Skip to main content

జాతీయ కమిషన్లు-విధులు

జాతీయ మానవ హక్కుల కమిషన్ : <br/> జాతీయ మానవ హక్కుల కమిషన్ చట్టబద్ధమైన సంస్థ కానీ రాజ్యాంగ బద్ధమైన సంస్థ కాదు. మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 ప్రకారం 1993 అక్టోబర్ 12న జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పడింది.
2006 సంవత్సరంలో ఈ కమిషన్‌ను సవరించారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
నిర్మాణం:
ఇది బహుళ సభ్య సంస్థ. దీనిలో ఒక చైర్మన్ నలుగురు సభ్యులు ఉంటారు
  1. చైర్మన్‌గా నియమితులయ్యే వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసినవారై ఉండాలి
  2. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్న లేదా పదవీ విరమణ చేసిన వారు ఒక సభ్యుడిగా ఉంటారు.
  3. మరో సభ్యుడు ఏదైనా హైకోర్టు నుంచి న్యాయమూర్తిగా పనిచేస్తున్న లేదా పదవీ విరమణ చేసిన వారై ఉండాలి
  4. మిగిలిన ఇద్దరు సభ్యులు మానవ హక్కుల రంగంలో పరిజ్ఞానం ఉన్నవారై ఉండాలి. 
పై సభ్యులతో పాటు మరో నలుగురు పదవి రీత్యా సభ్యులుగా ఉంటారు
నియామకం:
  1. కమిషన్ చైర్మన్, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు.
  2. వీరి నియామకంలో ప్రధాన మంత్రి అధ్యక్షతన ఆరుగురు సభ్యుల కమిటీ సలహా ఇస్తుంది.
    1. భారత ప్రధాన మంత్రి (చైర్మన్)
    2. కేంద్ర హోంశాఖ మంత్రి
    3. లోకసభ స్పీకర్
    4. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
    5. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు
    6. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు
పదవీకాలం:
కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీ కాలం ఐదేళ్లు లేదా 70 ఏళ్ల వయసు వచ్చే వరకు. ఏది ముందైతే అది వర్తిస్తుంది.
తొలగింపు:
కమిషన్ చైర్మన్, సభ్యులను తొలగించే అధికారం రాష్ట్రపతి (యూపీఎస్సీ చైర్మన్, సభ్యులను తొలగించినట్లు)
విధులు:
  1. మానవ హక్కులను పరిరక్షించడం
  2. జైళ్లలో ఉన్న ఖైదీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని మార్గదర్శకాలు ఇవ్వడం
  3. మానవ హక్కుల రంగంలో పరిశోధన చేపట్టడం
  4. ప్రజలకు మానవ హక్కుల పట్ల అవగాహన కల్పించడం
  5. కమిషన్‌కు సంవత్సరం కంటే ముందు జరిగిన విషయాలన విచారించే అధికారం లేదు
జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్లు:
  1. జస్టిస్ రంగనాథ్ మిశ్రా
  2. జస్టిస్ ఎం.ఎన్. వెంకట చలయ్య
  3. జస్టిస్ జేఎస్. వర్మ
  4. జస్టిస్ ఏ.ఎస్. ఆనంద్
  5. జస్టిస్ రాజేంద్ర బాబు
  6. జస్టిస్ కే.జి. బాలకృష్ణన్
  7. జస్టిస్ హెచ్.ఎల్ దత్తు
ప్రస్తుతం జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా హద్యాల లక్ష్మీనారాయణ దత్తు (హెచ్.ఎల్. దత్తు) 2016 ఫిబ్రవరి 29వ తేదీ నుంచి కొనసాగుతున్నారు.

జాతీయ ఎస్సీ కమిషన్ :
పరిచయం:
జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థ. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలను విభజించి 2006 ఫిబ్రవరి 19వ తేదీన ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
కమిషన్ ప్రస్తుత చైర్మన్ - రాంశంకర్ కఠారియా
నిర్మాణం:
జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్‌లో ఒక ైచైర్మన్, వైస్ ైచైర్మన్, ముగ్గురు సభ్యులు ఉంటారు. ఇందులో ఒక మహిళ సభ్యురాలు తప్పనిసరి.
నియామకం:
కమిషన్ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులను భారత రాష్ట్రపతి నియమిసారు. వీరు షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారై ఉండాలి.
పదవీ కాలం:
జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ైచైర్మన్, సభ్యుల పదవీకాలాన్ని రాష్ట్రపతి నిర్ణయిస్తారు. ప్రస్తుత కమిషన్ పదవీకాలం మూడేళ్లు.
తొలగింపు: కమిషన్ చైర్మన్, సభ్యులను రాష్ట్రపతి తొలగిస్త్తారు.
విధులు:
  1. షెడ్యూల్డ్ కులాల హక్కులను పరిరక్షించడం
  2. షెడ్యూల్డ్ కులాల సాంఘిక - ఆర్థిక అభివృద్ధికి వివిధ ప్రణాళికల రూపకల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు ఇవ్వడం.
  3. ఈ కమిషన్‌కు ఏదైనా కేసును విచారించే విషయంలో సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి.
  4. షెడ్యూల్డ్ కులాల హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు విచారణ చేయడం.
జాతీయ షెడ్యూల్డ్ కులాల చైర్మన్లు:
  1. సూరజ్ బాన్
  2. బూటాసింగ్
  3. పి.ఎల్.పునియా
  4. రాంశంకర్ కఠారియా

జాతీయ ఎస్టీ కమిషన్
:
89వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ప్రకారం జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ 2004 సంవత్సరంలో ఏర్పడింది. ఇది రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ. రాజ్యాంగంలోని 338(ఎ) అధికరణ జాతీయ షెడ్యూల్డ్ తెగల గురించి తెలియజేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. రాజ్యాంగ పరంగా షెడ్యూల్డ్ తెగలకు కల్పించిన రక్షణలను పరిరక్షించడం దీని లక్ష్యం
నిర్మాణం:
జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్‌లో ఒక ైచైర్మన్, వైస్ చైర్మన్, ముగ్గురు ఇతర సభ్యులు ఉంటారు. వీరిలో ఒక మహిళ సభ్యురాలు తప్పనిసరి. వీరందరూ షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినవారై ఉండాలి.
నియామకం:
చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు, అలాగే రాష్ట్రపతికే వీరిని తొలగించే అధికారం ఉంటుంది. వీరి పదవీ కాలం మూడేళ్లు.
విధులు:
  1. షెడ్యూల్డ్ తెగలకు రాజ్యాంగ పరంగా కల్పించిన హక్కులకు రక్షణ కల్పించడం.
  2. వీరి రక్షణ కోసం రాష్ట్రపతి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయడం.
  3. సివిల్ కోర్టు అధికారాలు ఈ కమిషన్‌కు ఉంటాయి
చైర్మన్లు:
  1. కున్వర్ సింగ్
  2. ఊర్మిళా సింగ్
  3. రామేశ్వర్ వోరాన్
  4. నంద కుమార్ సాయి (ప్రస్తుతం)

జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ :
  1. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చట్టం 1993 ప్రకారం 1993 ఆగస్టు14న ఏర్పడింది. ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ. భారత ప్రభుత్వం గుర్తించిన షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగలకు చెందని వెనుకబడిన వర్గాలను, వెనుకబడిన తరగతులు (బీసీలు) అంటారు. 1921 సంవత్సరంలో మైసూర్ సంస్థానంలో తొలిసారిగా వెనుకబడిన తరగతులు అనే పదాన్ని ఉపయోగించారు.
  2. భారత రాజ్యాంగంలోని అధికరణ 340 ప్రకారం వెనుకబడిన తరగతుల సామాజిక - ఆర్థిక స్థితిగతులపై కమిషన్‌ను ఏర్పాటు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. 1953లో కాకా సాహెబ్ కలేకర్ కమిషన్‌ను వేయగా, ఇది 1955లో నివేదిక సమర్పిం చింది. దేశంలో 2399 వెనుకబడిన కులాల ఉన్నాయి. కాబట్టి వీరి అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సూచన ఇచ్చింది.
  3. జనతా ప్రభుత్వం 1978లో బీసీ మండల్ కమిషన్‌ను ఏర్పాటు చేయగా, 1980లో నివేదిక సమర్పించింది. ఇందులో 3743 కులాలు వెనుకబడినవి ఉన్నాయి. దేశ జనాభాలో వీరు 52 శాతంగా ఉన్నారు. వీపీ సింగ్ ప్రభుత్వం 1990లో రిజర్వేషన్లు కల్పించగా ఇందిరా సహాని రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పోరాటం చేస్తే సుప్రీం కోర్టు 1992లో రిజర్వేషన్లు సబబేనని తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం 1993 ఆగస్టు 14వ తేదీన ఏర్పడింది
నిర్మాణం :
ఇది ఒక బహుళ సమాఖ్య కమిషన్. ఇందులో ఒక చైర్మన్, ముగ్గురు సభ్యులు, ఒక సభ్య కార్యదర్శి ఉంటారు. చైర్మన్, సభ్య కార్యదర్శులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. తొలగిస్తుంది. వీరి పదవీ కాలం మూడేళ్లు. ప్రస్తుతం జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ప్రస్తుత ఛైర్మన్ భగవాన్ లాల్ సాహ్ని.
కమిషన్ విధులు:
  1. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ప్రభుత్వానికి సలహలు ఇవ్వడం.
  2. ఏదైనా కులాన్ని వెనుకబడిన తరగతుల్లో చేర్చాలన్నా, తొలగించాలన్నా ప్రభుత్వానికి సూచనలు చేయడం.
  3. పదేళ్లకు ఒకసారి వెనుకబడిన తరగతుల కులాలను పునఃసమీక్షించి కేంద్ర ప్రభు త్వానికి నివేదిక సమర్పిస్తుంది.
కమిషన్ చైర్మన్లు:
  1. జస్టిస్ ఆర్.ఎన్. ప్రసాద్
  2. జస్టిస్ శ్యామ్‌సుందర్
  3. జస్టిస్ బి.ఎల్.యాదవ్
  4. జస్టిస్ రామ్ సూరత్ సింగ్
  5. జస్టిస్ ఎస్.ఆర్. పాండ్యన్
  6. జస్టిస్ మకాని నారాయణ రావు
  7. జస్టిస్ వంగాల ఈశ్వరయ్య
  8. భగవాన్ లాల్ సాహ్ని(ప్రస్తుతం)

జాతీయ మహిళ కమిషన్ :

పరిచయం:
జాతీయ మహిళ కమిషన్ చట్టం 1990 ప్రకారం జాతీయ మహిళ కమిషన్ 1992 జనవరి 31వ తేదీన ఏర్పడింది. ఇది శాసనబద్ధమెన సంస్థ. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
నిర్మాణం: జాతీయ మహిళా కమిషన్ బహుళ సభ్య సంస్థ. ఇందులో ఒక చైర్మన్, ఐదుగురు సభ్యులు, ఒక సభ్య కార్యదర్శి ఉంటారు. చైర్‌పర్సన్, సభ్యులకు మహిళ సమస్యలపై, న్యాయ శాస్త్రంలో , మహిళ సాధికారతపై పూర్తిగా అవగాహన ఉండాలి. కమిషన్‌లో ఒకరు ఎస్సీ, ఎస్టీ తెగలకు చెందిన వారై ఉండాలి
నియామకం:
కమిషన్ చైర్‌పర్సన్, సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. తొలగిస్తుంది.
పదవీకాలం:
కమిషన్ చైర్‌పర్సన్, సభ్యుల పదవీ కాలం 3 ఏళ్లు. వీరు పదవీ కాలం కంటే ముందే రాజీనామా చే యవచ్చు.
విధులు:
  1. మహిళల రక్షణలను పరిరక్షించి, పర్యవేక్షించడం.
  2. కేంద్ర ప్రభుత్వానికి మహిళ సంక్షేమానికి సంబంధించి సూచనలు ఇవ్వడం.
  3. పరివారక్ మహిళ లోక్ అదాలత్ ద్వారా బాల్య వివాహాల నిరోధానికి కృషి చేయడం.
  4. వరకట్న నిషేధచట్టం 1961ని సమీక్షించి, ఆస్తి తగదాలను పరిష్కరించడం
  5. సెమినార్లు, వర్‌‌కషాపులు నిర్వహించి మహిళ సమస్యల పట్ల సమాజంలో అవగాహన కల్పించడం
జాతీయ మహిళ కమిషన్ చైర్‌పర్సన్లు:
  1. జయంతి పట్నాయక్
  2. మెహిని గిరి
  3. విభా పార్థసారధి
  4. పూర్ణిమా అద్వాని
  5. గిరిజా వ్యాస్
  6. మమత శర్మ
  7. లలిత కుమార మంగళం
  8. రేఖ శర్మ (ప్రస్తుతం)

జాతీయ మైనార్టీ కమిషన్ :

జాతీయ అల్ప సంఖ్యాక వర్గాల(మైనార్టీ) కమిషన్ చట్టం 1992 ప్రకారం 17 మే 1993న ఏర్పడింది. ఇది శాసనబద్ధమైన సంస్థ కానీ రాజ్యాంగ బద్ధమైన సంస్థకాదు. అల్ప సంఖ్యాక వర్గాలకు కల్పించిన రక్షణలను పర్యవేక్షించడం దీని లక్ష్యం. ప్రస్తుత జాతీయ అల్ప సంఖ్యాక వర్గాల కమిషన్ చైర్మన్ - సయ్యద్ గయోరల్ హసన్ రిజ్వి
నిర్మాణం:
జాతీయ అల్ప సంఖ్యా వర్గాల కమిషన్ బహుళ సభ్య సంఘం. ఇందులో ఒక చైర్మన్, వైస్ చైర్మన్, ఐదుగురు సభ్యులు ఉంటారు. కమిషన్ చైర్మన్, సభ్యులను కేంద్ర ప్రభుత్వ నియమిస్తుంది. తొలగిస్తుంది.
వీరి పదవీకాలం మూడేళ్లు, కేంద్ర ప్రభుత్వం ఆరు మతాలను అల్ప సంఖ్యాకులుగా గుర్తించింది.
  1. ముస్లీం
  2. క్రైస్తవులు
  3. సిక్కులు
  4. బౌద్ధులు
  5. పార్శీలు
  6. జైనులు
విధులు:
  1. అల్ప సంఖ్యాక వర్గాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వాలకు సూచనలు చేయడం.
  2. కేంద్ర ప్రభుత్వం మైనార్టీలకు సంబంధించి ఏమైనా ఆదేశాలు ఇస్తే అవి పాటించడం.
  3. మెనార్టీల సంక్షేమం కోసం కేంద్ర- రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాల అమలు తీరును పర్యవేక్షించడం.
  4. ఈ కమిషన్‌కు సివిల్ కోర్టు అధికారాలు ఉంటాయి.
చైర్మన్లు:
  1. మహ్మద్ సర్ధార్ అలీఖాన్
  2. థాహిర్ మహ్మద్ ఔ
  3. మహ్మద్ షమీమ్
  4. తర్లోచన్
  5. మహ్మద్ హమీద్ అన్సారీ
  6. మహ్మద్ షఫీ ఖురేషి
  7. వజహత్ హబీబుల్లా
  8. నసీం అహ్మద్
  9. సయ్యద్ గయోరల్ హసన్ రిజ్వి

జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ కమిషన్ :
జాతీయ వినియోగదారుల రక్షణ చట్టం 1986 ప్రకారం జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ 1988లో ఏర్పడింది. ఇది రాజ్యాంగ బద్ధమైన సంస్థకాదు. కానీ శాసనబద్ధమైన సంస్థ. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
నిర్మాణం: ఈ కమిషన్ బహుళ సభ్యత్వం కలిగి ఉంది. ఇందులో ఒక చైర్మన్, 10మంది సభ్యులు ఉంటారు. వీరందరిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది, తొలగిస్తుంది. వీరి పదవీకాలం 3 ఏళ్లు.
విధులు:
  1. హానికరమైన వస్తువులు,సేవల నుంచి వినియోగదారులను రక్షించడం
  2. కోటి రూపాయల ఆస్తి విలువ ఉన్న వస్తువులపై కమిషన్ విచారిస్తుంది.
  3. విచారణలో ఏకీకృత విచారణ పద్ధతిని అమలు చేయడం
  4. కమిషన్ వినియోగదారునికి ఆరు రకాల హక్కులను కల్పించింది.
    ఎ) భద్రత హక్కు
    బి) అవగాహన హక్కు
    సి) ఎంపిక హక్కు
    డి) సమాచారం తెలుసుకునే హక్కు
    ఈ) సమస్య పరిష్కారం హ క్కు
    ఎఫ్) విన్నవించుకునే హక్కు
    ప్రస్తుత కమిషన్ చైర్మన్ -జస్టిస్ ఆర్.కె. అగ ర్వాల్

జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ :
జాతీయ బాలల హక్కుల పరిరక్షణ చట్టం 2005 ప్రకారం జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ 2007లో ఏర్పడింది. ఇది రాజ్యాంగేతర సంస్థ. పార్లమెంట్ చట్టం ప్రకారం ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు వారిని బాలలుగా గుర్తిస్తారు.
నిర్మాణం: కమిషన్‌లో చైర్మన్ , ఆరుగురు సభ్యులు ఉంటారు. వీరిలో ఇద్దరు మహిళ సభ్యులు తప్పనిసరి. చైర్మన్, సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. తొలగిస్తుంది. వీరి కాల పరిమితి మూడేళ్లు.
విధులు:
  1. బాలలకు కల్పించిన రక్షణల అమలుకై మార్గదర్శకాలు జారీ చేయడం
  2. బాలల హక్కులకు సంబంధించి పరిశోధనలను పోత్సహించడం
  3. కేసులు సత్వర విచారణకై ప్రత్యేక బాలల కోర్టును ఏర్పాటు చేయడం
చైర్మన్లు:
  1. శాంతా సిన్హా
  2. నూతన్ గుహ బిశ్వాస్
  3. ప్రియాంక్ కనుంగో(ప్రస్తుతం)
Published date : 04 May 2019 06:13PM

Photo Stories