Skip to main content

Department of Education: స్కూళ్లకు మినిస్టీరియల్‌ సిబ్బంది

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు సమర్థమంతమైన బోధన అందించేందుకు నాడు – నేడు పూర్తయిన స్కూళ్లల్లో మినిస్టీరియల్‌ సిబ్బందిని నియమిస్తామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
Department of Education
స్కూళ్లకు మినిస్టీరియల్‌ సిబ్బంది

ఇకపై ఉపాధ్యాయులకు బోధన తప్ప మరో విధి ఉండదన్నారు. ఇప్పటికే ఆ పాఠశాలలకు నైట్‌ వాచ్‌మన్లను నియమించామని, రికార్డు పనుల కోసం త్వరలో స్కూళ్లకు కంప్యూటర్‌ ఆపరేటర్లను నియమిస్తామని చెప్పారు. ఉపాధ్యాయుల బదిలీలు, ఎంఈవో–2 పోస్టుల భర్తీ పూర్తయిన నేపథ్యంలో కొన్ని చోట్ల తలెత్తిన సాంకేతిక సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల నేతలు జూన్‌ 19న మంత్రితో విజయవాడలో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీలకు 82,587 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో అన్ని అర్హతలు ఉన్న 52,548 మందిని బదిలీ చేశామన్నారు. ఇప్పటికే 98.28 శాతం రిలీవ్‌ అయ్యారని, ప్రత్నామ్నాయం లేక 1012 మంది రిలీవ్‌ కాలేదని చెప్పారు.

ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రక్రియ కూడా పూర్తి చేస్తామన్నారు. బదిలీల్లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు రెండు జిల్లాల నుంచి ఫిర్యాదులొచ్చాయని, బలవంతపు బదిలీలు చేసినట్టు ఒకట్రెండు ఫిర్యాదులు కూడా అందాయని చెప్పారు. అలాంటి వారికి న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. త్వరలోనే మున్సిపల్‌ ఉపాధ్యాయుల బదిలీలు చేపడతామని తెలిపారు. మున్సిపల్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయేతర సిబ్బంది, పీఈటీలకు కూడా పదోన్నతులు ఇచ్చి బదిలీ చేస్తామని చెప్పారు.

చదవండి: AP Schools: 60 వేల తరగతి గదుల్లో ఇంటరాక్టీవ్ ప్యానల్స్‌ ఏర్పాటు.. ఒంటిపూట బడులు పొడిగింపు..

ఎంఈవో–1 పోస్టుల్లోకి వస్తే సీనియర్లకు పదోన్నతి

విద్యా శాఖలో సమర్థవంతమైన పాలనకు గ్రేడ్‌–2 ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులిచ్చి 679 ఎంఈవో–2 పోస్టులను కూడా భర్తీ చేసినట్టు మంత్రి తెలిపారు. 355 ఎంఈవో–1 పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయని, సీనియర్‌ హెచ్‌ఎంలు ఈ పోస్టుల్లోకి వస్తే సీనియర్‌ స్కూల్‌ అసిస్టెంట్లకు హెచ్‌ఎంలుగా, ఎస్‌జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లగా పదోన్నతులకు ఆస్కారం ఉంటుందన్నారు.

ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కూడా ఉపాధ్యాయులతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని చెప్పారు. ఉపాధ్యాయులు సెలువు పెట్టినప్పుడు ఆ స్థానంలో బోధించేందుకు ప్రతి మండలంలో ముగ్గురు నుంచి ఐదుగురు రిజర్వ్‌ ఉపాధ్యాయులను అందుబాటులో ఉంచుతామన్నారు. దీనివల్ల బోధనలో అంతరాయం ఉండదని తెలిపారు.

చదవండి: AP School Education: ఏపీలో పాఠశాల విద్యా విధానం భేష్‌

విలీన పాఠశాలల్లో మెరుగైన బోధన

విలీనమైన ప్రాథమికోన్నత పాఠశాలల్లో మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లు బోధిస్తారని, దీనివల్ల పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని మంత్రి తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను ఈ స్కూళ్లల్లో చేర్పించాలని కోరారు. పాఠశాల దూరంగా ఉందనుకొంటే సమీపంలోని మోడల్‌ స్కూల్‌ లేదా కేజీబీవీల్లోనైనా చేర్పించాలన్నారు.

విద్యార్థులకు చక్కటి వాతావరణంలో బోధన అందించేందుకు ఆరో తరగతి నుంచి ఐఎఫ్‌పీ స్క్రీన్లు అందిస్తున్నామని, ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్‌ టీవీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నాడు–నేడు పూర్తయిన అన్ని స్కూళ్లల్లో డిసెంబర్‌ నాటికి పూర్తిస్థాయిలో డిజిటల్‌ బోధన వస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

చదవండి: Digital Education: విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన చేయాలి

Published date : 20 Jun 2023 05:39PM

Photo Stories