Skip to main content

భారతదేశ తీర మైదానాలు - దీవులు

సుమారు 7 వేల కిలోమీటర్ల పైచిలుకు పొడవైన తీర రేఖతో... భారతదేశం విశాలమైన తీర మైదానాలను కలిగి ఉంది. పశ్చిమబెంగాల్ నుంచి కన్యాకుమారి వరకు తూర్పు తీర మైదానం; గుజరాత్ నుంచి కన్యాకుమారి వరకు పశ్చిమ తీరమైదానం విస్తరించి ఉన్నాయి. సహ్యాద్రి కొండలు తీరరేఖకు సమీపంలో ఉండటం వల్ల పశ్చిమ తీర మైదానం వెడల్పు తక్కువగా ఉంది. సాపేక్షంగా పరిశీలిస్తే.. తూర్పు కనుమలు తీరరేఖ నుంచి దూరంగా ఉండటంతో తూర్పు తీర మైదానం విశాలంగా ఉంటుంది. అరేబియా మహాసముద్రం పశ్చిమ కనుమల వైపు చొచ్చుకొని రావడంతో... పశ్చిమతీర మైదానం ముంపునకు గురవుతోంది. అందువల్ల పశ్చిమ తీరంలో అనేక కయ్యలు, చిత్తడి నేలలు ఏర్పడ్డాయి!!
 పురాణాల్లో ప్రస్తావించిన ద్వారక పట్టణ శిథిలాలను శాస్త్రజ్ఞులు గుజరాత్ తీరంలోని సముద్ర భూతలంపై కనుగొన్నారు. ముంబై నగర తీరంలో సముద్ర భూతలంపై దట్టమైన అరణ్యాలు ఉండేవని కూడా శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. ఈ పరిశోధనా ఫలితాలు.. పశ్చిమ తీర మైదానం ముంపునకు గురవడాన్ని రుజువు చేస్తున్నాయి. తూర్పు తీరంలో బంగాళాఖాతం  క్రమంగా తీర రేఖ నుంచి తిరోగమనం చెందడాన్ని కూడా గుర్తించారు. అంటే.. పశ్చిమ తీరం కుచించుకుపోతుంటే.. తూర్పు తీరం క్రమంగా విస్తరిస్తుందన్నమాట! కృష్ణా-గోదావరి డెల్టాలోని కొల్లేరు సరస్సులో జరిపిన అధ్యయనాల్లో ఈ సరస్సు పూర్వం తీర రేఖపై ఉప్పు నీటి సరస్సు ఉండేదని నిర్ధారణ అయింది. అంటే.. ఒకప్పుడు కొల్లేరు సరస్సు.. ఇప్పటి చిల్కా సరస్సులా తీరంలో ఉన్న ఉప్పునీటి సరస్సు అన్నమాట. అరేబియా సముద్రం తిరోగమనం వల్ల ఇది క్రమంగా మంచినీటి సరస్సుగా రూపొందింది.
 తీరరేఖ నిర్మాణం, స్వరూపాన్ని పరిశీలిస్తే.. పశ్చిమ తీరరేఖ అనేక వంకలు, వక్రాలతో సచ్ఛిద్రంగా ఉంటుంది. వేలా తరంగాల క్రమక్షయం తీవ్ర స్థాయిలో ఉండటంతో పశ్చిమ తీర రేఖ రంపపు పళ్ల స్వరూపాన్ని సంతరించుకుంది. ఈ కారణంగా పశ్చిమ తీరంలో అనేక సహజ రేవు పట్టణాలు ఏర్పడ్డాయి. మనదేశంలో మొత్తం 140కి పైగా మధ్య తరహా, భారీ రేవు పట్టణాలు ఉండగా... అందులో 80కి పైగా రేవు పట్టణాలు గుజరాత్, మహారాష్ట్ర తీరంలోనే ఉండటం విశేషం. తూర్పు తీరంలో ఒక్క విశాఖ పట్టణం మాత్రమే ప్రధాన సహజ రేవు పట్టణం. ‘డాల్ఫిన్స్ నోస్’గా పిలిచే తూర్పు కనుమలకు చెందిన యారాడ్ కొండ చరియ.. బంగాళాఖాతంలోకి చొచ్చుకు పోవడం వల్ల ఈ సహజ రేవు పట్టణం ఏర్పడింది. పశ్చిమ, తూర్పు తీర మైదానాలను వివిధ ప్రాంతీయ ఉప విభాగాలుగా విభజించవచ్చు. గుజరాత్ తీరంలో కచ్, కథియావాడ్, సాబర్‌కాంతా తీర మైదానాలు ఉన్నాయి. మహారాష్ట్ర, గోవా, కర్ణాటకల తీర మైదానాన్ని కొంకణ్ తీర మైదానం అని పిలుస్తారు. కేరళ తీర మైదానాన్ని మలబార్ తీర మైదానంగా వ్యవహరిస్తారు. తూర్పు తీరం ప్రాచీన కాలంలో చోళ రాజుల ఆధీనంలో ఉండేది. దాంతో ఈ ప్రాంతాన్ని కోరమండల్ తీరం అని పిలిచేవారు. ఒడిశా తీర మైదానాన్ని ఉత్కళ్ తీర మైదానం అంటారు. పశ్చిమ బెంగాల్‌లో తీర మైదానాన్ని కాంతీ మైదానంగా వ్యవహరిస్తారు.
 తూర్పు తీర మైదానం విశాలమైన ఇసుక దిబ్బలతో కూడి ఉంది. తూర్పు తీరంలోని సముద్ర బీచ్‌లు విశాలంగా ఉంటాయి. పశ్చిమ తీరంలో ముఖ్యంగా కొంకణ్ తీరంలో అనేక తిన్నని వాలులు ఉండే కొండ శిఖరాలు ఉన్నాయి. కర్ణాటక తీరంలో పశ్చిమ కనుమలు సముద్ర తీరం నుంచి కేవలం 10.15 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నాయి. అందువల్ల ఇక్కడ తీర మైదానం చాలా ఇరుకుగా ఉంటుంది. తీర మైదానాల్లో విశిష్టమైన ‘మాన్ గ్రూవ్’ (మడ) అరణ్యాలు పెరుగుతాయి. ఈ అరణ్యాలు తీర రేఖ స్థిరీకరణకు దోహదపడతాయి. మడ అడవులు తీర మైదానంలోని సారవంతమైన వ్యవసాయ భూముల్లోకి లవణీయత ప్రవేశించకుండా నిరోధిస్తాయి. పశ్చిమ బెంగాల్‌లోని సుందరవనాలు, ఒడిశాలోని ఖత్తర్‌కనికా, ఆంధ్రప్రదేశ్‌లోని కొరింగ, తమిళనాడులోని పాయింట్ కాలిమోర్, పిచ్చవరం, కేరళలోని వెంబనాడు, కర్ణాటకలోని కొండాపూర్, మహారాష్ట్రలోని అచ్రాలలో మడ అరణ్యాలు విస్తారంగా పెరుగుతున్నాయి.
 
దీవులు
అరేబియా మహాసముద్రం, బంగాళాఖాతాల్లోని 247 పెద్ద దీవులపై భారత సార్వభౌమాధికారం ఉంది. వీటిలో 204 బంగాళా ఖాతంలోను, మిగతా 43 దీవులు అరేబియా మహాసముద్రంలో ఉన్నాయి. బంగాళాఖాతంలో అండమాన్-నికోబార్, అరేబియా సముద్రంలో లక్ష దీవులు.. ప్రధాన ద్వీప సమూహాలు. అండమాన్-నికోబార్ దీవులు అగ్ని పర్వత దీవులు. లక్ష దీవులు ప్రవాళ దీవుల తరగతికి చెందుతాయి. ఇవేకాకుండా.. మన్నార్ సింధు శాఖ, కంభత్ సింధు శాఖ, కచ్ సింధు శాఖ, గంగా నదీ ముఖద్వారం వద్ద కూడా దీవులు ఉన్నాయి.
అండమాన్-నికోబార్ దీవులను 10 డిగ్రీల చానల్ విడదీస్తోంది. గ్రేట్ నికోబార్ దీవుల్లోని ఇందిరా (పిగ్నాలియన్) పాయింట్ భారతదేశ అత్యంత దక్షిణ భూభాగం. అండమాన్ నికోబార్ దీవులు దట్టమైన ఆర్ధ్ర ఆకురాల్చే అరణ్యాలతో కప్పి ఉన్నాయి. అతి ప్రాచీన ఆదిమ మానవ తెగలు.. అండమాన్ నికోబార్ దీవుల దట్టమైన అరణ్యాల్లో నివసిస్తున్నాయి. ఉదాహ రణకు సెంటినెలస్, జారవా, ఓంజే మొదలైనవి. అండమాన్ నికోబార్ దీవుల ఉపరితల నైసర్గిక స్వరూపం ఎగుడుదిగుడుగా ఉంటుంది. లక్ష దీవుల్లోని మొత్తం 43 దీవుల్లో.. కేవలం 10 దీవుల్లో మాత్రమే మానవ జనావాసాలు ఉన్నాయి. లక్ష దీవుల్లోని కాననూర్ దీవుల సమూహాన్ని, మినికాయ్ దీవిని 9 డిగ్రీల చానల్ విడదీస్తోంది. కవరత్తి, లక్షదీవుల రాజధాని. లక్షదీవుల ఉపరితల నైసర్గిక స్వరూపం సమతలంగా ఉంటుంది. లక్షదీవులు అధిక జనసాంద్రత ఉన్న దీవులు. ఇక్కడ కొబ్బరి తోటలను విస్తారంగా పెంచుతున్నారు. ప్రజల ప్రధాన వృత్తి.. చేపలు పట్టడం.
 
 ఇతర ముఖ్య దీవులు
 పిరమ్, బయిసాలా - కథియావాడ్ తీరం (గుజరాత్)
 కారున్‌బార్, డయ్యు, వయిడా, నోరా - కచ్ తీరం (గుజరాత్)
 ఆలియాబెత్, కాడియాబెత్ - నర్మద-తపతి ముఖద్వారం (గుజరాత్)
 కరంజ, బుచ్చర్స్, ఎలిఫెంటా - ముంబై సమీపంలో (మహారాష్ట్ర)
 బక్తల్, పీజన్ కాక్, సెయింట్ మేరీ - మంగళూరు తీరం (కర్ణాటక)
 అంజిదీవి - గోవా తీరం
 వైపిన్ - కొచ్చిన్ తీరం (కేరళ)
 పంబన్, అడుండా, కచ్చతీవు - మన్నర్ సింధుశాఖ (తమిళనాడు)
 శ్రీహరికోట - పులికాట్ సరస్సు వద్ద (ఆంధ్రప్రదేశ్)
 పియర్ కుడ్ - చిల్కా సరస్సు వద్ద (ఒడిశా)
 వీలర్ - మహానది - బ్రాహ్మణి ముఖద్వారం (ఒడిశా)
 న్యూమూర్, సాగర్ - గంగా డెల్టా (పశ్చిమ బెంగాల్)
Published date : 22 Dec 2015 03:30PM

Photo Stories