Skip to main content

Indian Geography: భారతదేశం - భౌతిక స్వరూపాలు.. హిమాద్రి పర్వత శ్రేణుల సరాసరి ఎత్తు ఎంత‌?

భూ విజ్ఞాన శాస్త్రానికి చెందిన పలకల విరూపకారక సిద్ధాంతం ప్రకారం హిమాలయాలు, గంగా - సింధు మైదానం ఆక్రమించి ఉన్న ప్రస్తుత భూభాగంలో మధ్య మహాయుగ కాలంలో 'టెథిస్‌' సముద్రం అనే ఒక పెద్ద భూ అభినతి ఉండేది. ఈ సముద్రానికి ఉత్తరంగా ఉన్న భూభాగాన్ని 'అంగారా' లేదా లారెన్షియా భూమి అని, దీనికి దక్షిణంగా ఉన్న భూభాగాన్ని (నేటి ద్వీపకల్ప భాగం) 'గోండ్వానా' అని పిలిచేవారు. కొన్ని మిలియన్‌ సంవత్సరాల తర్వాత సంపీడన బలాల వల్ల 'టెథిస్‌' సముద్రంలో నిక్షేపితమైన అవక్షేపాలు ముడుతలు పడి ప్రస్తుతమున్న హిమాలయ పర్వత శ్రేణులు ఏర్పడ్డాయి.
indian geography study material and bit bank for tspsc, appsc exams

భారతదేశం - భౌతిక స్వరూపాలు

భారతదేశంలో ఉన్న భౌతిక సహజ స్వరూపాలను ప్రధానంగా నాలుగు విభాగాలుగా విభజించవచ్చు. అవి...
    1. ఉత్తర పర్వతాలు (హిమాలయాలు)
    2. గంగా - సింధు మైదానం
    3. ద్వీపకల్ప పీఠభూమి
    4. తీర మైదానాలు

ఉత్తర పర్వతాలు (హిమాలయాలు)

ప్రపంచంలోని ముడుత పర్వతాల్లో హిమాలయాలు అన్నింటికంటే చివరగా ఏర్పడ్డాయి. కాబట్టి వీటిని 'అతి తరుణ(నవీన) ముడుత పర్వతాలు' అంటారు. ఈ పర్వతాలు అవక్షేప శిలలు ముడుతలు పడటం వల్ల టెర్షియరీ మహాయుగంలో(6 కోట్ల సంవత్సరాల క్రితం) ఏర్పడ్డాయి. ఇవి అవిచ్ఛిన్న సమాంతర శ్రేణులుగా వ్యాపించి ఉన్నాయి. 

  • హిమాలయాలు జమ్మూ - కాశ్మీర్‌ నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌ వరకు భారతదేశ ఉత్తర సరిహద్దులుగా ఉన్నాయి.
  • సుమారు 2400 కి.మీ. పొడవున ఒక చాపం లా సింధునది, సాంగ్‌పో - బ్రహ్మపుత్ర నదుల గార్జిల మధ్య 'వాయవ్య - ఆగ్నేయ' దిశగా వ్యాపించాయి.
  • వీటి విస్తీర్ణం సుమారు 5 లక్షల చ.కి.మీ., వెడల్పు కాశ్మీర్‌లో 500 కి.మీ., అరుణాచల్‌ప్రదేశ్‌లో 200 కి.మీ.

ఈ పర్వతాలను ఉత్తర, దక్షిణాలుగా మూడు సమాంతర శ్రేణులుగా విభజించవచ్చు. అవి..
1.    ఉన్నత హిమాలయాలు (హిమాద్రి)
2.    మధ్య హిమాలయాలు (హిమాచల్‌)
3.    పర్వత పాద హిమాలయాలు(శివాలిక్‌ కొండలు)

ఉన్నత హిమాలయాలు

వీటికి హిమాద్రి, అత్యున్నత, లోపలి హిమాలయాలనే పేర్లున్నాయి. ఇవి శ్రేణులన్నింటిలో అత్యున్నత, అతి ఉత్కృష్ట, అవిచ్ఛిన్నమైనవి. వీటి సరాసరి ఎత్తు సుమారు 6100మీ. ఇవి గ్రానైట్, షిస్ట్, నీస్‌ల వంటి స్ఫటికాకార రూపాంతర శిలలతో ఏర్పడ్డాయి. ఇక్కడ ప్రపంచంలో అతి ఎత్తయిన శిఖరాలున్నాయి.

  • ఈ పర్వత శ్రేణిలో ఉన్న 'మౌంట్‌ ఎవరెస్ట్‌' (8848మీ.) ప్రపంచంలోనే అతి ఎత్తయింది. ఇది నేపాల్‌ దేశంలో ఉంది. దీన్నే 'సాగర్‌ మాతా' అని కూడా అంటారు.
  • ప్రపంచంలో మూడో ఎత్తయిన శిఖరం కాంచనగంగా (8598మీ.) ఈ శ్రేణిలోనే ఉంది. ఇది సిక్కిం రాష్ట్రంలో ఉంది.
  • వీటితోపాటు మరికొన్ని ఎల్తైన శిఖరాలు... మకాలు (8481మీ.), ధవళగిరి (8177మీ.), మనస్లూ (8156మీ.), చోఓయు (8153మీ.). హిమాద్రికి ఉత్తరంగా 'ట్రాన్స్‌ - హిమాలయ మండలం' ఉంది. ఈ మండలంలో జస్కార్, కారకోరం, లడక్, కైలాస్, కున్‌లున్, హిందూకుష్, పామీర్‌ పర్వత శ్రేణులున్నాయి.
  • కాశ్మీర్‌కు వాయవ్యంగా ప్రముఖ 'కారకోరం'పర్వతశ్రేణి ఉంది. 
  • ఈ శ్రేణిలో ప్రపంచంలో రెండో ఎత్తయిన శిఖరం ఓ2 (గాడ్విన్‌ ఆస్టిన్‌) ఉంది. దీని ఎత్తు 8611మీ. ఇది పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉంది. దీంతోపాటు ప్రపంచంలో అతి పొడవైన హిమనీ నదం 'సియాచిన్‌' ఉంది.
  • ప్రపంచంలో అతి ఎత్తయిన 'పామీర్‌ పీఠభూమి'(ప్రపంచ పైకప్పు), ప్రముఖ నదులకు జన్మస్థానమైన 'మానస సరోవరం' కూడా ట్రాన్స్‌ హిమాలయ మండలంలోనే ఉన్నాయి.

చ‌ద‌వండి: Geography for Groups Exams: భారత నైసర్గిక స్వరూపం... హిమాలయాలు ఎన్ని దేశాల్లో విస్తరించాయి?

మధ్య హిమాలయాలు

వీటికి హిమాచల్, నిమ్న హిమాలయాలు అని కూడా పేర్లు ఉన్నాయి. ఇవి హిమాద్రికి దక్షిణంగా ఉండి అతి దట్టమైన, కఠిన పర్వత వ్యవస్థను కలిగి ఉన్నాయి. వీటి ఎత్తు 1,000 నుంచి 4,500మీ., వెడల్పు 60 నుంచి 80 కి.మీ.

  • వీటిలో కాశ్మీర్‌లోని 'పిర్‌ పంజాల్‌ పర్వత శ్రేణి' అతి పొడవైంది(400 కి.మీ.). దీని సగటు ఎత్తు సుమారు 4000 మీ. 
  • హిమాద్రి, పిర్‌ పంజాల్‌ శ్రేణుల మధ్య ప్రఖ్యాతి చెందిన 'కాశ్మీర్‌ లోయ' ఉంది. ఈ లోయలో ఊలర్, ధాల్‌ సరస్సులు ఉన్నాయి.
  • కృష్ణగంగ, జీలం, చీనాబ్‌ నదులు పిర్‌ పంజాల్‌ పర్వత శ్రేణిని ఖండించుకుంటూ కాశ్మీర్‌లో ప్రవేశిస్తున్నాయి.
  • పిర్‌పంజాల్‌ పర్వత శ్రేణిలోని నైరుతి భాగాన్ని 'ధౌల్‌ధార్‌ శ్రేణి' అంటారు.
  • వేసవి విశ్రాంతి స్థావరాలైన సిమ్లా, కులు, కాంగ్రా లోయలు ఇక్కడే ఉన్నాయి. ఇవి పండ్లతోటలకు ప్రసిద్ధి చెందాయి.
  • హిమాచల్‌ పర్వత శ్రేణుల్లో 1500 నుంచి 2000 మీ. ఎత్తులో సిమ్లా, ముస్సోరి, నైనిటాల్, ఛక్రాటి, రాణిఖేట్‌ వంటి అనేక వేసవి విశ్రాంతి స్థావరాలు ఉన్నాయి.
  • ఈ పర్వత శ్రేణిలో సతతహరిత అరణ్యాలకు చెందిన ఓక్, శృంగాకార అడవులు ఉన్నాయి.
  • హిమాచల్‌ ప్రదేశ్, పంజాబ్, నేపాల్‌ ఈ పర్వత శ్రేణుల్లోనే ఉన్నాయి.

పర్వత పాద హిమాలయాలు

వీటిని శివాలిక్‌ శ్రేణులు, బాహ్య హిమాలయా­లు, హిమాలయ పాదగిరులు అని కూడా అంటారు. ఇవి తక్కువ ఉన్నతి ఉండి హిమాచల్‌ శ్రేణికి దక్షిణంగా ఉన్నాయి. వీటి ఎత్తు 600 - 1500 మీ.

  • ఈ శ్రేణులు జమ్మూ-కాశ్మీర్‌ నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌ వరకు అవిచ్ఛిన్నంగా వ్యాపించి ఉన్నాయి.
  • వీటిని జమ్మూ ప్రాంతంలో జమ్మూ కొండలని, అరుణాచల్‌ప్రదేశ్‌లో మిస్మి కొండలని అంటారు.
  • ఈ కొండలు హిమాలయ నదుల క్రమక్షయం వల్ల ఏర్పడిన ఇసుక, గ్రావెల్, కంగ్లామరేట్‌ వంటి తృతీయ మహాయుగపు అవక్షేప శిలతో కూడి ఉన్నాయి.
  • హిమాచల్‌ పర్వతాలను, శివాలిక్‌ కొండలను వేరు చేస్తూ ఉన్న దైర్ఘ్య లోయలను 'డూన్‌'లు అంటారు.
  • డూన్‌ లోయల్లో ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్, పాట్లిడూన్, జమ్మూలోని కోట్లీడూన్‌ ప్రముఖమైనవి.
  • ఈ కొండలపై ఆయన రేఖా మండల తేమతో కూడిన ఆకురాల్చే అడవులున్నాయి.

చ‌ద‌వండి: Geography Notes for Groups: ఖండ చలనం.. పలక విరూపణ

హిమాలయాలను తూర్పు, పడమరలుగా నాలుగు విభాగాలుగా విభజించవచ్చు. అవి..

    1. కశ్మీర్‌ హిమాలయాలు
    2. పంజాబ్‌ హిమాలయాలు
    3. కుమాన్‌ హిమాలయాలు
    4. నేపాల్‌ హిమాలయాలు
    5. అస్సాం హిమాలయాలు

కశ్మీర్‌ హిమాలయాలు

  • ఈ పర్వత భాగం సింధూ నదికి ఉత్తరంగా విస్తరించి ఉంది.
  • దీనిలో కారకోరం శ్రేణి, ఓ2 శిఖరం ప్రసిద్ధి చెందినవి. సియాచిన్‌ హిమనీనదం కూడా ఉంది. 

పంజాబ్‌ హిమాలయాలు

  • ఈ పర్వత భాగం 560 కి.మీ. పొడవు కలిగి, సింధూ, సట్లెజ్‌ నదుల మధ్య విస్తరించి ఉంది.
  • ఇందులో జస్కార్, పిర్‌ పంజాల్‌ హిమాలయ శ్రేణులు ఉన్నాయి.

చ‌ద‌వండి: Geography: Major Port Towns... తూర్పు తీరంలోని ఏకైక సహజ రేవు పట్టణం?

కుమాన్‌ హిమాలయాలు

  • ఈ పర్వత భాగం 320 కి.మీ. పొడవుతో సట్లెజ్, కాళి నదుల మధ్య విస్తరించి ఉంది.
  • హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు కుమాన్‌ హిమాలయ పర్వత ప్రాంతాల్లోనే విస్తరించి ఉన్నాయి.
  • గంగోత్రి, యమునోత్రి హిమనీ నదాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి.
  • నందాదేవి(7817మీ.) అనే శిఖరం ఈ శ్రేణుల్లో ఉంది.

నేపాల్‌ హిమాలయాలు

  • ఈ పర్వత భాగం 800 కి.మీ. పొడవు కలిగి ఉంది. ఇది కాళి, టీస్తా నదుల మధ్య విస్తరించింది. 
  • ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోనూ,నేపాల్‌లోనూ విస్తరించింది.
  • హిమాలయాల్లో ఎత్తయిన శిఖరాలు 'మౌంట్‌ ఎవరెస్ట్, కాంచన గంగా, అన్నపూర్ణ మొదలైనవి ఈ శ్రేణిలోనే ఉన్నాయి.

అస్సాం హిమాలయాలు

  • ఈ పర్వత భాగం 720 కి.మీ. పొడవు కలిగి, టీస్తా, బ్రహ్మపుత్ర నదుల మధ్య వ్యాపించి ఉంది. ఇది తక్కువ ఎత్తు కలిగి ఉంది.
  • ఈ పర్వత శ్రేణులను పూర్వాంచల్‌ పర్వతాలు అని కూడా అంటారు.

హిమాలయాలు సంవత్సరంలో ఎక్కువ రోజులు మంచుతో కప్పి ఉన్నప్పటికీ జొజిలా (కాశ్మీర్‌), షిప్పికిలా (హిమాచల్‌ ప్రదేశ్‌), నాథూలా (సిక్కిం), బొమ్మిడిలా (అరుణాచల్‌ ప్రదేశ్‌) కనుమలు ఎత్తు ప్రాంతంలో ఉన్న ప్రధాన రహదారులుగా విరసిల్లాయి.

rameshముల్కల రమేష్, సబ్జెక్ట్‌ నిపుణులు

చ‌ద‌వండి: Geography Notes for Groups: శిలలు.. ఖనిజాల సమాహారం..!

గతంలో అడిగిన ప్రశ్నలు

Published date : 28 Apr 2023 03:48PM

Photo Stories