Skip to main content

కెరీర్‌ గైడెన్స్.. ఫైనాన్షియల్ కోర్సెస్

ఆర్థిక రంగం.. శరవేగంగా విస్తరిస్తున్న విభాగం. దేశాన్ని.. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కషి చేస్తున్న రంగం. ఈ క్రమంలో రోజుకో సంస్థ వెలుస్తోంది. రోజుకో సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలకు, సంస్థల తాము అందించే సేవలకు అనుగుణంగా మానవ వనరులను తీర్చిదిద్దేందుకు శిక్షణనిస్తున్నాయి.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, సెబీ, ఐఎఫ్‌బీఐ తదితర ఆర్థిక నియంత్రణ సంస్థలు ఇందుకోసం పలు కోర్సులను అందిస్తున్నాయి. వాటి వివరాలపై ఫోకస్..

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్
ఎంబీఏ - ఫైనాన్షియల్ మార్కెట్స్
ఫైనాన్షియల్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్ విధి విధానాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ) కూడా పలు అకడెమిక్ కోర్సులను నిర్వహిస్తోంది. వాటిలో ప్రధానమైంది.. రెండేళ్ల వ్యవధి గల ఎంబీఏ ఫైనాన్షియల్ మార్కెట్స్. ఈ కోర్సును ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది.

అర్హత: 50 శాతం మార్కులతో డిగ్రీ (10+2+3 విధానంలో).

ఎంపిక: బీఎస్‌ఈ ఇన్‌స్టిట్యూట్ లిమిటెడ్ నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్ స్కోర్ లేదా క్యాట్ స్కోర్ ద్వారా షార్ట్‌లిస్ట్ చేసిన (విదేశీ విద్యార్థులైతే జీమ్యాట్ స్కోర్ ఆధారంగా) అభ్యర్థులకు నిర్వహించే గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.

నోటిఫికేషన్: ఈ కోర్సుకు సాధారణంగా డిసెంబర్/జనవరి నెలల్లో నోటిఫికేషన్ వెలువడుతుంది. దానికి అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలి.

పీజీ ప్రోగ్రాం ఇన్ బిజినెస్ జర్నలిజం:
ఆర్థిక రంగంపై ఆసక్తి, జర్నలిజం వృత్తిలో స్థిరపడాలనుకునే వారికి సరైన వేదిక పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ బిజినెస్ జర్నలిజం. ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఫైనాన్షియల్ ఇండస్ట్రీ న్యూస్ కవరేజ్, ఎకనామిక్ ట్రెండ్స్ అండ్ అనాలిసిస్ రిపోర్టింగ్ తదితర అంశాలపై శిక్షణనిచ్చే ఏడాది వ్యవధి గల కోర్సు ఇది.

అర్హత
: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత

ఎంపిక
: రాత పరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా.

అవకాశాలు:
ఈ కోర్సు పూర్తి చేసిన వారికి మీడియా రంగంలో బిజినెస్ దిన పత్రికలు, మ్యాగజీన్లు, బిజినెస్ టెలివిజన్ వంటి వాటిలో బిజినెస్ రిపోర్టర్లు, ఎడిటర్లు, ప్రొడ్యూసర్స్ ఉద్యోగాలు లభిస్తాయి.

పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్:
రోజురోజుకి విస్తరిస్తున్న బ్యాంకింగ్ రంగం, అందుకు అవసరమైన ప్రత్యేక నైపుణ్యాలు (స్పెషలిస్ట్ క్వాలిటీస్) గల మానవ వనరుల కొరతను తీర్చే ఉద్దేశంతో రూపకల్పన జరిగిన కోర్సు ఇది. ఏడాది వ్యవధిలో మూడు ట్రెమిస్టర్ల విధానంలో శిక్షణ కొనసాగుతుంది.

ఎంపిక:
ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇదే కాకుండా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం, అప్పటికే ఆయా రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ పదోన్నతులు పొందాలనుకునే వారికి ఉపకరించే విధంగా మరికొన్ని కోర్సులను కూడా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ అందిస్తోంది. వివరాలు..
  • గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ప్రోగ్రాం
  • బేసిక్ కోర్స్ ఇన్ స్టాక్ మార్కెట్
  • అడ్వాన్స్‌డ్ ప్రోగ్రాం ఆన్ స్టాక్ మార్కెట్
  • ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ అనాలిసిస్
  • సర్టిఫికెట్ ప్రోగ్రాం ఆన్ కేపిటల్ మార్కెట్
  • సర్టిఫికెట్ ప్రోగ్రాం ఆన్ కమోడిటీ అండ్ కరెన్సీ మార్కెట్స్.
వెబ్‌సైట్: www.bsebti.com, www.bseindia.com

సెబీ
సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)... స్టాక్ మార్కెట్ లావాదేవీలు, సెక్యూరిటీ చట్టాలకు సంబంధించి అవగాహన కోసం పలు కోర్సులను నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ అనే ఇన్‌స్టిట్యూట్‌ను నెలకొల్పింది. ఈ ఇన్‌స్టిట్యూట్ ప్రస్తుతం మూడు రకాల కోర్సులను అందిస్తోంది. అవి..

సర్టిఫికెట్ ఇన్ సెక్యూరిటీస్ ‘లా’స్: ఈ కోర్సు కాల వ్యవధి ఆరు నెలలు. ముఖ్యంగా ఇప్పటికే ఈ రంగంలో అనుభవజ్ఞులు, ఎంబీఏ, ఎంకాం, సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ వంటి కామర్స్ నేపథ్యం ఉన్న వారికి ఇది అనువైన కోర్సు. ఈ కోర్సు ప్రవేశ ప్రక్రియ ప్రతి ఏటా అక్టోబర్/ నవంబర్‌లలో మొదలౌతుంది.

ఎంపిక: అకడెమిక్ రికార్డ్ 20 శాతం వెయిటేజీ ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. దీనికి కల్పించే వెయిటేజీ 60 శాతం. తర్వాత నిర్వహించే ఎస్సే రైటింగ్ (వెయిటేజీ 20)కు షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆయా వెయిటేజీలను గణించి తుది జాబితా ప్రకటిస్తారు.

సర్టిఫికెట్ ఇన్ ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్:
ఇది కేవలం వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఉద్దేశించిన కోర్సు. మొత్తం మూడు వందల గంటల వ్యవధిలో కోర్సు పూర్తి చేస్తారు.

అర్హత:
గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ.

ఎంపిక:
మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది. ఈ కోర్సుకు నోటిఫికేషన్ మార్చి/ఏప్రిల్ నెలల్లో వెలువడుతుంది.

పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ సెక్యూరిటీస్ మార్కెట్:
వ్యవధి:
ఏడాది
ఎంపిక: ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే ఆన్‌లైన్ టెస్ట్ ఆధారంగా. మన రాష్ట్రంలో సికింద్రాబాద్‌లో ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆన్‌లైన్ టెస్ట్‌లో నిర్దేశిత కటాఫ్‌లో నిలిచిన వారికి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ రెండిటిలో సాధించిన మార్కుల ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు.
వెబ్‌సైట్: www.nism.ac.in

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్
న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ సంస్థ ఆయా ఆర్థిక సంస్థల అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను తీర్చిదిద్దే క్రమంలో ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ ప్రోగ్రాంను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్, షార్ట్ టర్మ్ కోర్సులను అందిస్తోంది. వివరాలు..

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్స్ సర్టిఫికేషన్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్:
ఈ సర్టిఫికేషన్‌ను ఆన్‌లైన్ టెస్టింగ్ విధానంలో నిర్వహిస్తోంది. వీటిలో ఎన్‌సీఎఫ్‌ఎం, ఎన్‌ఎస్‌ఈ సర్టిఫైడ్ మార్కెట్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్‌ను నిర్వహిస్తోంది. ఎన్‌సీఎఫ్‌ఎంలో మ్యూచువల్ ఫండ్స్, కరెన్సీ డెరివేటివ్స్, ఈక్విటీ డెరివేటివ్స్, ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్స్, కమర్షియల్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా, సెక్యూరిటీస్ మార్కెట్, తదితర 25 విభాగాల్లో బేసిక్, అడ్వాన్స్‌డ్ మాడ్యూల్స్‌ను అందిస్తోంది.

ఎన్‌సీఎంపీ (ఎన్‌ఎస్‌ఈ సర్టిఫైడ్ మార్కెట్ ప్రొఫెషనల్):
ఎన్‌సీఎఫ్‌ఎంలో పేర్కొన్న 25 మాడ్యూళ్లలో ఉత్తీర్ణులైన వారికి ఎన్‌సీఎంపీ సర్టిఫికేషన్స్ ఇస్తారు. ఇది అయిదు అంచెల్లో (లెవల్ 1, 2, 3, 4, 5) ఉంటుంది. ఎన్‌సీఎఫ్‌ఎంలో 3 నుంచి 4 మాడ్యూల్స్ పూర్తి చేస్తే ఎన్‌సీఎంపీ లెవల్ 1; 5 నుంచి 6 మాడ్యూల్స్ పూర్తి చేస్తే లెవల్ 2; 7 నుంచి 8 మాడ్యూల్స్ పూర్తి చేస్తే లెవల్ 3; 9 నుంచి 10 మాడ్యూల్స్ పూర్తి చేస్తే లెవల్ 4 ; 11 లేదా ఆపై సంఖ్యలో మాడ్యూల్స్ పూర్తి చేస్తే లెవల్ 5 సర్టిఫికేషన్ లభిస్తుంది.

అర్హత: ఎన్‌సీఎఫ్‌ఎం ప్రోగ్రాంకు ఎలాంటి ప్రత్యేకమైన విద్యార్హతలు అవసరం లేదు. గణించడం, ఇంగ్లిష్‌లో మాట్లాడగలిగిన వారంతా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఎన్‌ఎస్‌ఈ వెబ్‌సైట్‌లోని ఎడ్యుకేషన్ ప్రోగ్రాం లింక్‌లో ఉండే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నిర్దేశిత ఫీజు మొత్తాన్ని చెల్లిస్తే పేరు నమోదు అవుతుంది. పేరు నమోదై రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయించిన 180 రోజుల్లోపు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఈ పరీక్ష నిర్వహిస్తారు.

ప్రొఫెషనల్ కోర్సెస్:
స్టాక్ మార్కెట్ కార్యకలాపాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో.. ప్రొఫెషనల్ కోర్సులను నిర్వహిస్తోంది. అవి.. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్; పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్. ఇదే కోర్సును పార్ట్‌టైం విధానంలో వీకెండ్ తరహా బోధనలో సాగిస్తోంది.
పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్: ఏడాది వ్యవధిలో సాగే ఈ కోర్సును గోఖలే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ (డీమ్డ్ యూనివర్సిటీ)తో ఒప్పందం ద్వారా ఎన్‌ఎస్‌ఈ నిర్వహిస్తుంది.

అర్హత:
50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక
: దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి మెరిట్ జాబితాలో నిలిచిన వారిని ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

అవకాశాలు:
కోర్సు పూర్తి చేసిన వారికి ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ వెల్త్ మేనేజర్స్, ఫండ్/పోర్ట్‌ఫోలియో/హెడ్జ్ ఫండ్ మేనేజర్స్, బ్యాక్/ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్స్ మేనేజర్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి.

పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం-ఫైనాన్షియల్ మార్కెట్స్:
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ (ఫరీదాబాద్), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సంయుక్తంగా ఏడాది వ్యవధితో నిర్వహిస్తున్న కోర్సు ఇది.

అర్హత: 50 శాతం మార్కులో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత

ఎంపిక: ఆన్‌లైన్‌లో నిర్వహించే ఆబ్జెక్టివ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మన రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఈ టెస్ట్ నిర్వహిస్తారు. క్యాట్, మ్యాట్, ఎక్స్‌టీ స్కోర్ ఉన్న వారికి ఆన్‌లైన్ టెస్ట్ నుంచి మినహాయింపు లభిస్తుంది. ఆ తర్వాత అకడెమిక్ ప్రొఫైల్, టెస్ట్ స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూలకు నిర్దేశిత వెయిటేజిలు కల్పించి వాటిలో మెరిట్ జాబితా ద్వారా 60 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఈ కోర్సుకు సాధారణంగా మార్చి/ఏప్రిల్ నెలల్లో నోటిఫికేషన్ వస్తుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: www.nseindia.com

అవకాశాలకు ఆకాశమే హద్దు:
దేశంలోని ఆర్థిక కార్యకలాపాల నియంత్రణ సంస్థలు సెబీ, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలు నిర్వహిస్తున్న ఈ కోర్సులు పూర్తి చేస్తే.. అవకాశాలకు ఆకాశమే హద్దుగా పేర్కొనొచ్చు. ముఖ్యంగా ఫైనాన్స్ విభాగానికి చెందిన గ్రాడ్యుయేట్స్ లభ్యత ఉన్నప్పటికీ.. కరిక్యులంను పరిగణనలోకి తీసుకుంటే స్టాక్ మార్కెట్ వ్యవహారాల్లో అవగాహన కొద్దిపాటిగానే ఉంటోంది. ఎంబీఏ విద్యార్థులు సైతం కరిక్యులంలో ఒక సబ్జెక్ట్‌గానే పోర్ట్ ఫోలియా మేనేజ్‌మెంట్‌పై అవగాహన పొందుతున్నారు.

ఈ నేపథ్యంలో సెబీ, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు నిర్వహించే కోర్సుల సర్టిఫికెట్లు అందుకున్న వారికి ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ ఉందని చెప్పొచ్చు. వీరికి.. బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలు, స్టాక్ ట్రేడింగ్ సంస్థలు, మ్యూచువల్‌ఫండ్ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. ప్రారంభంలోనే అయిదంకెల జీతం గ్యారెంటీ. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి కోర్సులు పూర్తి చేసుకుంటే మొదట్లోనే మిడిల్ లెవల్ మేనేజ్‌మెంట్ కేడర్ ఉద్యోగాలు సొంతం చేసుకోవడానికి అవకాశాలు పుష్కలం.

ప్రత్యేక స్కిల్స్ ఉంటేనే:
ఈ కోర్సులు, వాటి ఉపాధి వేదికలు చూడగానే ఆకర్షితులైన వారు మిగతా కోర్సుల్లో మాదిరిగా చేరడం సరికాదు. ఆయా కోర్సుల్లో చేరి నిలదొక్కుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన స్కిల్స్ కావాలి.
అవి..

- ముఖ్యంగా ఆర్థిక రంగం, ఆర్థిక గణాంకాలపై ఆసక్తి.
- ఒత్తిడితో కూడిన వాతావరణంలో పనిచేయగలగడం.
- నిర్దిష్ట వేళలకు పరిమితం కాని పని విధానానికి సైతం అలవాటు పడటం.
- నిరంతరం ఆర్థిక చట్టాలు, ప్రభుత్వ విధానాలపై అవగాహన ఏర్పరచుకోవడం.
Published date : 11 Mar 2013 03:52PM

Photo Stories