సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీ–ఈ కేటగిరీ కింద వెనకబడిన ముస్లింలకు విద్య, ఉద్యోగ రంగాల్లో అమలు చేస్తున్న 4 శాతం రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులేదని, ఈ రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగుతాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ముస్లింల 4% కోటాలో మార్పు లేదు
ముస్లిం రిజర్వేషన్లను 4 శాతం నుంచి 3 శాతానికి తగ్గించినట్లు కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయడాన్ని ఖండించింది. ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్–1996కి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసిందని, ముస్లిం రిజర్వేషన్ల విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని రాష్ట్ర సమాచార, ప్రజాసంబంధాల శాఖ నవంబర్ 20న వివరణ ఇచ్చింది. స్టేట్ అండ్ సబార్డినేట్ సర్విసెస్ రూల్స్ లోని 100 రోస్టర్ పాయింట్లలో 4 శాతానికి సమానంగా బీసీ–ఈ కోటాకు 19, 44, 69, 94 పాయింట్లను కేటాయించినట్లు పేర్కొంది.