Tenth Class: పది పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
మే 16న తన కార్యాలయంలో అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 5,09,275 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారని, ఇందుకోసం 2,861 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఆమె అధికారులతో మాట్లాడుతూ.. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విధుల్లో ఉండే సిబ్బందికి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించొద్దన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా విద్యా శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని క్షేత్ర స్థాయి సిబ్బందికి చెప్పాలన్నారు. పాఠశాల ఉపాధ్యాయుల ద్వారా హాల్ టికెట్లు పొందాలని విద్యార్థులకు మంత్రి సూచించారు. పరీక్ష సమయంలో విద్యుత్కు అంతరాయం లేకుండా చూడాలని, ఆర్టీసీ బస్సులు అవసరమైన మేర నడిపేలా జిల్లా కలెక్టర్లు చొరవ చూపాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రంలో ఏఎన్ ఎం, ఆశా ఉద్యోగి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. తాగునీరు, తగిన ఫర్నిచర్, శౌచాలయాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన, కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
చదవండి:
మోడల్ పేపర్లు కోసం క్లిక్ చేయండి