Tenth to University Exams: టెన్త్ నుంచి యూనివర్సిటీ పరీక్షల వరకు ప్రక్షాళన చేయాల్సిందే..!
హైదరాబాద్: టెన్త్ నుంచి యూనివర్సిటీ వరకు పరీక్షల విభాగాలను ప్రక్షాళన చేయనున్నారు. ఇటీవల ఉన్నతాధికారులు ఈ అంశంపై సమీక్షించారు. అన్ని వివరాలు అందించాలని సంబంధిత విభాగాలను ఆదేశించారు. అనంతరం దీనిపై ఓ నివేదిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత దీనిపై కీలక నిర్ణయం తీసుకునే వీలుంది. రాష్ట్రంలో పరీక్షల విధానంపై కొన్నేళ్లుగా ఆరోపణలు వస్తున్నాయి. గత ఏడాది టెన్త్ పేపర్ లీక్, ఇంటర్ పరీక్ష పేపర్లు తారుమారైన ఘటనలు, డిగ్రీ పరీక్షల విధానంలోనూ అనేక విమర్శలు రావడాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారం చేపట్టిన తొలిరోజుల్లో దీనిపై సమీక్ష జరిపారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆయన సూచించారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో అధికారులు పరీక్షల విభాగాలపై దృష్టి పెట్టారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై ఆరా :
కొన్నేళ్లుగా పరీక్షల్లో జరుగుతున్న పొరపాట్ల వెనుక ఔట్సోర్సింగ్ ఉద్యోగులే బాధ్యులుగా తేలుతున్నారని టెన్త్ , ఇంటర్, యూనివర్సిటీ అధికారుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. విద్యాశాఖ పరిధిలో రాష్ట్రంలో 12 ప్రభుత్వ విశ్వ విద్యాలయాలున్నాయి. అన్ని వర్సిటీల్లోని పరీక్షల విభాగాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. వారికి ఇచ్చే వేతనాలు కూడా తక్కువే. ఉద్యోగ భద్రత లేకపోవడంతో కొంతమంది జావాబుదారీతనం లేకుండా పనిచేస్తున్నారని వీసీలు అంటున్నారు. వీరిని మధ్యవర్తులు, అవసరమున్న వారు వలలో వేసుకుంటున్నారు. ఇటీవల విదేశాలకు వెళ్లిన కొంతమంది విద్యార్థులు నకిలీ సర్టిఫికెట్లు పెట్టడం వెనుక వీరి హస్తం ఉందనేది వర్సిటీ అధికారుల వాదన.
Free Coaching: ఎమ్మెస్సీ కెమిస్ట్రీ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణ
సాంకేతిక కోణంలోనూ:
టెన్త్ , ఇంటర్ పరిధిలోని పరీక్షల విభాగంలో సాంకేతిక వ్యవస్థ మొత్తం మూడో వ్యక్తుల చేతుల్లోకి ఉంది. పలు సంస్థలను టెక్నికల్ సహాయానికి వినియోగిస్తున్నారు. ప్రశ్నపత్రాల రూపకల్పన మొదలు, మార్కులు ఫీడ్ చేయడం, ఫలితాల వెల్లడి వరకూ ప్రైవేటు సాఫ్ట్వేర్ వాడుతున్నారు. వీటి పాస్వర్డ్ కూడా ఆయా సంస్థల వద్దే ఉంటున్నాయి. రెగ్యులర్ ఉద్యోగులు ఆ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం, అవసరమైన సాఫ్ట్వేర్ను సొంతంగా కొనుగోలు చేసే విధానం లేకపోవడంతో థర్డ్ పార్టీని ఆశ్రయించాల్సి వస్తోందని అధికారులు అంటున్నారు. దీనివల్ల ప్రశ్నపత్రాల లీకేజీకి ఆస్కారముందని, ఏ చిన్న లోటుపాట్లు జరిగినా బాధ్యులు ఎవరనేది తెలుసుకునే అవకాశం ఉండటం లేదని అధికారవర్గాలు అంటున్నాయి. ఈ కారణంగా తాత్కాలిక, బయట వ్యక్తుల పాత్రను పరీక్షల విభాగం నుంచి తప్పించాలని భావిస్తున్నారు.