకాశం కల్పిస్తున్న జీవో 55లోని రూల్‌ 3 (4)(బీ)(సీ), రూల్‌ 3(5)లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిసెంబర్‌ 3న రద్దు చేసింది.
High Court
యాజమాన్య కోటాను కన్వీనర్‌ భర్తీ చేయడం ఏంటి?

యాజమాన్య కోటా సీట్లు కన్వీనరే భర్తీ చేస్తారనడంలో ఏమాత్రం హేతుబద్ధత లేదని తెలిపింది. ఇది ఏకపక్షం, అసంబద్ధమని స్పష్టం చేసింది. ఒకవైపు 70 శాతం సీట్లను కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేస్తూ.. మిగిలిన 30 శాతం యాజమాన్య సీట్లను కూడా కన్వీనరే భర్తీ చేస్తారనడం చట్టవిరుద్ధమంది. ఇది యాజమాన్య కోటాను కన్వీనర్‌ కోటాగా మార్చడమేనంది. అంతేకాకుండా జీవో 55లోని రూల్‌ 3 (4) (హెచ్‌) కన్వీనర్, యాజమాన్య కోటాల కింద ప్రవేశాలు పొందే విద్యార్థుల మధ్య వివక్ష చూపుతోందని పేర్కొంది. యాజమాన్య కోటా కింద చేరిన విద్యార్థులు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందే అవకాశాన్ని కోల్పోతారంది. ఇలాంటి వివక్ష అహేతుకమంది. అందువల్ల రూల్‌ 3 (4) (హెచ్‌)ను సైతం రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు 30 శాతం సీట్లను యాజమాన్య కోటా కింద భర్తీ చేసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసుకోవచ్చునంది. నిబంధనలకు, ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ నిర్ణయించిన ఫీజులకు అనుగుణంగా విద్యార్థులను చేర్చుకోవచ్చునంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 55ను సవాల్‌ చేస్తూ రాయలసీమ డిగ్రీ కాలేజీల సంఘం రిట్‌ పిటిషన్ దాఖలు చేసింది. ఇదే అంశంపై మాల మహానాడు ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుర్రం రామారావు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు.

చదవండి: 

న్యాయశాస్త్రం చదివిన విద్యార్థులకు విపరీతమైన డిమాండ్‌

బాలిక లేఖతో స్పందించిన సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ.. సజ్జనార్‌కు లేఖ

MBBS: ఎంబీబీఎస్‌ పరీక్ష పేపర్‌పై వివరణ ఇవ్వండి

Published date : 04 Dec 2021 11:55AM

Photo Stories