633 Jobs: ఫార్మసిస్ట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌.. నోటిఫికేషన్‌లోని కీలక అంశాలు, వివరాలివీ..

సాక్షి, హైదరాబాద్‌: వైద్యారోగ్యశాఖలో 633 ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌–2 పోస్టుల భర్తీ కోసం ‘మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు’సెప్టెంబ‌ర్ 24న‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. అభ్యర్థులు అక్టోబర్‌ ఐదో తేదీ నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

దరఖాస్తులో ఏవైనా పొరపాట్లు ఉంటే మార్చుకునేందుకు 23, 24వ తేదీల్లో అవకాశం ఉంటుందని వివరించారు. నవంబర్‌ 30న కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పద్ధతిలో పరీక్ష ఉంటుందని వెల్లడించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నవారిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. 

చదవండి: EWS Reservations in Medical Admissions: వైద్య కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్‌ అమలు

నోటిఫికేషన్‌లోని కీలక అంశాలు, వివరాలివీ.. 

  • మొత్తం 633 పోస్టులు ఉండగా.. అందులో 446 ప్రజారోగ్య సంచాలకులు, వైద్యవిద్యా సంచాలకుల (డీఎంఈ) విభాగంలో ఉన్నాయి. మరో 185 తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో, ఇంకో 2 హైదరాబాద్‌ ఎంఎన్‌జే ఆస్పత్రిలో ఉన్నాయి. ళీ జోన్ల వారీగా చూస్తే.. జోన్‌–1లో 79, జోన్‌–2లో 53, జోన్‌–3లో 86, జోన్‌–4లో 98, జోన్‌–5లో 73, జోన్‌–6లో 154, జోన్‌–7లో 88 పోస్టులు ఉన్నాయి. 
  • ఈ పోస్టులకు పేస్కేల్‌ రూ.31,040 నుంచి రూ.92,050 మధ్య ఉంటుంది. 
  • రాష్ట్రవ్యాప్తంగా 13 ప్రాంతాలు.. హైదరాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటలలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. 
  • ఫలితాల అనంతరం మెరిట్‌ జాబితాను బోర్డు వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తారు. 
  • అభ్యర్థులు డి.ఫార్మసీ, బి.ఫార్మసీ, ఫార్మా డీ పూర్తి చేసి ఉండాలి. తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌లో తప్పక రిజిస్ట్రేషన్‌ చేసి ఉండాలి. 
  • ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిజేసే వారికి వెయిటేజీ ఉంటుంది. వారు అనుభవ పూర్వక ధ్రువీకరణపత్రం సమర్పించాలి. 
  • అభ్యర్థుల వయసు ఈ ఏడాది జూలై 1 నాటికి 46 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు.. దివ్యాంగులకు పదేళ్లు సడలింపు,ఎన్‌సీసీ, ఎక్స్‌ సర్వీస్‌మన్లకు మూడేళ్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు (ఆర్టీసీ, మున్సిపల్‌ ఉద్యోగులు అనర్హులు) ఐదేళ్ల సడలింపునిచ్చారు. 
  • రాత పరీక్షకు 80 మార్కులు ఉంటాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేసినవారికి వెయిటేజీ కింద 20 పాయింట్స్‌ కేటాయిస్తారు. ఇందులో గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన ప్రతి ఆరు మాసాలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే ప్రతీ ఆరు నెలలకు 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. 
  • పూర్తి వివరాలను అభ్యర్థులు  www.mhsrb.telangana.gov.in వెబ్‌సైట్‌లో పొందవచ్చు.   

#Tags