AP Inter Exams: నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు..

రాయచోటి: జిల్లాలో ఇంటర్‌మీడియట్‌ వార్షిక పరీక్షల నిర్వహణకు జిల్లా ఇంటర్‌ బోర్డు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ ఆదేశాల మేరకు పరీక్షల నిర్వహణను పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేపట్టినట్లు డీఐఈవో కృష్ణయ్య తెలిపారు.

పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు తీసుకెళ్లరాదని ఆదేశాలిచ్చారు. వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు అవసరమైన తాగునీరు, ఆరోగ్య సమస్యలు తలెత్తితే ప్రాథమిక వైద్యంలో భాగంగా ప్రతి సెంటరు వద్ద ఒక ఏఎన్‌ఎంను, మందులను సిద్ధంగా ఉంచాలని సూచించారు. మార్చి నెల 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్‌ ప్రథమ సంవత్సరం, 2 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు జరగుతాయన్నారు.ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అరగంట(8.30) ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని డీఐఈవో తెలిపారు.

54 సెంటర్లు.. 29877 మంది విద్యార్థులు
అన్నమయ్య జిల్లా పరిధిలో ఇంటర్‌ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు 54 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో 29,877 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. ప్రథమ సంవత్సరంలో 14821 మంది పరీక్ష రాయనుండగా అందులో 7011 మంది బాలురు, 7810 మంది బాలికలు ఉన్నారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో 15056 మంది పరీక్షలు రాయనున్నారు. వీరిలో బాలురు 7339, బాలికలు 7717 మంది ఉన్నారు. పరీక్ష కేంద్రాలకు అవసరమైన ప్రశ్నపత్రాలు, ఇతర సామగ్రి నిల్వ కోసం 26 పోలీసు స్టేషన్లలో స్టోరేజి కేంద్రాలను ఏర్పాటు చేశారు.

  • జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్‌ పరీక్షలను 5 విభాగాలకు చెందిన అధికారులు పర్యవేక్షణ చేయనున్నారు. డీఐఈవో, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఇద్దరు, సిట్టింగ్‌ స్క్వాడ్‌ ఇద్దరు, స్పెషల్‌ ఆఫీసర్‌ ఒక్కరు, జిల్లా ఇంటర్‌ పరీక్షాకమిటీ పర్యవేక్షకులు ముగ్గరు వంతున పర్యవేక్షించనున్నారు. వీరితో పాటు 9 మంది కస్టోడియన్‌లు కూడా ఉన్నట్లు డీఐఈవో పేర్కొన్నారు.

చదవండి: AP Inter Exams: ఏపీలో నేటి నుంచే ఇంటర్‌ పరీక్షలు.. అన్ని సెంటర్లలో ప్రత్యేక నిఘా


ఉత్తీర్ణత శాతాన్ని పెంచేలా...
విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలను రాసి మంచి ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని విద్యార్థులకు డీఐఈవో కృష్టయ్య సూచించారు. ఫీజులు చెల్లించలేదని కొంతమంది ప్రైవేటు స్కూల్స్‌ యాజమాన్యం హాల్‌ టిక్కెట్లను ఇవ్వకపోతే నెట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్షలకు హాజరు కావాలన్నారు.

ఏర్పాట్ల పరిశీలన
శుక్రవారం ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను డీఐఈవో కృష్ణయ్య పరీశీలించారు.గదులను తనిఖీ చేశారు. సౌకర్యాల గురించి ఆరా తీశారు.విద్యార్థులు కుర్చోవడానికి నంబర్లు వేస్తున్న విధానాన్ని ఆయన దగ్గరుండి పరిశీలించారు.

#Tags