AP Tenth class Results: పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ విద్యార్థుల ప్రతిభ .....ఫ్యాక్షన్ గడ్డపై విద్యా కుసుమం
![AP Tenth class Results CM YS Jaganmohan Reddy prioritizing education in rural areas](/sites/default/files/images/2024/07/06/students-exam-1720261279.jpg)
ఫ్యాక్షన్ గడ్డపై విద్యా కుసుమం
ఆలూరు : ఒకప్పుడు అవి ఫ్యాక్షన్ గొడవలతో అభివృద్ధికి నోచుకోని గ్రామాలు. ముఠాకక్షలతో ఎన్నో కుటుంబాలు ఛిద్రమయ్యాయి. నిత్యం కరువుతో దయనీయ దుస్థితిలో ఉన్న ఆ గ్రామాల్లో నేడు చదువుల పంట పండుతోంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, హంద్రీ– నీవా జలాలను పొలాలను తరలించడంతో ఫ్యాక్షన్ తగ్గిపోయి తల్లిదండ్రులను పిల్లలను బడికి పంపించి మంచి చదువులు చదివిస్తున్నారు. ఈ కోవలోనే తెర్నేకల్ గ్రామానికి చెందిన త్రివేణి ప్రభుత్వ పాఠశాలలో చదివి పది ఫలితాల్లో 593 మార్కులు సాఽధించి తన సత్తా చాటింది. గ్రామానికి చెందిన నాగేష్ ఆటో డ్రైవర్గా, ఆయన భార్య లక్ష్మి కూలి పనిచేస్తున్నారు. వీరు కష్టపడి తన కమార్తె త్రివేణిని చదివించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు బాగున్నాయని, ఉన్నత చదువులు చదివి సివిల్స్ రాయాలన్నదే తన లక్ష్యమని త్రివేణి తెలిపారు.
ఎమ్మిగనూరు : పోగుపోగు కలిపి అందమైన వస్త్రాన్ని నేసే ఆ కుటుంబంలో అక్షరాలు అద్భుతాన్ని సృష్టించాయి. చేనేత కుటుంబానికి చెందిన విద్యార్థి కె. అజయ్ పదో తరగతిలో అత్యధికంగా 594 మార్కులు సాధించి ప్రశంసలు అందుకున్నాడు. గుడేకల్లు గ్రామానికి చెందిన తండ్రి చంద్రశేఖర్, తల్లి పుష్పలత.. చేనేత మగ్గంపై పనిచేస్తున్నారు. వీరి కుమార్తె అమృత గుడేకల్ జెడ్పీ స్కూల్ చదివి 576 మార్కులు సాఽధించి.. ప్రస్తుతం ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో చదువుతోంది. అక్కను స్ఫూర్తిగా తీసుకుని తమ్ముడు అజయ్ కూడా పట్టుదలతో చదివి మంచి మార్కులు తెచ్చుకున్నాడు. తల్లిదండ్రులు కష్టపడి తనను చదివించారని, ట్రిపుల్ఐటీలో సీటు వస్తే చేరుతానని అజయ్ తెలిపారు. మంచి ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.
కర్నూలు : పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు సత్తాచాటాయి. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఫలితాలను సాధించాయి. ఈ ఏడాది సర్కారు స్కూళ్లలో చదివిన విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి నూతన ఒరవడి సృష్టించారు. జిల్లాలో అన్ని యాజమాన్యాలకు చెందిన ఉన్నత పాఠశాలలు 489 ఉండగా.. మొత్తం 30,802 మంది విద్యార్థులు గత నెల18 నుంచి 30వ తేదీ వరకు 162 కేంద్రాల్లో పరీక్షలు రాశారు. ఈ నెల 1 నుంచి 8వ తేది వరకు మూల్యాంకనం నిర్వహించారు. కేవలం 14 రోజుల్లోనే సోమవారం విజయవాడలో పాఠశాల విద్య కమిషనర్ సురేష్కుమార్ ఫలితాలను విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 19,242 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
Also Read: AP 10th Class Supplementary Exam Updates
పెరిగిన ఉత్తీర్ణత
గతేడాది 60.58 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. ఈఏడాది అది 62.47 శాతానికి పెరిగింది. గతేడాదితో పోలిస్తే 1.89 శాతం పెరగడం విశేషం. గతేడాది బాలుర ఉత్తీర్ణత శాతం 55.89 ఉండగా.. ఈ ఏడాది 57.22 శాతానికి పెరిగింది. బాలికలు గతేడాది 65.88 శాతం ఉత్తీర్ణులు కాగా ఈ ఏడాది 68.35 శాతం మంది పాస్ అయ్యారు. ఉత్తీర్ణులైన వారిలో 13,183 మంది ఫస్ట్ క్లాసు, 3,877 మంది సెకెండ్ క్లాస్, 2,182 మంది థర్డ్ క్లాస్ సాధించారు. జిల్లాలోని 25 మండలాలు ఉండగా 9 మండలాల్లో 50 శాతంలోపు ఉత్తీర్ణులయ్యారు. అత్యధికంగా కృష్ణగిరి మండలంలో 75.48, అతి తక్కువ హొళగుంద మండలంలో కేవలం 37.77 శాతం ఉత్తీర్ణత నమోదైంది. తెలుగు మీడియం కంటే ఇంగ్లిషు మీడియం విద్యార్థులు అత్యధిక శాతం మంది పాస్ కావడం విశేషం. జిల్లాకు చెందిన సింగం సాయి స్వతేజ్, మంగలి హర్షవర్ధన్లకు అత్యధికంగా 597 మార్కులు సాధించారు. ఆ తరువాత కె. వాసవి ప్రియ 596, జి.హారిక 596, షేక్ రోషిణి 596, ప్రశాంత్ 596, భావన 596, ఎస్.రజియా సుల్తానా 596, కె.అజయ్ 594, త్రివేణి 593 మార్కులు తెచ్చుకున్నారు.
సత్ఫలితాలను ఇచ్చిన ప్రభుత్వ చర్యలు
గతంలో ప్రభుత్వ పాఠశాల అంటే చిన్నచూపు ఉండేది. చాలీచాలని తరగతి గదులు.. శిథిలావస్థకు చేరుకున్న భవనాలు...తాగేందుకు నీరు ఉండదు.. కాలకృత్యాలకు అవస్థలు..సబ్జెక్టు టీచర్ల కొరత.. ఇలా ఎన్యోన సమ్యలు ఉండేది. అత్యధిక మంది విద్యార్థులు తెలుగు మీడియంలోనే పరీక్షలు రాసేవాళ్లు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారాయి. ఇంగ్లిషు మీడియం, డిజిటల్ విద్యను ప్రవేశ పెట్టడంతో ప్రవేశాలు సైతం పెరిగాయి. ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించి సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చడంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకోగలిగారు. ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు 74.57 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంగ్లిషు సబ్జెక్టులో 95.23, తెలుగులో 90.45, హిందీ/సంస్కృతంలో 98.14 శాతం, గణితంలో 73.67, సైన్స్లో 74.68, సోషల్లో 79.36 శాతం ఉత్తీర్ణత సాధించారు.
30 స్కూళ్లలో 100 శాతం ఫలితాలు
జిల్లాలో 489 స్కూళ్లకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాయగా, ఇందులో 30 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. నాలుగు ప్రైవేటు పాఠశాలల్లో ఒక్కరూ కూడా పాస్ కాలేదు. 100 శాతం ఉత్తీర్ణతలో 26 స్కూళ్లు ప్రైవేటు, ఒక మున్సిపల్ హైస్కూల్, ఒక జెడ్పీ హైస్కూల్, బీసీ వెల్ఫేర్ రెండు, రెసిడెన్షియల్ రెండు స్కూళ్లు ఉన్నాయి.
Also Read: TS 10th Class Results: తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే..
ప్రభుత్వ విద్యార్థుల ప్రతిభ ఇదీ..
జెడ్పీ పాఠశాల విద్యార్థులు 283 మంది 500 మార్కులకుపైగా తెచ్చుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో 57, బీసీ వెల్ఫేర్ స్కూళ్లలో 104, మున్సిపల్ పాఠశాలల్లో 132, కేజీబీవీల్లో 21, మోడల్ స్కూళ్లలో 133, సోషల్ వెల్ఫేర్లో పాఠశాలల్లో 70, ట్రైబల్ వెల్ఫేర్లో 7, ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 142 మంది 500 మార్కులకు పైగా తెచ్చుకున్నారు. ప్రభుత్వ హైస్కూళ్లలో 1,894 మందికిగాను 951 మంది పాసైయ్యారు. జెడ్పీ హైస్కూల్(ఉర్దూ–కోడుమూరు) 100 శాతం ఉత్తీర్ణత సాధించింది.
● జిల్లాలో ఏపీ మోడల్ స్కూళ్లు 16 ఉండగా.. 1,404 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే 1,050 మంది పాసయ్యారు.
● జిల్లాలో 25 కస్తూర్బాగాంధీ విద్యాలయాలకు చెందిన 929 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 550 మంది ఉత్తీర్ణులయ్యారు.
● మున్సిపల్ హైస్కూళ్లలో 1,958 మందికిగాను 1,033 మంది ఉత్తీర్ణులయ్యారు. కర్నూలు నగరంలోని ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ మెమోరియల్ స్కూల్లో 48 మంది పరీక్షలు రాస్తే 48 మంది పాసైయ్యారు. ఈ స్కూల్కి చెందిన షేక్ హూమీరా ఇక్బాల్కు 593 మార్కులు సాధించింది. ఆదోని మున్సిపల్ హైస్కూల్కి చెందిన కె.ధనుంజయ అనే విద్యార్థికి 590 మార్కులు వచ్చాయి.
● ఎయిడెడ్ స్కూళ్లలో 176 మందికిగాను, 73 మంది పాసయ్యారు.
● ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 78 మందికిగాను 54 మంది, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 77 మందికిగాను 54 మంది, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 540 మందికిగాను 452 మంది, బీసీ వెల్ఫేర్ స్కూళ్లలో 254 మందికిగాను 242 మంది ఉత్తీర్ణులయ్యారు.
● ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 372 మందికిగాను 363 మంది పాసైయ్యారు. కాల్వబుగ్గ రెసిడెన్షియల్ స్కూల్, బీక్యాంపు రెసిడెన్షియల్ స్కూల్(బాలికలు) మహాత్మజ్యోతిరావు ఫూలే స్కూల్స్, గోరంట్ల, ఆరెకల్లు చెందిన విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణులు అయ్యారు. జ్యోతిరావు ఫూలే స్కూల్ (ఆరెకలు)కు చెందిన బోయ హరిక 591 మార్కులు, దేవనకొండ త్రివేణి 593 మార్కులు సాధించారు.
కూలీ ఇంట చదువుల తల్లి
కూలీ ఇంటి ఆణిముత్యం మెరిసింది. ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఓ బాలిక 593 మార్కులు సాధించింది. కర్నూలు నగరంలో ఎం. ఇక్బాల్ బాషా, ఆసియా తహసీన్ కుమార్తె షేక్ హుమెరా ఇక్బాల్ నగరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ మెమోరియల్ హైస్కూల్లో చదివింది. తండ్రి దినసరి కూలీగా పనిచేస్తూ కుమార్తెను చదివించాడు. తండ్రి కష్టాన్ని చూసి చలించిన షేక్ హుమెరా ఇక్బాల్ ప్రతిరోజూ స్కూల్కు వెళ్లి శ్రద్ధగా చదువుకునేది. సబ్జెక్టుల వారీగా వచ్చే అనుమానాలను ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు నివృత్తి చేయడంతో ఈ బాలిక అత్యధిక మార్కులు సాధించింది. డాక్టర్ అయి సేవలు అందించడమే తన లక్ష్యమని ఈ విద్యార్థిని పేర్కొన్నారు.
Tags
- AP Tenth results
- ap tenth class results 2024
- 10th class results updates
- tenth results 2024
- andhra pradesh news
- ap tenth class results
- highest percentage in boys of ap tenth class
- Students Talent in Tenth Board
- CM YS Jaganmohan Reddy Initiative
- Community development
- Student Success
- Rural Education
- Social Impact
- sakshieducation updates