Skip to main content

పర్యావరణ పరిరక్షకుడు.. ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్

ఆధునిక యుగంలో పర్యావరణం ప్రమాదంలో పడింది. జీవజాలం కనుమరుగవుతోంది. ఫలితంగా విపత్తులు పంజా విసురుతున్నాయి. పర్యావరణా న్ని పరిరక్షించుకోవడంపై ప్రపంచంలో అన్ని దేశాలు దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్లకు డిమాండ్ పెరుగుతోంది. కాలుష్య కారక పరిశ్రమల్లో వీరిని తప్పనిసరిగా నియమించాలనే నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీంతో ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విసృ్తతమవుతున్నాయి.

కాలుష్యాన్ని తగ్గించాలి
పర్యావరణ ఇంజనీరింగ్ కోర్సులు చేసినవారికి ప్రస్తుతం దేశ విదేశాల్లో అవకాశాలు లభిస్తున్నాయి. కాలుష్యం వెదజల్లే కర్మాగారాల్లో వీరిని నియమించుకుంటున్నారు. కాలుష్య నియంత్రణ మండలిలో ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్లకు ఉద్యోగాలు దక్కుతున్నాయి. కాలుష్యాన్ని గరిష్టస్థాయికి తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం పర్యావరణ ఇంజనీర్ల ప్రధాన బాధ్యత. ఇటీవలి కాలంలో వేస్ట్ మేనేజ్‌మెంట్ రంగం అభివృద్ధి చెందుతోంది. ఇందులో పర్యావరణ ఇంజనీర్లకు భారీగా అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత పెరుగుతుండడంతో ఈ రంగంలో ఇంజనీర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది.

స్కిల్స్ పెంచుకోవాలి
ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్లకు ప్రకృతిపై మమకారం ఉండాలి. దాన్ని కాపాడుకోవాలనే తపన, వృత్తిపట్ల అంకితభావం తప్పనిసరి. పర్యావరణ చట్టాలు, నిబంధనలపై అవగాహన పెంచుకోవాలి. పనివేళలతో నిమిత్తం లేకుండా క్షేత్రస్థాయిలో ఎక్కువ సేపు పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అవసరాన్ని బట్టి దూర ప్రాంతాలకు ప్రయాణించేందుకు సిద్ధంగా ఉండాలి. టైమ్ మేనేజ్‌మెంట్, టీమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ పెంచుకోవాలి. పర్యావరణ ఇంజనీర్లకు ప్రారంభంలో తక్కువ వేతనాలున్నా.. నైపుణ్యాలను పెంచుకుంటే అధిక వేతనం అందుకోవచ్చు.

అర్హతలు: మన దేశంలో ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్‌లో బీటెక్, ఎంటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ పూర్తయిన తర్వాత ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి, బీటెక్‌లో చేరొచ్చు. అలాగే ప్రవేశ పరీక్ష లేకుండానే బీఎస్సీలో ప్రవేశం పొందొచ్చు. ఇందులో మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తిచేస్తే అధిక అవకాశాలు లభిస్తాయి.

వేతనాలు: పర్యావరణ ఇంజనీర్లకు ప్రారంభంలో నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వేతనం అందుతుంది. తర్వాత నైపుణ్యాలు, పనితీరును బట్టి నెలకు రూ.25 వేల నుంచి రూ.40 వేల వేతనం పొందొచ్చు. ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థల్లో ఇంకా అధిక వేతనాలుంటాయి.

ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు
  • ఉస్మానియా యూనివర్సిటీ
    వెబ్‌సైట్:
    www.osmania.ac.in
  • జేఎన్‌టీయూ-హైదరాబాద్
    వెబ్‌సైట్:
    www.jntuhceh.ac.in
  • ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్-ధన్‌బాద్
    వెబ్‌సైట్:
    www.ismdhanbad.ac.in
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
    వెబ్‌సైట్:
    www.jee.iitd.ac.in
  • నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
    వెబ్‌సైట్:
    www.neeri.res.in
పర్యావరణ కోర్సులతో అవకాశాలు పుష్కలం!
‘‘పారిశ్రామికీకరణ, పట్టణీకరణల కారణంగా అభివృద్ధితోపాటు పర్యావరణ కాలుష్యం కూడా విపరీతంగా పెరుగుతోంది. దీని పరిష్కారానికి పర్యావరణ నిపుణుల అవసరం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో పర్యావరణ కోర్సులు పూర్తి చేసిన వారికి విస్తృత అవకాశాలు అందుబాటులో ఉంటున్నాయి. యునెస్కో, యూఎన్ ఈపీలతోపాటు దేశంలోనూ పలు సంస్థలు పర్యావరణ కోర్సులు చదువుతున్న వారికి ఫెలోషిప్‌లు అందించి ప్రోత్సహిస్తున్నాయి. ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్లకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విస్తృత అవకాశాలున్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతోపాటు అర్బన్ ప్లానింగ్, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్, వాటర్ రిసోర్సెస్ తదితర ప్రభుత్వ విభాగాల్లోనూ పర్యావరణ నిపుణులకు ఉద్యోగాలు దక్కుతున్నాయి. ప్రైవేటు రంగంలో టెక్స్‌టైల్ మిల్స్, రిఫైనరీలు, ఫెర్టిలైజర్ ప్లాంట్స్, వ్యర్థాల నిర్వహణ ప్లాంట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ లు, మైనింగ్ కంపెనీలు వీరికి ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. ఈ విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేస్తే శాస్త్రవేత్తలుగా, ప్రొఫెసర్లుగా రాణించొచ్చు’’
- డా. టి.విజయలక్ష్మీ
అసిస్టెంట్ ప్రొఫెసర్, సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్, జేఎన్‌టీయూ-హైదరాబాద్.
Published date : 14 Aug 2014 12:08PM

Photo Stories