Skip to main content

AP News: విద్యుత్‌ నష్టాలు ఏపీలోనే తక్కువ... దేశంలోనే మొదటి స్థానం

ప్రజలకు మెరుగైన సేవలందించడంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీపడి ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో నిలుస్తోంది. ఆ కోవలోనే విద్యుత్‌ రంగంలో విప్లవాత్మక చర్యలను అమలు చేస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడమేగాక జాతీయస్థాయిలో అవార్డులు అందుకుంటోంది.

తాజాగా టెక్నికల్, కమర్షియల్‌ (ఏటీసీ) నష్టాలను తగ్గించడంలో ఏపీ ముందంజలో నిలిచి కేంద్రం నుంచి ప్రశంసలు అందుకుంది.

చ‌ద‌వండి: విరబూసిన తెలుగు పద్మాలు
16 శాతం నుంచి 11 శాతానికి తగ్గింపు 
అన్ని రాష్ట్రాల విద్యుత్‌ సంస్థలతో జనవరి 25న కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌.కె.సింగ్‌ వర్చువల్‌గా సమీక్షించారు. రాష్ట్రాల వారీగా విద్యుత్‌ సంస్థల పనితీరు, రీవాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌  సిస్టమ్‌ స్కీమ్‌ (ఆర్‌డీఎస్‌ఎస్‌) పురోగతిపై చర్చించారు. ఆర్‌డీఎస్‌ఎస్‌లో ప్రధానంగా పరిగణించే ఏటీసీ నష్టాలు మన రాష్ట్రంలో 2018–19లో 16.36 శాతం ఉండేవి. 2021–22లో అవి 11.21 శాతానికి తగ్గాయి. ఈ కాలంలో మూడుశాతానికిపైగా నష్టాలను తగ్గించిన రాష్ట్రాల జాబితాను కేంద్రమంత్రి ప్రకటించారు.
దేశంలోనే మొదటిస్థానం....
ఈ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, హరియాణ, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, పంజాబ్, రాజస్థాన్, త్రిపుర, పశ్చిమబెంగాల్‌ ఉన్నాయి. 5.15 శాతం నష్టాల తగ్గింపుతో ఏపీ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. 2024–2025 నాటికి ఏటీసీ నష్టాలను 12–15 శాతానికి తగ్గించాలని కేంద్రం నిర్దేశించిన లక్ష్యాన్ని రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇప్పుడే చేరుకున్నాయి.

చ‌ద‌వండి: మరోసారి తన వంకరబుద్ధి చూపించిన అమెరికా... మోదీపై పరోక్ష సెటైర్లు
ఏటీసీ నష్టాలే ప్రామాణికం...
ఉదయ్‌ డ్యాష్‌బోర్డ్‌ ఆధారంగా డిస్ట్రిబ్యూషన్ యుటిలిటీ ఫోరం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 12 రాష్ట్రాల్లో ఏటీసీ నష్టాలు 25 శాతం కంటే ఎక్కువ. ఆరు రాష్ట్రాలలో 15–25 శాతం మధ్య ఉన్నాయి.

AP Power

రాష్ట్రంలో విద్యుత్‌ పంపిణీ సంస్థల పనితీరును అంచనా వేయడానికి కేంద్రం ఈ ఏటీసీ నష్టాలనే ప్రామాణికంగా తీసుకుంటోంది. అవి తక్కువగా ఉన్న, వేగంగా తగ్గించుకుంటున్న రాష్ట్రాలకు మాత్రమే ఆర్‌డీఎస్‌ఎస్‌ ద్వారా నిధులు సమకూరుస్తామని స్పష్టం చేసింది.
తక్కువ ఖర్చుతో వ్యవసాయానికి విద్యుత్‌...
మరోవైపు ప్రీపెయిడ్‌ మోడ్‌లో స్మార్ట్‌మీటర్లు అమర్చడంపైనా మంత్రి ఆరాతీశారు. వ్యవసాయ ఫీడర్లకు సౌరవిద్యుత్‌ వినియోగం ప్రయోజనకరమని తెలిపారు. ఏపీ ఈ దిశగా సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ (సెకీ) నుంచి ఏడువేల మెగావాట్ల సౌరవిద్యుత్‌  కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల వ్యవసాయ వినియోగదారులకు పగటిపూట తక్కువ ఖర్చుతో విద్యుత్‌ను అందించవచ్చని మంత్రి వెల్లడించారు.

Published date : 26 Jan 2023 04:56PM

Photo Stories