Skip to main content

Tenth Class Exams 2025: పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు లక్ష్యం 10/10 సాధించడానికి కృషి .... పరీక్షలకు మరో 46 రోజులే గడువు

Teachers guiding students for tenth-grade exams   Tenth Class Exams 2025: పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు లక్ష్యం 10/10 సాధించడానికి కృషి .... పరీక్షలకు మరో 46 రోజులే గడువు
Tenth Class Exams 2025: పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు లక్ష్యం 10/10 సాధించడానికి కృషి .... పరీక్షలకు మరో 46 రోజులే గడువు

 మరో 46 రోజుల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనుండగా.. వందశాతం ఉత్తీర్ణత సాధించడంపై జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఇప్పటికే సిలబస్‌ పూర్తిచేసిన ఉపాధ్యాయులు.. విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధులను చేస్తున్నారు. ఇందుకోసం జిల్లాలోని ఉన్నత పాఠశాలలు, మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీల్లో ఎక్కువ మంది విద్యార్థులు 10/ 10 జీపీఏ సాధించేలా ఉపాధ్యాయులు పక్కా ప్రణాళిక రూపొందించారు. నవంబర్‌ మొదటి వారం నుంచే ఉదయం పూట ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండగా.. సంక్రాంతి సెలవుల తర్వాత సాయంత్రం వేళల్లో సైతం ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. పాఠ్యాంశాల వారీగా విద్యార్థులకు రోజువారీ పరీక్షలు నిర్వహిస్తూ.. తక్కువ మార్కులు తెచ్చుకుంటున్న వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న విద్యార్థులు ఆకలితో ఇబ్బంది పడకుండా అల్పాహారం అందిస్తున్నారు. పరీక్షలు జరిగే ముందురోజు మార్చి 20 వరకు విద్యార్థులకు అల్పాహారం అందించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఈవీ నర్సింహారెడ్డి ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే. ఈ మేరకు ప్రతి విద్యార్థికి రోజూ అల్పాహారం కోసం రూ.15 చొప్పున ఖర్చు చేస్తున్నారు.

ఇదీ చదవండి: Tenth Pre Final 2025 Schedule : విద్యార్థుల‌కు అలర్ట్‌.. టెన్త్ ప్రీ ఫైన‌ల్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుద‌ల‌.. తేదీలివే..
 

పెరిగిన పర్యవేక్షణ..

జిల్లాలోని పాఠశాలలపై ఎంఈఓలు, సెక్టోరియల్‌ అధికారులు రోజువారీ పర్యవేక్షణ చేస్తున్నారు. 2023– 24 విద్యా సంవత్సరంలో పూర్తిస్థాయిలో ఎంఈఓలు లేకపోవడంతో పదో తరగతి ఫలితాలపై ప్రభావం పడింది. కొన్ని పాఠశాలల్లో నామమాత్రంగా తరగతులు నిర్వహించినట్లు విమర్శలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలనే లక్ష్యంతో పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓలుగా ఇన్‌చార్జీ బాధ్యతలను అప్పగించింది. జిల్లాలోని 20 మండలాల్లో 19 మంది ఎంఈఓలు పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలపై పర్యవేక్షణ పెరిగిన నేపథ్యంలో.. రాష్ట్రస్థాయిలో జిల్లా మెరుగుపడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: Tenth Class Pre Final Exams Time Table 2025 : టెన్త్ ప్రీఫైనల్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుద‌ల‌... ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే...?
 

తరగతుల నిర్వహణ ఇలా..

జిల్లావ్యాప్తంగా 131 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, రెండు మోడల్‌ స్కూళ్లు, 20 కేజీబీవీల్లో కలిపి మొత్తం 5,161 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మొత్తం 11,050 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలు రాయనున్నారు. మార్చి 21వ తేదీ నుంచి వార్షిక పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో మెరుగైన ఫలితాల సాధనకు జిల్లా విద్యాశాఖ పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. విద్యార్థులు పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో మెళకువలు నేర్పిస్తున్నారు. ప్రత్యేక తరగతులకు విద్యార్థులు తప్పకుండా హాజరయ్యేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు విద్యా ప్రగతిపై విద్యార్థులతో చర్చిస్తున్నారు. ఆయా కార్యక్రమాలను హెచ్‌ఎంలు నిరంతరం పర్యవేక్షిస్తూ.. అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. విద్యార్థులు సామర్థ్యాల ఆధారంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు రాసిన జవాబులను పరిశీలించి.. చర్చలతో సరిదిద్దుతున్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ మోడల్ పేపర్స్ 2025 | టైం టేబుల్ 2025 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్

ముఖ్యమైన అంశాలు..

ఉపాధ్యాయులు సిలబస్‌ను రివిజన్‌ చేస్తున్నారు. రోజు వారీగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వెనకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ముఖ్యమైన అంశాలు చదివిస్తున్నారు. మేము రాసిన జవాబులను అప్పటికప్పుడు పరిశీలించి.. తప్పులు ఉంటే సరిదిద్దుతున్నారు.   – అశ్విని, విద్యార్థిని,  జంగంరెడ్డిపల్లి, అమ్రాబాద్‌ మండలం

సంసిద్ధులను చేస్తున్నాం..

పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడానికి కృషిచేస్తున్నాం. అన్ని పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. వెనకబడిన విద్యార్థులపై దృష్టిసారించి పరీక్షలకు సంసిద్ధులను చేస్తున్నాం. రోజువారీగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేస్తున్నాం. ఈసారి జిల్లాలో ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్‌ కావొద్దనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం.

                                                                                                        – రమేష్‌కుమార్‌, డీఈఓ

 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 07 Feb 2025 11:22AM

Photo Stories