Jagananna Vidya Deevena Scheme: జగనన్న విద్యా దీవెన ఈకేవైసీపై దృష్టి పెట్టండి
కర్నూలు(అర్బన్): జిల్లాలో అర్హత కలిగిన ఎస్సీ విద్యార్థులందరికీ జగనన్న విద్యా దీవెన అందించేందుకు ఈకేవైసీపై ప్రత్యేక దృష్టి సారించాలని సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ జె.రంగలక్ష్మిదేవి ఆదేశించారు. శుక్రవారం స్థానిక సంక్షేమ భవన్లోని తన చాంబర్లో ఆమె జిల్లాలోని సహాయ సంక్షేమాధికారులు, వసతి గృహ సంక్షేమాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతా నెంబర్లకు ఎన్పీసీఐ మ్యాపింగ్ చేయించాలన్నారు. ఆధార్ నెంబర్ ఖాతా నెంబర్కు మ్యాప్ కాకుంటే పోస్టల్ ఖాతా ఓపెన్ చేయించి ఎన్పీసీఐకి మ్యాపింగ్ చేయించాలన్నారు. అలాగే 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లుల ఖాతాల్లో జమ అయిన 2వ విడత జగనన్న విద్యా దీవెన మొత్తాలను ఆయా కళాశాలల్లో చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇంటర్మీడియట్ చదువుతున్న ఎస్సీ విద్యార్థుల ఆధార్ నెంబర్లను కూడా బ్యాంకు ఖాతాకు లింక్ చేయించాలన్నారు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు వచ్చేందుకు వీలుగా స్టడీ అవర్స్ను పాటించాలని, అలాగే కోచింగ్ ఇప్పించడంతో పాటు మోటివేషన్ క్లాసులు నిర్వహించాలన్నారు. సమావేశంలో సహాయ సంక్షేమాధికారులు కె.బాబు, సుధాకర్, లీలావతి, బి.మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.
చదవండి: Sportsmanship: విద్యార్థులకు క్రీడా స్ఫూర్తి అవసరం