Skip to main content

NEET-UG 2023: నీట్‌-యూజీ.. ఇలా ఈజీ !

ఎంబీబీఎస్, బీడీఎస్‌.. ఇంటర్మీడియెట్‌ బైపీసీ చదువుతున్న లక్షల మంది విద్యార్థుల స్వప్నం! ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో చేరాలని, వైద్య వృత్తిలో స్థిరపడాలని కలలు కనే వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. అలాంటి విద్యార్థులంతా తమ స్వప్నం సాకారం చేసుకునేందుకు..అడుగులు వేయాల్సిన తరుణం వచ్చింది! కారణం.. దేశ వ్యాప్తంగా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే.. నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(నీట్‌)-యూజీ-2023 పరీక్ష తేదీ ఖరారు కావడమే! నీట్‌-యూజీ-2023.. మే 7వ తేదీన నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది! ఈ నేపథ్యంలో.. నీట్‌-యూజీ పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..
NEET-UG Exam Pattern, Syllabus, Preparation Guidance
  • మే 7న నీట్‌-యూజీ 2023 ఎంట్రన్స్‌
  • షెడ్యూల్‌ ప్రకటించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ
  • ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశానికి నీట్‌
  • ప్రణాళికబద్ద ప్రిపరేషన్‌తోనే సక్సెస్‌ అంటున్న నిపుణులు

నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌.. నీట్‌గా సుపరిచితమైన ప్రవేశ పరీక్ష. ఈ ఎంట్రన్స్‌లో స్కోర్‌తోనే ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌ వంటి వైద్య కోర్సుల్లో ప్రవేశం లభిస్తోంది. అందుకే ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా ఏటా లక్షల మంది విద్యార్థులు సన్నద్ధమవుతుంటారు. అలాంటి వారంతా.. ఇప్పటి నుంచి నీట్‌ ప్రిపరేషన్‌కు పదును పెట్టుకోవాలి. 

పోటీ తీవ్రం

  • ఇంటర్మీడియెట్‌ బైపీసీ గ్రూప్‌ అర్హతగా నిర్వహించే నీట్‌కు జాతీయ స్థాయిలో లక్షల సంఖ్యలో విద్యార్థులు హాజరవుతున్నారు. గత ఏడాది 17,64,571 మంది ఈ పరీక్ష రాశారు. జాతీయ స్థాయిలో అందుబాటులో ఉన్న దాదాపు 96 వేల ఎంబీబీఎస్, 28 వేల వరకు బీడీఎస్, 52 వేలకు పైగా ఆయుష్‌ కోర్సుల సీట్లకు పోటీ తీవ్రంగా ఉంది. 
  • తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 65,305 మంది; తెలంగాణ నుంచి 59,296 మంది గతేడాది ఈ పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణలో 6,690, ఆంధ్రప్రదేశ్‌లో 5,485 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. అదే విధంగా ఏపీలో 1400, తెలంగాణలో 1300 బీడీఎస్‌ సీట్లు ఉన్నాయి. 
  • ఈ సీట్లను నీట్‌ యూజీ స్కోర్‌ ఆధారంగా ఆల్‌ ఇండియా కోటా,స్టేట్‌ కోటా విధానంలో భర్తీ చేస్తారు. ఆల్‌ ఇండియా కోటా విధానంలో.. అన్ని రాష్ట్రాల్లోని 15 శాతం సీట్లకు జాతీయ స్థాయిలో కౌన్సెలింగ్‌ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు. స్టేట్‌ కోటా విధానంలో..రాష్ట్ర స్థాయిలో ఆల్‌ ఇండియా కోటాకు బదిలీ అయిన సీట్లను మినహాయించి.. మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.

చ‌ద‌వండి: NTA: నీట్‌ యూజీ– 2023 తేదీ ఖరారు

నాలుగు సబ్జెక్ట్‌లు.. 720 మార్కులు

నీట్‌ పరీక్షను నాలుగు సబ్జెక్ట్‌లలో 720 మార్కులకు నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు. వివరాలు..

సబ్జెక్ట్‌ సెక్షన్‌ ప్రశ్నలు మార్కులు
ఫిజిక్స్‌ సెక్షన్‌-ఎ 35 140
  సెక్షన్‌-బి 15 40
కెమిస్ట్రీ సెక్షన్‌-ఎ 35 140
  సెక్షన్‌-బి  15 40
బోటనీ సెక్షన్‌-ఎ 35 140
  సెక్షన్‌-బి 15 40
జువాలజీ సెక్షన్‌-ఎ 35 140
  సెక్షన్‌-బి 15 40
మొత్తం మార్కులు     720
  • ప్రతి సబ్జెక్ట్‌లోనూ సెక్షన్‌-బిలోని 15 ప్రశ్నలకు గాను పదింటికి సమాధానాలు గుర్తిస్తే సరిపోతుంది. అంటే..సెక్షన్‌-బిలో ఛాయిస్‌ వెసులుబాటు ఉంది.
  • ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు. నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత పడుతుంది.
  • వాస్తవానికి ఛాయిస్‌ విధానాన్ని 2021లో అందుబాటులోకి తెచ్చారు. గత ఏడాది కూడా దీన్ని కొనసాగించారు. ఈ ఏడాది కూడా ఛాయిస్‌ విధానంతోనే పరీక్ష నిర్వహించే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

సన్నద్ధతకు తగినంత సమయం

నీట్‌ యూజీ-2023ని మే 7న నిర్వహించనున్నారు. ఈ తేదీని పరిగణనలోకి తీసుకుంటే.. విద్యార్థులకు తగినంత సమయం అందుబాటులో ఉందని చెప్పొచ్చు. మార్చి చివరి నాటికి ఇంటర్మీడియెట్‌ పరీక్షలు పూర్తవుతాయి. ఆ తర్వాత నీట్‌ పరీక్ష తేదీకి దాదాపు 40 రోజుల సమయం అందుబాటులో ఉంటుంది. ఈ వ్యవధిలో పూర్తిగా నీట్‌ ప్రిపరేషన్, రివిజన్, మాక్‌ టెస్ట్‌లకు హాజరు వంటి వ్యూహాలు అనుసరిస్తే..మెరుగైన స్కోర్‌ సాధించే అవకాశముంది.

చ‌ద‌వండి: NEET Guidance

ప్రతి సబ్జెక్ట్‌లో 130-140 మార్కులు లక్ష్యంగా

  • నీట్‌కు సన్నద్ధమవుతున్న విద్యార్థులు.. ప్రతి సబ్జెక్ట్‌లోనూ 180 మార్కులకు గాను 130 నుంచి 140 మార్కులు సాధించేలా సిలబస్‌ అంశాలను ఔపోసన పట్టాలి. అప్పుడే సీటు సాధించేలా మెరుగైన ర్యాంకు సొంతమవుతుంది. ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్‌కు నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకుని అధ్యయనం సాగించాలి. 
  • బోర్డ్‌ పరీక్షలకు నెల రోజుల ముందు వరకు ఇంటర్, నీట్‌ సిలబస్‌లను సమన్వయం చేసుకుంటూ చదవాలి.
  • బోర్డ్‌ పరీక్షలు ముగిశాక.. నీట్‌ సిలబస్‌కు అనుగుణంగా ఆయా సబ్జెక్ట్‌లకు సమయం కేటాయిస్తూ ప్రిపరేషన్‌ చేయాలి. స్వీయ సామర్థ్యాలపై స్పష్టతతో వ్యవహరించాలి.
  • వీలైనంత మేరకు రివిజన్‌కు ఎక్కువ సమయం కేటాయించాలి.
  • ప్రతి రోజు చదవాల్సిన టాపిక్స్‌ను ముందుగానే విభజించుకుని.. దానికి అనుగుణంగా అధ్యయనం చేయాలి. ప్రతి రోజు మాక్‌ టెస్టులకు హాజరవ్వాలి. మోడల్‌ కొశ్చన్స్‌ను ప్రాక్టీస్‌ చేయాలి. 
  • డైరెక్ట్‌ కొశ్చన్స్‌ కంటే ఇన్‌ డైరెక్ట్‌ ప్రశ్నలనే ఎక్కువగా అడుగుతున్న విషయాన్ని గుర్తించాలి. దీనికి అనుగుణంగా మోడల్‌ టెస్ట్‌లను వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి. 
  • ప్రిపరేషన్‌ సమయంలోనే షార్ట్‌ నోట్స్‌ రూపొందించుకోవాలి. ఇది రివిజన్‌కు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. 

చ‌ద‌వండి: NEET UG 2022 All India 5th Ranker : చదివిన కొద్దిసేపైనా ఇలా చ‌దివే వాడిని.. నా ల‌క్ష్యం ఇదే..

ముఖ్య సమాచారం

  • 2023, మే 7న నీట్‌ యూజీ పరీక్ష. 
  • మార్చి రెండో వారంలో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం.
  • పెన్‌-పేపర్‌ విధానంలో మూడు గంటల వ్యవధిలో 720 మార్కులకు పరీక్ష.
  • నీట్‌ స్కోర్‌ ఆధారంగానే ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, వెటర్నరీ సైన్స్‌ కోర్సుల సీట్ల భర్తీ.
  • అర్హత: బైపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్‌ తత్సమా న కోర్సు ఉత్తీర్ణత ఉండాలి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • నీట్‌కు ఇంటర్‌ బైపీసీ ఉత్తీర్ణత అర్హతగా పేర్కొన్నప్పటికీ.. ప్రవేశాల సమయంలో కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు బైపీసీ గ్రూప్‌ సబ్జెక్ట్‌లలో 50 శాతం మార్కులు ఉండాలనే నిబంధన విధిస్తున్నాయి.

Also Read: NEET - QUICK REVIEW | GUIDANCE | BIT BANK | MODEL PAPERS | PREVIOUS PAPERS | GUEST SPEAKS | CUT-OFF RANKS

సబ్జెక్ట్‌ వారీగా సన్నద్ధత ఇలా
ఫిజిక్స్‌.. ప్రాక్టీస్‌తోనే విజయం

ఫిజిక్స్‌లో విద్యార్థులు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి. ఆప్టిక్స్, మెకానిక్స్, హీట్‌ అండ్‌ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రానిక్‌ డివైజెస్, కరెంట్‌ ఎలక్ట్రిసిటీ, మోడరన్‌ ఫిజిక్స్‌ చాప్టర్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో అధ్యాయానికి చివర ఇచ్చిన ప్రశ్నలను సాధించాలి.అవకలనం,సమాకలనం, అనువర్తనాలపై పట్టు సాధించాలి. ఇంటర్‌ రెండేళ్ల పాఠ్యాంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. రొటేషనల్‌ డైనమిక్స్, సిగ్మా పార్టికల్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలి. అదేవిధంగా ఎలక్ట్రోమ్యాగ్నటిజం, ఇండక్షన్, కరెంట్‌ ఎలక్ట్రిసిటీ వంటి చాప్టర్లను చదవడంతోపాటు ప్రాక్టీస్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలి.
-రవీంద్ర, ఫిజిక్స్‌ ఫ్యాకల్టీ

కాన్సెప్ట్స్, రివిజన్‌ ప్రధానంగా

కెమిస్ట్రీలో విద్యార్థులు ఆయా విభాగాలకు సంబంధించిన కాన్సెప్ట్‌లపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా రివిజన్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా జనరల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, మోల్‌ కాన్సెప్ట్, కెమికల్‌ బాండింగ్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కోఆర్డినేషన్‌ కాంపౌండ్, ఈక్విలిబ్రియమ్, పాలిమర్‌లు, బయో మాలిక్యూల్స్, పరమాణు నిర్మాణం, సాలిడ్‌ స్టేట్, ద్రావణాలు, సర్ఫేజ్‌ కెమిస్ట్రీ; ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో ఐసోమెరిసమ్, సమ్మేళనాల తయారీలకు కొంత వెయిటేజీ ఎక్కువగా ఉంటుంది. కెమిస్ట్రీలో విద్యార్థులు చర్యలు, సమీకరణాలను మర్చిపోతుంటారు. దీంతో నిరంతరం పునఃశ్చరణ చేయాలి. ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో వివిధ మూలకాలు, వాటి సమ్మేళనాల ధర్మాలను అధ్యయనం చేయాలి. ఫిజికల్, ఆర్గానిక్, ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలను వాటి వాటి స్వభావాల ఆధారంగా ప్రిపేరవ్వాలి. ఫిజికల్‌ కెమిస్ట్రీలో ఫార్ములాలతో సొంత నోట్స్‌ రూపొందించుకోవాలి. పీరియాడిక్‌ టేబుల్‌పై పట్టు సాధిస్తే.. ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో మెరుగైన స్కోర్‌ పొందొచ్చు.
-కృష్ణ, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ

బోటనీ.. విభిన్నంగా

బోటనీకి సంబంధించి.. ఫిజియాలజీ ఆఫ్‌ ప్లాంట్స్‌ అండ్‌ యానిమల్స్, మార్ఫాలజీ, జెనిటిక్స్‌ అండ్‌ ఎవల్యూషన్, సెల్‌ బయాలజీ, బయోటెక్నాలజీ, హ్యూమన్‌ ఫిజియాలజీ, డైవర్సిటీ ఆఫ్‌ లివింగ్‌ ఆర్గానిజమ్‌లను ముఖ్య చాప్టర్లుగా భావించి చదవాలి. అన్ని అంశాలకు సంబంధించి కాన్సెప్ట్ట్‌లపై పట్టు సాధించాలి. ఎకాలజీలో ఆర్గనైజేషన్స్‌ అండ్‌ పాపులేషన్, ఎకోసిస్టమ్‌పై ప్రశ్నలు వస్తున్నాయి. వీటితోపాటు బయోడైవర్సిటీ, ఎన్విరాన్‌మెంట్‌ ఇష్యూస్‌ పాఠ్యాంశాలపై దృష్టిపెట్టడం లాభిస్తుంది. ప్లాంట్‌ ఫిజియాలజీలో ప్లాంట్‌ గ్రోత్‌ అండ్‌ డెవలప్‌మెంట్, మొక్కల హార్మోనులు, ట్రాన్స్‌పోర్ట్‌ ఇన్‌ ప్లాంట్స్, మినరల్‌ న్యూట్రిషన్‌ చాప్టర్లను ప్రిపేరవ్వాలి. సెల్‌ స్ట్రక్చర్స్‌ అండ్‌ ఫంక్షన్స్‌లో కణవిభజన(సమ విభజన, క్షయకరణ విభజన)లోని వివిధ దశల్లో జరిగే మార్పులు, కణచక్రం తదితరాలను అధ్యయనం చేయాలి. బయోమాలిక్యూల్స్‌ నుంచి కంటెంట్‌ సంబంధిత ప్రశ్నలు వస్తాయి. రీప్రొడక్షన్‌ నుంచి దాదాపు 10 ప్రశ్నల వరకు అడుగుతున్నారు.మాలిక్యులర్‌ బేసిస్‌ ఆఫ్‌ ఇన్‌హెరిటన్స్‌లో రెప్లికేషన్, ట్రాన్‌స్క్రిప్షన్, ట్రాన్స్‌లేషన్, రెగ్యులేషన్‌పై దృష్టిపెట్టాలి. నీట్‌లో ఇంటర్‌ సిలబస్‌లో లేని అంశాలను గుర్తించి.. వాటికోసం ప్రత్యేక సమయం కేటాయించాలి.
- బి.రాజేంద్ర, బోటనీ ఫ్యాకల్టీ

జువాలజీ.. ప్రీవియస్, మోడల్‌ పేపర్స్‌

జువాలజీ సబ్జెక్ట్‌లో రాణించేందుకు విద్యార్థులు హ్యూమన్‌ ఫిజియాలజీ, ఎకాలజీ, జెనిటిక్స్, ఎవల్యూషన్‌ టాపిక్స్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్‌సీఈఆర్‌టీతోపాటు ఇంటర్‌ పుస్తకాల నుంచీ ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి గత ప్రశ్న పత్రాలను, ఇంటర్‌లో ఆయా చాప్టర్స్‌ చివరలో అడిగే ప్రశ్నలను సాధన చేయాలి. ఎన్‌సీఆర్‌టీ, ఇంటర్‌ పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి.
-కె.శ్రీనివాసులు, జువాలజీ ఫ్యాకల్టీ.

Published date : 05 Jan 2023 05:41PM

Photo Stories