Skip to main content

RGUKT: ముగిసిన ట్రిపుల్‌ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్‌.. రెండు రోజుల్లో ఇన్ని సీట్ల భర్తీ

నూజివీడు/వేంపల్లె: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో రెండు రోజులుగా నిర్వహిస్తోన్న ప్రవేశాల కౌన్సెలింగ్‌ జూలై 21తో ముగిసింది.
RGUKT
ముగిసిన ట్రిపుల్‌ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్‌.. రెండు రోజుల్లో ఇన్ని సీట్ల భర్తీ

రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థుల సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించారు. రెండో రోజు కౌన్సెలింగ్‌కు 540 మంది అభ్యర్థులకు కాల్‌లెటర్లు పంపించి పిలవగా అందులో 475 మంది హాజరయ్యారు. వారందరికీ సీట్లు కేటాయించారు. రెండు రోజుల్లో 1,085 మందికి గాను 956 మందికి అడ్మిషన్లు కల్పించారు.

కౌన్సెలింగ్‌కు రాని అభ్యర్థులు ఇంటర్, పాలిటెక్నిక్‌ కోర్సుల్లో చేరి ఉండొచ్చని ట్రిపుల్‌ఐటీ అధికారులు భావిస్తున్నారు. మరో 129 సీట్లు మిగిలిన నేపథ్యంలో 4 ట్రిపుల్‌ఐటీల్లో కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగిసిన తరువాత రెండో జాబితాను ప్రకటించి కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తామని అడ్మిషన్ల కన్వీనర్‌ ఆచార్య గోపాలరాజు తెలిపారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియను డైరెక్టర్‌ ఆచార్య జీవీఆర్‌ శ్రీనివాసరావు పరిశీలించారు.

ఆర్‌కే వ్యాలీ ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌

ఇడుపులపాయ ఆర్‌కేవ్యాలీ ట్రిపుల్‌ ఐటీలో 2023–24 విద్యా సంవత్సరానికి గాను ఆర్‌కేవ్యాలీ క్యాంపస్‌లో ఆరేళ్ల సమీకృత సాంకేతిక విద్యకు సంబంధించిన కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. టాప్‌లో నిలిచిన విద్యార్థులు కృష్ణా జిల్లా అవనిగడ్డ గ్రామానికి చెందిన ఆకుల ప్రేమ్‌సాయి, కడప జిల్లా సోములవారిపల్లె గ్రామానికి చెందిన శీల హరిణి, కడప జిల్లా గోపవరం గ్రామానికి చెందిన సోమల వెంకటరామ శరణ్య, నంద్యాల జిల్లా అవుకు గ్రామానికి చెందిన షేక్‌ మహమ్మద్‌ సమీర్, ప్రకాశం జిల్లా దొర్నాల గ్రామానికి చెందిన బండారు కార్తీక్‌లు ఆర్జీయూకేటీ చాన్స్‌లర్‌ కె.చెంచురెడ్డి, వైస్‌ చాన్స్‌లర్‌ విజయ్‌కుమార్‌ల చేతుల మీదుగా అడ్మిషన్ల పత్రాలను పొందారు. మొదటి రోజు 444మంది అడ్మిషన్లు పొందారు. 

Published date : 22 Jul 2023 04:23PM

Photo Stories