PM Modi : యూపీఎస్సీ సివిల్స్ 2023 ఫలితాల్లో ఫెయిలైన అభ్యర్థుల గురించి ప్రధాని మోదీ ఏమన్నారంటే..!
ఈ ఫలితాల్లో ఆరుగురు అమ్మాయిలు టాప్-10లో నిలిచి సత్తా చాటారు. ఈ ఫలితాల్లో విజయం సాధించిన అందరిని భారత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారు. అలాగే వారి కృషి, పట్టుదల, అంకితభావం ఫలించాయని తెలిపారు. అలాగే వీరికి ప్రజాసేవలో ఉజ్వలమైన భవిష్యత్తుకి ఇది తొలిమెట్టుగా ఆయన అభివర్ణించారు. రానున్న రోజుల్లో వారి ప్రయత్నాలు దేశ భవిష్యత్ను తీర్చిదిద్దుతాయని ఆయన అన్నారు.
ఫెయిలైన అభ్యర్థులకు ఇది ముగింపు కాదు..
యూపీఎస్సీ సివిల్స్ సర్వీసెస్ పరీక్షల్లో తాము అనుకున్న విజయాన్ని సాధించలేక పోయిన అభ్యర్థులకు.. ఇది వారి ప్రయాణంలో ముగింపుకాదని గుర్తించుకోవాలన్నారు. పరీక్షల్లో విజయం సాధించడానికి ఎన్నో మార్గాలున్నాయని ప్రధాని తెలిపారు. వీరి ప్రతిభను సరిపడా ఉపయోగించుకునేందుకు భారతదేశంలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే వీరు ప్రయత్నాలు చేస్తూ.. మరిన్ని అవకాశాలను అన్వేషించాలని ప్రధాని మోదీ అన్నారు.