ప్రభుత్వ ఉద్యోగులుగా వీఆర్ఏలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): గ్రామ రెవెన్యూ స హాయకుల(వీఆర్ఏ) వ్యవస్థ పూర్తిగా రద్దయింది. జి ల్లాలోని వీఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖలకు కేటా యిస్తూ జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) మోతీలాల్ ఆధ్వర్యంలో జాబితా సిద్ధమైంది. రెవెన్యూ శాఖతో పాటు మొత్తం 11శాఖలకు కేటాయించారు. జిల్లాలోని 482మంది వీఆర్ఏలతోపాటు పెద్దపల్లి జిల్లా నుంచి మరో 17మంది బదిలీ రానున్నారు. వీరందరికీ ఈ నెల 11న శుక్రవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ సంతోష్, అదనపు కలెక్టర్లు మోతీలాల్, రాహుల్, ప్రభుత్వ విప్ బాల్కసుమన్, ఎమ్మెల్యేలు ఎన్.దివాకర్రావు, దుర్గం చిన్నయ్య నియామక పత్రాలు అందజేయనున్నారు. ఆయా శాఖల ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అక్కడికక్కడే నియామక లేఖలు అందుకోవడంతోపాటు ఉద్యోగాల్లో చేరేలా ఏర్పాట్లు చేశారు.
సర్దుబాటు ఇలా..
జిల్లాలో 541 మంది వీఆర్ఏలు ఉండగా 61ఏళ్లలోపు వారు 482 మంది ఉన్నారు. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా 75మంది, రికార్డు అసిస్టెంట్గా 61, సబార్డినేట్గా 12, మున్సిపల్ శాఖలో వార్డు అధికారులు(జూనియర్ అసిస్టెంట్)గా 47, ఇరిగేషన్ శాఖలో లష్కర్ పోస్టులకు 83, సహాయకుల పోస్టులు 8, మిషన్ భగీరథలో సహాయకులు 96మందిని సర్దుబాటు చేస్తున్నారు. జిల్లా నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ముగ్గురిని, జగి త్యాల జిల్లాకు 39మందిని కేటాయించారు. 61ఏళ్లు దాటిన 59మంది స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఆదేశాలు రాకపోవడంతో పెండింగ్లో ఉంచారు.
ఏడుగురు జేపీఎస్లకు..
జేపీఎస్ల పనితీరు ఆధారంగా క్రమబద్ధీకరణకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ సాగుతోంది. జిల్లాలో 218మందికి గాను 115మంది ప్రొబేషనరీ కాలం పూర్తి కాగా మరో 103మందికి సంబంధించి మరో మూడు నెలల్లో ముగియనుంది. కలెక్టర్ చైర్మన్గా ఉన్న కమిటీ ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి వివిధ అంశాల వారీగా వంద మార్కులతో కూడిన నివేదిక ఆధారంగా పనితీరును పరిశీలించి 70మార్కులు వచ్చిన వారిని అప్రూవల్ చేస్తోంది. 70మార్కులు రాని వారికి మరో ఆరు నెలలు అవకాశం ఇస్తోంది. ఇప్పటివరకు 115మందిలో దాదాపు 25మందికి పైగా జేపీఎస్ల పనితీరు పరిశీలించారు. ఇందులో ఏడుగురికి మాత్రమే 70కి పైగా మార్కులు రాగా శుక్రవారం కలెక్టరేట్లో నియామక లేఖలు అందించనున్నారు.