TOEFL Exam: టోఫెల్‌ ప్రిపరేటరీ సర్టిఫికేషన్‌ పరీక్ష.. పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఈ సర్టిఫికెట్‌ ప్రదానం

సాక్షి, అమరావతి: ఆంగ్ల భాషలో రాష్ట్ర విద్యార్థుల నైపు­ణ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన టోఫెల్‌ ప్రిపరేటరీ సర్టిఫికేషన్‌ పరీక్ష ఏప్రిల్‌ 10న‌ నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ తెలిపారు.

13,104 పాఠశాలల్లో 3 నుంచి 5 తరగతుల వరకు చదువుతున్న 4,53,265 మంది విద్యార్థులు ఎడ్యుకేషన్‌ టెస్టింగ్‌ సర్వీసెస్‌ (ఈటీఎస్‌) నిర్వహించే టోఫెల్‌ ప్రైమరీ పరీక్షకు హాజరవుతున్నారని తెలిపారు. ఏప్రిల్‌ 12న జరిగే టోఫెల్‌ జూనియర్‌ ప్రిపరేటరీ పరీక్షను 5,907 పాఠశాలలకు చెందిన 6 నుంచి 9 తరగతులు చదువుతున్న 16,52,142 మంది విద్యార్థులు రాయనున్నట్టు వివరించారు.

ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అమెరికాకు చెందిన ఎడ్యుకేషన్‌ టెస్టింగ్‌ సర్వీసెస్‌ నుంచి టోఫెల్‌ సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తారని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మన విద్యా వ్యవస్థను బలోపేతం చేసి, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచి, చిన్న వయసు నుంచే పోటీ పరీక్షల్లో రాణించేలా టోఫెల్‌ పరీక్షకు సిద్ధం చేయడం తమ లక్ష్యమన్నారు.

చదవండి: Changes in TOEFL: టోఫెల్‌.. కీలక మార్పులు ఇవే!

జిల్లాల్లో అత్యుత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు పాఠశాలల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం అవసరమని, ప్రతి పాఠశాలా ఉన్నత స్థాయిలో ఉండాలని ఆయన ఆ­కాంక్షించారు.

విద్యార్థుల్లో ఉన్నతమైన నైపుణ్యా­లు, బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడంలో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. టోఫెల్‌ పరీక్షలు రాసే విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.  

#Tags