Skip to main content

సాంఘిక శాస్త్రం

‘భారతదేశం - భౌగోళిక స్వరూపాలు’ పాఠ్యభాగంలో విద్యార్థులు విశాల భారతదేశ భౌగోళిక స్వరూప విశిష్టతలు, వైవిధ్యతలు, ముఖ్య లక్షణాల గురించి నేర్చుకుంటారు.
Tenth Class Guidance ఈ పాఠ్యాంశం ద్వారా వివిధ భౌగోళిక స్వరూపాల ఉనికి అక్కడి ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో అవగాహన చేసుకోవచ్చు. భారతదేశంలోని వాతావరణ మార్పులకు, భారతీయుల జీవనయానానికి కావాల్సిన అవసరాలను తీర్చడానికి భౌగోళిక దృగ్విషయాలు ఎలా దోహదపడుతున్నాయో వివరణాత్మకంగా తెలుసుకోవచ్చు.

భాగం-ఐ: వనరుల అభివృద్ధి, సమానత
పాఠం - 1: భారతదేశం: భౌగోళిక స్వరూపాలు
ప్రపంచ భూభాగమంతా ‘అంగారా (లారేషియా)’, ‘గొండ్వానా’ అనే రెండు ప్రధాన భూఖండాల నుంచి ఏర్పడింది. భారత ద్వీపకల్పం గోండ్వానా భూభాగానికి చెందింది. హిమాలయాలు 20 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడగా, వేట సేకరణపై ఆధారపడిన తొలి మానవులు రెండు లక్షల ఏళ్ల కిందట భూమిపై ఆవిర్భవించారు. భారతదేశం పూర్తిగా ఉత్తరార్ధ గోళంలో ఉంది. 8o41 నుంచి 37o61 ఉత్తర అక్షాంశాల మధ్య, 68o71 నుంచి 97o251 తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.

భారత ప్రామాణిక కాలమానాన్ని (IST) నిర్ధారించడానికి అలహాబాద్ (ఉత్తరప్రదేశ్) నుంచి వెళ్లే 82o301 తూర్పు రేఖాంశాన్ని ఆధారంగా తీసుకున్నారు. గ్రీన్‌విచ్ (లండన్) ప్రామాణిక కాలానికి ((Greenwich Mean Time) IST 5 గంటల 30 నిమిషాలు ముందుంటుంది.

భారతదేశ తూర్పు చివరన ఉన్న ఇంఫాల్ (మణిపూర్)లో సూర్యోదయం అయిన 80 నిమిషాల తర్వాత పశ్చిమ చివరన ఉన్న అహ్మదాబాద్ (గుజరాత్)లో సూర్యోదయం అవుతుంది.

ముఖ్యమైన భౌగోళిక స్వరూపాలు
  1. హిమాలయాలు: ఇవి పడమర నుంచి తూర్పునకు 2400 కి.మీ. పొడవున వ్యాపించి ఉన్నాయి. హిమాలయాల్లో సమాంతరంగా ఉండే మూడు పర్వత శ్రేణులున్నాయి. అవి.. ఉన్నత హిమాలయాలు (హిమాద్రి శ్రేణి), నిమ్న హిమాలయాలు (హిమాచల్ శ్రేణి), బాహ్య హిమాలయాలు (శివాలిక్ శ్రేణి).
  2. గంగా-సింధూ నదీ మైదానం: దీన్ని మూడు భాగాలుగా విభజించారు. అవి.. పశ్చిమ భాగం, మధ్య భాగం, తూర్పు భాగం.
  3. ద్వీపకల్ప పీఠభూమి: ఈ ప్రాంతాన్ని ప్రధానంగా రెండు భాగాలుగా విభజించారు. అవి.. మధ్య ఉన్నత భూములు, దక్కన్ పీఠభూమి.
  4. తీర ప్రాంత మైదానాలు: వీటిని పశ్చిమ తీర మైదానం (అరేబియా సముద్ర తీర ప్రాంతం), తూర్పు తీర ప్రాంతం (బంగాళాఖాతం తీరం) అని రెండు భాగాలుగా వర్గీకరించారు.
  5. ఎడారి ప్రాంతం: థార్ ఎడారి (రాజస్థాన్).
  6. దీవులు: రెండు ద్వీప సమూహాలున్నాయి. అవి.. అండమాన్ - నికోబార్ దీవులు, లక్షద్వీప్ దీవులు.
కీలక పదాలు - అర్థాలు
  • జీవ నది: వేసవి కాలంలోనూ ఎండిపోకుండా ఏడాది పొడవునా ప్రవహించే నది. ఉదా: గంగా, యమునా.
  • ద్వీపకల్పం: మూడు వైపులా నీరు ఉండి ఒకవైపు భూభాగంతో ఉండే భూ స్వరూపం. ఉదా: భారతదేశం.
  • కోరల్ ((Coral): కోరల్ అనే ఆంగ్ల పదానికి ‘పగడం’ అని అర్థం. ఇది సముద్రాల్లో జీవించే కీటకం. ఈ పగడపు కీటకాలు కాల్షియం కార్బొనేట్‌ను గ్రహించి తమ కర్పరాలను (షెల్స్) నిర్మించుకుంటాయి. ఇవి గుంపులు గుంపులుగా నివసిస్తూ ఒకదానికొకటి పెనవేసుకొని ‘పగడపు దిబ్బలు’ ఏర్పరుస్తాయి. ఈ దిబ్బలను ‘ప్రవాళభిత్తికలు’గా పిలుస్తారు. ఇవి సముద్రంపైకి ఉబ్బి వచ్చి దీవులుగా ఏర్పడతాయి. ఉదా: లక్షద్వీప్ దీవులు.
  • డూన్: హిమాచల్ శ్రేణి (నిమ్న హిమాలయాలు), శివాలిక్ శ్రేణి (బాహ్య హిమాలయాలు)ల మధ్య ఉండే లోయలను స్థానికంగా ‘డూన్’లు అని పిలుస్తారు. ఉదా: డెహ్రాడూన్, కోట్లీ డూన్, పాట్లీ డూన్.
  • అంగారా భూమి: ప్రస్తుతమున్న ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా ఖండాలు 20 కోట్ల ఏళ్ల కిందట ఒకటిగానే కలిసి ఉండేవి. దీన్ని అంగారా భూమి (లారేషియా)గా పిలిచేవారు. ఇది టెథిస్ సముద్రానికి ఉత్తరంగా ఉండేది.
  • గోండ్వానా భూమి: ప్రస్తుతం ఉన్న దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా ఖండాల భూభాగంతోపాటు ఇండియా, మలేషియా లాంటి దక్షిణాసియా ప్రాంతాలన్నీ ఒకే భూభాగంగా కలిసి ఉండేవి. ఈ భూభాగమంతటినీ ‘గోండ్వానా’ అనేవారు. ఇది టెథిస్ సముద్రానికి దక్షిణంగా ఉండేది.
  • శివాలిక్ శ్రేణి: దక్షిణ హిమాలయ పర్వతాలను బాహ్య హిమాలయాలుగా పిలుస్తారు. వీటిని ‘శివాలిక్ పర్వత శ్రేణి’ అంటారు. ఈ శ్రేణి జమ్ము-కశ్మీర్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్ వరకు అవిచ్ఛిన్నంగా వ్యాపించి ఉంది. వీటి సగటు ఎత్తు 900 మీటర్ల నుంచి 1100 మీ. ఉంటుంది.
  • పూర్వాంచల్ పర్వతాలు: భారతదేశానికి తూర్పు దిక్కున ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న హిమాలయాలను ‘పూర్వాంచల్ పర్వతాలు’ అంటారు. ఇవి అవక్షేప శిలలు, ఇసుకతో ఏర్పడ్డాయి. వీటిని స్థానికంగా వివిధ పేర్లతో పిలుస్తారు. ఉదా: పాట్‌కాయ్ కొండలు (నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్), ఖాసి కొండలు (మేఘాలయ).
  • ఇందిరా పాయింట్: భారతదేశ దక్షిణ సరిహద్దును ‘ఇందిరా పాయింట్’ అని పిలుస్తారు. ఇది నికోబార్ దీవుల దక్షిణ చివరన ఉంది.
  • అంతర్వేది (Doab): రెండు నదుల మధ్య ఉండే మైదాన ప్రాంతం. ఇది చాలా సారవంతమైన భూభాగం. పూర్వం ఈ ప్రాంతంపై అధికారం చెలాయించడానికి రాజుల మధ్య యుద్ధాలు జరిగేవి.
  • భాబర్: హిమాలయాల్లో జన్మించిన నదులు కిందకు ప్రవహించే క్రమంలో రాళ్లు, గుళకరాళ్ల లాంటి వాటిని శివాలిక్ పర్వత శ్రేణి పాద భాగంలో సన్నటి మేఖలగా నిక్షేపణ చేస్తాయి. ఈ విధంగా నిక్షిప్తమైన సన్నటి భూ స్వరూపాన్ని ‘భాబర్’ అంటారు.
  • టెరాయి: సచ్ఛిద్రంగా ఉండే భాబర్ ప్రాంతం కింద నుంచి చిన్న చిన్న నదులు, వాగులు ప్రవహించి కొద్ది దూరంలో బయటికి వచ్చి ప్రవహిస్తాయి. అప్పుడు ఆ ప్రాంతంలో చిత్తడి నేలలు ఏర్పడతాయి. ఈ చిత్తడి ప్రాంతాన్ని ‘టెరాయి’ అంటారు.
  • అంతస్థలీయ ప్రవాహం: ఎడారుల్లో ప్రవహించే నది లేదా కాలువల్లోని నీరు సముద్రానికి చేరకుండా సరస్సుల్లోకి ప్రవహించి ఇసుకలోకి ఇంకి ప్రవహిస్తాయి. వీటిని ‘అంతస్థలీయ ప్రవాహాలు’ అంటారు. ఉదా: థార్ ఎడారిలోని ‘లూనీ’ ప్రవాహం.
  • దక్కన్ పీఠభూమి: నర్మదా నదికి దక్షిణాన ఉన్న త్రిభుజాకార భారతదేశ భూభాగాన్ని ‘దక్కన్ పీఠభూమి’ అంటారు. ఇది తూర్పు వైపునకు వాలి ఉంది.
  • ఎవరెస్ట్ శిఖరం: హిమాలయ పర్వతాల్లో ఉన్న ఈ పర్వత శిఖరం ప్రపంచంలోనే ఎత్తయింది. దీని ఎత్తు 8848 మీటర్లు. ఇది నేపాల్‌లో ఉంది.
  • K2 శిఖరం (గాడ్విన్ ఆస్టిన్): ప్రపంచంలోనే రెండో ఎత్తయిన శిఖరం. ఇండియాలో అతి ఎత్తయిన శిఖరం. దీని ఎత్తు 8611 మీటర్లు. ఇది ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉంది.
  • దొడబెట్ట: నీలగిరి పర్వతాల్లో ఎత్తయిన శిఖరం. ఇది తమిళనాడులో ఉంది. దీని ఎత్తు 2637 మీటర్లు. ప్రఖ్యాత వేసవి విడిది కేంద్రమైన ఊటీ సమీపంలో ఇది ఉంది.
  • అనైముడి: అన్నామలై కొండల్లో ద్వీపకల్ప పీఠభూమిలో అనైముడి ఎత్తయిన శిఖరం. దీని ఎత్తు 2695 మీటర్లు. ఇది కేరళలో ఉంది.
  • తీర మైదానాలు: ఇవి ద్వీపకల్ప పీఠభూమికి దక్షిణ భాగంలో.. పశ్చిమాన అరేబియా సముద్రం, తూర్పున బంగాళాఖాతం వెంట ఉండే సన్నటి తీర ప్రాంతాలు.
సంక్షిప్త సమాధాన ప్రశ్నలు (2 మార్కులు)
Tenth Class Guidance
1. పైన ఇచ్చిన ప్రపంచ పటాన్ని పరిశీలించి భారతదేశ ఉనికి గురించి కొన్ని వాక్యాలు రాయండి. (పట నైపుణ్యాలు)
    జ:
  • భారతదేశం భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉంది. ఇది ఉత్తరార్ధ గోళంలో ఉంది.
  • ఆసియా ఖండం దక్షిణ భాగంలో భారతదేశం ఉంది.
  • భారతదేశానికి మూడు వైపులా నీరు ఉండటం వల్ల ద్వీపకల్పంగా చెప్పవచ్చు.
  • భారతదేశ ఉనికి: 8o41 నుంచి 37o61 ఉత్తర అక్షాంశాల మధ్య, 68o71 నుంచి 97o251 తూ ర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.
  • భారతదేశ భూభాగాలైన అండమాన్ నికోబార్, లక్షద్వీప్ దీవులు ప్రధాన భూభాగానికి దూరంగా విసిరేసినట్లుగా ఉన్నాయి.
  • శివాలిక్ శ్రేణిలోని పర్వతాలను జమ్ము ప్రాంతంలో జమ్ము కొండలని, అరుణాచల్ ప్రదేశ్‌లో మిష్మి కొండలని పిలుస్తారు. అసోంలో కచార్ కొండలనీ అంటారు. ఈ పర్వత పాద ప్రాంతంలో పెద్ద పెద్ద రాళ్లు, ఒండ్రు మట్టి ఉంటుంది. నిమ్న హిమాలయాలు, శివాలిక్ శ్రేణి మధ్య ఉండే లోయలను స్థానికంగా డూన్‌లని పిలుస్తారు. డెహ్రాడూన్, కోట్లీడూన్, పాట్లీ డూన్ అనేవి మనదేశంలోని ప్రఖ్యాత డూన్‌లు. ఇవి వేసవి విహార కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. (సమాచార సేకరణ నైపుణ్యాలు)
    ఎ. మేఘాలయలో ఉన్న ఏవైనా మూడు కొండల పేర్లను పేర్కొనండి.
    జ:
    ఈశాన్య భారతదేశ రాష్ట్రమైన మేఘాలయలోని కొండలు: ఖాసీ కొండలు, గారో కొండలు, జాంతీయ కొండలు.
వ్యాసరూప ప్రశ్నలు (4 మార్కులు)
1. భారతదేశ ప్రధాన భౌగోళిక విభజనలు ఏవి? హిమాలయ ప్రాంత భౌగోళిక పరిస్థితులతో ద్వీపకల్ప పీఠభూమిని పోల్చండి. (విషయావగాహన)
జ:
భారతదేశ భౌగోళిక స్వరూపాన్ని ఆరు ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. అవి.
  1. హిమాలయాలు
  2. గంగా- సింధూ మైదానం
  3. ద్వీపకల్ప పీఠభూమి
  4. తీర ప్రాంత మైదానాలు
  5. ఎడారులు
  6. దీవులు
హిమాలయ ప్రాంతం, ద్వీపకల్ప పీఠభూమి మధ్య పోలికలు:
  • ఉత్తర భారతదేశ ఉత్తర భాగంలో హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఇవి సుమారుగా ఐదు లక్షల చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్నాయి. భారత ఉత్తర మైదానాలకు దక్షిణంగా ఉన్న పీఠభూమిని ద్వీపకల్ప పీఠభూమిగా పిలుస్తారు. 16 లక్షల చ.కి.మీ. వైశాల్యం ఉన్న ఈ పీఠభూమి దేశంలోనే అతిపెద్ద నైసర్గిక స్వరూపం.
  • హిమాలయాలు సముద్ర మట్టానికి సరాసరిగా 600 మీటర్ల నుంచి 6100 మీటర్ల ఎత్తు ఉండగా, ద్వీపకల్ప పీఠభూమి 600 నుంచి 900 మీటర్ల సాధారణ ఎత్తుతో క్రమరహితంగా ఉంది.
  • హిమాలయాల్లో జన్మించిన గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు, వాటి ఉపనదులు జీవనదులుగా ప్రవహిస్తూ ఉత్తర భారతదేశాన్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. ద్వీపకల్ప పీఠభూమిలో ప్రవహిస్తున్న గోదావరి, కృష్ణా, మహానది, కావేరి, నర్మద, తపతి లాంటి ముఖ్య నదులు దక్షిణ భారతదేశ సౌభాగ్యాన్ని పటిష్టం చేస్తున్నాయి.
  • హిమాలయ దక్షిణ భాగంలో గంగా - సింధూ మైదానాలు ఉన్నాయి. ఇక్కడి సారవంతమైన నేలలు వివిధ పంటలు పండించడానికి అనుకూలంగా ఉన్నాయి. ద్వీపకల్ప పీఠభూమిని ఆనుకుని పశ్చిమ, తూర్పు భాగాల్లో తీర మైదానాలున్నాయి. ఈ మైదానాల్లోని సాగుభూమి వ్యవసాయానికి చాలా అనుకూలమైంది.
  • ఈ రెండు ప్రాంతాల్లోని భౌగోళిక నిమ్నోన్నతాలు రుతుపవన వర్షపాతాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
  • హిమాలయ ప్రాంతంలో దాల్, ఊలార్, కుమావున్, సోమర్ లాంటి ప్రముఖ సరస్సులున్నాయి. చిల్కా, పులికాట్, కొల్లేరు, అష్టముడి లాంటి సరస్సులు ద్వీపకల్ప పీఠభూమిలో ఉన్నాయి.
లక్ష్యాత్మక ప్రశ్నలు - (1/2 మార్కు)
  1. 821/2ని తూర్పు రేఖాంశం ఏ నగరం నుంచి వెళ్తుంది?
    1) అహ్మదాబాద్
    2) అలహాబాద్
    3) న్యూఢిల్లీ
    4) భోపాల్
  2. సింధూ నది ఉపనది?
    1) గండక్
    2) కోసీ
    3) రావి
    4) బెట్వా
  3. నీలగిరి పర్వతాల్లో ఎత్తయిన శిఖరం?
    1) అనైముడి
    2) మహేంద్రగిరి
    3) దొడబెట్ట
    4) గురుశికార్
  4. రెండు నదుల మధ్య ఉండే భూ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు?
    1) డూన్
    2) కనుమ
    3) సింధు శాఖ
    4) అంతర్వేది
  5. ‘టెరాయి’ అంటే?
    1) పురాతన ఒండ్రు నేలలు
    2) నవీన ఒండ్రు మృత్తికలు
    3) చిత్తడి నేలలు
    4) గులకరాళ్లు
  6. కిందివాటిలో భారతదేశ దక్షిణ కొన?
    1) మెక్‌మోహన్ రేఖ
    2) ఇందిరా పాయింట్
    3) గ్రేట్ నికోబార్ దీవి
    4) పాంబన్ లైన్
  7. కిందివాటిలో మంచినీటి సరస్సు?
    1) కొల్లేరు
    2) పులికాట్
    3) చిల్కా
    4) సాంబర్
  8. ఆంధ్రప్రదేశ్‌లో కోస్తా తీరాన్ని ఏమని పిలుస్తారు?
    1) కోరమాండల్ తీరం
    2) మలబార్ తీరం
    3) ఉత్కల్ తీరం
    4) సర్కార్ తీరం
  9. ద్వీపకల్ప పీఠభూమి మధ్య భాగంలో ఉన్న రాష్ట్రం?
    1) తెలంగాణ
    2) మహారాష్ట్ర
    3) ఛత్తీస్‌గఢ్
    4) ఆంధ్రప్రదేశ్
సమాధానాలు
1) 2; 2) 3; 3) 3; 4) 4;
5) 3; 6) 2; 7) 1; 8) 4;
9) 1.
Published date : 10 Jan 2015 03:11PM

Photo Stories