Skip to main content

Inspirational Story: పేపర్‌ బాయ్‌ నుంచి ఐఏఎస్‌ వరకు... రాజ్‌పుత్‌ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమే... చదవండి

చదువుకునే కోరిక ఉన్నా కుటుంబ ఆర్థిక పరిస్థితులు దయనీయంగా ఉండడంతో ఎన్నో లక్షల మంది తమ కలలను వదులుకుని కుటుంబానికి ఆసరగా నిలుస్తున్నారు. కానీ, నిరీష్‌ రాజ్‌పుత్‌ మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా... నమ్మిన వారు మోసం చేసినా ఏ మాత్రం వెనకడుగు వేయలేదు.
IAS Rajputh

చదువుకునేందుకు డబ్బులు లేకపోవడంతో ఇంటింటికి తిరిగి పేపర్‌ వేసేవాడు. డిగ్రీ తర్వాత తాను నమ్మిన స్నేహితుడే ద్రోహం చేశాడు. అయినా ఎక్కడా కుంగిపోకుండా యూపీఎస్సీలో సత్తా చాటాడు. నిరీష్‌ రాజ్‌పుత్‌ కష్టాల జర్నీని తెలుసుకుందాం పదండి. 

చ‌ద‌వండి: నోట్ల రద్దు నిర్ణయం సరైనదే: సుప్రీం... అప్పట్లో 115 మంది మృతి...
మధ్యప్రదేశ్‌లోని బింద్‌ జిల్లాలో నిరీష్‌ రాజ్‌పుత్‌ జన్మించాడు. తండ్రి వీరేంద్ర రాజ్‌పుత్‌ టైలర్‌ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. నిరీష్‌ ఇద్దరు సోదరులు స్థానికంగా ఉపాధ్యాయులుగా పనిచేసేవారు. నిరీష్‌ చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాల్లోనే చదువుకున్నాడు. పరీక్షల ఫీజుల కోసం ఇంటింటికి తిరిగి పేపర్‌ వేసేవాడు. చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు ఎదురైనా చదువును మాత్రం ఆపలేదు. గాల్వియర్‌లోని ప్రభుత్వ కళాశాలో గ్రాడ్యుయేట్‌ పూర్తి చేశాడు. 

చ‌ద‌వండి: మళ్లీ తెరపైకి యోయో... యోయోలో టాప్‌ స్కోరర్‌ ఎవరో తెలుసా..?
డిగ్రీ పూర్తయిన తర్వాత తన లక్ష్యం ఐఏఎస్‌గా నిర్ణయించుకున్నాడు. కానీ, కోచింగ్‌ తీసుకునేందుకు చేతిలో చిల్లిగవ్వలేదు. దీంతో ఇంటి నుంచే ప్రిపరేషన్‌ మొదలుపెట్టాడు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ఉత్తరాఖండ్‌లో కొత్తగా ప్రారంభించిన కోచింగ్‌ సెంటర్‌లో భోదించడానికి తన స్నేహితుల్లోని ఒకరు నిరీష్‌ను సంప్రదించారు. ప్రతిఫలంగా యూపీఎస్‌సీ పరీక్షల కోసం స్టడీ మెటీరియల్స్‌ ఇస్తానని అతను నిరీష్‌కు హామీ ఇచ్చాడు.
రెండేళ్లు గడిచేసరికి కోచింగ్ ఇన్‌ స్టిట్యూట్‌ బాగా వృద్ధి చెందింది. దీంతో నిరీష్‌ అవసరం లేదని భావించి అతన్ని ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పంపించేశాడు. రెండేళ్ల పాటు కోచింగ్‌ సెంటర్‌లో పాఠాలు చెప్పినా ఎటువంటి ప్రతిఫలం పోందలేకపోయాడు నిరీష్‌. చేసేది లేక కట్టుబట్టలతో ఢిల్లీకి బయలుదేరాడు. అక్కడ యూపీఎస్‌సీ పరీక్షల కోసం ప్రిపరేషన్‌ మొదలుపెట్టాడు.

చ‌ద‌వండి: బార్బర్‌గా స్టార్ట్‌ చేసి... నేడు కోట్లకు అధిపతి... అచ్చం రాజా సినిమా స్టోరీలాగే...
యూపీఎస్‌సీ పరీక్షల కోసం ఢిల్లీలో సన్నద్ధమవుతున్న అనేక మంది ఔత్సాహికులను కలుసుకున్నాడు. ప్రిపరేషన్‌ ఎలా అవ్వాలో వారు నిరీష్‌కు వివరించారు. దీంతో మళ్లీ కోచింగ్‌ అవసరం లేకుండానే ప్రిపరేషన్‌ స్టార్ట్‌ చేశాడు. ఇలా చదువుతూ మొదటి మూడు ప్రయత్నాల్లో విజయానికి దగ్గరగా వచ్చి నిలిచిపోయాడు. మూడు సార్లు చేసిన తప్పులను బేరీజు వేసుకుని, ఈ సారి ఎలాంటి తప్పులకు చాన్స్‌ ఇవ్వకూడదని కృతనిశ్చయంతో కష్టపడి ప్రిపరేషన్‌ను మళ్లీ మొదలు పెట్టాడు. 2013లో యూపీఎస్సీ ఫలితాల్లో  370వ ర్యాంకు సాధించి తన కల సాకారం చేసుకున్నాడు. 
నిరీష్‌ జీవితం కూడా ఏ సినిమా స్టోరీకి తక్కువ కాదు. చిన్ననాటి నుంచే ఆర్థిక ఇబ్బందులతో చదువులో సత్తా చాటుతూ వచ్చాడు. నమ్మిన వాళ్లు మోసం చేసినా, మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేయడంతోనే సక్సెస్‌ సాధించాడు. కాబట్టి మనలో చాలా మంది నిరీష్‌ను స్ఫూర్తిగా తీసుకుని విజయం సాధించాలి.

Published date : 05 Jan 2023 01:50PM

Photo Stories