Skip to main content

TS History for Group 1 & 2: తెలంగాణ చరిత్ర... తొలి కాకతీయులు అవలంభించిన మతం?

ts history preparation tips for tspsc group 1 & 2
ts history preparation tips for tspsc group 1 & 2

కాకతీయ రాజ్యంపై దండెత్తిన పొలవాస మేడరాజు, కొలనుపాక జగద్దేవుడిని ఓడించడంలో రెండో బేతరాజుకు కాటసేనాని తోడ్పడ్డాడు. యుద్ధంలో సహాయం చేసిన కాటసేనానికి బేతరాజు చెరకుపల్లి సహా 12 గ్రామాలను ఇచ్చాడు. చెరకుపల్లి ప్రాంతాన్ని పాలించినందువల్ల ఈ వంశీయులు చెరకు రెడ్లు అయ్యారు.

కాకతీయుల సామంతులు
చెరకురెడ్డి వంశం 

కాకతీయ సేనానులు, సామంతుల్లో చెరకురెడ్డి వంశీయులు ప్రసిద్ధి చెందినవారు. వీరు రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుల కాలంలో సామంతులుగా పనిచేశారు. నల్గొండ జిల్లాలోని జమ్మలూరు, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అమరాబాద్, కర్నూలు జిల్లాలోని వేల్పూరు ప్రాంతాలను పాలించారు.
నల్గొండ జిల్లాలోని దేవరకొండ, నకిరేకల్‌ తాలూకాల్లో ఉన్న చెరకుపల్లి గ్రామాలు వీరి తొలి నివాసమని భావిస్తున్నారు. వీరి తొలి రాజధాని జమ్మలూరు. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలోని జలాలుపురమే జమ్మలూరు కావచ్చు. జలాలుపురంలో చెరకు బొల్లయ్యరెడ్డి తన వంశీయుల పేరుమీద నిర్మించిన కేతేశ్వర, కోటేశ్వర, మారేశ్వర, సూర్యదేవర ఆలయాలే ఇందుకు నిదర్శనం. వీరు 1158 నుంచి 1323 వరకు పరిపాలించారు. ఈ వంశానికి ఆద్యుడు కాటసేనాని(1080–1140). జలాలుపురం శాసనంలో ఇతడి ప్రస్తావన ఉంది. పొలవాస మేడరాజు, కొలనుపాక జగద్దేవుడు కాకతీయ రాజ్యంపై దండెత్తగా.. వీరిని ఓడించడంలో రెండో బేతరాజుకు కాటసేనాని తోడ్పడ్డాడు. యుద్ధంలో సహాయం చేసిన కాటసేనానికి బేతరాజు చెరకుపల్లి సహా 12 గ్రామాలను ఇచ్చాడు. చెరకుపల్లి ప్రాంతాన్ని పాలించినందువల్ల ఈ వంశీయులు చెరకు రెడ్లు అయ్యారు. కాటసేనాని పెద్దకుమారుడు కేతసేనాని. ఇతడి మొదటి భార్యకు కాట, మార, ఎర్ర అనే ముగ్గురు కుమారులు. చెరకు రెడ్ల సైనిక సహకారానికి మెచ్చిన రుద్రదేవుడు వారికి గుండియపూండి, బెరపూడి, గొట్టిపల్లి, పసువల, తొర్రూరు గ్రామాలను ఇచ్చాడు. కేతసేనాని రెండో భార్యకు కాట, మార, బొల్ల అనే కుమారులు ఉన్నారు. కేతసేనాని, ఈ ముగ్గురు కుమారులు కందూరు చోడులను ఓడించడంలో రుద్రదేవుడికి సహకరించారు. అందువల్ల రుద్రదేవుడు వీరికి జమ్మలూరు రాజ్యమిచ్చి సామంతులుగా నియమించాడు. ఈ ముగ్గురిలో చివరివాడైన బొల్లయరెడ్డి ప్రసిద్ధుడు. తండ్రి తర్వాత ఇతడు జమ్మలూరు రాజ్యాధిపతి అయ్యాడు.
సంక్షోభంలో కూరుకుపోయిన కాకతీయ రాజ్యాన్ని రక్షించడంలో రేచర్ల రుద్రసేనానికి బొల్లయరెడ్డి సహాయం చేశాడు. అందుకే గణపతిదేవుడు సింహాసనం అధిష్టించగానే బొల్లయరెడ్డిని జమ్మలూరు రాజ్యంతోపాటు అమరాబాద్, వేల్పూరు రాజ్యాలకు సామంతుడిగా నియమించాడు. తర్వాత ఇతడి పెద్ద సోదరుడి కుమారులు, మనుమలు, మునిమనమలు ఈ రాజ్యాలను పాలించారు. వీరు ఈ ప్రాంతాల్లో 22 శాసనాలు వేయించారు. జలాలుపురం, కలువకొలను, అమరాబాద్, ఉడిమళ్ల, కూరెళ్ల తదితర ప్రాంతాల్లో దేవాలయాలను నిర్మించారు. వీరి శాసనాలు నాటి తెలుగు భాషా స్వరూపాన్ని తెలుపుతున్నాయి. వీరు శైవ మతాన్ని అవలంభించారు.

Telangana History for Group 1 & 2: కాకతీయ సామ్రాజ్యం... రేచర్ల రెడ్ల వంశ మూలపురుషుడు?

మల్యాల వంశం

మల్యాల వంశీయులు కాకతీయులకు విధేయులుగా ఉన్నారు. ఎన్నో యుద్ధాల్లో పాల్గొని కాకతీయుల విజయ సాధనకు తోడ్పడ్డారు. వీరు దుర్జయ కులస్థులు. ఈ వంశానికి ఆద్యుడు దన్నసేనాని. కటుకూరు, కొండిపర్తి, బూదపూర శాసనాలు ఇతడిని కాకతీయ సేనానిగా పేర్కొంటున్నాయి. దన్నసేనానికి ఇద్దరు కుమారులు. పెద్దవాడైన సబ్బసేనాని సంకీసపుర రాజ్యాన్ని, రెండోవాడైన బాచసేనాని బూదపూర రాజ్యాన్ని పొందారు. సబ్బ సేనాని కుమారుడు కాటసేనాని. ఇతడికి ఇద్దరు కుమారులు. చిన్నవాడైన చౌండసేనాని ప్రసిద్ధుడు. ఇతడు గణపతి దేవుడి ఆజ్ఞ మేరకు దివిసీమపై దండెత్తి చోడియ రాజును ఓడించాడు. వెలనాటి పృథ్వీశ్వరుడి కోశాగారాన్ని గణపతిదేవుడికి అప్పగించాడు. విరియాల వంశానికి చెందిన మైలమను వివాహమాడి మల్యాల రాజ్యంతో పాటు విరియాల రాజ్యాన్ని కూడా పాలించాడు. చౌండసేనాని మల్యాల రాజ్య పాలకుడైనప్పటికీ ఓరుగల్లు దుర్గ రక్షణ కోసం ఉంచిన సైన్యాధ్యక్షుడిగా కొండపర్తిలో ఉండేవాడు. రాజ్యపాలనా వ్యవహారాలను ఇతడి అన్న పోతసేనాని చూసుకునేవాడు.
బాచసేనాని కుమారుడు గుండ దండాధీశుడు కూడా ఈ వంశంలో ప్రసిద్ధుడు. ఇతడు గణపతిదేవుడు, రుద్రమదేవి కాలంలో సామంతుడిగా, దండనాయకుడిగా పనిచేశాడు. బూదపుర, వర్థమానపుర ప్రాంతాలపై ఆధిపత్యం వహించి కృష్ణానది ఉత్తర ప్రాంతాలను పాలించాడు. ఇతడి భార్య గోన గన్నారెడ్డి సోదరి అయిన కుప్పాంబిక(కవయిత్రి). 1276లో ఈమె వేయించిన బూదపూర శాసనాన్ని బట్టి గుండ దండాధీశుడు అప్పటికే మరణించాడని తెలుస్తోంది. తర్వాత ఇతడి కుమారులు రాజ్యపాలన చేశారు. 

Indian History Notes for Groups: దక్షిణ భారతంలోనే.. తొలి బ్రిటిష్‌ వ్యతిరేక తిరుగుబాట్లు

విరియాల వంశం

కాకతీయ మొదటి బేతరాజుకు రాజ్యాన్ని ఇప్పించి కాకతీయ రాజ్యాన్ని నిలబెట్టింది వీరే. ఈ వంశీయులు వీరులైనప్పటికీ స్వతంత్ర పాలకులు కాలేదు. రాష్ట్ర కూటులు, కల్యాణీ చాళుక్యుల వద్ద సామంతులుగా, దండనాయకులుగా పనిచేశారు. వీరు కూడా దుర్జయ కులస్థులే. విరియాల వంశానికి ఆద్యుడు పోరంటి వెన్న సేనాని. ఇతడి తర్వాత ఎర్రభూపతి, భీముడు రాష్ట్ర కూటసేనానులుగా పనిచేశారు. భీముడి కుమారుడైన ఎర్రనరేంద్రుడు విరియాల వంశంలో ప్రసిద్ధుడు. ఇతడి కాలంలోనే రెండో తైలపుడు రాష్ట్రకూటులను ఓడించి 973లో కల్యాణీ చాళుక్య రాజాన్ని స్థాపించాడు. ఎర్రనరేంద్రుడు ఇతడి సేనాని అయ్యాడు. ఆ సమయంలో ముదిగొండ చాళుక్యులు, తొలి కాకతీయులు పరస్పరం ఘర్షణ పడేవారు. అంతకు ముందే కాకతీయ నాలుగో గుండరాజు ముదిగొండ చాళుక్య బొట్టు బేతరాజును ఓడించి తమ పూర్వ రాజ్యమైన కొరవి సీమను ఆక్రమించాడు.
తైలపుడు చక్రవర్తి కాగానే బొట్టు బేతరాజు అతడిని ఆశ్రయించాడు. చక్రవర్తి ఆజ్ఞ మేరకు విరియాల ఎర్రనరేంద్రుడు కాకతీయ నాలుగో గుండరాజును సంహరించి చాళుక్యబొట్టు బేతరాజును కొరవి సీమకు రాజును చేశాడు. ఎర్రనరేంద్రుడి భార్య అయిన కామసాని సోదరుడే గుండరాజు. కామసాని తన భర్త సహకారంతో మేనల్లుడైన మొదటి బేతరాజు(గరుడ)కు రెండో తైలపుడి నుంచి అనుమకొండ రాజ్యాన్ని ఇప్పించింది. ఈ విధంగా విరియాల వంశం కాకతీయ రాజ్యాన్ని నిలబెట్టింది.
ఎర్రసేనాని(నరేంద్రుడు) తర్వాత ఇతడి వంశీయులైన సూరసేనాని, బేతన, రుద్రయ రాజు, సూరన్నపతి, మల్లచమూపతి, అన్నయ మొదలైనవారు సేనానులుగా పనిచేశారు. వీరిలో కొందరు కాకతీయుల దగ్గర పనిచేశారని బి.ఎన్‌.శాస్త్రి తెలిపారు. కానీ ఇందుకు ఆధారాలు లభించలేదు.

Telangana History For Groups Exams: పానగల్లు శాసనాన్ని వేయించింది ఎవ‌రు?

యాదవ రాజులు

తెలంగాణకు పశ్చిమ–ఉత్తరంగా ఉన్న ప్రాంతాన్ని దేవగిరి రాజధానిగా యాదవరాజులు పాలించేవారు. వీరు 9వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు అధికారంలో ఉన్నారు. కాకతీయుల కాలంలో హోయసాల, దేవగిరి బలమైన రాజ్యాలు. దేవగిరి యాదవరాజులు కొంతకాలం కాకతీయులకు పక్కలో బల్లెంలా ఉండేవారు. దేవగిరి యాదవరాజ వంశానికి చెందిన ఒక శాఖ కాకతీయుల సామంతులుగా కొన్ని ప్రాంతాలను పాలించింది.
అద్దంకి శాఖకు చెందిన యాదవ రాజుల్లో మొదటి వాడు మొదటి సారంగధరుడు. ఇతడు కాకతీయ రుద్రదేవుడికి యుద్ధాల్లో తోడ్పడ్డాడు. ప్రతిఫలంగా కాకతీయులు ఇతడిని అద్దంకి రాజ్యానికి సామంతుడిగా నియమించారు. ఈ శాఖకు చెందిన మాధవ దేవుడు, సింగల దేవుడు, రెండో సారంగ దేవుడు వేయించిన శాసనాలను బట్టి వీరు గణపతిదేవుడికి సామంతులుగా ఉన్నారని తెలుస్తోంది.
దేవగిరి యాదవరాజు జైతుగీ(జైత్రపాలుడు) కాకతీయ రాజైన మహాదేవుడిని సంహరించాడు. సింఘన ఇతడి కుమారుడు. సింఘన మూడో కుమారుడైన సారంగపాణి దేవుడు తెలంగాణకు వచ్చి రుద్రమదేవి సామంతుడిగా పానగల్లు రాజధానిగా పరిసర ప్రాంతాలను పాలించాడు. ఇతడు వేయించిన పానగల్లు శాసనం(క్రీ.శ.1267) ద్వారా ఈ విషయాలు తెలుస్తున్నాయి. ఇతడి వంశీయులు పానగల్లు, సూర్యాపేట పరిసర ప్రాంతాలను పాలించారని పాతర్లపాడు శాసనం తెలుపుతోంది.

నాగ వంశస్థులు

ఈ వంశీయులు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలను పాలించారు. ఈ వంశంలోని కొందరు నల్గొండ జిల్లా, కోదాడ ప్రాంతాలను పాలించినట్టు అనంతగిరి శాసనం ద్వారా తెలుస్తోంది.
sunkireddy narayanareddy

డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ‘తెలంగాణ చరిత్ర’ రచయిత

History Notes for Groups: శాతవాహనులు–సంస్కృతి


ప్రాక్టీస్‌ క్వశ్చన్స్‌

Published date : 11 Jun 2022 05:08PM

Photo Stories