Skip to main content

Budget sessions: జడ్జీల నియామకాల్లో రిజర్వేషన్లు లేవు.... ఉన్నవారిలో 77 శాతం జనరల్‌ కేటగిరీ వారే..!

జడ్జీల నియామకాల్లోనూ రిజర్వేషన్లు పాటించాలని గతకొంతకాలంగా కొన్ని రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ఇదే అంశంపై ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సవివరంగా వివరాలు వెల్లడించింది.

27 మంది మైనారిటీలు....
2018 నుంచి హైకోర్టు జడ్జీలుగా 554 మంది నియమితులయ్యారని, వీరిలో 430 మంది జనరల్‌ కేటగిరీకి చెందిన వారేనని న్యాయ శాఖ మంత్రి కిరెన్‌ రిజిజు రాజ్యసభలో తెలిపారు. మిగిలిన వారిలో 58 మంది ఇతర వెనుకబడిన కులాలకు, 19 మంది షెడ్యూల్‌ కులాలకు చెందిన వారని చెప్పారు. అలాగే ఆరుగురు జడ్జిలు షెడ్యూల్‌ తెగలకు చెందిన వారు కాగా, 27 మంది మైనారిటీలని వివరించారు. మొత్తమ్మీద 84 మంది మహిళా జడ్జీలున్నారని చెప్పారు. మొత్తం జడ్జీల్లో జనరల్‌ కేటగిరీకి చెందిన వారు 77% పైగా ఉన్నారన్నారు.
రిజర్వేషన్లు లేవు..!
సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాలకు రిజర్వేషన్లు లేవని మంత్రి స్పష్టం చేశారు. అయితే అత్యున్నత న్యాయ వ్యవస్థలోనూ సామాజిక వైవిధ్యం సాధించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జడ్జీల నియామకాలకు ప్రతిపాదనలు పంపే సమయంలో అర్హులైన ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ, మహిళా జడ్జీల పేర్లను కూడా పరిశీలించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ప్రభుత్వం కోరుతోందని వెల్లడించారు. 
30 మంది మహిళా జడ్జీలు..!
2018 నుంచి ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో 30 మంది జడ్జీలు నియమితులయ్యారని కిరణ్‌ చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా జడ్జీల్లో 612 మంది ఎస్సీలు, 204 మంది ఎస్‌టీలు, 1,329 మంది ఓబీసీలు, 1,406 మంది మహిళలు ఉన్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Published date : 03 Feb 2023 01:09PM

Photo Stories