Engineering Colleges Fee : ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపు..? ఈ ప్రకారంగానే..
ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇంజినీరింగ్ కాలేజీల ట్యూషన్ ఫీజుల సవరణకు రంగం సిద్ధమవుతున్నది. 2025-28 బ్లాక్ పీరియడ్కు సంబంధించిన ఫీజుల సవరణ అంశంపై తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఇటీవల పలు ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో సన్నాహక సమావేశం నిర్వహించింది.
నోటిఫికేషన్ను జారీ..?
నెల రోజుల్లోపు ఫీజుల సవరణకు నోటిఫికేషన్ను జారీచేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇంజినీరింగ్ ఫీజులను ప్రతి మూడేండ్లకు ఒకసారి సవరిస్తున్నారు. గతంలో 2022లో ఫీజులను సవరించారు. 2022-25 బ్లాక్ పీరియడ్ ట్యూషన్ ఫీజుల గడువు ఈ విద్యా సంవత్సరంతో ముగియనున్నది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 2025-28 బ్లాక్ పీరియడ్ ప్రారంభం కానున్నది.
మార్గదర్శకాల రూపకల్పనపై..
ఈ నేపథ్యంలో టీఏఎఫ్ఆర్సీ ఫీజుల సవరణకు సన్నాహక సమావేశం నిర్వహించింది. ఇటీవలి కాలంలో అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనేక మార్పులు చేసింది. ఆయా మార్పులతోపాటు 7వ పే కమిషన్ సిఫారసు ప్రకారం వేతనాలు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ సంఖ్య వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. మార్గదర్శకాల రూపకల్పనపై కూడా సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. తమ ప్రతిపాదనలను వినతిపత్రం రూపంలో సమర్పిస్తామని, వాటిని పరిగణనలోకి తీసుకోవాలని కాలేజీల యాజమాన్యాలు కోరినట్టు తెలిసింది.