Skip to main content

మేనేజ్‌మెంట్ విద్య...తీరు మారాలి

‘దేశంలో మేనేజ్‌మెంట్ విద్య ఔత్సాహికుల సంఖ్య ఏటా పెరుగుతోంది. మేనేజ్‌మెంట్ డిగ్రీ ఉంటే కొలువు సులువు అనే అభిప్రాయం నెలకొనడమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. విద్యార్థులు కార్పొరేట్ ప్రపంచంలోదేశవిదేశాల్లోరాణించాలంటే.. ఎన్నో అంశాలపై అవగాహన పొందాలి. ఆదిశగా మన దేశంలో మేనేజ్‌మెంట్ చదువుల తీరు మారాలి’ అంటున్నారు..ప్రతిష్టాత్మక ఐఐఎం- బెంగళూరు డెరైక్టర్ ప్రొఫెసర్. జి.రఘురామ్. అమెరికా, కెనడా, సింగపూర్ తదితర విదేశాలతో పాటు మన దేశంలోనూ బోధనరంగంలో ఆయనకు దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవముంది. ముఖ్యంగా లాజిస్టిక్స్ రంగంలో ఎన్నో పరిశోధనలు చేసి, ప్రభుత్వవిభాగాలకు సైతం సేవలందించిన ప్రొఫెసర్ జి.రఘురామ్‌తో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ...
స్పెషలైజేషన్‌తో పాటు :
ఎక్కువ మంది మేనేజ్‌మెంట్ విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న స్పెషలైజేషన్‌లో నైపుణ్యాలు పెంచుకోవడానికే ప్రాధాన్యమిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్పెషలైజేషన్ సబ్జెక్టులతో పాటు ఇతర విభాగాల్లోనూ నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. భవిష్యత్తులో కార్పొరేట్ కంపెనీల్లో బాధ్యతల నిర్వహణలో ఇలాంటి దృక్పథం ఎంతో ఉపయోగపడుతుంది. పీజీ స్థాయిలో నిర్దిష్టంగా ఒక విభాగంలో పూర్తిస్థాయి కోర్సుల వల్ల భవిష్యత్తులో అదే రంగంలో అత్యున్నతంగా రాణించే వీలుంటుంది. ఐఐఎం-బెంగళూరులో ప్రత్యేక ఫుల్‌టైమ్ ప్రోగ్రామ్స్‌లోనూ ఇతర విభాగాలకు సంబంధించిన కోర్సులను బోధిస్తున్నాం.

కరిక్యులం మారాలి...
మేనేజ్‌మెంట్ విద్యార్థులు అన్ని అంశాల్లో నైపుణ్యాలు పొందాలంటే.. ముందుగా మన కరిక్యులంలో మార్పులు చేయాలి. పరిశ్రమ అవసరాలను పరిగణనలోకి తీసుకుంటూ.. అభ్యర్థుల స్పెషలైజేషన్‌కు అనుబంధ అంశాల్లో నైపుణ్యాలు అందించేలా సిలబస్ రూపొందించాలి. అదేవిధంగా బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్‌గా విధులు నిర్వహించేందుకు అవసరమైన వాస్తవ పరిస్థితులపై అవగాహన కల్పించేలా కరిక్యులంలో మార్పులు చేయాలి. ఎంబీఏ కోర్సు, బోధన పరంగా ఇటీవల ఏఐసీటీఈ కరిక్యులంలో మార్పులు చేస్తూ కొన్ని ప్రతిపాదనలు చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం. దీన్ని అన్ని యూనివర్సిటీలు అమలు చేసేలా నిరంతరం నియంత్రణ, మూల్యాంకన యంత్రాంగాన్ని కూడా రూపొందించాలి. అప్పుడే కరిక్యులం మార్పు ఫలితం కనిపిస్తుంది.

ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యం :
మేనేజ్‌మెంట్ విద్యార్థులు ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకోసం ఇండస్ట్రీ విజిట్స్, రియల్ టైం కేస్ స్టడీస్ విశ్లేషణ వంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. అమెరికా వంటి విదేశాలకు, మన దేశంలోని మేనేజ్‌మెంట్ విద్యకు మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఇదే. అక్కడ అధిక శాతం ప్రాక్టికల్ ఓరియెంటేషన్‌తో కోర్సుల బోధన సాగుతుంది. మన దగ్గర కూడా అలాంటి విధానం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. కొన్ని బి-స్కూల్స్ తమ సొంత విధానాలతో ప్రాక్టికాలిటీకి పెద్దపీట వేస్తున్నప్పటికీ.. ఇతర యూనివర్సిటీల పరిధిలోని బీస్కూల్స్‌లో ఇంకా మార్పు రావాల్సి ఉంది.

ఐఐఎం-చట్టం మేలు చేసేదే !
ఐఐఎంలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ రూపొందించిన చట్టం ఇన్‌స్టిట్యూట్‌లకు మేలు కలిగించేదే! దీనివల్ల అంతర్జాతీయ ఫ్యాకల్టీని నియమించుకోవడం, విదేశీ విద్యార్థులను ఆకర్షించడం వంటి విషయాల్లో స్వేచ్ఛ లభిస్తుంది. ఫలితంగా అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో ముందంజలో నిలిచేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మేధో వలసను ఆపేందుకు ఆస్కారం లభిస్తుంది. ఐఐఎంలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తే ఫీజులు పెరుగుతాయనే వాదన సరికాదు. ఐఐఎంలు నిర్ణయించిన ఫీజుల మేరకు విద్యార్థులకు ఎన్నో రకాలుగా ఆర్థిక ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించుకుంటే ఫీజుల భారమనే ప్రశ్నే తలెత్తదు.

గివింగ్ బ్యాక్ టు సొసైటీ :
మేనేజ్‌మెంట్ విద్యార్థులు సామాజిక అంశాలపైనా దృష్టిసారించాలి. గివింగ్ బ్యాక్ టు సొసైటీ లక్షణాన్ని అలవరచుకోవాలి. ఇప్పుడు ఎంబీఏ విద్యార్థులు పలువురు సోషల్ స్టార్టప్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది హర్షణీయం. అయితే ఈ సంఖ్య మరింత పెరగాలి. మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరే విద్యార్థులు రెగ్యులర్, రియల్ టైం లెర్నింగ్ లక్షణాలతో ముందుకు సాగితేనే భవిష్యత్తు బాగుంటుంది. కోర్సు పూర్తయ్యాక ఆఫర్ లెటర్లు వచ్చినా.. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో కొలువులో మనుగడ సాగించాలంటే నిరంతర అధ్యయనం తప్పనిసరి. దీన్ని అలవరచుకుంటే కెరీర్‌లో ‘ది బెస్ట్’గా నిలవొచ్చు!!
Published date : 08 Aug 2018 05:03PM

Photo Stories