Skip to main content

ఆ మాటను నిజం చేసుకోవడానికే...ఐఏఎస్ సాధించా: నీతూ ప్రసాద్, కలెక్టర్

చదువు ఒక ఒడ్డున... ఉద్యోగం ఇంకో ఒడ్డున...యువతకు నిరుద్యోగమన్న భవసాగరాన్ని దాటించే ప్రయత్నమే నీతూ ప్రసాద్ ఐఏఎస్ కట్టిన వారధి. కలెక్టర్‌గా బాధ్యతలను, విధులను నెరవేరిస్తే మంచి కలెక్టర్ అనిపించుకునేవారు. అంతకుమించి చేస్తున్నారు కాబట్టే మంచి మనిషి అనిపించుకుంటున్నారు. కరీంనగర్ యువత ప్రతిరోజూ ఆమెను మనస్ఫూర్తిగా థాంక్యూ మేడమ్ అని తలచుకుంటున్నారు.
ఆ పరిస్థితుల్లో...
ఐఏఎస్ కావాలనేది నీతూ చిన్నప్పటి కల. తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీర్, ఐటీ ప్రొఫెషనల్స్‌కు ఎంత క్రేజో బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఐఏఎస్‌కు అంత మోజు. స్కూల్లో ఎవరైనా బాగా చదివితే కలెక్టర్ అవుతావని ప్రోత్సహిస్తారు. అలాగే పాఠశాల విద్య నుంచే చాలా చురుకుగా ఉన్న నీతూను టీచర్లు, బంధువులు కలెక్టర్ అవుతావు అనేవాళ్లట. ఆ మాటను నిజం చేసుకోవడానికి కష్టపడుతూ వచ్చింది. టెన్త్ వరకు ఒక ఎత్తయితే ఇంటర్ నుంచి మరో ఎత్తు. ఇంటర్‌లో ఉన్నప్పుడే ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. నీతూను మైగ్రేన్ తీవ్రంగా బాధించింది. ఒక దశలో పుస్తకం తెరవడం కూడా దుర్భరమై ఐఏఎస్ అనే తన లక్ష్యాన్ని చేరుకోలేనేమోనని కలత చెందింది.ఆ పరిస్థితుల్లో మహాభారతంలోని అర్జునుడు స్ఫూర్తిగా నిలిస్తే తండ్రి పోత్సాహాన్నిచ్చాడు. అలా 2001లో సివిల్స్‌కి ఎంపికై శిక్షణ పూర్తిచేసుకొని భద్రాచలం సబ్‌కలెక్టర్‌గా తొలి పోస్టింగ్‌తో తెలుగురాష్ట్రాల్లో బాధ్యతలు చేపట్టింది. ఏ పోస్టులో ఉన్నా ఆ పోస్టులో ఒదిగిపోయి అంకితభావంతో పనిచేయడం నేర్చుకుంది. ఏ పోస్ట్‌లో ఉన్నా దానికి అనుగుణంగా నైపుణ్యాన్ని పెంపొందించుకోవడమే ఆమెకు ప్రధానం.

ఇది ప్రస్తుతం ఎందరో నిరుద్యోగులకు...
సాధారణంగా ఏ ఐఏఎస్ అయినా తొలుత జిల్లా కలెక్టర్లుగా చేసి ఆ తర్వాత వివిధ శాఖల్లోకి వెళ్లాలనుకుంటారు. కానీ నీతూప్రసాద్ మాత్రం అందుకు భిన్నం. ఆమె మొదట వివిధ శాఖల్లో పనిచేశాక కలెక్టర్‌గా వెళ్లింది. ‘అలా ఆయా శాఖల్లో పని చేయడం వల్ల ఆ పాలనా అనుభవం కలెక్టర్ అయ్యాక చాలా హెల్ప్ అయింది’ అంటారామె. ఆ అనుభవం ఆమెకు ఒకటి అర్థం చేయించింది. అదేమిటంటే చాలా మందికి ప్రభుత్వ ఉపాధి అందటం లేదు. ఉద్యోగికీ ఉపాధికీ మధ్య చాలా అడ్డంకులున్నాయి. వాటిని తీసి వేసి నేరుగా ఉపాధి అందించాలి అని అనుకున్నారామె. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యత తీసుకోగానే అలా వికాస్ సొసైటీకి నాంది పలికారు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా వారధి అనే సొసైటీకి ప్రాణం పోశారు. ఇది ప్రస్తుతం ఎందరో నిరుద్యోగులకు ఉపాధి మార్గాలను చూపుతోంది. ఈ రెండు సొసైటీలు ఆమె బ్రెయిన్ చిల్డ్రన్!

సుమారు 25 వేల మంది నిరుద్యోగులు వారధిలో..
ఔట్‌సోర్సింగ్‌లో ప్రైవేట్ ఏజెన్సీలకు చెక్‌పెట్టాలనే సదుద్దేశంతో కరీంనగర్ జిల్లాలో ‘వారధి’ అనే సొసైటీని ప్రారంభించింది నీతూ ప్రసాద్. ఇది ఆమె వ్యక్తిగత శ్రద్ధకు ప్రతిరూపం. తొమ్మిదినెలల కిందట మొదలైన వారధి దాదాపు 4 వేల మందికి ఉద్యోగాలు కల్పించింది. మరోమూడు వేల మంది యువతకు వివిధ ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణనిచ్చింది. ఇప్పటి వరకు సుమారు 25 వేల మంది నిరుద్యోగులు వారధిలో దరఖాస్తు చేసుకున్నారంటే ఈ సొసైటీ పట్ల యువతకున్న నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రతియేటా ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ నిర్వహణ కోసం ప్రభుత్వం విడుదల చేసే 3 శాతం కమీషన్ సొమ్ముతోనే వారధి సొసైటీలోని ఉద్యోగులకు జీతాలు, శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన కల్పించే ఉద్యోగాలన్నింటినీ వారధి ద్వారానే చేపడుతుండడంతో అర్హులైన వారికే ఉద్యోగాలు దక్కుతున్నాయి. ఈ ఏడాది సెస్టెంబర్ 10న వారధి ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియంలో జాబ్‌మేళాలో 30 కంపెనీలు 2801 మంది నిరుద్యోగులకు వివిధ ఉద్యోగాలను కల్పించాయి. గ్రూప్-1, 2, 3తోపాటు బ్యాంకింగ్ రంగంలోని ఉద్యోగాల కోసం యువతకు ఈ సొసైటీ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. ఇప్పటికే సుమారు రెండువేల మంది ఈ సొసైటీ ద్వారా ఆయా ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ పొందారు. వారధి సొసైటీ వద్ద దరఖాస్తు చేసుకునే నిరుద్యోగుల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ మొదలు ఐటీఐ, పీజీ కోర్సులు, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు చేసినవారూ ఉన్నారు. వీరి అర్హతలకు తగినట్లుగా ప్రభుత్వ, ప్రైవేటు కొలువులు సాధించేందుకు వీలుగా నిష్ణాతులైన ఫ్యాకల్టీలచే ఉచిత బోధనను అందిస్తున్నారు. మెట్రో నగరాల్లో పేరుగాంచిన ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు దీటుగా వారధి ఉండడం విశేషమే కాదు నీతూప్రసాద్ కృషికి తార్కాణం కూడా!

ఎన్ని విపత్తులు ఎదురైనా...
కలెక్టర్ పోస్టు అనేది చాలా బాధ్యాతాయుతమైంది. ఎన్ని విపత్తులు ఎదురైనా అధిగమించాల్సి ఉంటుంది. ప్రభుత్వ పథకాలను మరింత మెరుగ్గా అమలు చేయడమే నా ప్రధాన బాధ్యత. ఆరోగ్యం, విద్య అనేవి ఏ కలెక్టర్‌కైనా పునాదులే. ఈ రెండింటినీ వృత్తికి అతీతంగా కూడా నిర్వహించవచ్చు.
Published date : 15 Apr 2021 05:46PM

Photo Stories