Skip to main content

Padma Bhushan, Padma Shri & Padma Vibhushan : పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ ఉన్న తేడాలు ఇవే..! ఇవి ఎవ‌రికి ఇస్తారంటే...?

సాక్షి ఎడ్యుకేష‌న్: 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం 2025 ఏడాదికిగాను జ‌న‌వ‌రి 25వ తేదీ పద్మ పురస్కారాలను ప్రకటించిన విష‌యం తెల్సిందే.
Padma Bhushan and Padma Shri and Padma Vibhushan

ఈ నేప‌థ్యంలో ఈ అవార్డుల ప్రాదాన్య‌త‌, ఈ అవార్డుల‌ను ఎవ‌రికి ఇస్తారు...?  పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ ఉన్న తేడాలు ఏమిటి...? ఇలా మొద‌లైన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌పై ప్ర‌త్యేక స్టోరీ మీకోసం...

1954లో ప్రారంభమైన పద్మ అవార్డులు భారతదేశ అత్యున్నత పౌర గౌరవాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు. అయితే 1978-1979, 1993-1997 మధ్య ఈ అవార్డులను ప్రదానం చేయలేదు. ఈ అవార్డులు ప్రజాసేవకు సంబంధించిన అన్ని రంగాల్లో విశిష్ట ప్రతిభను గుర్తించడమే లక్ష్యంగా ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక అవార్డులు ప్రతి సంవత్సరం భారత ప్రధానమంత్రి నియమించే పద్మ అవార్డుల కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రదానం చేస్తారు.

ఈ అవార్డులు మూడు విభాగాల్లో అందిస్తారు.. అవి : 
1. పద్మ విభూషణ్, 
2. పద్మ భూషణ్, 
3. పద్మ శ్రీ

మూడు పద్మ అవార్డుల మధ్య తేడాలను చూద్దాం :

పద్మ విభూషణ్

పద్మ భూషణ్

పద్మ శ్రీ

ఇది భారతదేశంలో రెండవ అత్యున్నత పౌర గౌరవం.

ఇది భారతదేశంలో మూడవ అత్యున్నత పౌర గౌరవం.

ఇది భారతదేశంలో నాలుగవ అత్యున్నత పౌర గౌరవం.

అసాధారణ, విశిష్టమైన సేవలకోసం ప్రదానం చేస్తారు.

ఉన్నత స్థాయి విశిష్ట సేవలకోసం ప్రదానం చేస్తారు.

విశిష్ట సేవలకోసం ప్రదానం చేస్తారు.

దీని పూర్వపు పేరు "మొదటి వర్గం (క్లాస్ -I)

దీని పూర్వపు పేరు "రెండో వర్గం (క్లాస్ -II)

దీని పూర్వపు పేరు "మూడో వర్గం (క్లాస్ -III)

1954లో మొత్తం ఆరుగురు ఈ అవార్డు పొందారు.

1954లో మొత్తం 23 మంది ఈ అవార్డు పొందారు.

1954లో మొత్తం 17 మంది ఈ అవార్డు పొందారు.

 
భారత రత్న:
భారతదేశ అత్యున్నత పౌర గౌరవం. ఇది ఏదైనా రంగంలో అత్యున్నత ప్రతిభకు గాను ప్రదానం చేస్తారు. ఈ అవార్డును జనవరి 2, 1954న అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. 

అలా మొదటిసారిగా స్వతంత్ర భారత తొలి గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి,ప్రముఖ శాస్త్రవేత్త, డాక్టర్‌ సివి రామన్‌, భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ 1954లో భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. అప్పటివరకు ఈ అవార్డును జీవించి ఉన్నవారికే ఇచ్చేవారు. కానీ ఆ మరుసటి ఏడాది అంటే 1955 నుంచి ఈ అవార్డును మరణానంతరం ఇవ్వడం ప్రారంభించారు. ఈ అవార్డులను  ఎంపిక చేసే ప్రక్రియ పద్మ అవార్డుల కంటే భిన్నంగా ఉంటుంది.ప్రధానమంత్రి నేరుగా రాష్ట్రపతికి భారతరత్న అవార్డు కోసం వ్యక్తులను సిఫారసు చేస్తారు. ఏడాదిలో గరిష్టంగా ముగ్గురికి మాత్రమే భారతరత్న ఇస్తారు. అయితే ప్రతి ఏటా ఈ అవార్డు ఇవ్వాలనే నిబంధన ఏమీ లేదు. కాగా ఇప్పటివరకూ 50 మంది ‍ప్రముఖులు ‘భారతరత్న’ను అందుకున్నారు. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా విజేతలను రాష్ట్రపతి సత్కరిస్తారు.

17 మందికి మరణానంతరం భారతరత్న లభించింది. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ మొదలుకొని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వరకు... ఇలా పలువురు ‘భారతరత్న’ పురస్కారం అందుకున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు ప్రముఖ గాంధేయ సోషలిస్ట్ నేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్,మాజీ ఉప ప్రధాని ఎల్ కె అద్వానీకి చోటు దక్కింది. 

భారతరత్న గ్రహీతలకు ఏం అందజేస్తారంటే...?

bharath rathna award

భారతరత్న గ్రహీతలకు రాష్ట్రపతి సంతకం చేసిన ధ్రువీకరణ పత్రం, ఒక మెడల్ బహూకరిస్తారు. రావి ఆకు రూపంలో ఉన్న మెడల్‌పై ప్రకాశిస్తున్న సూర్యుడి బొమ్మ, దేవనాగరి లిపిలో భారతరత్న అని రాసి ఉంటుంది. వెనుకవైపు భారత జాతీయ చిహ్నం, కింద దేవనాగరి లిపిలో సత్యమేవ జయతే అనే అక్షరాలు ఉంటాయి. అయితే భారతరత్న గ్రహీతలకు ఎలాంటి నగదు ప్రోత్సాహకం ఉండదు. కానీ ప్రత్యేక ప్రాధాన్యం, సదుపాయాలు వంటివి లభిస్తాయి. 

పద్మ అవార్డుల అర్హతలు ఇవే..:
జాతి, వృత్తి, లింగం వంటి భేదాలు లేకుండా అందరూ అర్హులు. వైద్యులు శాస్త్రవేత్తలు మినహా ప్రభుత్వ ఉద్యోగులు అర్హులు కారు. అవార్డును సాధారణంగా మరణానంతరం ఇవ్వరు. కానీ ప్రత్యేక సందర్భాల్లో ఇవ్వవచ్చు.

పద్మ అవార్డులు ప్రదానం చేసే రంగాలు ఇవే..
➤☛ కళలు : సంగీతం, చిత్రకళ, శిల్పకళ, ఫోటోగ్రఫీ, సినిమా, నాటకం మొదలైనవి.
➤☛ సామాజిక సేవ : సమాజం కోసం సేవ, సహాయ కార్యక్రమాలు మొదలైనవి.
➤☛ పబ్లిక్ అఫైర్స్ : న్యాయం, రాజకీయాలు మొదలైనవి.
➤☛ శాస్త్రం & ఇంజినీరింగ్: అంతరిక్షం, సాంకేతికత, పరిశోధనలు మొదలైనవి.
➤☛ వాణిజ్యం & పరిశ్రమ : బ్యాంకింగ్, టూరిజం, బిజినెస్ మొదలైనవి.
➤☛ వైద్యం : ఆయుర్వేదం, హోమియోపతి, నేచురోపతి మొదలైనవి.
➤☛ సాహిత్యం & విద్య : పాత్రికేయం, కవిత్వం, విద్యలో అభివృద్ధి మొదలైనవి.
➤☛ సివిల్ సర్వీస్ : పరిపాలనలో విశిష్ట ప్రతిభ.
➤☛ క్రీడలు : క్రీడలు, యోగా, అడ్వెంచర్ మొదలైనవి.
➤☛ ఇతరాలు : భారతీయ సంస్కృతి ప్రచారం, వన్యప్రాణుల సంరక్షణ మొదలైనవి.

అవార్డులు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం చేస్తారు. అవార్డు గ్రహీతకు రాష్ట్రపతి సంతకం ఉన్న సనద్, పతకం అందజేస్తారు. ఈ అవార్డులను గెజిట్ ఆఫ్ ఇండియాలో ప్రచురిస్తారు. ప్రతి సంవత్సరం 120 మందికి మించకుండా అవార్డులు ప్రదానం చేస్తారు.

Published date : 03 Feb 2025 09:02AM

Photo Stories