Microsoft Invest: 1.7 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్న సత్యనాదెళ్ల.. ఎక్కడ, దేనికంటే..!?
![Microsoft set to Invest 1.7 billion Dollars in cloud, AI in Indonesia Improved data centers and AI capabilities in Indonesia](/sites/default/files/images/2024/04/30/microsoft-1714474806.jpg)
ఈ పెట్టుబడితో డేటా సెంటర్లు, కృత్రిమ మేధస్సు (AI) సామర్థ్యాలను మెరుగుపరుస్తారు. ఈ మౌలిక సదుపాయాలతో కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్లో కీలక మార్పులు తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 30వ తేదీ సత్యనాదెళ్ల ఆర్చిపెలాగో సంస్థ అధ్యక్షుడు జాన్ఫ్లడ్తో సమావేశమయ్యారు. అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇండోనేషియా ఆగ్నేయాసియాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. దాదాపు 28 కోట్ల జనాభా కలిగిన ఈ దేశంలో ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు డిమాండ్ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. దాంతో కంపెనీ ఈ చర్యలకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇండోనేషియా పర్యటనలో భాగంగా సత్యనాదెళ్ల జకార్తా అధ్యక్షుడు జోకో విడోడోతో చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా సత్య మాట్లాడారు. ‘ఇండోనేషియాలో దాదాపు 1.7 బిలియన్ డాలర్లతో డేటా సెంటర్లు, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేయబోతున్నాం. తరువాతి తరం ఏఐ మౌలిక సదుపాయాలు భవిషత్తులో ఎంతో ఉపయోగపడనున్నాయి. ఇండోనేషియాలోని ప్రతి సంస్థ లార్జ్ ఏఐను సద్వినియోగం చేసుకోవాలి. సమీప భవిష్యత్తులో సంస్థ వేలమందికి ఏఐ శిక్షణ ఇవ్వబోతుంది. 2025 నాటికి ఏషియా ప్రాంతంలో దాదాపు 2.5 మిలియన్ల మందికి ఇందులో శిక్షణ ఇవ్వబోతున్నాం’ అని అన్నారు.
గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ కెర్నీ చేసిన పరిశోధనలో 2030 నాటికి ఆగ్నేయాసియా జీడీపీలో ఏఐ ద్వారా 1 ట్రిలియన్ డాలర్లు సమకూరుతాయని అంచనా వేసింది. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇటీవల ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ దేశంలో తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు యాపిల్ దృష్టి సారిస్తోందని టిమ్ చెప్పారు.
Microsoft: మైక్రోసాఫ్ట్లో 75 వేల మహిళా డెవలపర్లకు నైపుణ్య శిక్షణ