OPSC OJS Result: ఓజేఎస్ పరీక్ష ఫలితాలు విడుదల
![OPSC OJS Result 2023 released Odisha Public Service Commission Top 10 Rank Holders in Odisha Judicial Service Exam](/sites/default/files/images/2023/12/30/opsc-ojs-result-1703918032.jpg)
భువనేశ్వర్: ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఓపీఎస్సీ) నిర్వహించిన ఒడిశా జ్యుడీషియల్ సర్వీస్ పరీక్ష ఫలితాలు ప్రకటించింది. ఈ ఫలితాల్లో 55 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులకు రాష్ట్రంలో సివిల్ జడ్జీల నియామకానికి ఓపీఎస్సీ సిఫార్సు చేసింది. ఓజేఎస్ పరీక్ష ఫలితాల్లో యువతులు ఉన్నత ఫలితాలతో ముందంజలో నిలిచారు. టాప్ 10 ర్యాంక్ హోల్డర్లలో ఎనిమిది మంది యువతులు ఉండడం విశేషం. సుశ్రిత మిశ్రా అగ్రస్థానంలో నిలవగా, నిలిసా పట్నాయక్ రెండో స్థానంలో నిలిచింది. అదేవిధంగా అనన్య మిశ్రా తృతీయ స్థానంలో నిలిచింది. రాణి రంజిత, లోపముద్ర ఆచార్య, హర్షిత మిశ్రా వరుసగా నాలుగు, ఐదు, ఆరో స్థానాలతో ఉత్తీర్ణత సాధించారు. ప్రజ్ఞా సుమన్ మహాపాత్ర ఏడో ర్యాంక్, ఎస్.ఆర్.తొషాలి ఎనిమిదో ర్యాంక్ ఉత్తీర్ణులుగా నిలిచారు. యువకుల్లో తొమ్మిదో ర్యాంక్తో సత్యజిత్ పాణి ముందంజలో నిలవగా, లలితేందు దేబొత 10వ ర్యాంక్తో ఉత్తీర్ణత సాధించాడు. 7వ ర్యాంక్తో ఉత్తీర్ణత సాధించిన ప్రజ్ఞా సుమన్ స్థానిక ఉత్కళ విశ్వ విద్యాలయంలో ఎల్ఎల్ఎం పరీక్ష – 2022లో అత్యధిక మార్కులు సాధించినందుకు జస్టిస్ గతి కృష్ణ మిశ్రా బంగారు పతకాన్ని అందుకుంది. ఉత్తీర్ణులైన అభ్యర్థుల వివరాల కోసం www.opsc.gov.in వెబ్సైట్ సందర్శించాలని కమిషన్ సూచించింది.