Good News: ప్రభుత్వ స్కూళ్లన్నీ ఇంగ్లిష్‌ మీడియంలోకి

సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లిష్‌ మీడియంలోకి మార్చాలని ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.

విద్య కోసం ఎన్ని నిధులైనా కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. దేశానికే మోడల్‌గా నిలిచేలా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణం చేపట్టడమే కాకుండా అన్ని రెసిడెన్షియల్‌ పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించేందుకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో నిధులు కేటాయించామని చెప్పారు.

 ఖమ్మంలోని ఎన్నెస్పీ ప్రభుత్వ పాఠశాలలో జూన్ 12న‌ ఆయన విద్యార్థులకు యూనిఫామ్‌ అందజేశారు. అనంతరం కలెక్టరేట్‌లో విద్య, నీటి పారుదలశాఖలపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సమీక్ష నిర్వహించారు ఆ తర్వాత మీడియాతో భట్టి మాట్లాడారు.

ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన తొలిరోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌ అందించడం రాష్ట్ర చరిత్రలోనే ఇది మొదటిసారన్నారు. ఏడాదిలోగా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. 

చదవండి: Badi Bata Programme: బడికి చలో.. ’బడిబాట’ పట్టిన ఉపాధ్యాయులు...

విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల ద్వారా అందిస్తున్న ఓవర్సీస్‌ స్కాలర్‌ప్‌ సంఖ్య మరో వంద పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు భట్టి వెల్లడించారు.

రూ.8 వేల కోట్లు ఖర్చు పెట్టినా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి పదేళ్లయినా.. రూ.8 వేల కోట్లు ఖర్చు పెట్టినా ఇప్పటివరకు చుక్క నీరు కూడా గత పాలకులు అందించలేకపోయారని భట్టి విమర్శించారు.

సీతారామ ప్రాజెక్టులో గత ప్రభుత్వం ఎక్కడా రిజర్వాయర్‌ డిజైన్‌ చేయలేదని, కేవలం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ మాత్రమే చేసిందని భట్టి పేర్కొన్నారు. 

ఈ మేరకు తమ ప్రభుత్వం నీటిని స్టోరేజ్‌ చేసేలా 10 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్‌ డిజైన్‌ చేయనున్నట్లు వెల్లడించారు.

సమీక్షలో కలెక్టర్‌ వీపీ.గౌతమ్, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు రాందాస్‌ నాయక్, మట్టా రాగమయి పాల్గొన్నారు.

#Tags