Skip to main content

సవాళ్లను స్వీకరిస్తేనే విజయం

సొంత బ్లాగ్స్, పుస్తకాల ద్వారా అటు రిక్రూటర్లకు, ఇటు యంగ్ మేనేజర్స్‌కు సలహాలు, సూచనలు అందించే వ్యక్తిగా అభిజిత్ భాదురి సుపరిచితులు. విప్రోలో చీఫ్ లెర్నింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆయన రాసిన ‘డోన్ట్ హైర్ ది బెస్ట్’ పుస్తకం బెస్ట్ సెల్లర్‌గా గుర్తింపు పొందింది. బెస్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా, ఆథర్‌గా, రిక్రూటర్‌గా పేరొందిన అభిజిత్ భాదురితో గెస్ట్ కాలమ్...
ఆధునిక ప్రపంచ పోటీ వాతావరణంలో
యువత అకడమిక్స్‌లో, కెరీర్ పరంగా సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. అప్పుడే విజయం సొంతమవుతుంది. సమస్య తీవ్రత చూసి ఆందోళన చెందకూడదు. పరిష్కారం కనుగొనేందుకు మార్గాల గురించి ఆలోచిస్తే ఆందోళన వీడుతుంది. ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ, ఢిల్లీ యూనివర్సిటీలోని మెంటార్స్ ఇచ్చిన అసైన్‌మెంట్స్‌ను అవకాశాలుగా స్వీకరించి నన్ను నేను నిరూపించుకోవడం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను.

అసలు లెర్నింగ్ అంటే..
విద్యార్థులు లెర్నింగ్ నైపుణ్యాలు పెంచుకోవాలని, సొంతగా నేర్చుకునే దృక్పథాన్ని అలవర్చుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఏదైనా ఒక అంశం గురించి క్లాస్ రూంలో బోధిస్తున్నప్పుడు సరైన ప్రశ్న అడిగే నైపుణ్యమే.. లెర్నింగ్. ఎక్కువ శాతం మంది విద్యార్థులు బిడియంతోనో లేదా ఆ అంశాన్ని వినకపోవడం వల్లనో సందేహాలు నివృత్తి చేసుకోలేకపోతున్నారు. ఇది అంతిమంగా వారి కెరీర్‌పై ప్రభావం చూపుతోంది. మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లు పరిశ్రమల్లో పని అనుభవం ఉన్నవారినే ప్రస్తుతం ప్రొఫెసర్లుగా నియమించుకుంటున్నాయి. వారికి వాస్తవ పరిస్థితులపై అవగాహన, తమ అనుభవాన్ని అకడమిక్స్‌తో అన్వయించి బోధించే సామర్థ్యం ఉంటుంది. విద్యార్థులు దీన్ని తమకు అనుకూలంగా మలచుకొని వాస్తవ పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలి.

ఇన్‌స్టిట్యూట్‌ల బాధ్యత
టీచింగ్, లెర్నింగ్ విషయాల్లో ఇన్‌స్టిట్యూట్‌ల బాధ్యత కూడా ఎంతో ఉంది. వేలు, లక్షలు ఫీజులతో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పించడం యాజమాన్యాల బాధ్యత. విద్యార్థులు వారి లక్ష్యాలు చేరుకునే విధంగా అకడమిక్ సదుపాయాలు, ప్రొఫెసర్ల నియామకం ఇతరత్రా అవకాశాలను ఇన్‌స్టిట్యూట్‌లు కల్పించాలి.

కరిక్యులంలో మార్పులు అవసరం
వాస్తవ పరిస్థితుల్లో పరిశ్రమ వర్గాలకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గత 5 ఏళ్లలో వ్యాపార రంగంలో పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కరిక్యులంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అధిక శాతం మంది యువ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్స్‌లో నిజాయతీ, అంకితభావం ప్రస్ఫుటమవుతుండటం ఆహ్వానించదగింది!

ఆసక్తులు విస్తృతం చేసుకోవాలి
ప్రస్తుతం వ్యాపార రంగం విభిన్న నైపుణ్యాలున్న స్పెషలిస్ట్‌ల కోసం అన్వేషిస్తోంది. కాబట్టి విద్యార్థులు తమ ఆసక్తులను విస్తృతం చేసుకోవాలి. ఎంచుకున్న స్పెషలైజేషన్ లేదా ప్రోగ్రామ్‌కే పరిమితం కాకుండా.. విభిన్న డిసిప్లైన్స్ అభ్యసించాలి. కెరీర్‌లో ప్రతి దశలోనూ మంచి మెంటార్స్ ఉండేలా చూసుకుంటూ ఏటా కొత్త నైపుణ్యాలు పొందేలా తమను తాము మలచుకుంటే సుదీర్ఘ కాలం సుస్థిరత లభిస్తుంది.

సమయం సద్వినియోగం
ప్రోఫెషనల్ కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల్లో అధిక శాతం మంది అకడమిక్స్‌కే పరిమితమై నిరాసక్తంగా, యాంత్రికంగా తయారవుతున్నారు. ఇప్పుడు దాదాపు అన్ని ఇన్‌స్టిట్యూట్‌లు కాలేజ్ ఫెస్ట్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్ వంటివి నిర్వహిస్తున్నాయి. మేనేజ్‌మెంట్ విద్యార్థులు వీటిలో పాల్గొని మానసిక ఉల్లాసం పెంచుకునేందుకు యత్నించాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది.

నైపుణ్యాలు పెంచుకోవాలి
ఆసక్తితో కోర్సులో చేరాలి. శరవేగంగా మారుతున్న పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకోవాలి. ఉద్యోగం, కెరీర్ ఎంపికలో తమ బలాలు, బలహీనతలు గుర్తుంచుకొని ముందుకుసాగాలి. ఒక అవకాశం చేజారినా నిరుత్సాహపడకూడదు. విశ్లేషణ చేసుకుని ఆ సమస్య పునరావృతం కాకుండా చూసుకోవాలి.

డోన్ట్ హైర్ ద బెస్ట్ ఉద్దేశం
నియామకాల విషయంలో రిక్రూటర్స్ బెస్ట్ కంటే తమ అవసరాలకు, సంస్థ పని సంస్కృతికి సరిపోయే వారిని ఎంపిక చేసుకోవాలనే ఉద్దేశంతో ‘డోన్ట్ హైర్ ద బెస్ట్’ పుస్తకం రాశాను. ప్రతి విద్యార్థిలో ఒక ప్రత్యేక లక్షణం/టాలెంట్ ఉంటుంది. అవి అవసరమైన సంస్థలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు క్లాస్‌లో టాపర్స్‌తో పోల్చుకోకుండా తమకున్న టాలెంట్‌కు సరితూగే సంస్థలను ఎంపిక చేసుకోవాలి.
Published date : 16 Sep 2015 11:17AM

Photo Stories