Skip to main content

సాంఘిక శాస్త్రం పరీక్ష విధానం - సన్నద్ధత

సాంఘిక శాస్త్రం యాంత్రికత, భౌతికత, పోటీతత్వం నెలకొని ఉన్న ఈ ప్రస్తుత సమాజంలో నేటి విద్యార్థుల విజ్ఞాన పటిమను పటిష్టవంతం చేయాల్సిన అవసరం ఉంది. వారిలో సహకార భావన, ప్రతిస్పందన, మానవీయ నైతిక విలువలు, విమర్శనాత్మక దృష్టిని పాఠశాల స్థాయి నుంచే పెంపొందించాలి. ఈ సదుద్దేశంతో ఈ విద్యా సంవత్సరం నుంచి నూతన మూల్యాంకన విధానాన్ని ప్రవేశపెట్టారు. అందుకనుగుణంగానే సీసీఈ (నిరంతర సమగ్ర మూల్యాంకనం) పద్ధతిలో పాఠ్యాంశాలను రూపకల్పన చేశారు. నూతన పరీక్ష విధానంతోపాటు మార్కుల పద్ధతి, భారత్వం, స్వల్పంగా మారిన మార్కుల గ్రేడింగ్ ప్రక్రియ విద్యార్థుల మానసిక పరిపక్వత స్థాయికి తగ్గట్టుగానే ఉన్నట్లు విద్యా నిపుణులు నిర్ధారించారు. ఈ వినూత్న సంస్కరణలు, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడడానికి సీసీఈ అనువైనవి. ప్రతి విద్యార్థి విషయ నైపుణ్యాలను మెరుగుపర్చుకొని వార్షిక పరీక్షలకు సన్నద్ధమైతే సాంఘిక శాస్త్రంలో అత్యధిక మార్కులు సాధించి ఎ-1 గ్రేడ్ సాధించడం చాలా సులువు.
Bavitha
సాంఘిక శాస్త్రంలో సీసీఈ లక్ష్యాలు
విద్యార్థులు పాఠశాలలో నేర్చుకున్న సమాచారాన్ని ఎంతవరకు జ్ఞాపకం ఉంచుకోగలరనే సామర్థ్యంపై ఆధారపడి ఇప్పటివరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. బట్టీ విధానాన్ని ప్రోత్సహిస్తున్న ఈ పద్ధతి వల్ల విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనలకు గురవుతున్నారు. దీన్ని నివారించి విద్యార్థుల శారీరక, మానసిక, ఉద్వేగ వికాసాల ఆధారంగా వారి వివిధ అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసి విద్య నేర్చుకోవడాన్ని, పరీక్షలు రాయడాన్ని ఆహ్లాదంగా మార్చడమే సీసీఈ ముఖ్యోద్దేశం. నిరంతరం విద్యార్థుల మొత్తం అభ్యసన సామర్థ్యాలను సమగ్రంగా మదింపు చేసి పరీక్షించడం సీసీఈ ముఖ్య ఆశయం.

నూతన సిలబస్ - విశ్లేషణ

గతంలో సాంఘికశాస్త్ర పాఠ్యాంశాలను భూగోళ శాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం అనే విభాగాల కింద విభజించి పాఠ్య పుస్తకంలో పొందుపర్చేవారు. ప్రస్తుతం అలా కాకుండా భూగోళ శాస్త్రం, అర్థ శాస్త్ర పాఠ్యాంశాలను ‘భాగం-1’లో, చరిత్ర, పౌరశాస్త్రం పాఠ్య విషయాలను ‘భాగం-2’లో చేర్చారు. ఆ విధంగా మొత్తం 22 చాప్టర్లను రూపొందించారు.

భాగం-1 (వనరుల అభివృద్ధి, సమానత):
1 నుంచి 12 చాప్టర్లు:

భౌతిక శాస్త్రానికి సంబంధించిన పాఠ్యాంశాలైన భారతదేశ భౌగోళిక స్థితిగతులు, శీతోష్ణస్థితి, నదులు, నీటిపారుదల వ్యవస్థ, జనాభా, వ్యవసాయం - పంటలు - ఆహార భద్రతల గురించి విస్తృతంగా చర్చించారు. వీటితోపాటు అర్థశాస్త్ర భావనలైన స్థూలజాతీయోత్పత్తి, జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం, ఉపాధి, ప్రజల వలసలు, విదేశీ వాణిజ్యం - ప్రపంచీకరణ, పర్యావరణ హక్కులు, ప్రజాపంపిణీ వ్యవస్థ, సుస్థిర అభివృద్ధిల గురించి వివరించారు.

భాగం-2 (సమకాలీన ప్రపంచం, భారతదేశం):
13 నుంచి 22 చాప్టర్లు:
ఈ భాగంలో ఆధునిక ప్రపంచ చరిత్ర (1900 - 1950 వరకు), వివిధ వలస పాలన వ్యతిరేక ఉద్యమాలు, భారత జాతీయోద్యమాల గురించి పేర్కొన్నారు. అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాణం, 30 ఏళ్ల స్వతంత్ర భారతదేశం (1947 నుంచి 1977 వరకు), దేశంలో వివిధ రాజకీయ ధోరణులు (1977 నుంచి 2000 వరకు). యూఎన్‌ఓతో, విదేశాలతో భారతదేశ సంబంధాలు, భారతదేశంలో సమకాలీన సామాజిక ఉద్యమాలు, సమాచార హక్కు చట్టం, న్యాయసేవ ప్రాధికార సంస్థల గురించి విపులంగా తెలిపారు. ఇవన్నీ కూడా పౌరశాస్త్ర పాఠ్యాంశాలుగా చెప్పవచ్చు.

ప్రస్తుత సిలబస్‌లోని పాఠ్యాంశాలు చాలా వివరణాత్మకంగా, విద్యార్థి నిజ జీవితానికి దగ్గరగా ఉన్నాయి. విద్యార్థులకు ఉపయోగకరమైన, మెరుగైన పాఠ్యాంశాలను కూర్చి వివిధ ఉదాహరణలను, గణాంకాలను పొందుపర్చారు. ఇవి విద్యార్థుల్లో విషయావగాహన కల్పించడంతోపాటు ఆచరణపూర్వకమైన వ్యూహాత్మకతను, విషయాలను వ్యాఖ్యానించడం, అభివ్యక్తీకరించడాన్ని పెంపొందిస్తాయి. అంతేకాకుండా సమకాలీన అంశాలపై విద్యార్థుల సానుకూల, వ్యతిరేక ప్రతిస్పందనలను, వారిలో అవగాహన, వినియోగ సామర్థ్యాలను పెంచడానికి తోడ్పడేట్లుగా ఉన్నాయి.

పరీక్ష విధానం - ప్రశ్నల రూపకల్పన
సీసీఈ విధానంలో జరిగే ప్రస్తుత వార్షిక పరీక్షల్లో కూడా గతంలో మాదిరిగానే రెండు పేపర్లుంటాయి. పేపర్-1 (భూగోళశాస్త్రం, అర్థశాస్త్రం)లో భాగం-1లోని పాఠ్యాంశాల నుంచి, పేపర్-2 (చరిత్ర, పౌరశాస్త్రం)లో భాగం-2లోని పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలను ఇస్తారు. ఈ ప్రశ్నలన్నింటినీ ఇఉఖఖీ నిర్దేశించిన వివిధ విద్యా ప్రమాణాలను ఆధారంగా చేసుకొని రూపొందిస్తారు. ఇవి విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న జ్ఞానాన్ని, అవగాహన, వినియోగ సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని పరీక్షించేవిగా ఉంటాయి. జవాబులు బట్టీపట్టి రాయడానికి అవకాశం లేదు. ఒక ప్రశ్నకు అందరూ విద్యార్థులు ఒకేవిధమైన సమాధానం రాయాలనే నిబంధన ఏమీ లేదు. అందుకనుగుణంగా సమాధాన పత్రాల మూల్యాంకన విధానాన్ని కూడా మారుస్తున్నారు. ప్రశ్నలు కూడా బహుళ సమాధానాలు వచ్చే విధంగా ‘ఓపెన్ ఎండెడ్’గా ఉంటాయి. వాటికి విద్యార్థులు బాగా ఆలోచించి, విశ్లేషించి, అన్వయించుకొని, వ్యాఖ్యానిస్తూ జవాబులు రాయాలి. అప్పుడే అనుకున్నట్టుగా మార్కులు వస్తాయి.

ప్రశ్నపత్రం రూపకల్పన తీరు:
పేపర్-1 (వనరుల అభివృద్ధి, సమానత):
50 మార్కులు
పాఠ్యపుస్తకంలోని మొదటిభాగం పాఠ్యాంశాల నుంచి (భూగోళ శాస్త్రం, అర్థశాస్త్రం) ప్రశ్నలు ఉంటాయి. ప్రధాన ప్రశ్నపత్రమైన పార్ట్-ఎ కు 35 మార్కులు. ఆబ్జెక్టివ్ ప్రశ్నపత్రమైన పార్ట్-బికు 15 మార్కులు కేటాయించారు. పార్‌‌ట-ఎలో 4 సెక్షన్ల కింద వివిధ రకాల ప్రశ్నలుంటాయి. సెక్షన్-1లో 2 మార్కుల ప్రశ్నలు 8 ఇస్తారు. వాటిలో 4 ప్రశ్నలు గ్రూప్-ఎ కింద భూగోళ శాస్త్ర పాఠ్యాంశాల నుంచి, గ్రూప్- బి కింద 4 ప్రశ్నలను అర్థశాస్త్ర పాఠాల నుంచి ఇస్తారు. ఇందులో ఏదైనా ఒక గ్రూప్ నుంచి రెండుకు తక్కువ కాకుండా మొత్తం ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఈ సెక్షన్‌కు 10 మార్కులు.

సెక్షన్-2లో 1 మార్కు ప్రశ్నలు ఆరు (భూగోళ శాస్త్రం నుంచి 3, అర్థ శాస్త్రం నుంచి 3) ఇస్తారు. వీటిలో ఏవైనా 4 ప్రశ్నలకు జవాబులు రాయాలి. మార్కులు 4. సెక్షన్-3లో 4 మార్కుల వ్యాసరూప ప్రశ్నలు 8 ఉంటాయి. వీటిలో గ్రూప్-ఎ కింద భూగోళ శాస్త్రం నుంచి 4 ప్రశ్నలు. గ్రూప్-బి కింద అర్థ శాస్త్రం నుంచి 4 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి గ్రూప్ నుంచి తప్పనిసరిగా రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఈ విధంగా రెండు గ్రూప్‌ల నుంచి 4 సమాధానాలు రాయాలి. వీటికి 16 మార్కులు కేటాయించారు. సెక్షన్-4 మ్యాప్ పాయింటింగ్‌కు సంబంధించింది. ఈ సెక్షన్‌లో గ్రూప్-ఎ కింద ఏవైనా ఐదు ప్రదేశాలను (నదులు, సముద్రాలు, సరస్సులు, పర్వతాలు, జాతీయ రహదారులు, రాజధానులు, ముఖ్య పట్టణాలు, దేశాలు, కాలువలు, రైల్వేజోన్‌ల కేంద్రాలు, వివిధ ముఖ్య పంటలు పండే ప్రాంతాలు, ఖనిజ మేఖలలు విస్తరించివున్న ప్రదేశాలు, ప్రాజెక్ట్‌లు మొదలైనవి) ఇస్తారు. గ్రూప్-బి కింద ఏవైనా ఐదు ప్రదేశాలను ఇస్తారు. విద్యార్థులు భారతదేశ అవుట్‌లైన్ మ్యాప్‌లో ఏదైనా ఒకే గ్రూప్‌లోని ఐదు ప్రదేశాలను గుర్తించాలి. రెండు గ్రూప్‌లలోని మొత్తం 10 ప్రదేశాల్లో ఏవైనా ఐదు ప్రదేశాలను గుర్తించకూడదు. అలా చేస్తే తప్పు. ఐదు ప్రదేశాలను గుర్తిస్తే 5 మార్కులు కేటాయిస్తారు. ఇక పార్ట్-బి (అబ్జెక్టివ్ ప్రశ్నపత్రం)లో అర మార్కు ప్రశ్నలు 30 ఉంటాయి. మార్కులు 15. వీటిలో 20 బహుళైచ్ఛిక ప్రశ్నలు, 5 ఖాళీలను పూరించండి, 5 జతపర్చండి ప్రశ్నలుంటాయి. ఇందులో సగం ప్రశ్నలు భూగోళ శాస్త్రం నుంచి మిగతా సగం అర్థశాస్త్రం నుంచి ఇస్తారు. అన్నింటికీ సమాధానాలను ప్రశ్నపత్రంలోనే గుర్తించి ప్రధాన సమాధాన పత్రం, మ్యాప్ పత్రంతో జత చేయాలి.

పేపర్-2 (సమకాలీన ప్రపంచం, భారతదేశం):
50 మార్కులు
ఈ పేపర్‌లో పాఠ్యపుస్తకంలోని రెండో భాగం పాఠ్యాంశాల నుంచి (చరిత్ర, పౌరశాస్త్రం) ప్రశ్నలుంటాయి. సెక్షన్ల వారీగా ప్రశ్నల సంఖ్య, మార్కుల విభజన పైన వివరించినట్లుగా పేపర్-1లో మాదిరిగానే ఉంటాయి. అయితే గ్రూప్-ఎలో చరిత్ర ప్రశ్నలు. గ్రూప్-బిలో పౌరశాస్త్రం ప్రశ్నలు ఇస్తారు.

ప్రతి పేపర్‌కు సమాధానాలు రాయడానికి గం. 2.30 ని॥సమయం ఇస్తారు. రెండు పేపర్లకు కలిపి మొత్తం 100 మార్కులకు కనీసం 35 మార్కులు (35 శాతం) పొందిన వారు ఉత్తీర్ణులవుతారు.

ప్రశ్నల సంఖ్య - మార్కులు: పేపర్-1లో, పేపర్-2లో ప్రశ్నల సంఖ్య మార్కుల విభజన ఈ విధంగా ఉంటాయి.

సమాధానాల పరిధి:

4 మార్కుల వ్యాసరూప ప్రశ్నకు 8 నుంచి 10 వాక్యాల్లో సమాధానం రాయాలి.
2 మార్కుల సంక్షిప్త సమాధానాల ప్రశ్నకు 4 లేదా 5 వాక్యాల్లో సమాధానాలు రాయాలి.
1 మార్కు గల అతి స్వల్ప సమాధాన ప్రశ్నకు 1 లేదా 2 వాక్యాల్లో సమాధానాలు రాయాలి.

విద్యా ప్రమాణాలు - మార్కుల కేటాయింపు
సీసీఈ పద్ధతిలో విద్యార్థుల జ్ఞానాన్ని పరీక్షించడానికి సాంఘిక శాస్త్రంలో (పేపర్1, 2) ఆరు రకాల విద్యా ప్రమాణాలను నిర్దేశించారు. వాటి ఆధారంగా ప్రశ్నలు రూపొందిస్తారు.

గుర్తుంచుకోండి: ఏ పాఠ్యాంశం నుంచి ఎలాంటి ప్రశ్నలివ్వాలి, ఎన్ని ప్రశ్నలివ్వాలి, ఏ విద్యా ప్రమాణం నుంచి ఇవ్వాలి అనే విషయాలను ముందే నిర్ణయించారు. మీ ఉపాధ్యాయుల నుంచి ఈ సమాచారాన్ని పొందండి.

చాప్టర్ చివరన ఉన్న ప్రశ్నలను యథావిథిగా ఇవ్వకపోవచ్చు. వాటి రూపాన్ని స్వల్పంగా మార్చవచ్చు. అవసరమైతే విద్యార్థి అవగాహన సామర్థ్యాన్ని పరీక్షించడానికి మార్చి అడిగే అవకాశం ఉంది.

అధిక మార్కుల సాధనకు ప్రధాన సూచనలు
యూనిట్‌లవారీగా ప్రతి పాఠ్యాంశాన్ని క్షుణ్నంగా చదవాలి.
పాఠం చివర ఉన్న కీలక పదాల నిర్వచనాలను ప్రత్యేక దృష్టితో చదవాలి.
పాఠ్యాంశాలపై ఉపాధ్యాయుల విశ్లేషణలను సావధానంగా విని, తమ ప్రతిస్పందనలు సరైనవో, కావో నిర్ధారించుకోవాలి. పాఠాల్లోని ముఖ్యాంశాలు, ఉదాహరణలు, గణాంకాలు, చిత్రాలు, పటాలపై పూర్తి అవగాహన కోసం ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు, మిత్రులతో చర్చించాలి. పట నైపుణ్యాలను పెంచుకోవడానికి ఇంటివద్ద, తరగతి గదిలో ప్రపంచ పటాన్ని, భారతదేశ పటాన్ని లేదా అట్లాస్‌ను నిత్యం సాధన చేయాలి.
సమకాలీన అంశాల అవగాహన కోసం ప్రతిరోజూ ఒక ప్రామాణిక దినపత్రిక చదవాలి.
పాఠ్యాంశాలకు సంబంధించిన అనుబంధ, అదనపు సమాచారాన్ని ఉపాధ్యాయులు లేదా పాఠశాల లైబ్రరీ ద్వారా సేకరించి నోట్స్ రాసుకోవాలి.
పాఠ్యాంశం చివరలో ఉన్న ప్రశ్నలకు సొంతంగా సమాధానం రాయడానికి ప్రయత్నించండి. ఆ విధంగా చేస్తే రాత నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి.
పాఠశాల నిర్వహించే కమ్యూనిటీ సర్వేల్లో, క్షేత్ర పర్యటనలో విధిగా పాల్గొనాలి.
సాంఘిక శాస్త్ర పదజాలాన్ని, వాక్య నిర్మాణాన్ని ఉపయోగించి సమాధానాలు రాస్తే ఎక్కువ మార్కులు పొందే అవకాశముంది.
సమాధానం రాసేటప్పుడు దానికి సంబంధించిన ప్రాంతాలను గుర్తిస్తూ పటం గీసి విశ్లేషిస్తే గరిష్ట మార్కులు పొందవచ్చు.
సమాచార సేకరణ పని / ప్రాజెక్ట్ పనిని స్వతహాగా, నిబద్ధతతో, పారదర్శకంగా చేయాలి.


ప్రశ్నల రకం

ఇచ్చే ప్రశ్నలు

రాయాల్సినపశ్నలు

మార్కులు

4 మార్కుల వ్యాస రూప ప్రశ్నల

8

4

16

2 మార్కుల సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

8

5

10

1 మార్కు అతి లఘు సమాధాన ప్రశ్నలు

6

4

4

5 మార్కుల పట రూప ప్రశ్నలు

2

1

5

అర మార్కు అబ్జెక్టివ్ ప్రశ్నలు

30

30

15

మొత్తం

54

44

50



విద్యా ప్రమాణాలు

మార్కులు

1. విషయావగాహన

16

2. ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి, అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం

04

3. సమాచార సేకరణ నైపుణ్యం

06

4. సమకాలీన అంశాలపై

ప్రతిస్పందన, ప్రశ్నించడం

04

5. పట నైపుణ్యాలు

06

6. ప్రశంస/అభినందన

- సున్నితత్వం

04

మొత్తం

40

Published date : 05 Jan 2015 12:29PM

Photo Stories