Teacher Jobs: గురుకులాల్లో బదిలీల తర్వాతే కొత్త పోస్టింగ్‌లివ్వాలి

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యా సంస్థల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు చేపట్టిన తర్వాతే కొత్తవారికి పోస్టింగ్‌ ఇవ్వాలని తెలంగాణ గురుకుల జేఏసీ తీర్మానించింది.

మే 26న‌ తెలంగాణ గవర్నమెంట్‌ ఆల్‌ రెసిడెన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌(టిగారియా) ఆధ్వర్యంలో గురుకుల జేఏసీ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా టిగారియా అధ్యక్షుడు మామిడి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో గురుకులాల సంఖ్య భారీగా పెరిగినప్పటికీ వసతుల కల్పన మాత్రం అధ్వాన్నంగా ఉందని, దీంతో అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

చదవండి: AI School Teacher: పాఠాలు చెబుతున్న ఏఐ టీచరమ్మ, అద్భుతమైన టాలెంట్‌తో ఫిదా చేస్తుంది..

ప్రభుత్వం వెంటనే అన్ని గురుకులాల్లో కామన్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోసం గురుకుల డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. పాఠశాలలు పునః ప్రారంభమయ్యే నాటికి 317 జీవో బదిలీలు జరిపి పదోన్నతులు ఇవ్వాలని కోరారు.

నిత్యావసర ధరలు పెరిగిన క్రమంలో డైట్‌ చార్జీలు పెంచాలన్నారు. గురుకుల టీచర్లు అందరికీ నైట్‌ స్టే(రాత్రి బస)ఎత్తివేయాలని, రాబోయే పీఆర్సీలో గురుకుల టీచర్లకు ప్రత్యేక వేతన స్కేలు, స్పెషల్‌ టీచర్స్‌కు టీజిటీలకు సమానమైన స్కేలు వర్తింపజేయాలని కోరారు.

దాదాపు పది అంశాలపై చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రభుత్వానికి నివేదించున్నట్లు ఆయన వివరించారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎ.మధుసూదన్, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ ఎం.రామకృష్ణయ్య, నేతలు నరసింహులు గౌడ్, కె.జనార్ధన్, బిక్షం పాల్గొన్నారు. 

#Tags