Skip to main content

School Fees: ప్రైవేటు పాఠశాలల దోపిడీకి అడ్డుకట్ట

ప్రైవేటు స్కూళ్ళ ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని భావిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఓ కీలక ముందడుగు వేసింది.
schools
ప్రైవేటు పాఠశాలల దోపిడీకి అడ్డుకట్ట

ఈ మేరకు ఏకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో దీనిపై అధ్యయనానికి మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని పేద, మధ్య తరగతి వర్గాలు స్వాగతిస్తున్నాయి. వీలైనంత త్వరగా పటిష్టమైన నియంత్రణాధికారంతో చట్టం తేవాలని మేధావులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. వాస్తవానికి పేదవర్గాలను ఫీజుల పేరుతో పీల్చి పిప్పి చేసే వ్యవస్థలపై 2016లోనే ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఫీజుల నియంత్రణపై అధ్యయనానికి ఆచార్య తిరుపతిరావు కమిటీని వేసింది. ఈ కమిటీ 2017లో ప్రభుత్వానికి కొన్ని సిఫారసులు కూడా చేసింది. ఇప్పుడు ఆ సిఫారసులను కూడా పరిగణనలోనికి తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 

పలు రాష్ట్రాల్లో ప్రత్యేక చట్టాలు

ప్రైవేటు ఫీజుల దందాను నియంత్రించేందుకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమబెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో పటిష్టమైన చట్టాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. మొత్తం 11 వేల ప్రై వేటు స్కూళ్ళను నియంత్రణ పరిధిలోకి తేవాలని భావిస్తోంది. ఇష్టానుసారం కాకుండా, స్కూళ్ళలోని మౌలిక వసతుల ఆధారంగా ఫీజులు పెంచుకునేందుకు వెసులుబాటు ఇచ్చే యోచనలో ఉంది. 

ఆచార్య తిరుపతిరావు సిఫారసులేంటి?

ప్రభుత్వం నియమించిన తిరుపతిరావు కమిటీ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రుల మనోభీష్టాన్ని తెలుసుకుంది. కాగా బడ్జెట్‌ స్కూళ్ళు (వార్షిక ఫీజు రూ. 20 వేల లోపు ఉండేవి) ఫీజుల నియంత్రణను స్వాగతించాయి.

  • స్కూల్‌ డెవలప్‌మెంట్‌ (అభివృద్ధి) చార్జీలు, ఇతర ఖర్చులు కలిపి 15 శాతం ఏటా పెంచుకునేందుకు ఉమ్మడి రాష్ట్రంలోనే జీవోలిచ్చారు. ఇదే సమస్యగా మారింది. పెద్ద స్కూళ్ళు అవసరం లేని ఖర్చును అభివృద్ధిగా చూపిస్తున్నాయి. ఉదాహరణకు ఒక స్కూల్లో ప్రతి గదిలో అత్యాధునిక సౌండ్‌ సిస్టం, టెక్నాలజీ అభివృద్ధి చేశారు. దీన్ని విద్యార్థుల కోసం ఖర్చు పెట్టినట్టు లెక్కల్లో చూపారు. తర్వాత ఫీజులు 25 శాతం పెంచారు. 
  • స్కూళ్ళ మూడేళ్ళ ఖర్చును బట్టి వార్షిక ఫీజుల పెంపునకు అనుమతించాలనే ప్రతిపాదన వచ్చింది. రాష్ట్రంలో ఉన్న 11 వేల స్కూళ్ళ ఆదాయ, వ్యయ లెక్కలు చూడాలంటే ప్రత్యేక యంత్రాంగం ఉండాలి. దీన్ని దృష్టిలో ఉంచు కుని కొన్ని సిఫారసులు తెరమీదకొచ్చాయి.
  • ప్రతి స్కూలు 10 శాతం లోపు ఫీజు పెంచుకోవచ్చు. పది శాతం దాటితే ఖర్చు చేసే ప్రతి పైసా బ్యాంక్‌ లావాదేవీగా ఉండాలని ప్రతిపాదించారు. వేతనాలు, స్కూలు కోసం కొనుగోలు చేసే మౌలిక వసతులు, ఇతరత్రా ఖర్చులన్నీ బ్యాంకు ద్వారానే చెల్లించాలి. విధిగా లెక్కలు చూపాలి. వీటిని ఫీజుల రెగ్యులేటరీ కమిటీ పరిశీలిస్తుంది. ఎక్కడ తప్పు చేసినా భారీ జరిమానా, అవసరమైతే స్కూలు గుర్తింపు రద్దును కమిటీ సిఫారసు చేసింది. 
  • ఈ విధానం అమలుచేస్తే చాలా స్కూళ్ళు 10 శాతానికి లోబడే ఫీజులు పెంచే వీలుంది. 2018లో తిరుపతిరావు కమిటీ దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసింది. దాదాపు 4,500 స్కూళ్ళు తమ ఖర్చులను ఆన్ లైన్ ద్వారా చూపాయి. ఇవన్నీ 10 శాతం లోపు ఫీజులు పెంచేందుకు అర్హత పొందాయి. అయితే ఈ విధానం అమల్లోకి రాలేదు. తాజాగా ఈ ప్రతిపాదనలే మంత్రివర్గ ఉప సంఘం పరిశీలిస్తున్నట్టు సమాచారం.

చదవండి:

Covid effect : మా పిల్లల్ని బడికి పంపించేది లేదు..కార‌ణం ఇదే..?

Education: అందరి ఆకాంక్షల చదువే..కానీ

Education: ఉన్నత విద్యకూ ‘విద్యాంజలి’

Published date : 24 Jan 2022 03:30PM

Photo Stories