Kuwait Building Fire: కువైట్లో భారీ అగ్నిప్రమాదం.. మృతుల్లో 42 మంది భారతీయులే!
ఏకంగా 49 మంది మరణించగా, వీరిలో 42 మంది భారతీయులేనని సమాచారం. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. బాధితుల్లో ఎక్కువమంది కేరళకు చెందినవారు. తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నారు.
ఉపాధి కోసం వలస వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవడం తీవ్ర విషాదానికి గురిచేసింది. కువైట్ దక్షిణ అహ్మదీ గవర్నరేట్లో మాంగాఫ్ ప్రాంతంలోని ఆరు అంతస్థుల భవనంలో జూన్ 12వ తేదీ ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. తొలుత వంటగది నుంచి మంటలు వ్యాపించినట్లు తెలియజేశారు. ఈ భవనంలో 200 మందికిపైగా భవన నిర్మాణ కార్మికులు నివసిస్తున్నారు.
➤ వివిధ దేశాల నుంచి వలస వచ్చిన వీరంతా ఎన్బీటీసీ గ్రూప్ అనే నిర్మాణ సంస్థలో పని చేస్తున్నారు.
➤ అగ్నిప్రమాదంలో చాలామంది భారతీయులు మరణించడంపై కువైట్లోని భారత రాయబార కార్యాలయం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
Landslide: తీవ్ర విషాదం.. కొండచరియల కారణంగా 2,000 మంది మృతి!!
➤ కువైట్ మొత్తం జనాభాలో భారతీయులు 21 శాతం(10 లక్షలు) ఉంటారు. కువైట్లోని మొత్తం కార్మికుల్లో 30 శాతం మంది(దాదాపు 9 లక్షలు) భారతీయులే. అగ్నిప్రమాదంలో మరణించినవారికి భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ సంతాపం ప్రకటించారు.
➤ మాంగాఫ్ ప్రాంతంలోని ఘటనా స్థలాన్ని భారత రాయబారి ఆదర్శ్ స్వాయికా సందర్శించారు.
➤ మాంగాఫ్ భవన యజమానిని తక్షణమే అరెస్టు చేయాలని కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహద్ అల్–యూసుఫ్ అల్–సబా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్మికులకు తగిన భద్రత కల్పించని భవన నిర్మాణ కంపెనీ యజమానికి సైతం అరెస్టు చేయాలన్నారు.
➤ అగ్ని ప్రమాదంలో ఆప్తులను కోల్పోయినవారికి ప్రధాని మోదీ సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.