సాక్షి, హైదరాబాద్: తొలిసారిగా ‘గ్లోబల్ నేచర్ చాలెంజ్’కు హైదరాబాద్ నగరం సిద్ధమైంది. ఏప్రిల్ 28 నుంచి మే 1 వరకు మహానగరంలోని జీవవైవిధ్యాన్ని స్వచ్ఛందంగా నమోదు చేసే ప్రక్రియ జరగనుంది.
'Global Nature Challenge'కు హైదరాబాద్
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 46 దేశాల్లోని 485 నగరాల్లో ఈ నేచర్ చాలెంజ్ను నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా చూస్తే 30కి పైగా నగరాలు ఇందులో పాల్గొంటున్నాయి. కృత్రిమమేథ (ఏఐ), జీపీఎస్ ఆధారిత ‘ఐ’నాచురలిస్ట్ యాప్ ద్వారా నగర పౌరులు తమ చుట్టూ ఉన్న ప్రకృతి, పరిసరాలు, జంతువులు, పక్షులు, చెట్లు, తదితర రూపాల్లోని జీవవైవిధ్యాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. నాలుగురోజుల వ్యవధిలో ఏ నగరంలోనైతే అత్యధికంగా ప్రకృతిని ప్రతిబింబించే ఛాయాచిత్రాలు నమోదు చేస్తారో.. ఆ నగరం ఈ ఫ్రెండ్లీ పోటీలో నెగ్గుతుందని డబ్ల్యూడబ్ల్యూఎఫ్–ఇండియా స్టేట్ డైరెక్టర్ ఫరీదా తంపాల్ తెలిపారు.